వామన మహా పురాణము
అధ్యాయము 23
ఆ నరశ్రేష్టుడు తపతియందొక చక్రవర్తి లక్షణాలు గల కుమారుని కనినాడు. జాతకర్మాది విధులు జరిగి ఆ బాలకుడు ఆజ్యాహుతులతో ప్రజ్వలించు హతాశనునకు వలె ప్రవర్దమానుడైనాడు. వసిష్టుడా బాలునకు చూడాకర్మాది సంస్కారాలు జరిపించాడు. తొమ్మిదేండ్ల వయసున ఉపనయనం జరిగి వేదశాస్త్రాదులలో ప్రావీణ్యం సంపాదించాడు. పదేండ్ల వయసునకే సర్వజ్ఞత్వం గడించి ఆ పురుష శ్రేష్టుడు “కురు” అనే పేర ఖ్యాతిచెందాడు. రాజైన సవరణుడు ధర్మిష్టుడైన తన సుపుత్రునకు తగిన వధువు కొరకై ప్రయత్నాలు సాగించాడు. ఒక మంచి వంశానికి చెందిన సుధాముని కుమార్తె సౌదామిని యను రూపవతిని కుమారునకై నిశ్చయం చేసుకున్నాడు. సుధాముడు కూడ సంతోషంతో తన తనయను కురునకిచ్చి వివాహం జరిపించాడు. కురుకుమారుడా కుమార్తెతో కలిసి ధర్మార్థాలను విఘాతం లేని విధంగా పౌలోమితో యింద్రుడులా సకలభోగాలు అనుభవించాడు. తన కుమారుడు రాజ్యభారదక్షుదగుట గమనించిన సంవరణుడాతని యౌవరాజ్యపదవికి అభిషేకించాడు. అనంతరం రాజ్యాభిషేకాన్ని పొందిన ఆ కురురాజే తండ్రి అడుగుజాడలలో నడుచుకుంటూ ప్రజలనుకన్న తండ్రివలె పాలించసాగెను. ఆ మహాబలుడు తానే క్షేత్రపాలకుడుగా పశుపాలకుడుగా సర్వపాలకుడుగా మహాసమర్థతతో ప్రజాపాలనం సాగించాడు. అతడు కీర్తిని మించినదేదీలేదని గ్రహించాడు. కీర్తి పృథివి మీద నిలచినంతకాలం స్వర్గంలో దేవతలతో బాటు నిలువవీలగును. కీర్తికిగల శక్తిని గుర్తించిన ఆ రాజశ్రేష్టుడు దానిని సంపాదించుటకై ప్రపంచమంతటా పర్యటనం గావించాడు. అంతట నా పృథ్వీపతి ద్వైత వనమను పుణ్యదేశానికి చేరుకొని సంతోషంతో అందు ప్రవేశించెను. అట బ్రహ్మపుత్రిక పాపనాశిని పుణ్యరూపిణి, హరిజిహ్వ, ప్లక్ష్మజ అయిన సరస్వతిని చూచెను. ఆమెసుదర్శనుని తల్లి. ఆ భగవతి కోటి తీర్థాలతో పరివేష్ణింపబడి చక్కని సరోవరంగా విరాజిల్లుతోంది. ఆమె పవిత్ర జలాల్లో ఆ రాజు సంతోషంతో స్నానం చేసి ఉత్తరాన ఉన్న బ్రహ్మవేది వద్దకు వెళ్ళాడు. అది ఉత్తమమైన ధర్మభూమి. పేరు సమంత పంచకం. ఎటు చూచినా ఐదు యోజనాల విస్తీర్ణం కలిగి ఉంది.
ఓ పురుషోత్తమా! ఉత్తరాన ఉన్న సర్వపంచకవేది అంటున్నారు. ఇంతకూ బ్రహ్మవేదీలు ఎన్ని ఉన్నయేమిటి?
లోకనాథుని వేదికలు ఈ లోకంలో అయిదున్నాయి. అవి ధర్మసేతువులు. ఆ ప్రదేశాల్లో లోకేశ్వరుడు శివుడు యజ్ఞాలు చేశాడు. వానిలో మధ్యవేది ప్రయాగ, తూర్పువేది గయా, దక్షిణాన అనంత ఫలం యిచ్చే విరజవేది ఉంది. పశ్చిమాన మూడుకుండాలతో కూడిన పుష్కరవేది. కాగా ఉత్తరాన ఉన్న దానిని అక్షయమైన సమంతపంచకవేది అంటారు. అంతట నా రాజర్షి ఈ క్షేత్రం మహాఫలదాయకం. కాబట్టి యిక్కడ కృషిచేసి అన్ని కామ్యాలను పండించుకుంటానని నిశ్చయించుకొని తన రాథాన్నుంచి క్రిందకు దిగాడు. ఆ క్షేత్రాన్ని తనకీర్తి సాధనకు నిలయం గావించుకొన్నాడు. ఆ రాజశ్రేష్టుడు. ఒక బంగారు నాగలికి రుద్రుని ఎద్దును యముని పౌండ్రకమనే మహిషాన్ని కట్టి స్వయంగా దున్నడం మొదలు పెట్టాడు. అలా సేద్యం చేస్తున్న రాజును సమీపించి యింద్రుడు ఏమిటీ ఈ వ్యవహారమంతా అని అడిగాడు. అందుకు రాజు తపస్సు, సత్యం, క్షమా, దయ, శౌచం, దానం, యోగం, బ్రహ్మచర్యం వీటిని సేద్యం చేస్తున్నానని బదులు చెప్పాడు. అప్పుడు యింద్రుడతనితో ఆ అష్టాంగ ధర్మబీజం నీకిచ్చిన వారెవ్వరని చిరునవ్వు నవ్వి అచటనుండి వెడలిపోయెను. ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత గూడ నారాజు నాగలితో సేద్యం సాగిస్తూ ప్రతిదినము ఆ చుట్టుపట్ల ఏడు క్రోశాల మేర భూమిని దున్నివైచెను. అంతట నేను కురురాజు వద్దకు వెళ్లి ఏమి చేయుచున్నావని యడుగగా నా మహీపతి అష్టాంగ మహాధర్మాన్ని నాకు వివరంగా చెప్పాడు. దానికి నేనా బీజం ఎక్కడ ఉన్నదని అడుగగా తన దేహంలో ఉన్నదని అతడు సమాధానమిడెను. అంతట నేను దానిని భూమిలోనాటెదనంటిని. అంతట నా రాజు తన కుడిచేతిని చాచగా నేను వెంటనే చక్రంతో దానిని వేయి ముక్కలుగా ఖండించితిని. అంతట నారాజు చాచిన ఎడమచేతిని గూడ నదేవిధంగా ముక్కలు గావించితిని. అనంతరం రాజు తన రెండు ఊరు (తొడ)లను చూపగా వానిని ఖండించితిని. చివరికాతడు తన శిరస్సును అర్పించగా నేను మిగుల సంతోషించి వరమిచ్చెద కోరుకొమ్మనగా కురురాజిట్లనెను.
నేను సేద్యం చేసిన (దున్నిన) ఈ నేల అంతా ధర్మ క్షేత్రం కావాలి. ఇక్కడ స్నానం చేసినా చనిపోయినా సరే అందరూ మహా పుణ్యఫలం పొందాలి. ప్రభూ మాధవా! హృషీకేశా! చక్రధరా! ఈ చోట గావింపబడిన ఉపవాస దాన స్నాన జపహోమయజ్ఞాది శుభాశుభ కర్మలన్నియు నీ అనుగ్రహం వల్ల అక్షయ ఫలదాయకాలు కావాలి. అంతే కాదు. నా పేర వ్యవహరింపబడునట్టి ఈ ప్రదేశాన సమస్త దేవతలు, త్రిశూలధారియగు శంకరునితో కూడి ఓ పుండరీకాక్షా! నీవు సదా నివసించుము. అంతట నేనా రాజుతో – రాజా! అట్లే అగుకాక! నీవు మరల దివ్యదేహం ధరించుము. అంత్యకాలాన వేలాది యాజ్ఞికులు క్రతువులొనరింతురు. అని చెప్పితిని. ఆ క్షేత్రాన్ని రక్షించుటకై శ్రీమన్నారాయణుడు చంద్రుడను యక్షుని, వాసుకి పన్నగుని, శంకుకర్ణుడను విద్యాధరుని, సుకేశియను రాక్షసేశ్వరుని అజావనుడను నరపతిని పావకమహాదేవుని నియమించెను. అప్పటినుండియు వారలు వారి శక్తి శాలురైన భృత్యులు అనుచరులు కలసి ఈ కురుజాంగల భూమిని కంటికి రెప్పవలె కాపాడుచున్నారు. పాపులు దుర్మార్గులు ఈ క్షేత్రాన్ని సమీపించకుండా ఎనిమిదివేల మంది ధనుర్ధరులు కాపాడుతున్నారు. అట్టివారిని యిచట స్నానం చేయకుండా నిరోధించుచున్నారు. ఆ కురుజాంగల క్షేత్రం మధ్యగా పైన చెప్పిన పాపహారి, పవిత్రమూ మంగళకరమూ నైన పృథూదక తీర్థం ఉంది. అక్కడ స్వచ్చజలాలతో నిండిన ఒక పవిత్ర నది తూర్పు ముఖంగా పారుతుంటుంది. ప్రాచీనకాలంలో బ్రహ్మ భూతజాలంతో కూడిన ఈ సృష్టినంతటినీ గావించాడు. అనాది కాలం నుంచి భూమి నీరు తేజస్సు వాయు ఆకాశాలతో బాటు ఈ పృథూదక క్షేత్రం గూడ విరాజిల్లుతోంది. అంతేకాక ఆ మహాభుజుని(విష్ణువు) సంకల్పంవల్ల సమస్త మహార్ణవాలు, తీర్థాలు, నదులు, తటాకసరోవరాలన్నీ తమతమ జలాలతో యీ ప్రదేశాన సమీకరింపబడి ఐక్య భావాన్ని భజిస్తున్నాయి.
అధ్యాయము 23 complete
