వామన మహా పురాణము
అధ్యాయము 25
ఆ మేనాదేవి గుణసంపన్నురాలయిన కుమార్తెలు మువ్వురను సునాభుడిగా పేరొందిన పుత్రునొకనిని కనినది. వారలలో ఎర్రని కాంతిని కలిగి ఎర్రని నేత్రాలతో ఎర్రనివస్త్రాలు ధరించిన రాగిణియను పుత్రిక జ్యేష్ఠురాలు. ఓ మునీ! తామరాకుల్లాంటి నేత్రాలతో తెల్లని అంగకాంతితో నల్లని నొక్కుల జుట్టుతో తెల్లని వస్త్రాలు ధరించి పుట్టిన కుటిల రెండవది. నల్లని దేహకాంతితో నల్ల కమలాల బోలిన కండ్లతో చక్కని పిరుదులతో సాటిలేనిఅందంతో పుట్టిన మూడవ కుమార్తె కాళీ. పుట్టిన ఆరేండ్ల తర్వాత ఆ ముగ్గురు బాలికలు తపస్సు చేయసాగారు. ఆ సుందరాంగులను దేవతలు చూచారు. చంద్రకిరణాల శోభతో వెలిగే కుటిలయను కన్యను ఆదిత్య వసువులు దేవలోకానికి గొనిపోయి బ్రహ్మకు చూపించి ప్రభూ! ఈమె మహిషాసురుని చంవగల పుత్రునికనగలదా చెప్పుడన్నారు. అందుకు బ్రహ్మ ఈ తపస్విని శివ వీర్యాన్ని ధరించజాలదు. కనుక ఈ చిన్నదానిని వదలిపెట్టండి అని చెప్పాడు. బ్రహ్మ మాటలకు కోపించిన ఆ కుటిల ఓ నారదా! బ్రహ్మతో - భగవన్! నేను జనార్ధనుని గూర్చి తీవ్రమైన తపస్సుచేసి శివవీర్యం ధరించగల శక్తి సంపాదించి శివుని పాదాక్రాంతుని చేసుకోగలను. అందుకు తీవంగా పయత్నించగలననెను. ఆడి విని కోపించిన విరించి, ధూర్తయైనకుటిలతో ఇలా అన్నాడు.
పాపిష్ఠవైన కుటిలా! నాహిత వచనాన్ని ధిక్కరించినందుకు నిన్ను నా శాపాగ్నిలో దహించి వేస్తాను. నీవు ఈ క్షణమే నీరుగా మారిపోతావు. అలా బ్రహ్మ శాపానికి గురియై ఆ కుటిల నీరుగామారి బ్రహ్మలోకాన్ని ముంచివేయబోగా నా పితామహుడు ఋగ్యజుస్సామాథర్వణ వేదాలతో నామెను గట్టిగా బంధించాడు. ఆమెయు అక్కడే బ్రహ్మదేవుని జటామండలాన్ని తడుపుతూ ఉండిపోయింది. అంతట రాగిణియను బాలికను గూడ దేవతలు బ్రహ్మకడకు గొనిపోగా ఆయన ఆ బాలికగూడ శివవీర్య ధారణ కనర్హురాలన్నాడు. ఆమె కూడ బ్రహ్మతో వివాదపడి ఆయన శాపానికి గురియై సంధ్యగా నాటినుండీ పిలువబడుతోంది. పర్వతంమీద కృత్రికగా గుర్తింపబడుతూంది. అలా తన కుమారై లిర్వురు చేతినుండి జారిపోవుటచూచిన మేనాదేవి మూడవ కుమార్తె కాళిని చూచి, "ఉ - మా" అమ్మా నీవు తపస్సు చేయవద్దని వారించింది. ఆనాటి నుండీ ఆ తల్లి ఆ బిడ్డను "ఉమా" అనే సంబోధించసాగింది. అంతటనా "ఉమ" అడవికి వెళ్ళిపోయింది. అక్కడ తన మనస్సులో శూలపాణి, వృషభ కేతనుడు మహాదేవుడైన రుద్రుని సంధానించుకొని ఘోరమైన తపోదీక్షలో మునిగిపోయెను. అంతట బ్రహ్మమరల హిమగిరి పుత్రికయైన ఆ కాళినిగొని తెమ్మని దేవతలను పంపగా ఆమె తపోఽగ్నికి భయపడి ఆమె దగ్గరకుగూడ వెళ్ళలేక పోయారు. ఆమె ముందర యింద్రుడు కూడ తన తేజస్సు గోల్పోయి ఆమె తేజస్సు బ్రహ్మ తేజాన్నిగూడ మించినదని వక్కాణించాడు. అది విని బ్రహ్మ మిమ్ములనందరను తన తేజస్సుతో నిర్జించిన ఆ బాలికయే శంకరుని అర్ధాంగి. ఇది తథ్యం. కనుక యిక మీరు మీ చింతలుమాని మీమీ నెలవులకు పొండ"ని ఆదేశించాడు. బ్రహ్మ వచనాలకు సంతసించి యింద్రాదిసురలు భయాందోళనలు వదలి తమ తమ యిండ్లకు వెళ్ళి పోయారు.
76 – Missing content
ఓ పార్వతీ! నీకీ సలహా ఎవడిచ్చాడని అడుగుతున్నాను. చిగురుటాకులను వెక్కిరించే నీ మెత్తటి చేతులెక్కడ? వీటితో ఆ పాములచేతివాడి కరగ్రహణం ఎలా చేస్తావు? నీవో చీనిచీనాంబరాలు ధరిస్తావు. అతడో పులితోలు కప్పుకనే రుద్రుడు (భయంకరుడు). నీవు చందన లేపనంచేసుకుంటే అతడు బూడిద పూసుకుంటాడు. ఈ సంబంధం నాకేమాత్రం నచ్చలేదు!
నారదా! అలా మాటాడుతున్న భిక్షువును వారిస్తూ పార్వతి "అలా అనగూడదు. హరుడు, ఓ భిక్షూ! సర్వ గుణాల్లో సర్వాధికుడు! ఆ ప్రభుడు మంగళరూపి కానీ భయంకరాకారుడు కానీ, ధనవంతుడు గానీ,దరిద్రుడు కానీ, సర్వాలంకారుడు కానీ, దిగంబరుడు కానీ ఆయనే నా భర్తకాగలడు! ఓ శశి ప్రభా! ఈతని పెదవులు కదలుచున్నవి. ఇంకా ఏమోవదరబోతున్నాడీతనిని ఆపండి. ఇతరులను నిందించే వానికన్నా ఆనిందనువినే వారలు ఎక్కువ పాపంమూటగట్టుకుంటారు" అని తన నిశ్చయం వెల్లడిచేసినది. పులస్తుడు ఓ నారదా! అలాపలికి అచటనుండి లేచిపోవనుద్యమించిన ఆ వరదాయిని ఎదుట శివుడు తననిజరూపంతో నిలచి యిలా అన్నాడు. "ప్రియురాలా! సుఖంగా యింటికి వెళ్ళిపో. నేను త్వరలోనే నిన్నుపొందుటకై మహర్షులను నీ తండ్రి యింటికి పంపుతాను. నీవుపూజించిన ఈ మృణ్మయ శంకర ప్రతిమ నేటి నుండీ భద్రేశ్వరుడుగా లోకంలో ప్రసిద్ధమౌతుంది. దీనిని దేవదానవ గంధర్వ యక్ష కింపురుష నాగ మనుష్యాదులు పూజించి శుభాలు పొందుతారు." హరుని మాటల కలరి ఆ గిరికన్య వెంటనే ఆకాశమార్గానా తన నెలవుకు వెళ్ళి పోయినది. మహాతేజస్వి అయిన శంకరుడు హిమవత్పుత్రిని వదలిపృథూదక క్షేత్రానికి వెళ్ళి యథావిధిగా స్నానం చేశాడు. అలా పృథూదక స్నానంతో పవిత్రుడై నందీశ్వరుడు మొదలగు గణాలతో కూడికొని మందర మహాశైలానికి తరలివెళ్ళాడు. అనంతరం ప్రమథగణాలు సప్తర్షులతో కలిసి తనయింటికే తెంచిన ఆ త్రిపుర సంహరునిచూచి హర్షసంభ్రమాశ్చర్యాలతో పులకించి ఆ నగాధిరాజు, ఆ దేవునికి స్వాగతంపలికి, కందమూల ఫలాలు దివ్యజలాలు సుగంధిత కుసుమాదులతో వారలనందరను ఘనంగా పూజించాడు.
అధ్యాయము 25 Complete
