1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

28 - బ్రహ్మ స్వరూప, వైకుంఠవర్ణనలు

నారద ఉవాచ- నారదుడిట్లనెను

మహేశ్వరా! నీ అనుగ్రహము వలన భక్ష్యాభక్ష్య స్వరూపము నంతయు తెలిసికొంటిని. ప్రస్తుతము బ్రహ్మస్వరూపమును వివరించి చెప్పుము.

హే ప్రభో! బ్రహ్మకు ఆకారమున్నదా? లేక నీరాకారమేనా? దానికి విశేషణములున్నాయా? లేవా? ఆది దృశ్యమా లేక ఆదృశ్యమైనదా? వేదములలో శాస్త్రములలో బ్రహ్మ స్వరూప మేవిధముగా చెప్పబడినది?

బ్రహ్మస్వరూపిణియైన ప్రకృతి బ్రహ్మకంటె అతిరిక్తమైనదా? దాని స్వరూపము వేదములలో ఏవిధముగా చెప్పబడినది: సృష్టి విషయమున ప్రకృతికి ఉన్న ప్రాధాన్యమెట్టిది? బ్రహ్మ, ప్రకృతుల మధ్య ఏది శ్రేష్ఠమైనది? వీటినన్నిటిని చక్కగా ఆలోచించి సర్వజ్ఞుడవైన నీవు నాకు తెలుపుము.

అను నారదుని మాటలు విని ఐదు ముఖములుగల మహాదేవుడు చిరునవ్వుతో నారదునకు పరబ్రహ్మస్వరూపమునిట్లు చెప్పనారంభించెను.

మహాదేవ ఉవాచ - శ్రీమహాదేవుడిట్లు పలికెను-

వత్స! నీవడిగినది చాలా నిగూఢమైన ఉత్తమజ్ఞానము. అదిపురాణములలో వేదాలలో కూడ కనిపించనీది. నేను, బ్రహ్మదేవుడు, విష్ణువు, ఆదిశేషుడు, ధర్ముడు, మేమందరము, వేదములు దీనీనీ వివరించుటకు ప్రయత్నించితిమి. పరబ్రహ్మము, విశేషణయుక్తమైనది. దృశ్యము, ప్రత్యక్షమైనది. మేము వేదములలో దీనిని వివరించితిమి.

పూర్వము వైకుంఠములో బ్రహ్మదేవుడు, ధర్ముడు ఇదే ప్రశ్నను వేయగా శ్రీహరి తెల్పిన విషయమును నీకు తెలుపుదును.

ఇది తత్వములయొక్క సారము. అజ్ఞానముచే గుడ్డివారికి కన్నులవంటిది. ద్విధా భ్రమమనే చీకటిని పారద్రోలు గొప్పదీపము.

పరబ్రహ్మ సనాతనమైనది. పరమాత్మ స్వరూపము కలది. అన్ని దేహములలో ఉండి ఆయా జీవులు చేయు కర్మలకు సాక్షిగా ఉండునది.

శ్రీవిష్ణువు జీవునియొక్క పంచప్రాణస్వరూపుడు. ప్రజాపతియైన బ్రహ్మదేవుడు మనో రూపుడు. నేను జ్ఞానస్వరూపుడను. సర్వేశ్వరియైన శక్తి ప్రకృతి స్వరూపిణి. మేమందరము ఆపరమాత్మకు ఆధీనులము. అతడు ఉన్నచోట మేముందుము. అతడు. ఆక్కడినుండి జరిగినచో మేముకూడ రాజువెంటపోవు అనుచరులున్నట్లు పోదుము.

జీవాత్మ ఆ పరమాత్మయొక్క ప్రతిబింబము. అతడు తాను చేసిన కర్మఫలితములనన్నిటిని అనుభవించును. సూర్యచంద్రుల ప్రతిబింబము నీటితోనిండిన కడవలలో కన్పించినట్లే పరమాత్మ ప్రతిబింబమైన జీవాత్మ ఆతడున్న చోట ఉండును. కుండలు పగిలిపోయినచో సూర్యచంద్రుల ప్రతిబింబములు మాయమైనట్లే లయ కాలమున జీవాత్మలు పరమాత్మలో విలీనమగును.

పరబ్రహ్మము ఒక్కటే. ప్రళయకాలమున ఈ చరాచర జగత్తు, మేమందరము ఆ పరబ్రహ్మలోనే విలీనమగుదుము. ఆ పరబ్రహ్మము, గ్రీష్మకాల మధ్యాహ్నమున కన్పించు కోటికోట్ల సూర్యుల కాంతితో సమానమైన మండలాకారమున నున్న జ్యోతి:స్వరూపము. ఆది ఆకాశమువలె సర్వత్ర వ్యాపించియున్నది. అట్లే ఆ పరమాత్మను యోగులు చంద్రబింబమును చూచినట్లు తేలికగా చూతురు.

యోగులు ఆ పరబ్రహ్మను సనాతనుడుగా పేర్కొనుచున్నారు. సత్యస్వరూపుడు, సర్వమంగళ స్వరూపుడైన ఆ పరమాత్మను యోగులు రాత్రింబవళ్ళు ఎల్లప్పుడు ధ్యానము చేయుచునుందురు.

ఆ పరబ్రహ్మ నిరీహుడు, నిరాకారుడు, స్వేచ్ఛామయుడు, స్వతంత్రుడు. సమస్త కారణములకు కారణమైనవాడు. ప్రధానమైనపోడు. పురుషుడు, ప్రకృతికంటే శ్రేష్ఠుడు. సమస్తమునకు కారణమైన ప్రకృతి ఆ పరమాత్మయందే విలీనమగుచున్నది.

అగ్నికి దాహకశక్తి, సూర్యునకు కాంతి, పాలకు తెలుపుదనము, నీటికి చల్లదనము, ఆకాశమునకు శబ్దము, భూమికి గంధము ఎట్లు సహజమైనవో ఆట్లే పరబ్రహ్మమునకు, ప్రకృతికి నీరుణత్వము సహజము.

సృష్టిని చేయవలెనను కోరికగల పరమాత్మయొక్క అంశమే పురుషుడు, అతడు సగుణస్వరూపుడు. సత్వ, రజస్తమస్సులనే త్రిగుణాత్మకమైన ప్రకృతి ఆ పురుషునకు నీడవంటిది. కుమ్మరి మట్టితో కుండలను చేసినట్లు పరబ్రహ్మ స్వరూపుడైన ఆ పురుషుడు ప్రకృతిద్వారా సృష్టిని చేయుచున్నాడు.

కంసాలివాడు బంగారముతో నగలనెట్లు చేయునో అట్లే పరబ్రహ్మ ప్రకృతితో సృష్టిని చేయుచున్నాడు.

కుమ్మరివాడు మట్టిని సృష్టించకపోయినను, ఆ మట్టి నిత్యమైనది. అట్లే స్వర్ణకారుడు బంగారమును సృష్టించకపోయినను ఆది అంతకుముందు కూడ ఉన్నట్టిదే. ఈ విధముగా ప్రకృతి, పరబ్రహ్మలగూర్చీ బాగుగా విచారించిన కొందరు పరబ్రహ్మ, ప్రకృతి రెండుకూడ నిత్యమైనవే అని, ఆ రెంటికి సమానమైన ప్రాధాన్యమునిత్తురు.

కుమ్మరివాడు, స్వర్ణకారుడు మట్టి, బంగారముకంటె ఏవిధముగా ఉత్కృష్టులో అట్లే పరబ్రహ్మ ప్రకృతికంటెను ఉత్కృష్టుడు. కాని కొందరు పరబ్రహ్మయే ప్రకృతి పురుషులుగా ఏర్పడినట్లు తెల్పుదురు. మరికొందరు ప్రకృతి పరబ్రహ్మ వేరువేరందురు.

ఓ నారదా! సమస్తకారణములకు కారణభూతమైన పరబ్రహ్మను గూర్చి కొంత వేదములలో చెప్పబడినది.

పరబ్రహ్మ అన్ని జీవులకు ఆత్మ, దానికి వికారములేవియు లేవు. పైగా జీవులు చేయు అన్ని కర్మలకు సాక్షిభూతమైనదీ, అంతట వ్యాపించియున్నది. ఆన్నీటికిని అదే మూలమని వేదములో చెప్పబడినది.

అన్నిటికి కారణరూపమైన ప్రకృతి ఆ పరబ్రహ్మముయొక్క శక్తి స్వరూపిణి. ఆ ప్రకృతి వలననే పరబ్రహ్మము శక్తిమంతమగుచున్నది.

యోగులు పరబ్రహ్మను తేజ:స్వరూపముగా భావించి ధ్యానింతురు. కాని నా భక్తులు, వైష్ణవులు పరబ్రహ్మను తేజఃస్వరూపమనీ తలపరు.

వైష్ణవులు పరబ్రహ్మ ఉండుచోటగల తేజస్సును చూచి పురుషుడు లేకుండ ఈ తేజస్సు ఎట్లు వచ్చునని భావింతురు. అందువలన వారు స్వేచ్ఛామయుడైన ఆ పరమపురుషుని మనోహరమైన రూపమును ధ్యానింతురు.

కోటిసూర్యులతో సమానమైన కాంతిగల, మండలాకారముననున్న ఆ తేజస్సు మధ్య గోలోకమనునదీ ప్రచ్ఛన్నముగా నున్నది. అది లక్షకోట్ల యోజనాల వైశాల్యముకలది. రత్నములు, ఇంద్రనీలమణులు గల భవనములు కలది. సదా గోపికలతో ఆ ప్రాంతము నిండియుండును. ఆ గోలోకమున చంద్రమండలమువలె గుండ్రముగా వైకుంఠమునకు ఏబది యోజనముల దూరములో అనేక రత్నములతో నిర్మింపబడిన భవనములుగల ప్రాంతము కలదు. అచ్చట గోవులు, గోపులు, గోపికలుందురు. కల్పవృక్షములుగల బృందావనము. విరజానది ఉండును. బంగారముతో నిండిన శతశృంగములతో మిక్కిలి అందమైన లక్షకోటి ఆశ్రమములున్నవి. ప్రాకారములు, పరిఖ, పారిజాతవనములు ఉన్నవి.

అచ్చట కౌస్తుభమణితో ప్రకాశించు గృహరాజము కలదు. దానిమెట్లు మణులతో నిర్మింపబడినవి. ద్వారములు కూడ శ్రేష్ఠమైన మణులతో కూడుకొని యున్నవి. చిత్రవిచిత్రములైన ఆనేకములైన అద్దములతో అది చాలా శోభాయమానముగానుండును.

ఆ భవనమునకు పదునారు ద్వారములున్నవి. రత్న నిర్మితములైన దీపములతో అది చక్కగా ప్రకాశించును. అచ్చట చిత్రవిచిత్రములతో ఉన్న గొప్ప విలువైన రత్న సింహాసనమున పరమాత్మ కూర్చొనియుండును. అతడు నూతన మేఘమువలె నల్లనివాడు. కిశోరవయస్కుడు. అతని కండ్లు శరత్కాలమందలి మధ్యాహ్న సూర్యుని కాంతివంటి కాంతిగలవి. అతని ముఖము శరత్కాలపు పున్నమిచంద్రునివంటి కాంతిగలది. అతడు కోటి మన్మథుల లావణ్యము గలవాడు. కోటి చంద్రుల కాంతిగలవాడు, అతడు చిరునవ్వుతో, చేతిలో మురళిని, పరమోత్తమమయిన పట్టు వస్త్రములను ధరించును. అతని శరీరమునిండ శ్రీచందనముండును. కౌస్తుభమనే మణితో, మోకాళ్ళవరకున్న మాలతీ పుష్పముల వనమాలతో, మణిమాణిక్య భూషణములతో, శిరస్సున మయూరపించముతో రత్నమయమైన కిరీటముతో, రత్నములతో చేయబడిన దండె కడియములతో, రత్నమంజీరములతో, రత్నకుండములతో అతడుండును. ఆతని ఆకారము త్రిభంగిమగానుండును. పలువరుస ముత్యాలవరుసవలె ఉండును. పెదవులు దొండపండువలె ఉండును. ముక్కు ఉన్నతమైనది. అతడెల్లప్పుడు మంచిరత్న భూషణములు, చిరునవ్వుతోనున్న ముఖములు కల గోపికలలోనుండును. ఇంకను అతడు బ్రహ్మాదిదేవతలు మునీంద్రులు నరశ్రేష్ఠులచే నమస్కారములనందుకొనుచుండును. అతడు భక్తులకు నాథుడు భక్తులననుగ్రహించువాడు, భక్తులను ప్రేమగా చూచుకొనువాడు. రాధాదేవి వక్షస్థలము పైనుండు రాసేశ్వరుడు, రసికుడు.

ఇటువంటి ఆ పరమాత్మరూపమును వైష్ణవులెల్లప్పుడు తమ మనస్సులలో ధ్యానింతురు. కాని ఆ పరమాత్మను రూపరహితుడుగా తలంపరు.

ఆ పరమాత్మ మాకందరకు ధ్యానించతగినవాడు. ఆ పరబ్రహ్మ అక్షరస్వరూపుడు, సనాతమడు, స్వేచ్చామయుడు, విరుణుడు, కోరికలు లేనివాడు. ప్రకృతికన్నను శ్రేష్ఠుడు. ఆతడు సమస్తమునకు ఆధారమైనవాడు. సమస్తసృష్టికి కారణభూతుడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సమస్తజీవులచే పూజింపదగినవాడు. సమస్తసిద్ధులను కలిగించువాడు.

ఆ భగవంతుడు గోలోకమున రెండుభుజములతో, గోపాలురతో గొల్లవేషమున తన సహచరులతో కలసియుండును. రాధాదేవికి ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు సర్వపరిపూర్ణుడు. అతడు ఆందరి అంతరాత్మలలోనుండును. అంతట ప్రత్యక్షమగును. ఆంతట తీరుగుచుండును.

కృషియనగా సమస్తము. నకారము ఆత్మను తెలుపును. అందువలన కృష్ణుడనగా సర్వాత్ముడు పరబ్రహ్మస్వరూపుడు. అట్లే కృషియవగా సమస్తము. నకారము ఆదిని తెలుపును. అందువలన కృష్ణుడవగా అందరికి ఆదిపురుషుడు. సర్వత్ర వ్యాపించియున్నవాడని అర్థము.

ఆ పరమాత్మయే తన అంశముతో శ్వేతద్వీపమందలి వైకుంఠమున చతుర్భుజములు గల విష్ణుమూర్తిగా నాలుభుజములుగల అమచరులతో, లోకములను రక్షించుచున్నాడు.

ఈవిధముగా మేమందరము సేవించుచున్న పరబ్రహ్మయొక్క స్వరూపును వీపు కోరినట్లు వివరించితివి.

ఈవిధముగా శంకరుడు నారదునకు పరబ్రహ్మస్వరూపమును తెలుపగా వారదుడు. గంధర్వరాజువకు వసిష్టుడు ఉపదేశించిన నారాయణ స్తోత్రమును చేయగా ఆతడు సంతోషించెను. మృత్యుంజయుడైన శంకరుడు నారదునకు ఇవమొసగగా అతడు సంతోషపడి శివునియొక్క ఆజ్ఞను తీసికొని పవిత్రమైన నారాయణాశ్రమమునకు వెడలిపోయెను.

శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున సౌతినకమహర్షుల సంపాదముగల బ్రహ్మఖండమున బ్రహ్మస్వరూపవైకుంఠాది వర్ణవము, నారదుడు బయలుదేరుట అనుఅంశములుగల . ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.