వామన మహా పురాణము

Table of Contents

అధ్యాయము 50

నారదా! తన త్రిలోకాధిపత్యం రాక్షసుల పాలైపోగా మొగము వ్రేల వేసికొని దేవతలతో కలిసి యింద్రుడు బ్రహ్మసదనానికి వెళ్లాడు. అక్కడ పద్మోద్భవుడైన బ్రహ్మను, ఋషి సమూహాన్ని తన తండ్రి అయిన కశ్యప మహర్షినీ, చూచి వారలందరకు తలవంచి ప్రణామాలు గావించి యిలా విన్నవించాడు. ‘పితామహా! నా రాజ్యాన్నంతనూ బలిదైత్యుడు బలపూర్వకంగా అపహరించాడు. 'అది విని చతుర్ముఖుడు 'అది అంతా నీ స్వయంకృతాపరాధ ఫలితమే' ననగా శక్రుడు - భగవాన్ నేను చేసిన దోషమేమో సెల వియ్యండి' అనగా నచటనే యున్న కశ్యపుడు - 'అది భ్రూణహత్త్యా పాపం. దితి గర్భస్థ పిండాన్ని నీవు ముక్కలు గావించిన పాప ఫలం' అని మందలించగా నా పురందరుడు - ప్రభూ! ఆమె అశుచిగా ఉన్నందుననే గర్భనాశం సంభవించిందని బదులు చెప్పగా కశ్యపుడు అశౌచం వల్ల గర్భానికి దాసత్వం కలిగింది. అయితే నీ వా దాసుణ్ణి కూడా వజ్రంతో సంహరించావు 'గా అనగా ఖిన్నుడై బ్రహ్మతో యింద్రుడు యిలా మొరపెట్టాడు. ప్రభో! అపరాధం జరిగింది. ఆ పాపానికి పరిహారం ప్రాయశ్చిత్తం సెలవియ్యండి.' ఇంద్రుని ప్రార్థన విని బ్రహ్మ, కశ్యపుడు, వసిష్ఠుడు, యింద్రునకూ అతనితో బాటు జగత్తుకూ మేలు కలుగునట్లు హితం చెప్పారు. 'సహస్రాక్షా! శంఖ చక్ర గాధరుడూ పురుషోత్తముడు నగు మాధవుని శరణు వేడుకొనుము. ఆయన నీ శ్రేయస్సుకై తగిన ఉపాయం చెప్పగలడు!' గురు జనుల ఆ హితవచనం విని యింద్రుడు స్వల్పకాలంలో అధిక అభ్యుదయం సాధించుట ఎక్కడ వలను పడునో తెలుప మనగా నా మహర్షులు అది మర్త్యలోకంలోనే సాధ్యమని చెప్పారు. అలా బ్రహ్మ, కశ్యప, వశిష్ఠులు చెప్పిన సలహా వినిన తక్షణమే యింద్రుడు భూలోకానికి చేరుకున్నాడు. కాలింజర క్షేత్రానికి ఉత్తరాన పవిత్ర హిమవ త్పర్వతానకి దక్షణాన, కుశస్థలికి తూర్పున వసుపురానికి పశ్చిమాన గల ఆ పవిత్ర క్షేత్రంలో పూర్వరాజవరుడైన గయుడు సదక్షిణాకంగా నూరు అశ్వమేధ యజ్ఞాలు, నరమేధ యజ్ఞాలు నూరు వేయి, రాజసూయ యాగలు వేయిగావించాడు.

అంతే కాదు ఆ గయు డాప్రదేశాన దేవతలకు అసురులకు దుష్కరమైన మహామేధ మనే యజ్ఞం చేశాడు. ఆకాశ రూపి, ముర మర్దనుడు నైన అవ్యక్త రూపి విష్ణు వాప్రదేశాన గధాధరుడుగా వెలశాడు. ఆ ప్రదేశం భయంకరమైన పాప వృక్షాలను కూల్చే కుఠారంగా ప్రసిద్ధి గాంచింది. వేద శాస్త్ర వర్జితులైన ద్విజులు గూడ ఆ ప్రదేశాన్ని సేవించి బ్రహ్మతో సమాను లౌతారు. ఒక్క పర్యాయమైనా అక్కడ శ్రద్ధగా పిండదానంతో పితృ పూజ చేస్తే అది మానవులకు అక్షయమైన మహామేధ యజ్ఞ ఫలా న్నిస్తుంది. దేవ ఋషి కన్య అయిన మహానది, జలరూపంలో హిమగిరి వైపు ప్రవహిస్తూ ఆ ప్రదేశాన, తన దర్శన స్నాన జల ప్రాశనాదులచే జగత్తులోని పాపాలన్నింటినీ క్షాళనం చేస్తూంటుంది. ఆ ప్రదేశానికి వెళ్లి ఇంద్రుడు మహానది అద్భుత తీరాన గదాధరుని ఆరాధించుటకై ఆశ్రమ మేర్పరచుకుని నిలచి పోయాడు. ప్రతిదినం ఉదయాన్నే నదిలో స్నానం చేస నేల మీద శయనిస్తూ అయాచితంగా లభించిన దేదైనా ఉండే రోజు కొక పర్యాయం భుజిస్తూ ఆ సహస్రాక్షుడు, గదాధరుని ఆరాధనలో తపించాడు. ఇంద్రయాల నన్నింటిని అదుపులోనుంచుకొని, కామ క్రోధాలు విడచి అలా ఒక సంవత్సర కాలం తనస్సు చేయగా ఓ నారదా! గదాధర దేవుడు సంతోషించి వాసవునితో యలా అన్నాడు – ఇంద్రా! నేను ప్రీతుడ నైనాను. నీ పాపాలన్నీ యిప్పటికి తొలగి పోయాయి. వెళ్లుము. త్వరలోనే పోగొట్టుకొన్న రాజ్యాన్ని తిరిగ పొందగలవు. నీకు శ్రేయస్సు కలుగు నట్లుగా ప్రయత్నం చేస్తాను." ఇలా వర మిచ్చి గదాధరుడు వెళ్లిన తర్వాత ఇంద్రుడు ఆ మనోహరమైన నదిలో స్నానం చేసిన తర్వాత, ఆయన పాపాలతో పుట్టిన మానవులలో కొందరాయనను సమీపించి, మాకు హితోపదేశం చేయుమని అర్ధించారు. అలా వచ్చిన క్రూర కర్ములైన పుళిందు లనే ఆ కిరాతులను చూచి శక్రుడిలా అన్నాడు. 'మీరు నా పాపఫలంగాజన్మించారు. ఓ పుళిందులారా! ఈ హిమాద్రి కాళింజరాలనే ప్రముఖ పర్వతాల మధ్య దేశాన్ని నివాసంగా చేసుకుని జీవించండి! అలా పులిందుల నాదేశించి పాపముక్తుడైన ఆ వాసవుడు సుర సిద్ధ యక్షాదుల పూజ లందుకుని ధర్మభూమి అయిన తన తల్లి ఆశ్రమానికి వెళ్లాడు. తల్లి అయిన అదితిని చూచి శిరసాప్రణామం చేసి తామర పూలలో భాగానికి వలె మృదువుగా ఎర్రగా ఉన్న ఆమె పాదాలను కన్నుల కద్దుకుని తన తపస్సు విషయాన్ని నివేదించాడు. ఆమె అశ్రు పూరిత నయనాలతో కుమారుని కౌగలించుకుని శిరస్సు మూర్కాని తపస్సుకు కారణ మేమని ప్రశ్నించగా నా శక్రుడు బలి దైత్యునితో యుద్దంతో ఓడిపోయి రాజ్యం కోలుపోవడ మంతా వివరించాడు. దితి కుమారులచేత పరాభవించ బడిన తన సుతుని దుర్దశకు ఆ సాధ్వి దుఃఖంతో క్రుంగిపోయి అద్యంత రహితుడు, వరేణ్యుడు నైన ఆ విష్ణుని ఆశ్రయించి శరణు పొందింది.

ఓ మహర్షీ! ఆ దేవ మాత ఏ ప్రదేశంలో చరాచర సృష్టి కర్తా, పురాణ పురుషుడూ, అనంతుడు నైన ఆ హృషీకేశుని ఆరాధించినది చెప్పండి.

నారదా! తన పుత్రుడావిధంగా బలి చేతిలో ఓడిపోయి దీనుడై యుండుట చూచి ఆ అదితి మాఘ శుద్ధ సప్తమీ పవిత్ర దినాన తూర్పున ఉదయించిన త్రిదశాధిపతిని దర్శించి మౌనం పాటించి నిరాహారయై తపో దీక్ష వహించింది. ఆ జగచ్చక్షువును ప్రసన్నురాలై యిలా ప్రార్ధించింది.

'దివ్య కమలాల గర్భస్థ శోభను పరిహసించు సౌందర్య నిధీ! నీకు జయ మగు గాక! సంసార తరువును ఛేదించు కుఠారమా నీకు జయ మగుగాక! పాపాలనే కట్టెల ప్రోవును భస్మం గావించు అగ్నిదేవా! నీకు జయ మగుగాక! పాపసంఘాలను నిరోధించు ప్రభూ నీకు జయము జయము! దివ్య విగ్రహుడవగునో భాస్కరా! సూర్యమండలాంతర్వర్తి నారాయణా నీకు నమస్సులు! త్రిలోక ఐశ్వర్య నిధీ! నీకు ప్రణామం! ఈ చరాచర జగత్తుకంతకూ నీవే మూలం. సర్వేశ్వరుడవు. ఓ విశ్వమూర్తీ! నన్ను కాపాడుము. జగన్మయుడవూ, జగత్పతివీ అయిన నీవల్లనే యింద్రుడు సర్వస్వం కోలుపోయి శత్రువులచే పరాభవం పొందాడు. అందుచేత నేను నీ మరుగున చేరాను. నన్ను రక్షించుము. ఇలా స్తోత్రం చేసి ఆదేవమాత శ్రీమన్నారాయణుని ప్రతిమను రక్తచందనములతో నలంకరించి కరవీరమాలతో పూజించి ధూపదీపాదులచే నర్చించి ఆజ్యసంమిశ్రితమైన శాల్యన్నం నైవేద్యం చేసింది. ఇంద్రుని క్షేమానికై ప్రభువును స్తుతిస్తూ ఆ దేవజనని నిర్జలోపవాసం గావించింది. రెండవ రోజు విధి విహితంగా స్నాన పూజాదికాలు నిర్వర్తించి బ్రాహ్మణులకు స్వర్ణం తిలలు అమృతం దానం చేసి ప్రణామం గావించింది. అంతట సంప్రీతుడై ఘృతార్చి అయిన ఆ స్యూనారాయణుడు సూర్యమండలాన్నుంచి వెలువడి ఆ దక్షకుమారి ఎదుట నిలచి యిలా అన్నాడు – 'ఓ దాక్షాయణి! నీవు గావించిన వ్రతానికి సంతోషించాను. నా ప్రసాదం వల్ల నీ కోరికనెరవేరుతుంది. ఓ దేవజననీ! నీ పుత్రులకు వారల రాజ్యం ఇచ్చెదను. సందేహించవద్దు. నీ కడుపున పుట్టి దైత్యులను నిర్మూలిస్తాను" వాసుదేవుని మాటలకు గడ గడ వడకుచు నా అదితి, ఓ నారదా! ఆ జగన్మూర్తితో యిలా అన్నది. 'ప్రభో! స్థావర జంగమ సృష్టిని ఉదరంలో పెట్టుకొని దుర్ధరుడవుగా నుండే నిన్ను నే నెలా కుక్షిలో ధరించగలను? కాబట్టి ఓ జనార్దనా! నాకు కష్టం కలగని విధంగా ప్రయత్నించు.

నీ వన్నట్లు నేను దేవతలకూ అసురులకూ దుర్ధరుడనే అయినప్పటికీ నీ కడుపుననే పుడతానమ్మా! యోగబలంతో నన్నూ యిూలోకాలనూ పర్వతాలనూ కశ్యపునితో సహా నిన్నూ కూడా కలుపుకెని నీ కడుపులో నుండి జన్మిస్తాను. దిగులు పడవద్దు. నీకెలాటి కష్టమూ కలుగ నీయ నమ్మా! నేను నీ గర్భాన జనించుటతోనే రాక్షసలోకం అంతా నిర్జీవమై పోతుంది. సందేహింపకుము. అలా నా దేవమాఆ నూరడించి ఆ శత్రుమర్దను డామె గర్భంలోతన సమస్తతేజము యొక్క సూక్ష్మాంశంతో, ఇంద్రుని హితార్థమై ప్రవేశించాడు.

అధ్యాయము 50 Complete