వామన మహా పురాణము
అధ్యాయము 13
మహర్షులారా ! పుష్కర ద్వీపములోని ఘోరపరిస్తితులు మీరు వర్ణించారు. ఇక జంబూ ద్వీపస్థితి గతులు చెప్పండి.
రాక్షసపతీ! ఇక నవ విభాగాత్మకమై సువిశాలమై స్వర్గ మోక్షాలను ప్రదానం చేయగల జంబూద్వీప వృత్తాంతం వినుము. అది మధ్యలో ఇలావృత వర్షం, తూర్పున అద్భుతమైన భద్రాశ్వ వర్షం ఈశాన్యాన హిరణ్యవర్షం, ఆగ్నేయాన కింనర వర్షం, దక్షిణాన భారత వర్షం, నైరుతి భాగాన హరివర్షం, పశ్చిమాన కేతుమాల వర్షం, వాయవ్యాన రమ్యక వర్షం, ఉత్తరాన కురువర్షంగా తొమ్మిది వర్షాలలో విభక్త మైనది. ఈ తొమ్మిది భూభాగాలు పవిత్రమైనవి రమణీయమైనవీను. వీనిలో కురువర్షం కల్పవృక్షాలతో నిండి ఉంటుంది. భారతవర్షం మినహాయిస్తే యిలావృతాదులు ఎనిమిది వర్షాల్లో యుగ విభాజనం గాని జరామరణ భయంగాని ఉండవు. అక్కడి వారలకు ఆ ప్రయత్నంగానే సుఖంగా సిద్ది లభిస్తుంది. అది సహజ సిద్ధం. వారిలో ఉత్తమధామార్వాది వివక్షగాని ఎలాంటి విపర్యయాలు గాని ఉండవు. ఇక భారత వర్షమో తొమ్మిదవది. ఇవన్నీ సముద్రాలచే వేరుచేయబడి పరస్పరం ఆగమ్యాలుగా ఉన్నాయి.
ఇక భారత వర్షం-యింద్ర ద్వీపం, కసేరుమాన్, తామ్రవర్ణం, గభస్తిమాన్ నాగద్వీపం, కటాహం, సింహళం, వారుణం, కుమారం అనే తొమ్మిది ద్వీపాలుగా విభక్తమైంది. దానిలో యిది దక్షిణోత్తర దిశలో సముద్రం చేత చుట్టబడియున్న కుమార ద్వీపం. ఓ వీరుడా! దీనికి తూర్పున కిరాతులు, పడమట యవనులు. దక్షిణాన ఆంధ్రులు ఉత్తర సీమన తురుష్కులు ఉన్నారు, అక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తదితర జాతులవారు యజ్ఞాలు, యుద్ధాలు, వాణిజ్యం, గోపాలనం మొదలయిన విద్యుక్త ధర్మాలను నిర్వహిస్తూ పవిత్రులైనారు. వారల పరస్పర ఆచరణలు, స్వర్గమోక్ష సంపాదనము, పుణ్య పాపాలు, కర్మాచరణాన్ననుసరించి నిర్ణయింపబడుతవి. అక్కడ మహేంద్ర, మలయ, సహ్య, శుక్తిమాన్, ఋక్ష, వింధ్య పారియాత్రములనే సప్తకుల పర్వతాలున్నవి. ఈ ప్రధాన గిరులు కాక వందలు వేల సంఖ్యలో విస్తార వైశాల్యాలు గలిగి రమణీయాలయిన యితర పర్వతాలు కూడ ఉన్నవి. కోలాహలం వైబ్రాజం, మందరం, దుర్దురం వాతంధమం వైద్యుతం, మైనాకం సరసం, తుంగప్రస్థం, నాగగిరి, గోవర్ధనాచలం, ఉజ్జాయనం, పుష్పగిరి, ఆర్భుదం, రైవతం, ఋష్యమూకం, గోమంతం, చిత్రకూటం, కృతస్మరం, శ్రీపర్వతం, కొంకణం వానిలో కొన్ని. ఈ పర్వత ప్రదేశాలతో కలిసి మ్లేచ్చ ఆర్యజనపదాలెన్నో వెలిశాయి. వీనికి జల ప్రదానం గావించే శ్రేష్ఠ నదులను గురించి చెబుతున్నాము. జాగ్రత్తగా వినుము. సరస్వతి, పంచరూప, కాళింది, హిరణ్వతి, శతద్రు, చంద్రిక, నీల, వితస్త, ఐరావతి, కుహూ, మధురా, హారరావీ, ఉశీర, ధాతుకి, రసా, గోమతి, దూతపాపా, బాహుద, దృషద్వతి, నిశ్చిరా, గండకి, చిత్ర, కౌశికీ, వదూసరా, సరయూ, లౌహిత్య ఈ నదులు హిమవత్పాద భూమినుంచి ఉద్గమిస్తాయి.
వేదస్మ్రుతి, వేదసినీ, వృత్రఘ్ని, మహీ, పారా, చర్మణ్వతి, లూపి, విదిశా, వేణుమతి, సిప్ర, అవంతీ అనే నదులు పారియాత్రగిరి నాశ్రయించియున్నవి. శోణా,మహానది, నర్మద, సురస, కృపా, మందాకిని, దశార్ణ, చిత్రకూటా, అపబాహిక, చిత్రోత్పల, తమసా, కరమోద, పిశాచిక, పిప్పలశ్రోణి, విపాశ, వంజులావతి, సత్సంతజ, శుక్తిమతి, మంజిష్టా, కృత్తిమా, వస, తదితర నదులు ఋక్షగిరి నుంచి ప్రభవించినవి. శివ, పయోష్టి, నిర్వింధ్య, తాపి, నిషదావతి, వేణా వైతరణీ, సినీబాహు, కుముద్వతి, తోయా, మహాగౌరీ, దుర్గందా, వాశిలా, యీ పవిత్ర నదులు వింధ్య పాద మూలాన ప్రభవించినవి. గోదావరి, భీమరథీ, కృష్ణా, వేణా, సరస్వతి, తుంగభద్ర, సుప్రయోగా, వాహ్య, కావేరి, దుగ్దోద, నళినీ, రేవా, వారిసేన, కలస్వనా, ఈ మహాతరంగిణులు సహ్యాద్రి కుమారికలు, కృతమాల, తామ్రపర్ణి, వంజుల, ఉత్సలాపతి, సినీ, సుదామ, యివి శుక్తిమత్పర్విత పుత్రికలు, ఈ నదులన్నీ పరమ పవిత్రాలు, సాగర పత్నులు, రాక్షసవరా! యింకా ఎన్నో వేలాది క్షుద్ర నదులున్నవి. కొన్ని అన్ని ఋతువుల్లో ప్రవహించేవి కాగా యితరాలు వర్షాకాలంలోనే కనిపిస్తాయి. ఇవన్నీ తమకందుబాటు గల ప్రదేశాలకు పుష్కలంగా జలప్రదానం చేస్తాయి.
మత్స్య, కుశట్ట, కుణి, కుండల, పాంచాల, కాళీ, కోసల, వృక, శబర, కౌవీర, సభూలింగ, శక, సమశక, జనపదాలు మధ్యదేశం లోనివి. వాహీక, వాటదాన, అభీర, కాలతోయక, అపరాంత, శూద్ర, పహ్లవ, ఖేటక, గాంధార, యవన, సింధు, సౌవీర, మద్రక, శతద్రవ, లలిత్థ్హ , పారావత, మూషక, మాకర, ఉదాకదార, కైకేయ, దశమజన పదస్థులు క్షత్రియ వైశ్య శూద్ర కులాలవారు వైశ్యుల స్థానంలోను, కాంబోజ, దరద, బర్బర, అంగలౌకిక, చీన, తుషార తదితరులు, జనపదాలకు వెలుపలను ఉందురు. ప్రస్థలులు, ఆత్రేయులు, భరద్వాజులు, దశేరకులు, లంపకులు, తాపకులు, రాములు, శూలికులు, తంగణులు, ఔరసులు, ఆలిమద్ర, కిరాత జాతులవారు, తామసులు, క్రమమాసలు, సుపార్శ్వులు, పుండ్రకులు, కులూతులు, కుహుకులు, ఊర్ణులు, తూణిపాదులు, కుక్కుటులు, మాండవ్యులు, మాలవీయులు వీరంతా ఉత్తరాపథవాసులు.
అంగ, వంగ, ముద్గరవ, అంతర్గిరి, బహిర్గిరి, ప్రవంగ, వాంగేయ, మాంసాద, బలదంతిక, బ్రహ్మోత్తర ప్రావిజయ, కేశబర్బర, ప్రాగ్జ్యోతిష, శూద్ర, విదేహ, తామ్రలిప్తక, మాల, మాగధ, గోనందులు తూర్పు జానపదాలు. రాక్షసేశ్వరా! పుండ్ర, కేరళ, చౌడ, కుల్య, జాతుష, మూషికాద, కుమారాద, మహాశక, మహారాష్ట్ర మాహిషక, కళింగ, అభీర, నైషీక, అరణ్య, శబర,బలిందయ, వింధ్య, మౌళేయ, వైదర్భ, దండక, పౌరిక, సౌశిక, అశ్మక, భోగవర్ధన, నైషిక, కుందల, ఆంధ్ర, ఉద్భిద, నలకారక, జానపదాలు దక్షిణ దిశన గలవు. సూర్పారక, కారివన, దుర్గ, తాళీకట, పుళీయ, ససినీల, తాపస, తామస, కారస్కర, రమిన, నాసిక్యాంతర, నర్మదా, భారకచ్చ, మాహేయ, సారస్వత, వాత్సేయ, సౌరాష్ట్ర, అవంత్య, అర్బుద –యివి పశ్చిమాన గల జానపదాలు. అక్కడి జనులు కారుష, ఏకలవ్య, మేకల, ఉత్కల,ఉత్తమర్ణ, దశార్ణ, భోజ, కిమ్కవర, తొసల, కోసల, త్రైపుర, చైల్లిక(ఇల్లిక?), తురుస, తుంబుర, వహన, నైషధ, అనూప, తుండికేర, వీతిహోత్ర, అవంతి, ఓ సుకేశీ! ఈ జానపదాలు వింధ్యాద్రిపాద మూలాన ఉన్నవి. ఇక పర్వత ప్రదేశాలలోని జానపదాలు యివి, నిరాహార, హంసమార్గ, ఊర్ణ, పుణ్య, కుపథ, తంగణ, ఖశ, కుథప్రావరణ, హుహుక, త్రిగర్త, కిరాత,తోమర, హిమవన్నగ ప్రదేశాలు. రజనీచరవతా! కుమార ద్వీపంలోని జనపదాలను గురించి విపులంగా చెప్పితిమి. ఇక ఈ ప్రదేశాలలో ఆచరించబడే ధర్మాచారాలను వివరించెదము వినుము.
అధ్యాయము 13 complete
