వామన మహా పురాణము

Table of Contents

అధ్యాయము 8

శార్జ్ఞ ధనువును దరించి తనవైపు వచ్చుచున్న నారాయణుని చూచి, దానవేశ్వరుడు, తన గదను గిరగిర త్రిప్పి అసాద్యుని నెత్తిపై బలముగా మోదెను. నారదా ! అట్లు గదచే ప్రహరించబడిన ఆ ధర్మపుత్రుని నేత్రాల నుండి అగ్నివృష్టివలె జలధారలు భూమిపై రాలెను. నారాయణుని నెత్తిమీదపడిన పిడుగునకు వలె నూరు వ్రక్కలుగా పగిలిపోయెను. అంతట వెనుదిరిగి, ఆ దానవ వీరుడు త్వరగా తన రథముపై నెక్కి కార్ముకము చేతగొని అమ్ముల పొదినుండి బాణమును తీసికొనెను. క్రోధంతో నల్లబడిన మోముగల ఆ దానవేశ్వరుడు, గృద్రపత్రాలతో నలంకరింపబడిన బాణాలను వింట సంధించి ఆ సాధ్యునిపై గుప్పించెను.

ఇలాతనపైకి వచ్చుచున్న అర్ద చంద్రబాణాలను తన శరపరంపరతో మధ్య మార్గాన్నే ఖండించి నారాయణుడా దానవుని నిశితమార్గణాలతో గాయపరచెను. ఆ విధంగా ఆ వీరులిరువురు ఒకరినొకరు తీవ్రములగు బాణములతో ఖేదించుకొనిరి. సాధ్య దైత్యుల అభీకర సంగ్రామాన్ని తిలకించిన దేవతలు గగనతలాన నిలబడి దుందుభులు మ్రోగించుచూ ఆ వీరులపై పుష్పవృష్టి కురిపించిరి. ఆ విధంగా అకాశాన్నుంచి తిలకించుచుచున్న దేవతలకు ప్రీతివర్దకంగా ఆ వీరులు అద్భుతసంగ్రామం గావించిరి. వారి బాణాసనాలనుంచి వెడలిన, అసంఖ్యాక శరాలతో భూమ్యాకాశాలు అష్టదిక్కులు కప్పబడినాయి. బ్రహ్మర్షే ! అంతట నారాయణుడు తన ధనుస్సును బాగుగా వంచి అతి తీవ్రమైన బాణముతో ప్రహ్లాదుని మర్మ స్థానమున గొట్టెను. అలా సర్వమర్మ స్తానములండు ప్రహరింపబడిన ప్రహ్లాదుడు ప్రచండమైనకోపంతో, నారాయణుని వక్షస్తలమును బాహువులను ముఖమును బాణాలతో నింపివైచెను.

అంతట నారాయణుడొక అర్ద చంద్ర బాణంతో దైత్యేశ్వరుని చేతిలోని వింటిని ఖండించివైచెను. అంతట దైత్యుడు వేరొక ధనుస్సు గైకొని అతిలాఘవంతో నారాయణునిపై బాణవృష్టి గురియించెను. సాధ్యుడగు నారాయణుడా బాణములను ఖండించి ఒక తీవ్రమైన శరంతో శత్రువు వింటిని రెండు తునుకలు గావించెను. వెంటనే దైత్యుడు వేరొక ధనుస్సు గైకొనినంతనే దానిని గూడ నా పురుషోత్తముడు రెప్పపాటులో త్రుంచివైచెను. ఈ విధంగా రాక్షస రాజు బాణాసనాలనెన్నింటినో ఖండించివైచెను. తన కార్ముకాలన్నీ యీ విధంగా ఖండింపబడుట చూచి క్రోదతాంరాక్షుడై దైత్యపతి, అతి భయంకరం సుదీర్ఘం సర్వలోహమయమైన పరిఘ (గుదియ)ను గైకొనెను, ఆ ప్రచండమైన పరిఘనాతడు భయంకరంగా త్రిప్పుతుండగా దానిని నారాయణుడొక బాణముతో ముక్కలుగావించెను. పరిఘతునుకలుకాగా శ్రీమంతుడైన ప్రహ్లాడుదొక ముద్గరమును చేకొని అతివేగంగా త్రిప్పి నారాయణునిపై విసరెను. మహామునీ ! ఆ వచ్చుచున్న ముద్గరాన్ని నారాయణుడు పది బాణములతో శతదాబిన్నము గావించెను. ముద్గరం వ్యర్థంకాగా దైత్యుడు ప్రాసమును ప్రయోగింపగా దానిని కూడ దర్మపుత్రుడు ఖండించివైచెను. అంతట దైత్యపతి శక్తిని ప్రయోగించగా నద్దానినిగూడ తీవ్రబాణాలతో ఆ తపస్వి వారించెను.

నారదా! అస్త్రాలట్లు వ్యర్థంకాగా నాదానవుడు వేరొక మహా ధనుస్సును గైకొని నలువైపులా బాణముల గురిపించెను. అంతట జగద్గురువగు నారాయణుడొక బాణమున తానా దైత్యుని వక్షమును భేదించెను. బ్రహ్మర్షే! అద్భుత కర్ముడగు నాతపోదనునిచే వక్షము విదీర్ణము కాగా నాదైత్యుడు రథముపై నొరగిపోయెను, వెంటనే సారథి అతనిని అచ్చట నుండి దూరముగా గొనిపోయెను. అచిరకాలంలోనే మూర్చనుండి తేరుకొని దానవపతి వేరొక ద్రుడచాపాన్ని తీసికొని మరల యుద్దమునకు దలపడెను. అంతట నరాగ్రజుడతని జూచి – ఓ దైత్యేంద్రా! రేపు ప్రాతఃకాలమున మరల యుద్దము చేయుదము. ఇంతట వెళ్లి నిత్యాహ్నికములు నేరవేర్చుకొమ్మనెను. నారాయణుని మాటలు విని దైత్యనాధుడు నైమిషారణ్యమునకు వెళ్లి అహ్నికకృత్యములు నేరవేర్చుకొనెను.

మునీ! నారాయణుడు గావించు సంగ్రామమును చూచి ప్రహ్లాదుడా రాత్రి – “ఈ కపట మునిని నిర్జించుటేట్లాయని ఆలోచనలో బడెను. నారదా! వారిర్వురావిధంగా వేయి దివ్యవత్సరములు పోరాడిరి. అయితే దైత్య రాజా తపస్వినిజయింపజాలడయ్యెను. దానితో విసిగిపోయి ప్రహ్లాదుడు పీతావాసుడగు విష్ణుదేవుని సమీపించి యిట్లనెను. యిందులకు కారణమేమి?”

ప్రహ్లాదా మహాబాహువగు నీ ధర్మపుత్రుని నీవు జయింపజాలవు. దీమంతుడగు నీసాద్యవిప్రోత్తముని దేవతలు రాక్షసులు సైతము నిర్జింప లేరు సుమా !

 

 “ప్రభూ! అతడజేయుడగుచో నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేరుటెట్లు? నావంటివాడు హీనప్రతిజ్ఞుడై ఎట్లు జీవింపగలడు? కాబట్టి ఓ విష్ణూ! నీ ఎదుటనే ఈ శరీర శోదనము కావించుకొందును.”

విష్ణునితో నిట్లుపలికి ప్రహ్లాదుడు శిరస్నానము గావించి ఆసీనుడై బ్రహ్మనుసందానమున కుపక్రమించెను. అంతట నతనితో విష్ణుడిట్లనెను. “నీ వాయనను భక్తి ప్రపత్తులతోనే జయింపగలవు. యుద్దమున నెన్నటికీ జయింపజాలవు. పొమ్ము!”

ఓ దేవదేవ! నీ దయవల్ల నేను ముల్లోకాలనూ జయించాను. యింద్రుని సైతం గెలిచాను. ఈ యిర్వురు మూడులోకాలకూ అజేయులగుచో, ఓ అభవా! నేనెట్లు జీవింతును? నాకు దారి ఏది?

ఓ దానవేశ్వరా! లోకకల్యాణ కాంక్షతో ధర్మ ప్రవర్థనార్తమై నేనే కఠోర తపశ్చర్యకు పూనుకొంటిని. కాబట్టి నీవు జయింపగోరుచో వారలనారాదింపుము. వారిని భక్తితో జయింపుము. వెళ్లి దర్మసుతునకు శుశ్రూషగావింపుము.

“ఓ మునీ! శ్రీ విష్ణుడిట్లు చెప్పగా దానవేంద్రుడు సంతోషించిన వాడై అంధకుని బిలిచి యిట్లనెను.”

 “మహా బలశాలివైన అంధకా ! దైత్యదానవులను నేటి నుండియు నీవు పరిపాలించుము. నేనీ రాజ్యము పరిత్యజిస్తున్నాను. దీనిని నీవు గైకొనుము. “ హిరణ్యాక్ష పుత్రుడైన అందకుడు ప్రహ్లాదుని కోరిక ప్రకారము రాజ్యము తీసికొనగా ప్రహ్లాదుడచ్చట నుండి పవిత్రమైన బదరికా వనమునకు బోయెను.

అచట నారా నారాయణులను చూచి చేతులు జోడించి నమస్కరించెను.అతనిని చూచి మహా తేజస్వి అయిన నారాయణు డిట్లనెను. “అసురోత్తమా ! ఇదేమి, మమ్ము జయింపక ఈ నమస్కరించుటేల?’

 “ప్రభో! మిమ్ము జయింప గల వారెవ్వరు? మీ కంటే అధికులెవ్వరు? నీవు సాక్షాత్తు నారాయణుడవు, అనంతుడవు, పీతాంబరుడ వగు జనార్ధనుడవు. దేవా! నీవే పుండరీకాక్షుడవు! శార్ఙ్గపాణి యగు విష్ణుడవు! అవ్యయుడవు మహేశానుడవు. పురుషోత్తముడవు శాశ్వతుడవు. యోగులు నిన్నే ధ్యానింతురు, మనీషులు నిన్నర్చింతురు. స్నాతకులు నీ నామాన్ని జపిస్తారు. యాజ్ఞికులు యజ్ఞేశ్వరునిగా యజిస్తారు. నిన్ను హృషీకేశుడనీ చక్రధరుడనీ, ధరాధరుడనీ, మత్స్యమూర్తివనీ, హయగ్రీవుడవనీ, కూర్మమూర్తివనీ కీర్తిస్తారు. హిరణ్యాక్షుని సంహరించిన భగవంతుడవగు శ్రీ వరాహమూర్తివి నీవే! నా తండ్రిని వధించిన నృకేసరివి గూడ నీవే స్వామీ! హే గరుడధ్వజా! విభో! బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు వరుణుడు, వాయువు, సూర్యచంద్రులు, జంగామస్థావరాత్మకమైన ఈ సర్వము నీవే. హే! లక్ష్మీపతీ! భూమి జ్యోతి రాకాశ జల రూపాన వేవేల మూర్తులతో జగత్తునంతటా వ్యాపించియున్న నిన్నెవడు జయింపగలడు? జగద్గురో! సర్వగతుడవు అవ్యయుడవునగు నిన్ను భక్తి చేతనే జయింపనగును. మరే విధంగానైననూ నిన్ను జయింప లేరు!

సుపుత్రదవాగు దైత్యపతీ! నీ స్తోత్రమునకు సంతోషించితిని. అనన్యమైన నీ భక్తి చేతనేనోడింపబడితిని. ఓడిపోయిన వారు పరిహారం చెల్లించుకోవలెను. పరిహారరూపాన నీకొక వరం ప్రసాదిస్తున్నాను. కోరుము.

వరదేశ్వరా! ప్రభో! నిన్ను శత్రువుగా నెంచి నేను (యుద్ధము చేసి) చేసిన మానసిక, వాచిక శారీరక పాపములన్నింటిని నశింపజేయుము. మహాత్ముడగు నరుని యెడ గావించిన అపరాధము క్షమింపుము, జగత్ప్రభో!

దైత్యేంద్రా! అట్లే అగు గాక, నీ పాప సంక్షయమగు గాక. యింకొక వరం కోరుకొనుము.

విష్ణో! నా బుద్ధులన్నియు నేల్లవేళలందునూ నిన్నాశ్రయించుకొని యుండు గాక. నీ పూజ అర్చన ఉపాసనలందే లగ్నమై యుండుగాక.

తథాస్తు. మహావీరా ! మరొక వరము కోరుకొనుము. కాదనక నిచ్చెద.

అధోక్షజా! ప్రభూ! నీ దయతో నా కన్నియు లభించినవి. ఎల్లప్పుడు నీ పాదముల భక్తి నాకనుగ్రహింపుము.

అట్లే యగు గాక. నా ప్రసాదం వల్ల నీవు అజరామరుడవై చిరకాలం వర్ధిల్లగలవు. రాక్షస శార్దూలా! వెంటనే నిజావాసమునకు వెళ్లి కర్మరతుడవుకమ్ము. మత్పరాయనుడవైన నిన్ను కర్మబందములంటవు. శాశ్వతంగా దైత్యరాజ్యానికధిపతివై స్వకులోచితమైన ధర్మాచరణము గావింపుము.

జగన్నాధుని మాటలు విని ప్రహ్లాడిట్లనెను. “ప్రభో! ఒక పర్యాయము వదలిన రాజ్యాన్ని మరలనెట్లు గ్రహించగలను? ధర్మమూర్తీ!” అందులకు భగవంతుడు “అట్ల్గుచొ రాక్షస జాతికంతకు హితోపదేశకుడవుగా నుండి దైత్య దానవులను కాపాడుము” అనెను. నారాయణునిచే ననుజ్ఙాతుడై ఆ దైత్యేశ్వరుడు స్వామికి మ్రొక్కి సంతోషముతో నిజ మందిరమున కరిగెను. తిరిగి వచ్చిన ప్రహ్లాదుని దైత్య దానవులు అంధకుడు సంభావించి రాజ్యమును మరల స్వీకరించమనిరి. కాని ఆ మహా జ్ఞాని అందులంగీకరింపడయ్యెను. నారదా! గడ్డిపోచ వలె సకల దానవ రాజ్యాన్నీ పరిత్యజించి అంధకుని సన్మార్గమున నడపుచు రాక్షసులకు మార్గదర్శియై, ఆ మహనీయుడు, నిరంతరము అప్రమేయుడగు శ్రీహరిని ఆరాధించుచు మహాయోగియై వర్ధిల్లెను. నారదా! ఈ విధంగా పురాసమయాన దానవేంద్రుడగు ప్రహ్లాదుడు పురుషోత్తముడగు నారాయణునిచే పరాజితుడయయు, రాజ్యత్యాగం కావించి తన చిత్తవృత్తులన్నియు నా భగవంతునిపై నుంచి ధన్యుడాయెను.

అధ్యాయము 8 complete