వామన మహా పురాణము
అధ్యాయము 1
నారాయణునకు ఉత్తముడగు నరునకు సరస్వతీ దేవికి వ్యాసభట్టారకునకు నమస్కరించి జయ కావ్యమును (పురాణము లేక ఇతిహాసము) చదువవలెను. ముల్లోకముల వ్యాపించిన రాజ్యమును వామనుడను చద్మ వేషముతో వంచన ద్వారా బలి నుండి లాగికొని ఇంద్రున కొసగిన శ్రీధరునకు నమస్కారము.
జ్ఞానులలో శ్రేష్టుడును , ధనయాశ్రమమున సుఖోపవిష్టుడైన వాడుమనగు పులస్త్య మహర్షిని నారదుడు వామనునకు సంబంధించిన పురాణమును గురించి ప్రశ్నించెను.
బ్రహ్మర్షీ! సర్వ సమర్థుడై యుండియు పురాసమయమున విష్ణువు మరుగుజ్జు రూపమునేల ధరించెను.
దైత్య శ్రేష్టుడగు ప్రహ్లాదుడు పరమ వైష్ణవుడయ్యును దేవతలతో నేల యుద్ధమొనర్చేను? ఈ సంశయము నన్ను పీడించుచున్నది . దీనిని తొలగించుడు.
బ్రాహ్మణోత్తమా! దక్షపుత్రి సతీదేవి శంకరునకు ప్రియమును గూర్చునర్దాంగి అయ్యెనుగదా. ఆ శుభాంగి యే కారణమున తన శరీరమును వడలి పర్వతేశ్వరుడగు హిమవంతు నింట మరల జన్మించెను? మరల దేవదేవుడగు శంకరుల నేల పరిణయమాడేను. ఈ నా సందేహములను సర్వజ్ఞుడవగు తాము తొలగింపుడు. ద్విజశ్రేష్టా! పలురకములగు వ్రతము లొనర్చు విధానములను, తీర్థక్షేత్రముల మహత్మ్యమును, దానముల మహిమను దయతో నాకెరిగింపుడు.
ఈ విధముగ ప్రశ్నించిన తపోనిధి నారదునితో మునిశ్రేష్టుడు వదతాంవరుడగు పులస్త్యుడిట్లనెను.
ఓ మునిసత్తమా! నీవు కోరినట్లు మొదటి నుండియు క్రమముగా వామన పురాణమును సమగ్రముగ నుడివెదను. సావధానుడవై వినుము.
పూర్వమొక పర్యాయము గ్రీష్మర్తువు సమీపించుట చూచి మందరగిరిపై ఆసీనుడైన మహేశ్వరుని చూచి భగవతి హైమవతి యిట్లనెను. “ప్రభూ! దేవాధిపా! వేసవి సమీపించినది. వేడి గాడ్పులకు మండుటెండలకు తట్టుకొని మనము నివసింపదగిన గృహము నీకు లేకపోయేనే!” అంతట భవానీతో శంకరుడనెను. “సుదతి! కళ్యాణీ! నేనెల్లపుడు నిరాశ్రయుడనై యరణ్యవాసమే చేయుచుంటిని .” శంకరుని మాట విని సతీదేవి (చేయునది లేక) భర్తతో ఆ వేసవి దినములు చెట్ల నీడలలో గడిపినది. వేసవి గడిచిన తోడనే మేఘముల గుంపులతో దిక్కుల చీకట్లు వ్యాపించగ వర్షాకాలమేతెంచెను. దిక్కులు జన సంచారం శూన్యములయ్యెను. అది చూచి దాక్షాయణి తన భర్తతో ప్రేమ పురస్పరముగా నిట్లనెను. “మహేశ్వరా! గుండెలు బ్రద్దలగునట్లు తీవ్రమైన చలిగాలులు వీస్తున్నవి. మేఘములు గర్జించుచున్నవి. మెరుపులు మెరయుచున్నవి . నెమళ్ళు ఆడుచు కేకారవములు సేయుచున్నవి . ఆకసము నుండి తెరిపి లేకుండ జలధారలు పడుచున్నవి. బలాక పంక్తులు మేఘముల వెంట పరుగులిడుచున్నవి. గాలి తూపులకు కదంబ, సర్ణ, అర్జున, కేతకీవృక్షములు పుష్పములు రాల్చుచున్నవి . మేఘ గంభీర గర్జనలు విని తమ తమ నెలవులు వదలి వెళ్ళు యోగులకు వలెనే హంసలు కూడ సరోవరాలను వదలిపోవుచున్నవి. శంభో! అవిగో! లేళ్ళ గుంపులు అరణ్యమున ఎల్లెడల తిరుగాడుచున్నవి పరుగిడుచున్నవి; తమ ప్రియలతో రమించుచున్నవి. అటు చూడుడు, నల్లని మొగళ్ళమధ్య మెరుపుతీగలెంత మనోహరముగ ప్రకాశించుచున్నవో : నలుగడల నిండుకొనిన నీటి సమూహమును చూచి శూరులు తరుణ వృక్షాల మధ్య తిరుగాడుచున్నారు. ఓ చంద్రశేఖరా! ఉన్నట్టుండి నదులన్నియు వేగాన్ని పుంజుకున్నవి. కాగా దుశ్సీలుడగు వానిని సేవించిన స్త్రీ తన శీలాన్ని కోల్పోవుటలో ఆశ్చర్యమేముండును. ఆకాశాన్ని నీలి మబ్బులావరించినవి. సర్జ వృక్షాలు పుష్పాలతో, కడిమి చెట్లు మొగ్గలతో, బిల్వతరువులు ఫలాలతో, నదీ నదాలు జలాలతో సరోవరాలు పద్మపత్రాలతో నిండి యున్నవి. శంకరా! ఇలాంటి భయంకరమూ దు:సహమైన కాలాన ఈ కొండ కొమ్మున, నేను నిర్భయంగా సుఖించుటకనువైన గృహము నిర్మించుము.”
తన ప్రియురాలి ఈ శృతిమనోహరా లైన మాటలు విని ఆ ముక్కంటి “ఓ ప్రియురాలా ।
నేనేమి చేయుదును గృహ సంపాదనమునకు నా వద్ద ధనములేదు. నేను ధరించేది పులితోలు. జన్నిదమా పాపరేడు. పద్మ పింగళులనే సర్పాలు నాకు చెవి పోగులు. నేను ధరించే కేయూరాలు కంబళ ధనంజయాలనే విషధరాలు. కుడి ఎడమ చేతులకు నేను తొడిగే కంకణాలు అశ్వత్తర, తక్షక నాగులు. పోతే కాటుక రంగుతో నిగనిగలాడే మహోరగం నీలుడు నామొలతాడు. ఇంతకు మించి నావద్ద ఏమి గలదు?“ అనెను.
సాధారణ గృహ నిర్మాణము చేసుకోజాలని తన అశక్తతను వెల్లడించుచున్న శంకరుని ఆపలుకులు సత్యములైనను కర్ణ కటువులూ అరుచి కరములగుటచేమృడానికి తృప్తి కలిగించలేదు. లజ్జారోషాలతో క్రుంగి పోయి వేడి నిట్టూర్పులు విడుచుచు చూపులు నేల మీద నిలిపి భర్తతో ఇలా అన్నది .
“ప్రభు అయితే ఇలాంటి భయంకరమూ దుర్బరమైన వర్షాకాలం చెట్ల క్రింద తడుస్తూ రోదిస్తూ ఎలా గడప గలను? అందులకే యింతగట్టిగా నేను మాటాడుచుంటిని.”
“ ప్రియురాలా! ఇందులో ఇష్టమేమి? వర్షాకాలమంతయు మేఘాలను ఆసనముగా చేసి కొని వాని మీద, నీ శరీరం పైనొక నీటి బిందువు కూడా పడకుండునట్లు నివసింపగలవు సుమా!
అంతట శంకరుడు దాక్షాయణితో నొక ఎత్తైన మేఘఖండము నదిరోహించి ఆసీనుడయ్యెను. ఆకారణమున నామహేశ్వరునకు స్వర్లోకమున జీమూతకేతువను పేరు సార్థకమాయెను .
అధ్యాయము 1 complete
