వామన మహా పురాణము

Table of Contents

అధ్యాయము 20

నారదా! ఆ పర్వత శిఖరాన తపస్వినిగా ఉన్న కాత్యాయనిని చండుడు, ముండుడు అనే యిద్దరు రాక్షస వీరులు చూచారు. వెంటనే ఆ అసురులు పర్వతం దిగి తమ భవనానికి వెళ్లి రాక్షస రాజైన మహిషాసురునితో ఇలా అన్నారు –ప్రభూ! నీవిలా సుఖంగా చేతులు ముడుచుకొని కూర్చొని ఉండుటకు కారణమేమి? అలా వింధ్యకు వెళ్లి చూతము పద. ముల్లోకాల్లో సౌందర్యవతీ, మహామహిమాన్వితురాలై, సురకాంతల తలదన్నే ఒక కన్యారత్నం అక్కడ ఉన్నది. ఆమె కేశాలు మేఘాలను జయించాయి. చంద్రుని ఆమె ముఖం ధిక్కరిస్తుంది. మూడు నేత్రాలు త్రేతాగ్నులను వెక్కిరిస్తాయి. కంఠానికి శంఖం దాసోహమంటుంది. ఆమె గుండ్రని స్తనాలు ఏనుగు కుంభస్థలాలను జయించాయి. ముల్లోకాలను జయించిన నీ వృత్తాంతం విని మన్మధుడామె కుచాలను తనకు చక్కని దుర్గాలుగా చేసుకున్నాడు. పరిఘలులాగా కండలు దీరిన పద్దెనిమిది బాహువులలో వివిధ శస్త్రాస్త్రాలు ధరించి ఉంది. ణీ పరాక్రమాన్ని గ్రహించిన మన్మధుడు వాటిని వివిధ యంత్రాలుగా మలుచుకున్నాడనిపిస్తుంది. మూడువళులతో, రోమసమూహంతో అందమైన ఆమె నడుము చూస్తే భయంతో మన్మధుడు ఎక్కుటకేర్పరచుకున్న సోపానపంక్తిలా ఉంటుంది. ఆమె పీనకుచాల క్రింద ఉన్న చక్కని రోమ పంక్తి నీ ప్రతాపోద్ధతికి భయతురుడైన మన్మధుని వంటి నుండి జారిన చెమట బిందువుల్లాగా కనిపిస్తుంది. కుడివైపు ప్రదక్షిణంగా తిరిగి లోతైన నాభి, సౌందర్య గృహంమీద దానికి రాజైన మన్మధుడు వేసినముద్ర (తాళము) గా భాసిస్తుంది. వడ్డాణంతో పరివేష్టితమైన ఆమె జఘన (పిరుదు) ప్రదేశం చూస్తే మన్మధుడు ఎత్తైన ప్రహరీగోడతో నిర్మించుకున్న శత్రుదుర్భేద్యమైన దుర్గమా అనిపిస్తుంది. రోమరహితాలై, గుండ్రనివై , మృదువుగా ఉన్న ఊరువులు, మన్మథ నరేశ్వరుడు తన వారలకై ఏర్పరచుకొన్న నివేశన స్థలాముల్లాగా కనిపిస్తవి. మహిషేశ్వరా! కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న ఆమె అందమైన మోకాళ్లను చూస్తే బ్రహ్మ ఆమెను సృష్టించి అలసిపోయి, తన సృష్టి సౌందర్య సమగ్రతను నిరూపించుటకు తన రెండు అరచేతులను వానిపై పెట్టుకున్నట్లు తోస్తుంది. ఆ సుందరి వట్రువలై, రోమరహితాలైన జంఘలు (పిక్కలు) ప్రపంచంలోని సౌందర్య సృష్టినంతటినీ అధఃకరిస్తాయి. తామరపూల లోవలి మృదుత్వాన్ని తలతన్నే ఆమె పాదాలనైతే విధాత ఎంతో శ్రమపడి నిర్మించాడు. ఆమె అంగుళ్యాభరణాల సౌరు, నక్షత్రాల కాంతిని మరపిస్తుంది. ఇంతటి అందాల రాశి అయిన ఆ బాలిక ఓ ధనుజేశ్వరా! భయంకరమైన శస్త్రాస్త్రాలు ధరిస్తుంది! మేమెంతో దీక్షగా ఆమెను చూచాము. అయినప్పటికీ ఆమె ఎవరి కుమార్తెయో, ఎవరో, ఏమో తెలుసుకొనలేకపోయాము! దివి నుండి భువికి దిగిన అనర్ఘ రత్నం ఆ బాలిక! స్వయంగా నీవే వెళ్లి వింధ్య శిఖరాన ఆమెను చూడుము. అనంతరం నీకు తోచినట్టుగా చేతనైనది చేయుము.”

దేవి సౌందర్య ప్రవృత్తులను గురించి ఆ రాక్షసులు చెప్పినదంతయు విని మహిషాసురుడు “యిందులో యింకా ఆలోచించవలసినదేమి? ఏమీ లేదని” అనుకున్నాడు. నారదా! జీవుల శుభాశుభాలు ముందుగానే బ్రహ్మ ద్వారా నిర్ణయింపబడే ఉంటాయి. ఎప్పుడు ఎవడు ఎక్కడకు వెళ్ళాలో అక్కడకు స్వయంగానైనా వెళ్ళతాడు లేక తీసికొనిపోబడతాడు. అప్పుడా అసురేంద్రుడు చండ ముండ నమరబిడాల నేత్ర పిశంగ, బాష్కల ఉగ్రాయుధ చిక్షుర రక్తబీజాదులను ఆజ్ఞాపించుటతో ఆ యుద్ధోన్మాదులందరూ యుద్ధ భేరీలు మ్రోగించి స్వర్గం వదలి భూమి మీద వింధ్య పర్వతాన్ని చేరి ఆ గిరి మూలాన స్కంధా వారాలు నిర్మించుకున్నారు. అప్పుడా మహిషుడు, శత్రు సంహారకుడు, తన సేనాపతి, మయాసురుని కుమారుడు దుందుభి ఘోషం వంటి కంఠధ్వని కలిగిన దుందుభి అనే రాక్షసుని దేవి వద్దకు దూతగా పంపాడు. వాడు దేవికి సమీపంగా ఆకాశంలో నిలబడి యిలా అన్నాడు.

 “ఓ కుమారీ! ఆప్రతిమ వీరుడు రంభ దైత్యుని కుమారుడు అసురలోకాధిపతి అయిన మహిషాసురుని దూతను నేను.” ఆ మాట వింటూనే కాత్యాయని, రావయ్యా దైత్యేంద్రా! రా! నిర్భయంగా జంకు లేకుండా నీ యజమాని రంభ పుత్రుడు పంపిన సందేశం చెప్పుమనెను. దేవి మాటలు విని దుందుభి ఆకాశం నుంచి భూమికి దిగి దేవి కెదురుగా సుఖోపవిష్టుడై మహిషాసురుని సందేశాన్ని యిలా వినిపించాడు. “దేవి! మహిషదైత్యుడు నీకిలా ఆజ్ఞాపించాడు. “యుద్ధంలో నాతో ఓడిపోయి హీనబలులై అమరులు భూమి మీద తిరుగుతున్నారు. స్వర్గమర్త్య పాతాళాలు వాయుమండలం అక్కడి రాజులు, అంతా నాకు వశ్యులైనారు. నేనే యింద్రుణ్ని, రుద్రుణ్ని, సూర్యుణ్ని పరలోకాధిపతిని! ఓ బాలా! స్వర్గమర్త్య పాతాళాలలో ఎవ్వరు కూడా, దేవాసుర యక్షభూతగణాల్లో, యుద్ధంలో నన్నెదురుకొని జీవింపగలవారులేరు. స్వర్గమర్త్య పాతాళాలలో ఉన్న అనర్ఘరత్నాలన్నీ యీనాడు ణా ప్రతాపానికి లోబడి నన్ను చేరాయి. స్త్రీ జాతి కంతకూ ఓ విశాలనేత్రా! నీవు రత్నానివి. అలాంటి ణీ కోసం నేను ఈ వింధ్య మూలానికి వచ్చాను. జగత్పతినీ సర్వప్రభువునూ అయిన నన్ను కన్యా రత్నమువైన నీవు వరించి భజించుము.

మయ పుత్రుడు దుందుభి మాటలు విని కాత్యాయని వానితో నిట్లనెను. నిజమే! మీ ప్రభువు దానవేశ్వరుడు. దేవతలను యుద్ధంలో జయించిన మాట వాస్తవం. అయితే ఓ దైత్యపతీ! మా కులాచారం ప్రకారం ధర్మ శుల్కం అంటూ చెల్లించి కన్యను వివాహమాడవలసి యున్నది. మీ మహిషుడది చెల్లించునో వానిని తప్పక పెండ్లాడెదను. కాత్యాయనీ మాటలు విని దుందుభి “పద్మనేత్రీ !ఆశుల్కమేదో చెప్పుము. ణీ కొరకై మా ప్రభువు తన శిరస్సునైనా సంర్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైన వివాహ శుల్కం ఏదియు యుండజాల” దనెను. మయ పుత్రుని మాటలు విని కాత్యాయని పకాలున నవ్వి ఉచ్చైస్వరంతో చరాచర జీవులందరకు కళ్యాణము కలుగజేయు పలుకులు పలికెను.

 “ఓ రాక్షసా ! మా కుల కన్యను పెండ్లాడనెంచిన వాడు ముందుగా ఆ కన్యను యుద్ధంలో జయించాలి. ఇది అనూచానంగా మా పెద్దల ఆచారము.”

నారదా! శ్రీదేవి మాటలు విని దుందుభి యథా తథంగా తన స్వామి మహిషుని వద్దకు వెళ్లి చెప్పాడు. అంతట మహా తేజస్వి అయిన ఆ రాక్షసుడు తన సమస్త దైత్య సేనతో కాత్యాయనిని జయించుటకై బయలుదేరి వింధ్య పర్వత మూలమును జేరేను. సేనాధ్యక్షుడయిన చిక్షురుడు నమర దైత్యవీరుని సేనా ముఖాన నిలబెట్టెను. వాడు కూడా చతురంగ బలాలతో మరొకవైపు నుంచి దుర్గాదేవితో యుద్ధానికి తలపడెను. వాని యుద్ధాతికి వెరగుపడి బ్రహ్మ పురస్సరులైన దేవతలు దేవితో “అమ్మా! కవచం ధరించు తల్లీ!” యని విన్నవించిరి. అంతట నా దుర్గ దేవతలతో “కవచం నా కెందులకు? ఈ రాక్షస కీటకాలు నా యెదుట అసలు నిలబడగలవా?” అంటూ కవచం ధరించకుండానే విష్ణుపంజర స్తోత్రాన్ని స్మరించింది. ఆ స్తోత్ర ప్రభావంతో ఓ నారదా! ఆ తల్లి సర్వ దేవతలకు నవధ్యుడైన ఆ మహిషదైత్యుని నేల బెట్టి కాలరాచి సంహరించింది! ఆ విధంగా పురాసమయాన దుర్గాదేవికి విష్ణు పంజర కవచాన్ని పరమశివుడుపదేశించాడు. ఆమె దాని ప్రభావంతో సకల రాక్షస సంహారం గావించింది. విప్రోత్తమా! లోకంలోని సమస్త రాక్షాకవచాలన్నింటిలోనికి విష్ణు పంజరం సర్వోత్తమంగా కీర్తింపబడుతోంది. ఆ చక్రధారి విష్ణువును హృదయంలో ప్రతిష్టించుకున్న వానిని యుద్ధంలో ఎదుర్కొనగలవాడెవ్వడు?

అధ్యాయము 20 complete