1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము
16 - చికిత్సా ప్రకరణము
బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను-
ఓ మాయావతీ! నీవు కాలువి, యముని, మృత్యుకన్యను వ్యాధుల సమూహమును చూచితివి కదా. ఇప్పటికీ నీకు మీగిలిన సందేహమును ఆడుగుము.
బ్రాహ్మణుని మాటలువిని పతివ్రతయైన మాలావతీ తన మనస్సులో నున్న సందేహము తీర్చుకొనుటకు జగత్పతినిట్లు ప్రశ్నించినది.
మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను-
ఓ బ్రాహ్మణా! ప్రాణుల ప్రాణములను పోగొట్టే వ్యాధి. వ్యాధి కారణము సమస్తము వేదమున నిరూపించబడినట్లు ఏదైతే చెప్పబడినదో నివారించుటకు వీలు కానీది ఆశుభమైనది ఐన ఆ వ్యాధి వ్యాపించకుండ దానికి తగిన ఉపాయమును వివరముగా తెలుపగలరు,
దీనవత్సలుడు గురువు ఐన మీరు నేను అడిగినవాటిని, ఆడగనివాటినీ కూడ, ఆట్లే నాకు తెలిసినా తెలియకపోయినా అన్నిటిని వివరముగా చేప్పుడు.
మాలావతి మాటలు విని విప్రరూపముననున్న జనార్దనుడు వైద్య సంహితను, సంహితార్థమును కూడ చెప్పుటకు ప్రారంభించెను.
బ్రాహ్మణ ఉవాచ- బ్రాహ్మణుడిట్లనెను-
సర్వతత్వములు తెలిసినవాడు, సర్వకారణములకు కారణభూతుడు, వేదవేదాంగముల కారణులకు కారణమైనవాడు ఈశ్వరుడు. ఐన కృష్ణుని నమస్కరింతును.
సర్వమంగళమాంగళ్యములకు కారణభూతుడు, సనాతనుడైన పరమేశ్వరుడు చతుర్వేదములను సృష్టించెను. ఋక్, యజూస్ సామాధర్వములను వేదములను బ్రహ్మదేవుడు తెలిసికొని వాటి ఆర్థమును కూడ తెలుసుకొని ఆయుర్వేదమును సృష్టించెను. బ్రహ్మదేవుడు ఆయుర్వేదమను పంచమ వేదమును సృష్టించి భాస్కరునకుపదేశించెను. భాస్కరుడు తన శిష్యులకు ఆయుర్వేదమును తన పేరబడుగు భాస్కరసంహితను ఉపదేశించెను.
సూర్యునియొక్క శిష్యులు వివిధములైన సంహితలను వ్యాప్తిచేసిరి.
సూర్యుని శిష్యులయొక్క పేర్లు వారు రచించిన, వ్యాధిని సంపూర్ణముగా నాశనము చేయగలుగు తంత్రములు ఇవి.
ధన్వంతరి, దివోదాసుడు, కాశీరాజూ, అశ్వినీకుమారులు, నకులుడు, సహదేవుడు, ఆర్కి, చ్యవనుడు, జనకుడు, బుధుడు, జాబాలుడు, జాబిలి, ఫైలుడు, కరథుడు, ఆగస్యుడు అను పదునారుగురు సూర్యుని శిష్యులు. వారు వేదవేదాంగ తత్వజ్ఞులే కాక వ్యాధులను నిర్మూలనము చేయు సామర్థ్యముకూడ కలిగినటువంటివారు.
ధన్వంతరి చికిత్సా తంత్ర విజ్ఞానమనే తంత్రమును, దివోదాసుడు చికిత్సాదర్పణతంత్రమును, కాశీరాజు చికిత్సా కౌముదీ తంత్రముమ, అశ్వినీకుమారులు సందేహములను తొలగించే చికిత్సాసార తంత్రమును, నకులుడు వైద్యక సర్వస్వమనే తంత్రమును సహదేవుడు వ్యాధసింధు విమర్ధనమును, ఆర్కియైన యముడు జ్ఞానార్ణవ మహాతంత్రమును చ్యవనమహర్షి జీవదాన తంత్రమును, యోగియగు జనకమహారాజు వైద్య సందేహభంజనమును, చంద్రపుత్రుడైన బుధుడు సర్వసార తంత్రమును జోబాలమహర్షి తంత్రసారకమును, జాజులిముని వేదాంగసార తంత్రమును, పైలమహర్షి నిదాన తంత్రమును, కరధుడు సర్వధర తంత్రమును, అగస్త్య మహర్షి ద్వైధనిర్ణయ తంత్రమును రచించెను.
ఆయుర్వేదశాస్త్రవిశారదులైన ధన్వంతరి మొదలగువారు ఆయుర్వేదమనే సముద్రమును జ్ఞానమనేమందర పర్వతముచే చీలికి పైన పేర్కొన్న గ్రంథములనే నవనీతముల తీసిరి.
దివ్యమైన భాస్కరసంహితను, పైగ్రంథములను చక్కగా చూచీన ఆయుర్వేదశాస్త్రము సమస్తమునకు కారణమని నీకు స్పష్టముగా తెలియును.
వ్యాధితత్వమును చక్కగా గుర్తించుట, రోగమువలన కలుగు వేదసలను నిగ్రహించు శక్తి కలిగినవాడే వైద్యుడు. ఆయుర్వేదశాస్త్రమును చక్కగా తెలిసినవాడు, చికిత్స చేయుట చక్కగా తెలిసినవాడు, దయాస్వభావము కలవాడు, ధర్మిష్ణుడు వైద్యుడనబడును. ఆ వైద్యుడు ఆయుస్సునకు కర్త మాత్రము కాజాలడు.
సమస్త రోగములకు కారణము దారుణమైన జ్వరము, ఆ జ్వరము శివభక్తుడు, యోగి, వికృతాకృతి కలది, భయంకరమైనది, మూడుపాదములు, మూడు తలలు, ఆరుభుజములు, తొమ్మిది కళ్ళు కలది. రౌద్రస్వరూపము కలది. కాలాంతక యమతుల్యమైనది.
జ్వరమునకు తండ్రి (కారణము) మందాన్నీ. ఆ మందాగ్నికి వాత, పిత్త శ్లేష్మములు కారణములు. జ్వరములు వాతము వల్ల కలిగినది, పిత్తమువలన కలిగినది, శ్లేష్మమువల్ల కలిగినదీ, త్రిదోషముల వలన కలిగినది అని నాలుగు విధములు.
పాండు, కామల, కుష్టు, శోధము (జలోదరము) ప్లీహము. శూల, జ్వరము, అతిసారము, గ్రహణి, కాస, వ్రణములు, హాలీమకము, మూత్రకృచ్ఛము, రక్తదోష వీకారమువలన కలిగిన గుల్మము, విషమేహము, కబ్జము, గోదము, గలగండకము, భ్రమరి, సన్నిపాతము, విషూచి వీటి భేదములు, ప్రభేదములచే అరువది నాలుగు విధములైన రోగములు కలుగుచున్నవి.
ఈవ్యాధులన్ని మృత్యుకన్యకు పుత్రులు. జరా (ముసలితనము) మృత్యుకన్య పుత్రిక. ఈ జర తన సోదరులతో కలసి భూమండలమంతయు తిరుగుచున్నది. ఇవన్నియు యమనియమములతో నుండువానిని, రోగనివారణోపాయము తెలిసిన వానిని చూచి గరుత్మంతుని చూచి సర్పములు పరుగెత్తినట్లు పరుగెత్తిపోవును.
కళ్ళను నీటితో పరిశుభ్రము చేయుట, వ్యాయమము, కాళ్ళ ఆడుగులను నూనెతో మర్ధించుట, చెవులలో నూనె వేసికొనుట, తలంటుకొనుట చేసికొన్నచో జరా, వ్యాధులు దూరమగును. వసంతరుతువులో ప్రతి దినము తీరుగుట, స్వల్పముగా వహ్నిని సేవించుట యుక్త సమయములో తనకంటె వయస్సులో చిన్నదైన స్త్రీతో సంగమించుట జరిగినచో వానికి ముసలితనమురాదు.
గ్రీష్మరుతువులో సరస్సులో నున్న చల్లని నీటిలో స్నానము చేయుచు, చందన ద్రవమును, చల్లనిగాలిని సేవించిన వ్యక్తికి ముసలితనము రాదు.
వర్షరుతువులో వేడినీళ్ళ స్నానము చేయవలెను. వర్షపు నీరును త్రాగరాదు. నిర్ణీతసమయమున సమానమైన (అతిగా కాకుండ, తక్కువ కాకుండ) భోజనము చేయవలెను.
శరత్కాలములో ప్రతిదినము ఉదయకాలపు భ్రమణమును మానివేయవలెను. సరస్సులో స్నానము చేయవలెను. మితమైన ఆహారమును మాత్రమే భుజింపవలెను.
హేమంత రుతువులోను సరస్సులో స్నానము చేయుట మంచిది. యుక్త సమయమున వహ్నిని సేవించవలెను. వేడిగానున్న క్రొత్త బియ్యపు అన్నమును తినినచో వారిని ముసలితనము దరి చేరదు.
శిశిర రుతువులోనూ వేడిగా నున్న కొత్త బియ్యపుటన్నమును తినవలెను. బట్ట చాటుగా ఉన్న అగ్నిని సేవించవలెను. ఉష్ణోదకమున స్నానము చేయవచ్చును. అందువలన ముసలితనము దరిచేరదు.
ఆకలియైనప్పుడు మంచి భోజనమును చేయవలెను. దప్పియైనప్పుడు వీరు తాగవలెను. నిత్యము తాంబూలమును సేవించినచో ముసలితనమతనికి రాదు.
జిహ్వచాపల్యములేక పెరుగు, నిన్న పిండిన పాలను తోడు పెట్టి తీసిన వెన్న (హైయంగవీనం) కొలనేయి, బెల్లము ప్రతినిత్యము తినినవానీకి జర దరిచేరదు.
ఎండిన మాంసము, తనకంటే వయసులో పెద్దస్త్రీ, ఉదయ కాలసూర్యుడు, లేత పెరుగు, రాత్రి పూట పెరుగు, చెడునడక గలస్తీ, రజస్వల ఐన స్త్రీ భర్త, పుత్రులు లేని స్త్రీ జారుని యొక్క దూతిక, యాగము చేసిన శూద్రుని భార్య, ముట్లుడిగిన స్త్రీ వీరిని సేవించిన వానినీ వ్యాధులు ముసలితనము త్వరగా దరిచేరును.
పైన పేర్కొనిన స్త్రీలు పెట్టిన అన్నము తిన్నచో బ్రహ్మహత్యా ఫలితము లభించగలదు. ఆ అన్నము తినిన వ్యక్తికి బ్రహ్మహత్యాపాపముతో ముసలితనముకూడా త్వరగా దరిచేరును.
పాపములకు వ్యాధులకు స్నేహము కలదు. పాపము జర, వ్యాధి. విఘ్నములకు కారణమగుచున్నది. పాపమువలన వ్యాధి కలుగును. వ్యాధులవలన ముసలితనము కలుగుచున్నది. ఆ పాపమువలన దైన్యము, దుఃఖము, మిక్కిలి భయంకరమైన శోకము కూడా కలుగుచున్నవి. అందువలన ఈ భారతదేశమున సత్పురుషులు దోషములకు హేతువైన పాపములను భయపడి చేయరు.
స్వధర్మాచారము కలవాడు దీక్షగైకొన్నవాడు, హరిభక్తుడు, గురువులందు, దేవతలందు, ఆతిథులందు భక్తి కలవాడు, తపస్సు చేయువాడు, ప్రతములు, ఉపవాసములయందు ఆనురక్తి కలవాడు. పుణ్యతీర్ణములను సేవించువాడు మొదలగు వారిని చూచి రోగములు గరుత్మంతుని చూచిన సర్పములవలే పరుగెత్తుకొని పోవును.
జ్వరమునకు, ఇతరములైన సమస్త రోగములకు పిత్తము, శ్లేష్మము, పాతము కారణములని ఇంతకుముందే చెప్పితిని. ఓమాలావతీ! ఆ వ్యాధులు ఏవిధముగా మానవులను చేరుచున్నవో వాటిని ఎట్లు నివారించవచ్చునో వినుము.
బాగుగా ఆకలి అగుచున్నప్పుడు అన్నము తినకుండా ఉన్నందువలన మణిపూరక చక్రములో పైత్యము పుట్టుచున్నది. తాటిపండును (ముంజకాయలను) మారేడు పండును తిని తక్షణము నీరు త్రాగినచో ప్రాణములను పోగొట్టు పిత్తమేర్పడగలదు. వేడి నీటిని శిరస్సుపై పోసుకొన్నను, భాద్రపదమాసమున చేదు వస్తువులు విపరీతముగా తిన్నను ఫైత్యమేర్పడును.
చక్కర కలిపిన ధనియాలు, చల్లని నీటితో తడుపబడిన పిండి, శనగలు, పెరుగు, మజ్జిగ కాక మిగిలిన గవ్యములు (ఆవుపాలు, ఆవువెన్న, ఆవునెయ్యి, ఆవుమీగడ) బాగుగా పండిన తాటిపండ్లు, మారేడు పండ్లు, చెరుకు సంబంధమైనవి, పెసరపప్పుతో చేసిన కట్టుచారు, చక్కర కలిపిన నువ్వులపిండి, అల్లము ఇవి పిత్తమును పోగొట్టును, బలమును పుష్టిని కలిగించును.
పై విధముగా పైత్యమునకు కారణములు, పిత్తనాశక వస్తువులు చెప్పబడినవి.
భోజనము తరువాత స్నానము చేసినను, దప్పిక లేక నీరు త్రాగినను, నువ్వుల నూనె, చిక్కని ఆమలకీ ద్రవము, చిక్కని నూనె, చద్ది అన్నము, నిన్నటి మజ్జిగ, పెరుగు, బాగా పండిన ఆరటిపండు, మేఘంబువులు, చక్కరవీళ్ళు, కొబ్బరినీళ్ళు, గురిపెంగ చెట్టు పండు, బాగుగా పండిన సన్నదోసపండు, వర్షకాలములో సరస్సులో చేసిన స్నానము మొదలగునవి శ్లేష్మమును కలిగించును. ఆ శ్లేష్మము వీర్యమునంత పోగొట్టును. దాని జన్మస్థానము బ్రహ్మరంధ్రము.
వహ్ని స్వేదము (ఆవిరి పట్టుకొనుట?) తిరుగుట, ఎండిన వస్తువుల తినుట, కరకకాయ, పక్వము కాని వెలగపండు, అరటిపండు, వేసవారము (మిరియాలు, ధనియాలు, అల్లము మొదలగు దినుసులతో చేయబడిన పొడి), ఆహారము తీసుకొనకుండుట, నీరుతాగకుండుట, నేయి కలిపిన రోచనా చూర్ణము (ఆకలిపుట్టించు పొడి) నేయి కలిపిన చక్కర, మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, జీవకము, తేనే ఇవన్ని శ్లేష్మమును వెంటనే తొలగించును. ఈ వస్తువులన్నీ బలమును పుష్టిని కలిగించునవి.
పండిన అరటిపండు, కొబ్బరినీరు, అప్పుడే చిలికి చేసిన మజ్జిగ, మంచి పిండి, గేదొ పెరుగు, శర్కరతో కూడుకున్న రుచికరమైన ఆహారము. కేవలం రుచికరమైన ఆహారము మరీ చద్దీదీకావి అన్నము, సౌవీరము, చల్లని నీరు, పక్వతైలము, నువ్వులనూనె, కొబ్బరి. ఖర్జూరము, తాటిపండు, వేడియైన ఆమలకీద్రవము, చిరువెచ్చని నీటిలో చేయస్నానము. మంచి చందన ద్రవము, దట్టమైన తామరరేకుల శయ్య, చక్కని ఏపనకట్టలు, ఇవన్నియు వాతరోగమును పోగొట్టుచున్నవి. ఈవాతరోగములు క్లేశజనితములవి, సంతాన జనితములని, కామ జనితములని మూడు విధములుగానున్నవి.
వ్యాధుల పేర్లు, వాటి నివారణకై ప్రాచీనులు రచించిన వివిధ తంత్ర గ్రంథముల పేర్లు మీకు చెప్పితిని. ఓ మాలావతీ! ఈ తంత్ర గ్రంథములన్నియు వ్యాధులను సమూలముగా నాశనము చేయునవి. ఈగ్రంథములందు తెల్పబడిన రసాయనాదులు, ఉపాయములు చాలా దుర్లభమైనవి. ఓ సాద్వి! వీటనన్నిటిని పూర్తి వివరముగా చెప్పుటకు పంవత్సరకాలము కూడ సరిపడదు.
ఓ పతివ్రతా! నీ భర్త ఏ రోగమువల్ల చనిపోయెనో తెలుపుము. దానివలన నీ భర్త బ్రతుకు ఉపాయమున నేను చెప్పుదును.
సౌతిరువాచ- సౌతీ మహర్షి ఇట్లనెను -
బ్రాహ్మణుని మాటలు విని చిత్రరథుని కూతురైన మాలావతి సంతోషముతో తన విషయమునట్లు చెప్పెను.
మాలావత్యువాచ- మాలావతి ఇట్లనెను –
బ్రహ్మదేవుని సభలో తనకు జరిగిన అవమానమువలన నా భర్త సిగ్గుపడి బ్రహ్మదేవుని శాపకారణముగా యోగశక్తిచే తన ప్రాణములు వదిలెను. ఓ బ్రాహ్మణుడా! అపూర్వము మనోహరమైన నా భర్తకు సంబంధించిన విషయమునంత వింటివి. ఈ ప్రపంచములో ఎవ్వరికిని కష్టము లేక మంచి జరుగదు.
అందువలన పీవు నా భర్తను వెంటనే బ్రతికింపుము. అప్పుడు మేమిద్దరము నీకు నమస్కరించి మా ఇంటికి పోయెదము.
మాలావతి మాటలు విని విప్రుని వేషమున నున్న నారాయణుడు దేవతలున్న బ్రహ్మదేవుని సభకు వెళ్ళాను.
శ్రీ బ్రహ్మ వైవర్తమను మహాపురాణమున సౌతి శౌనక సంవాద రూపమైన బ్రహ్మ ఖండమున మాలావతీ విష్ణు మూర్తుల సంవాద సమయమున చీకిత్సా ప్రణయనమను పదునారవ అధ్యాయము సమాప్తము.
