వామన మహా పురాణము
అధ్యాయము 58
బ్రహ్మర్షే! పరమ భక్తుడైన ప్రహ్లాదుడు శ్రద్దగా జపించిన గజేంద్ర మోక్షణం మొులయిన నాలుగు స్తోత్రాలేమో చెప్పండి.
ఓ తపోధనా! దేనిని జపిస్తే వింటే స్మరిస్తే దుఃస్వప్నాలు నశించునో ఆ గజేంద్ర మోక్షణ గాధను ముందుగా వినుము. తర్వాత సారసత్వ పాప ప్రశమన స్తోత్రాలు చెబుతాను. సర్వ రత్నాలతో నిండిన త్రికూటమనే భవ్య పర్వతం ఉంది. సూర్య కాంతితో వెలిగే మేరు పర్వతానికి ఆ త్రికూట పర్వతం పుత్రుడు. దేవర్షి గణాలు సేవించే ఆ పర్వతం క్షీర సాగరంలో నుంచి ఉద్భవించింది. దాని నునుపైన శిలలను ఆ సాగర తరంగాలు కడుగుతూంటాయి. అనేక సెలయేళ్లతో కల కల లాడే ఆ పర్వతాన్ని గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు, సిద్ద, చారణ, పన్నగ, విద్యాధరులు తమ భార్యలతో కలిసి సేవిస్తుంటారు. జితేంద్రియు లగు తపస్వులకు ఆట పట్టు అ గిరి. తోడేళ్లు, గజేంద్రాలు దాని మీద సంచరిస్తుంటాయి. ఆ పర్వతం నిండా పున్నాగ, కర్ణికార (గన్నేరు), బిల్వ, ఉసిరిక, పాటల, మామిడి, కడిమి, కదంబ, చందన, అగరు, సంపెంగ శాల, తాళ, తమాల, సరళ, అర్జున, పర్పట మొదలయిన ఎన్నో రకాల వృక్షాలు ఏపుగా పెరిగి నేత్ర పర్వం గావిస్తాయి. అనేక ధాతుమయాలైన దాని శిఖరాల నుంచి జాలువారే జల పాతాలతో అందాలుచిందించే మూడుసానువులతో అది అలరారుతూంటుంది. లేళ్లు, వానరాలు, సింహాలు, మదపుటేనుగులు జీవాలను చంపి తినే యితర జంతువులతో చకోర మయూరాల నాదాలతో ఆ ప్రదేశం కోలాహలంగా ఉంటుంది. ఆ మూడు శిఖరాలలో ఒకటి బంగారుమయమై దివాకరున కావాసంగా చక్కని పరిమళాలు వెదజల్లే నానాపుష్పాలతో నిండి ఉంటుంది. చంద్రున కావాసమైన రెండవ శిఖరం రజత నిర్మితం. అది శ్వేతమేఘ సమూహం లాగ తుషారపటలాల్లా గా మనోహరంగా ఉంటుంది. ఇంద్రనీల, వజ్ర, వైడూర్యకాంతులతో దిశలను వెలిగిస్తూ ఉండే మూడవ శిఖరం బ్రహ్మకు నెలవు. సర్వోత్తమమైనది. అది కృతఘ్నులకూ, కౄరులకూ, నాస్తికులకూ, తపస్సు చేయని పాపులకూ గోచరం కాదు.
ఆ పర్వతాగ్రాన బంగారు కమలాలతో నిండిన చక్కని సరోవరం నీటి బెగ్గురులు రాజహంసలు జల కుక్కుటాల కల ధ్వనులతో నయన శ్రవణాభిరామంగా శోభిస్తుంది. అందులో కలువలు, నల్ల కమలాలు, కల్హారాలు, తెల్ల కమలాలు, శతపత్రాలూ, కాంచన శోభతో నిండి ఉన్నాయి. మరకత మణు ల్లాగ కమల పత్రాలు నలువైపులా పరచుకుని ఉన్నాయి. సరోవరం చుట్టూ వెదురు పొదలు దట్టంగా వ్యాపించాయి. అలాంటి అందమైన సరోవరంలో ఏనుగుల పాలిట మృత్యువు లాగ అరమోడ్పు కనులలో నీళ్లలో కనపడకుండా దాగి కొని ఒక భయంకరమైన మొసలి మాటు వేసికొని ఉండేది. అలా ఉండగా నొక పర్యాయం ల్లని దంతకాంతులతో ముఖం వెలిగి పోతున్న ఒక గజ సమూహ నాయకుడు మద జలధారలు చెంపల నుండి స్రవిస్తూ ఉండగా దాహార్తుడై మద వాసనలతో ఆ పర్వతాన్ని ముంచేస్తూ ఐరావతాన్ని బురుడిస్తూ నడుస్తున్న కాటుక కొండ లాగ బయలుదేరి అచటకు వచ్చాడు. మద ఘూర్ణిత నేత్రాలలో నీరు త్రాగుటకై ఆ సరోవరంలోకి ఆతురతతో దిగాడు. నీరు త్రాగి తామర కొలనులో విహరిస్తూన్న ఆ గజాధిపతిని కనపడకుండా నీళ్లలో పొంచి ఉన్న ఆ క్రూర గ్రాహం గట్టిగా తన కోరలతో పట్టుకున్నది. ప్రక్కనే నిలబడిన ఆడ ఏనుగుల గుంపు ఏమీ చేయ లేక చూస్తూ ఆక్రోశిస్తూ ఉండిపోయింది. ఆ మొసలి మదగజం కాలు పట్టుకొని సరస్సులోనికి లాగుతూంటే ఆ బలమైన వరుణ పాశానికి లోనై విడిపించుకొనే ప్రయత్నం కూడ చేయలేని అసహాయ స్థితిలో చలనం మాని నిలబడిపోయింది, ఆ ఏనుగ. అలా ఘోరమైన పాశాలతో బంధింప బడి గజేంద్రుడు శక్తి కొలది ఘీంకరిస్తూ పెడ బొబ్బలు పెట్టసాగాడు. క్రమంగా శక్తి ఉత్సాహం కోల్పోయి ఫెూర విపత్తుకూ బాధకూ తట్టుకొన లేక మనసారా హరిని స్మరించాడు. పూర్వ జన్మలలో నారాయణుని చరణ కమల భక్తిని అభ్యసించిన వాడై ఉన్నందున, ఆ గజశ్రేష్ఠుదు పూర్వ సంస్కార పుణ్య పరిపాకం వల్ల పదిశుద్ధమైన అంతఃకరణంతో సర్వేంద్రియాలను ఆ గదుడధ్వజునిపై లగ్నం చేసి నిశ్చలమైన విశ్వాసంతో నా ప్రభువుకు శరణాగతుడై నాడు. అలా అనన్యమైన చిత్తంతో మధించిన అమృతం నుంచి వెలువడే నురుగునకు వలె తెల్లనైన శంఖం, చక్రం, గద ధరించిన ఆకేశవుని, మంగళ ప్రదాలయిన వేయి నామాలతో వెలుగొందే అభవుని, సర్వ లోక నాయకుని, కరా(తొండము) గ్రాన బంగారు కమలం పట్టుకొని తన బంధ విముక్తికై దీన హీన స్వరంతో యిలా స్తోత్రం చేశాడు.
35 – Slokas 35-59
శంఖ చక్ర గదాధరుడూ, అమోఘ సంభవుడు (సార్థక జన్ముడు) నగు విష్ణుదేవుడు గజేంద్రుని భక్తికి సంతోషించి ఈ సరస్సులో సాన్నిధ్యాన్ని కల్పించు కొన్నాడు. లోకాధారుడు మహా తపోధనుడునైన ఆ గరుడవాహనుడు వచ్చి మహా వేగంతో ఆ గజాన్నీ మొసలినీ రెంటినీ సరుస్సులో నుండి లాగి బయటపడవేసి చక్రంతో మకరి కంఠాన్ని ఉత్తరించాడు. శరణాగతుడైన ఆ గజాధిపునకు బంధ మోక్షం కలిగించాడు. దేవలుని శాపం వల్ల మకరిగా మారిన హూహూ అనే గంధర్వుడు కృష్ణుని చే వధింప బడి శాప విముక్తుడై దివికి చేరుకున్నాడు. గజేంద్రుడు గూడ విష్ణు కర స్పర్శ వలన దివ్య దేహం ధరించాడు. అలా గజ గంధర్వు లిద్దరూ ఆపదలు వీడి ముక్తులయ్యారు. అంతట వారిద్దరా పుండరీకాక్షుని పూజించారు. శరణాగత వత్సలు డైన ఈ మహా యోగి మధుసూదన డంతట నా గజేంద్రుని జూచి ఓ నారదా! ఇలా అన్నాడు.
మధుసూదనుడు
ఎవరైతే నిన్నూ, నన్నూ, ఈ సరోవరాన్ని, ఇచటి గుల్మ, కీచక, రేణువులను, మేరుపుత్రుడైన గిరిశఖరాన్ని మకరిసింహారాన్ని అశ్వత్థ వృక్షాన్ని, భాస్కరుని, గంగను నైమిషారణ్యాన్ని పవిత్రాంతఃకరణతో, స్థిర బుద్ధితో కీర్తిస్తారో, భక్తితో శుచులై ఈ పవిత్ర గాధను వింటారో వారల దుస్వప్నాలు నశించి శుభ స్వప్నాలు కలుగుతాయి. ప్రతి దినము ప్రాతఃకాలాన మేల్కాంచి ఏ నరులైతే మత్స్య, కూర్మవరాహ, వామన, గరుడ, నారసింహావతారాలను, వారి కార్యాలను, సృష్టి ప్రలయ కారకుడైన నాగేంద్రుని, సమాహిత చిత్తంతో స్మరిస్తారో వారలు సమస్త పాపాల నుండి విడి వడి వూణ్యలోకాలకు పోతారు.
గరుడ ధ్వజుడైన ఆ హృషీకేశవుడీ విధంగా వరా లిచ్చి ఆ గజ గ్రాహాలను తన చేతితో నిమిరాడు. అంత నా గజేంద్రుడు దివ్య దేహం ధరించి మధుసూదనుని పాదాల కడ శరణాగతు డయ్యాడు. నారదా! అంతట శ్రీ నారాయణ దేవుడా నారాయణ పరాయణుడగు గజరాజునకు మకరి నుండి యే కాక పాపాల నుండి కూడ ముక్తి ప్రసాదించాడు. అనంతరమా అద్భుత కర్ముడు విష్ణుడు ఋషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, స్తోత్రాలు చేస్తూండగా వెళ్లిపోయాడు. దుర్విజ్ఞేయ గమను డైన శ్రీహరి గావించిన గజేంద్ర మోక్షణాన్ని తిలకించిన యింద్రాది దేవతలంద రా భక్త వత్సలు నకు చేతులు మోడ్చి వందనాలు చేశారు. మహర్షులు చారణులు ఆశ్చర్య పులకితులై స్తవనములు గావించారు. చక్ర పాణి నెరపిన అద్భుత చేష్టితాన్ని చూచి ప్రజాపతులలో ముఖ్యుడైన చతుర్ముఖుడు యిలా అన్నాడు. ఈ గజేంద్ర యోక్షణ కథను ప్రాతఃకాలాన లేచి నిత్యమూ యే మానవులు వినెదరో వారలకు పరమసిద్ధి కలుగుతుంది. దుస్వస్నాలు నశిస్తాయి. ఓ తపోధనా! గజరాజమోక్షణ గాధ పరమ పవిత్రమైనది. పుణ్య ప్రదమైనది. దీనిని చదివినా, స్మరించినా, వినినా, సర్వ పాపాలు నశిస్తాయి. ఆ క్షణాన్నే! మురారి యొక్క ఈ పావన చరిత్రం సదా గానం చేయతగినది. దీనిని చదివినచో ఆ గజరాజునకు వలెనే సకల పాప బంధాల నుంచీ విముక్తి కలుగుతుంది. అజితుడం వరేణ్యుడు, పద్మనాభుడు, నారాయణుడు, బ్రహ్మ నిధి, సురేశ్వరుడు, పురాణపురుషుడు లోకపతి అయిన శ్రీవల్లభునకు నమస్కరిస్తున్నారు.
నారదా! నీవడిగిన స్తోత్రాలలో మేటి అయిన గజేంద్ర కృత స్తవాన్ని వినిపించాను. దీనిని పాడి విని స్మరించి మానవుడు పాప దూరుడు కాగలడు.
అధ్యాయము 58 Complete
