3 - బ్రహ్మాండ మహా పురాణము - మధ్య భాగము (భార్గవ చరితము)

Table of Contents

50 - సగరుఁడు ఔర్వాశ్రమమున కరుగుట

 జైమినిరువాచ :-

జైమిని ఇట్లు చెప్పెను :

ఈ విధముగా రాజు భూమినంతటినీ విధియుతముగ పాలించెను. సప్తద్వీపవతియగు మేదినీ, సాక్షాధర్మమున కపరమూర్తివలె ఆతడేలెను. బ్రాహ్మణులు మొదలగు నాయా వర్ణముల వారిని వారి వారీ ధర్మ నిర్వాహణమున స్థాపించెను. ఇంద్రియములచే అవ్యావృతుఁడయి ఇంద్రియ నిగ్రహము గలిగి న్యాయము నతిక్రమింపకుండ రాజు పాలించెను. సర్వవర్ణములయందు. ప్రజలు వారిలో శ్రేష్టులయిన వారి ననుసరించి వర్తించిరి. సర్వవర్ణముల వారు తమ పద్ధతిని వర్ణక్రమాదుల యుత్తమత్వమును ననుసరించిరి. వారు వారి ఆశయములను సౌఖ్యముగా ననుభవించిరి. రాజు రాజ్యము చేయుచుండ ముదుసలులు బ్రతికియుండగా మృత్యువు బాలలను చెనకకుండెను. (4) అడ్డంకులు బాధలు లేకయే, రాష్ట్రమంతయు సర్వత్ర పుష్టి నొందెను. దేశమున అసంఖ్యాకములయిన జనపదములుండెను. అందు, చతుర్వర్ణ ప్రజలు జీవించుచుండిరి. (5) ఆ జనపదములు గృహగ్రామ శతములచే నిండియుండెను. రాజు రాజ్యము సలుప దేశములావాసభూయిష్ఠమలు, ఆ దేశములో అనాశ్రమియైన ద్విజుఁడొక్కడును లేఁడు. సర్వ ప్రజలయందు సర్వవర్గములయందు ఆరంభించిన కార్యములు ఫలప్రదములు. మానవులందరు తమకు చితములయిన కర్మలనే చేయుచుండిరి. మానవుల కర్మలన్నియు చతుర్విధ పురుషార్టోపన్నములు. పురములు గ్రామములు మహోత్సవ సముద్యుక్తములు. ప్రజలందరు పరస్పర ప్రీయమును కోరెడువారు. రాజభక్తి సమన్వితులు. ప్రజలలో నెవ్వడును నిందితుఁడు కాడు, శపుండు కాఁడు, దరిద్రుఁడు కాఁడు వ్యాధి పీడితుఁడు కాఁడు, లుబ్ధుఁడు కాని కృపణుఁడుకాని కాఁడు. ప్రజలు పరగుణముల యందు ప్రీతిగలవారు. ఉత్తములతో సంపర్కమును . కాంక్షించువారు. గురువులకునమస్కరించు వినయులు. సద్విద్యను నేర్చెడు వ్యసనము నండాసక్తి కలవారు. వారందరు పరాపవాదభీతులు. స్వభార్యారతులు. స్వభావముచే ఖలులతోడి సంసర్గమునకు విముఖులు, ధర్మతత్పరులు. సగరుడు భూమీని శాసింప ప్రజలందరాస్తికులు. ఈ విధముగా సుభహుతనయుఁడయిన సగరుడు, తన ప్రతాపముచే నార్జించిన భూమీనీ, పరిపాలించెను. ఋతువులు యథాకాలానుగములు. భూమియందు శాలి, ధాన్య, సస్యమధికముగా గలిగిన నృపశార్దూలుఁడు రాజ్యము పాలింప సర్వము సుభిక్షమై యొప్పెను.

ఆతని రాజసభ రత్నప్రభలచే నుద్భాసించుచు, అమరావతి యందలి ఇంద్రసభవలె ప్రకాశించును. ఇంద్రుని యొక్క సభ, ఆసనములు మణులచే నలంకరింపఁబడి దేవతలచే నాసీనములై యుండునట్లు సగరుని రాజసభ సేవార్థ మరుదెంచిన అష్టాదశ మండలాధిపులచే, ప్రఖ్యాలోరు పరాక్రమాన్వితులతో మూర్థాభిషిక్తులతో నలంకృతము. వారందరు రాజ సేవార్థమరుదెంచినవారే. వారందరు ప్రత్యేక మణిమయా సనములనుపవసించిరి. సామంతరాజులు వివిధ మండలముల నుండి ఉపాయనములతో ప్రభువును దర్శించుటకు వచ్చిరి. అట్టి సమయములలో ఆ సామంత నృపులు తమ సైన్య నివేశనములను, పట్టణము చుట్టును ప్రత్యేకముగా నిర్మించిరి. వారి వారి పుత్రులతో ప్రభువును దర్శింష కాంక్షితులై యుండిరి. వారు ద్వారమునందున్న ద్వారపాలకులచే నరేశ్వరునకు విజ్ఞాపన మంపుకొన, ఆ ద్వారపాలకులు రాజాంతఃపురమునందు చిరకాలము నుండి పోవుదురు. రాజ దర్శనమునకు అవకాశము విజ్ఞాపనమందించుటకు సమయము లభింప దుర్లభమయ్యెను. వచ్చి నమస్కరించు నరేంద్రుల యొక్క కిరీటపంక్తుల యొక్క అతిఘర్షణము వలన ఆ మహారాజేంద్రుని చరణములు కిణీభూతములై (కాయలుగా) ప్రకాశించెను.(18) సేవార్థ మరుగుదెంచిన నరేంద్ర సమూహములచే వినికీర్ణమై రాజసభ సమంతతః రత్నములు అనర్ఘమణులు సర్వత్ర ప్రకాశించుట వలన సుమేరు గుహవలె ప్రకాశించెను. ఏవం విధముగా భానువంశశిఖామణీయైన రాజు ధర్మబద్దముగా నరిందముఁడై అనన్యశాసనమయిన భూమిని పాలించెను. ఇట్లు సగరమహీపతి భూమిని పాలించుచుండ, ఆతనికి పుత్రముఖదర్శనము లేక రాజు అత్యంతము పలుమార్లు విచారించెను. అహో ! కష్టము సంప్రాప్తము. నేను అపుత్రకుఁడనైతిని. తన్మూలమున మావంశమున పితరులు పిండములు లేనివారగుదురు. వంశమున ఒక్క సత్పుత్రుండు జనింప, పీతరులు, నరకము నుండి కూడ జాతకర్మ క్రియోత్సుకులై తధృహమున కరుదెంచెదరు. అత్యంత సుకృతాచరణమున స్వర్గము సంప్రాప్తమయినను, అపుత్రకునకు దేవతలు స్వర్గద్వారమును తెరువరు, ఒక సత్పుత్రుండుద్బవింప, తండ్రి (పితరుఁడు) ఉభయలోకముల (ఈ లోకమున పరలోకమున) ఆనందమొందును. ఆతని పితామహులు, రెండు వంశముల యందు స్వర్లోకము నొందుదురు. పుత్ర ప్రాప్తి లేనందున, పుత్రవంతులకు గలుగు సద్గతినీ నేను నిజముగా పొందజాలను. అది సుదుర్లభతరము. నా సమృద్ధమైన అఖండ రాజ్యము. ఇంద్ర రాజ్యముకంటే భిన్నమయినది కాదు. నాకీ పుణ్యము లేనందున ఆ టైశ్వర్యాదులు నిష్ఫలములు. నాకు పుత్రులు లేనందున మా పూర్వులచే నధిష్టితమయిన యీ సింహాసనము

ఈ రాజ్యము పరాధీనత్వము నొందును. అందుచే ఔర్వాశ్రమమునకు భార్యాద్వయముతోపోయి ఆ ముని పుంగవుని పుత్రార్ధము ప్రసన్నుని చేసికొందును. ఇప్పుడు భార్యా సహితుఁడనై యరిగి నాయపుత్రత్వమును నివేదించెదను. ఆతఁడేది చెప్పిననది నిస్సంశయముగ నాచరింతును” అనీ రాజసత్తముఁడయిన సగరుఁడు మనస్సులో నీ విధముగా నాలోచించి, కార్యవిదుఁడు ఔర్యాశ్రమమునకు పోవుటకు, మంత్రి ప్రవరుని యందు రాజ్యమును ప్రతిష్టాపించి అరణ్యమునకు బయలు దేరెను. సంతోషముతో భార్యాద్వయముతో రథమారోహించెను. రథ ఘోష మేఘనాదమని అనుమానించి స్తిమిత దృక్కులతో నెమిళ్లచే చూడబడెను. స్తిమితేక్షణములయిన లేళ్లను ప్రియురాండ్రకు రాజు చూపించుచుండెను. తలలు పైకెత్తి వెంటనేదించి పలాయనపరములయిన లేళ్లను రాజు భార్యలకుఁజూ పెను. పుష్పఫలోపేతములయిన వృక్షములను చూచి రాజు ఆనందకంద ళుఁడయ్యెను. (35) వాడి పోవని పుష్పములతో, స్వాదుఫలములతో, పచ్చనిగరికభూములతో, దట్టము మధురమునయిన చిగుళ్ల నీడలతో, చుట్టును చెట్లు నిండి చెలువొందెను. మామిడి చిగుళ్లను తినుటచే స్నిగ్ధములైన కంఠములుగల పికరవములతో శోత్రాభిరామమై దిక్కులు సర్వత్ర నిండి యుండెను. సర్వర్తువుల వికసించు పుష్పములతోగూడి, వానిచుట్టును భ్రమించు భ్రమరములచే నలంకృతములై, ప్రసూనస్తబకములతో వంగిన లతలతో పెనవేసికొనబడినవృక్షములు, కపి సమూహములచే నిండి చెలగుచున్న వనస్పతీ శతావృతములు, మదించిన నెమళ్లు, సారంగములు మొదలగు కూజత్పక్షి గణావృతములు, పాడుచుండు విద్యాధర వధూగీతికా సుమనోహరములు, సంచరించు కీన్నరీ ద్వంద్వములచే ప్రకాశించు  వనగహ్వరములు, హంసములు, సారసములు, చక్రవాకములు, కారండవములు, శుకములు మొదలగు వాని సుస్వరములతో నిండి పొలు పొందు సరోవరములతో నిండినవి, సరస్సులందలి, అంబుజములు కల్హారములు మొదలయిన కుసుమ సమూహముల నుండి మెల్లగా వీచు మారుతపోతములచే నిండిన దిబ్ముఖములు - నయిన గుణవంతములయిన తపోవనభూముల ప్రయాణించి, రథమున పోవుచు రోజు పరమ హర్శమొందెను, ఆశ్రమ మండల సమీపమును చేరి రాజు ఉపశాంతాశయుఁడయ్యెను. భార్యలతో గూడి శ్రీమంతుఁడు రాజు వాహనము నుండి యవతరించెను. (44)

జైమిని రువాచ :-

గుఱ్ఱముల విశ్రమింపఁజేయుమని రథసారథికి చెప్పి మహారాజు భావితాత్ముఁడయిన మహర్షి యొక్క ఆశ్రమోపాంతము చేరెను. రాజు మునిశిష్యుల వలన కృతనిత్యక్రియుఁడని యెఱింగి, మునిని దర్శించుటకు, వినీతాత్ముఁడై ఆశ్రమమును ప్రవేశించెను. మునుల మధ్య, ముని బృందములచే సమన్వితుఁడై సమాసీనుఁడై యున్న మునికి భార్యాద్వయముతో కూడుకొనీ సంతోషముతో శిరసా రోజు నమస్కరించెను. (47) ప్రతాపవంతుఁడు ఔర్వుఁడు, నమస్కరించిన రాజును, భార్యలతో కూర్చుండుమని ప్రేమతో వచించెను, ఆ మునీ అర్య పాద్యాదులచే చక్కగా రాజును పూజించి, వన్యసంబంధమైన ఆతిథ్యముచే భార్యలతో నతనీనీ సంతోషపరచెను. అంత ఆతిధ్యము నంది విశ్రమించి మునికి నమస్కరీంచీ, ముందు నాసీనుఁడైన రాజును చూచి, మృద్వక్షరయుతమయిన పలుకులతో ఔర్వమహర్షి మెల్లగా నీట్లనెను. “ఓ రాజా ! నీ రాజ్యమున బాహ్యాభ్యంతరంబుల కుశలమే కదా ! ధర్మముతో నీవు నీ ప్రజలను రక్షించుచుంటివికదా ! ధర్మార్థకామములను త్రివర్గమును ఉపాయములతో జయింప గోరుచుంటివికదా ! సమ్యక్ప్రచోదీతములయి (ఆఱు) గుణములు నీ కొలకు ఫలించుచున్నవికదా ! ఓ నృపసత్తమా ! అదృష్టవశమున సర్వ శత్రువులు నీచే జయింపఁబడిరి ! ధర్మమునందున్న వారికి విప్లవముండదు. ఇంతకు పూర్వమే నేను విని యుంటిని. సమస్త పృధ్విని జయించి ససైన్యముగా కృతదారుఁడవై నగరమును ప్రవేశించి యుంటివనీ. సమ్యక్పాలనము రాజులకు శ్రేష్ఠము. తన్మూలమున రాజులు ఇహాముత్రముల సుఖవంతులు. అట్టి నీవు, రాజ్యపాలనమును విడిచి, భార్యలతో గూడికొని నా సమీపమునకు వచ్చి యుంటివి. కారణము వచింపుము.

జైమిని ఇట్లనెను : -

ముని యిట్లు అడుగగా రాజసత్తముఁడయిన సగరుఁడు కృతాంజలిపుటుఁడై యాతనితో మృదువుగా నిట్లనెను.

ఇది మహాపురాణము వాయుప్రోక్తమునయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమున, సగరుని ఔర్వాశ్రమగమనమను ఏబదవ అధ్యాయము.