1 - మహర్షులు యదువంశమును శపించుట

శ్రీబాదరాయణిరువాచ

కృత్వా దైత్యవధం కృష్ణస్సరామో యదుభిర్వృతః

భువోఽవతారయద్భారం జవిష్ఠం జనయన్ కలిమ్

వ్యాససూనుడగు శుకమహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుడు బలరామునితో, ఇతరయాదవులతో గూడి రాక్షసులను మట్టుబెట్టెను. ఆయన అతిశయించిన వేగము గల కలహము (మహాభారతయుద్దము) ను కలిగించి, తద్ద్వారా భూమియొక్క బరువును తగ్గించెను.

యే కోపితాస్సుబహు పాండుసుతాసపత్నైః

దుర్ద్యూత హేలనకచగ్రహణాదిభిస్తాన్

కృత్వా నిమిత్తమితరేతరతస్సమేతాన్

హత్వా నృపాన్నిరహరత్ క్షితిభారమీశః

శత్రువులైన దుర్యోధనాదులు పాండవులను పలుమార్లు అవమానించిరి. వారిని కపటపు జూదములో ఓడించి వారి భార్యయగు ద్రౌపది జుట్టు పట్టి లాగిరి. ఇంతేగాక, లక్కయింటిని తగులబెట్టుట మొదలగు అకృత్యములను చేసిరి. దీనితో పాండవులు కోపించియుండిరి. సర్వసమర్థుడగు శ్రీకృష్ణ భగవానుడు భూభారమును పోగొట్టుటకు వారినే నిమిత్తముగా చేసుకొనెను. కౌరవపాండవుల పక్షములలో చేరి రాజులు ఒకచో యుద్ధరంగములో సమావేశమైరి. వారినీ పరస్పరము సంహరింపజేసి ఆయన భూభారమును తగ్గించెను.

భూభారరాజపృతనా యదుభిర్నిరస్య

గు ప్రెస్స్వబాహుభిరచింతయదప్రమేయః

మన్యేఽవనేర్నను గతోఽప్యగతో హి భారో

యద్యాదవం కులమహో అవిషహ్యమాస్తే

శ్రీకృష్ణ భగవానుని స్వరూపము ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాదు. ఆయన తన భుజశక్తిచే రక్షించబడిన యాదవుల ద్వారా భూమికి బరువైన రాజులను, వారి సేనలను సంహరించి, ఇట్లు తలపో సెను -- లోకదృష్టిలో భూభారము తొలగినా, నా దృష్టిలో ఇంకనూ పూర్తిగా తొలగలేదు. ఇది నిశ్చయము. ఆహా! ఎందుకంటే, శత్రువులకు కన్నెత్తి చూడ శక్యము కాని యాదవవంశము ఇంకనూ మిగిలియే యున్నది.

నైవాన్యతః పరిభవోకస్య భవేత్కథంచిత్

మత్సంశ్రయస్య విభవోన్నహనస్య నిత్యమ్

అంతఃకలిం యదుకులస్య విధాయ వేణు-

స్తంబస్య వహ్నిమివ శాంతము పైమి ధామ

వీర్యశౌర్యాదులలో ఉత్కర్షను పొంది ఉచ్చృంఖలముగానున్న ఈ యాదవవంశమునకు ఆశ్రయము నేనే అగుట వలన, దీనికి ఇతరుల వలన పరాభవము కలుగనే కలుగదు. (ఇతరుల వలన నాశము కలుగదని చెప్పవ లేనా?) లోపల నిప్పు పుట్టినప్పుడు వెదుళ్ల పొద కాలి బూడిద యగును. అదే విధముగా, ఈ వంశమునకు లోపలినుండీ, కలహమును కలిగించేదను. ఈ వంశము కూడ నాశము కాగా, భూభారము తగ్గుటచే నాకు శాంతి కలుగును. అప్పుడు నేను నిత్యమంగళమగు వైకుంఠధామమును చేరెదను.

ఏవం వ్యవసీతో రాజన్ సత్యసంకల్ప ఈశ్వరః

శాపవ్యాజేన విప్రాణాం సంజహ్రే స్వకులం విభుః

ఓ పరీక్షిద్రాజా! శ్రీకృష్ణ భగవానుని సంకల్పము సత్యమగును. సర్వ ప్రాణులలో అంతర్యామి, సర్వసమర్థుడు అగు ఆ దేవుడీ విధముగా నిశ్చ యించి, తనదైన వంశమును మహర్షుల శాపమనే మిషతో నశింపజేసెను.

స్వమూర్త్యా లోకలావణ్యనిర్ముక్త్యా లోచనం నృణామ్

గీర్భిస్తాస్స్మరతాం చిత్తం పదైస్తానీక్షతాం క్రియాః

ఆచ్చిద్య కీర్తిం సుశ్లోకాం వితత్య హ్యంజసా ను కౌ

తమోనయా తరిష్యంతీత్యగాత్స్వం పదమీశ్వరః

శ్రీకృష్ణ భగవానుని రూపలావణ్యము ముందు లోకములో ఇతరములైన సుందరవస్తువులు వెలవెలపోయెడివి. ఆ సౌందర్యము జనుల చూపును తన వైపు బలముగా ఆకర్షించెడిది. ఆయన పలుకులు ఆ పలుకులను స్మరించువారి చిత్తమును ఆకర్షించెడివి. జనులు ఇతరవ్యాపారములను కట్టిపెట్టి ఆయన కాలి గురుతులను చూచెడివారు. ఆయన భూలోకమునందు చక్కగా కవులచే గానము చేయబడే కీర్తిని విస్తరింపజేసినాడు. దానిచే జనులు నిశ్చయముగా అజ్ఞానమనే చీకటిని తేలికగా దాటివేయగలరనే దయతో ఆయన అట్లు చేసినాడు. అప్పుడాయన తన ధామమునకు వెళ్లినాడు.

రాజోవాచ

బ్రహ్మణ్యానాం వదాన్యానాం నిత్యం వృద్ధోప సేవితామ్

విప్రశాపః కథమభూదృష్ణీనాం కృష్ణ చేతసామ్

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- యాదవులు బ్రాహ్మణభక్తులు, దాతలు. వారు శ్రీకృష్ణునియందే లగ్నమైన చిత్తము గలవారై సర్వదా పెద్దలను సేవించెడివారు. వారికి మహర్షుల శాపము ఎట్లు కలిగెను?

యన్నిమిత్తస్స వై శాపో యాదృశో ద్విజసత్తమ

కథమేకాత్మనాం భేద ఏతత్సర్వం వదస్వ మే

ఓ మహర్షిపుంగవా! ఆ శాపమునకు కారణమేమి? ఆ శాపమెట్టిది? ఒకే చిత్తము గల యాదవులలో కలహము ఎట్లు కలిగెను? ఈ విషయమునంతనూ నాకు చెప్పడు.

శ్రీశుక ఉవాచ

బిభ్రద్వపుస్సకలసుందరసన్నివేశం

 కర్మాచరన్ భువి సుమంగలమాప్తకామః

ఆస్థాయ ధామ రమమాణ ఉదరకీర్తిః

సంహర్తు మైచ్ఛత కులం స్థితకృత్య శేషః

పూర్ణకాముడగు శ్రీకృష్ణుడు భూలోకములో ద్వారకాధామమునధిష్టించి కల్యాణకరమగు లీలలను చేస్తూ రమించెను. ఆయన గొప్ప కీర్తి గలవాడు. ఆయన అందమైన సకలావయవముల చక్కని విన్యాసము గల దేహమును ధరించినాడు. భూభారమును హరించుట అనే కార్యములో ఇంకనూ శేషము గలదు. కావుననే, ఆయన యాదవవంశము నుపసంహరించవలెనని సంకల్పించెను.

కర్మాణి పుణ్యనివహాని సుమంగలాని

గాయజ్జగత్కలిమలాపహరాణి కృత్వా

కాలాత్మనా నివసతో యదుదేవ గే హే

పిండారకం సమగమన్మునయో నిసృష్టాః

కాలరూపుడైన శ్రీకృష్ణుడు చేసిన పరమమంగళకరములగు లీలలు గానము చేసే జగత్తులోని జనులకు కలిదోషములను పోగొట్టి పుణ్యమును కలిగించును. వసుదేవుని ఇంటిలో నివసించే శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకొని మహర్షులు పిండారకక్షేత్రమును చేరిరి.

విశ్వామిత్రోఽసితః కణ్వో దుర్వా భృగురంగిరాః

కశ్యపో వామదేవోఽత్రిర్వసిష్ఠో నారదాదయః

ఆ మహర్షులెవరనగా -- విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దూర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వసిష్ఠుడు, నారదుడు, గౌతముడు మొదలగువారు.

క్రీడంతస్తానుపమ్రాజ్య కుమారా యదునందనాః

ఉపసంగృహ్య పప్రచ్ఛురవినీతా వినీతవత్

యాదవుల పుత్రులగు కొందరు యువకులు అచట ఆటలాడుచుండిరి. వినయమునేరుంగని ఆ యువకులు ఆ మహర్షుల వద్దకు వెళ్లి, వినయశీలురు వలే పాదములకు నమస్కరించి ఇట్లు ప్రశ్నించిరి.

తే వేషయిత్వా స్త్రీవేషైస్సాంబం జాంబవతీసుతమ్

ఏషా పృచ్ఛతి వో విప్రా అంతర్వత్న్యసితేక్షణా

వారు జాంబవతి పుత్రుడగు సాంబునకు స్త్రీల వస్త్రములను కట్టి, ఆభరణములను పెట్టి వారితో నిట్లనిరి -- మహర్షులారా! ఈ నల్లని కన్నుల సుందరి గర్భిణి. ఈమె మిమ్ములను (మా ద్వారా) ఇట్లు ప్రశ్నించుచున్నది.

ప్రష్టుం విలజ్జతీ సాక్షాత్ప్రబ్రూతామోఘదర్శనాః

ప్రసోష్యంతీ పుత్రకామా కింస్విత్సంజనయిష్యతి

ఓ మహర్షులారా! మీ దర్శనము వ్యర్థము కాదు. ఈమె తానే స్వయముగా మిమ్ములను ప్రశ్నించుటకు చాల సిగ్గు పడుచున్నది. కొద్ది రోజులలో ప్రసవించబోయే ఈమె పుత్రసంతానమును కోరుచున్నది. ఈమెకు పుత్రుడు కలుగునా?

ఏవం ప్రలబ్ధా మునయస్తానూచుః కుపితా నృప

జనయిష్యతి వో మందా ముసలం కులనాశనమ్

ఓ పరీక్షిన్మహారాజా! వారీ విధముగా వంచనతో పరిహసించగా మహర్షులు కోపించి ఇట్లు పలికిరి -- ఈమె మీ వంశమునంతమొందించే రోకలిని ప్రసవించగలదు.

తచ్ఛ్రుత్వా తేఽతిసంత్రస్తా విముచ్య సహసోదరమ్

సాంబస్య దదృశుస్తస్మిన్ముసలం ఖల్వయస్మయమ్

ఆ మాటను విని ఆ యువకులు చాల భయపడిరి. వారు వెంటనే సాంబునకు కృత్రిమముగా పెట్టిన పొట్టను తెరిచి చూడగా, దానిలో యథార్థముగా ఇనుముతో చేసిన రోకలి కనబడెను.

కిం కృతం మందభాగ్యైర్నః కిం వదిష్యంతి నో జనాః

ఇతి విహ్వలిత గేహానాదాయ ముసలం యయుః

మనము దురదృష్టవంతులము. మనము చేసిన పని యేమి? మనలను గురించి జనులేమనుకొనెదరు? ఈ విధముగా వ్యాకులమైన మనస్సు గల ఆ యువకులు రోకలిని తీసుకొని ఇళ్లకు వెళ్లిరి.

తచ్చోపనీయ సదసి పరిమ్లానముఖశ్రియః

రాజ్ఞ ఆవేదయాంచక్రుస్సర్వయాదవసన్నిధౌ

ఆ యువకుల ముఖకాంతి పూర్తిగా మాడిపోయేను. వారా రోకలిని సభకు తీసుకువచ్చి, సకలయాదవుల సన్నిధిలో ఉగ్ర సేన మహారాజునకు విన్నవించిరి. (శ్రీకృష్ణునకు చెప్పలేదు).

శ్రుత్వాఽమోఘం విప్రశాపం దృష్ట్వా చ ముసలం నృప

విస్మితా భయసంత్రస్తా బభూవుర్ద్వారకౌకసః

ఓ పరీక్షిన్మహారాజా! ద్వారకావాసులు తప్పక ఫలమునిచ్చే మహర్షుల శాపమును గురించి విని రోకలిని కూడ చూచిరి. వారికి ఆశ్చర్యము, భయముతో కంగారు కలిగెను.

తచ్చూర్ణయిత్వా ముసలం యదురాజస్స ఆహుకః

సముద్రసలిలే ప్రొస్యల్లోహం చాస్యావ శేషితమ్

యాదవుల రాజగు ఆ ఉగ్ర సేనుడు ఆ రోకలిని చూర్ణముగా చేయించి, ఆ చూర్ణమును, మిగిలియున్న చిన్న లోహపు ముక్కను కూడ సముద్రజలములలో పారవేయించెను (శ్రీకృష్ణుని సంప్రదించలేదు).

కశ్చిన్మత్స్యోగ్రసీల్లోహం చూర్ణాని తరలైస్తతః

ఉహ్యమానాని వేలాయాం లగ్నాన్యాసన్ కిలైరకాః

ఆ సముద్రములోని ఒక చేప లోహపు ముక్కను మ్రింగెను. చూర్ణముయొక్క కణములు కెరటములపై పయనించి ఒడ్డున ఇసుకకు తగుల్కొని తుంగ (ముళ్ల) గడ్డి దుబ్బులుగా అయినవి.

మత్స్య గృహీతో మత్స్య ఘ్నైర్జాలేనాన్యైస్సహార్ణవే

తస్యోదరగతం లోహం స శల్యే లుబ్ధకోఽకరోత్

సముద్రములో చేపలను పట్టువారు వల వేసి మిగతా చేపలతో బాటుగా ఆ చేపను కూడ పట్టిరి. దాని పొట్టలోని లోహపు శకలము ఒక కిరాతునకు దొరకగా, ఆతడు దానిని బాణపు కొనలో గ్రుచ్చెను.

భగవాన్ జ్ఞాతసర్వార్థ ఈశ్వరోఽపి తదన్యథా

కర్తుం నైచ్ఛద్విప్రశాపం కాలరూప్యన్వమోదత

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే ఏకాదశస్కంధే ప్రథమోఽధ్యాయః

శ్రీకృష్ణ భగవానుడు కాల(మృత్యు)రూపుడు. ఆయనకు అన్ని విషయములు తెలియును. మహర్షుల శాపము జరుగకుండా చేసే శక్తి ఆయనకు గలదు. అయినా, ఆ శాపమును తప్పించుట ఆయనకు ఇష్టము కాలేదు. ఆయన ఆ శాపముననుమోదించెను.

శ్రీమద్భాగవతము ఏకాదశ స్కంధములో  యదువంశములో ముసలము పుట్టుటను వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1).