1 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - బ్రహ్మ ఖండము

Table of Contents

25 - కైలాపమువకు నారదుడు వెళ్ళుట

సౌతిరువాచ - సౌతిమహర్షి ఇట్లనెను -

నారదుడు క్షణకాలములో శివలోకమును చేరుకొనెను. ఆ శివలోకము ధ్రువలోకము పైన లక్షయోజనముల దూరమున నున్నది. ఆ లోకమునకు ఆధారమేమీ లేకున్నను శంకరుడే దానినీ తనయోగబలముచే పడిపోకుండ చేయుచున్నాడు. ఆలోకమున చిత్ర విచిత్రములైన ఆలయములున్నవి. మునిశ్రేష్ఠులందరు అచ్చట నుందురు. ఆలోకము గొప్ప పుణ్యము చేసికొనిన సాధకులకు మాత్రమే కన్పించును.

ఆ పట్టణమున సూర్యచంద్రులకాంతులు లేకున్నను అసంఖ్యాకమై చాలా ఎత్తు కలిగిన అగ్ని జ్వాలలతో నిత్యము ప్రకాశించుచుండును. ఆది లక్షయోజనముల వైశాల్యముగలది. విచిత్రములు, సుందరములు, మణులలో పరివేష్టితములైన వివిధ చిత్రములు గల మూడుకోట్ల రత్నగృహములు కలది. ఆది ఎల్లప్పుడు శివుని సేవించు జనములచే నిండిపోయినది. ఇంకను కోటి కోట్ల సంఖ్యలో నున్న సిద్ధులచే మూడు లక్షల కోట్ల ఆత్మ పరివారముతో, మూడులక్షల భైరవులచే నాలుగు కోట్ల పుణ్యక్షేత్రములతో కూడుకొనియున్నది.

అచ్చట అనేకములైన కల్పవృక్షములు, మందారవృక్షములున్నవి. అచ్చటనున్న కామధేనువులను చూచినచో తెల్లని కొంగలతో నిండిన ఆకాశము ఇకి వచ్చును.

ముల్లోకములకన్నను విలక్షణమైనది, భయము, ఆర్తీ, రోగములు ముసలితనము, మృత్యువు లేని ఆలోకమును దర్శించి నారదుడు చాలా విస్మయమందెను. వెంటనే అతడు దేవతలకు యోగులకు గురువైన మహేశ్వరుడున్న ఈ ప్రదేశమున పై చిత్రవిచిత్రములుండుట సహజమే అని తలపోసెను.

నారదుడు సభా మధ్యలోనున్న శాంతి స్వరూపుడు, మంగళార్థ ప్రదాయి, మనోహరుడు, పద్మములవంటి మూడుకన్నులు గలవాడు, చంద్రుని వంటి ఐదు ముఖములు గలవాడు గంగాధరుడు, చంద్రుని శీరోలంకారముగా కలవాడగు శివుని దూరమునుండే చూచెను.

ఆ శివుడు స్వచ్ఛమైన బంగారు పంట జడలు ధరించినవాడు. దిగంబరుడు, ఆంతము లేనివాడు, నాశరహితుడు. నారదుడు చూచిన సమయమున శివుడు ఆకాశగంగలో పుట్టిన నల్లకలువల బీజములలో కూర్చిన మాలలో శ్రీకృష్ణనామజపము చేయుచుండెను. అతడు నీలకంఠుడు. అతని మెడచుట్టు సర్పముండెను. అతడు మృత్యుంజయుడు, కొలయములను ఆంతము చేయువాడు, చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడు, అల్పసంతోషి భక్తులపై ప్రేమగలవాడు. స్వరభేదము లేక ప్రపంచమున నున్న ప్రాణులందరకు వరము లిచ్చువాడు. అతనిని ఎల్లప్పుడు ముని శ్రేష్ఠులు, యోగీంద్రులు, సిద్ధేంద్రులు సేవించుచుందురు.

నారదుడు శంకరుని సమీపమునకు వెళ్ళి, నమస్కరించి మూడు తీగలు కల తన వీణను మ్రోగించుచు మంచికంఠముతో శ్రీకృష్ణుని స్తుతించెను.

శంకరుడు బ్రహ్మ దేవుని పుత్రుడైన నారదుని చూచి చిరునవ్వుతో తన యొద్దనున్న యోగీంద్రులు, సిద్ధేంద్రులు, మహరులతో కలసి పీఠమునుండి లేచి నిలబడి నారదుని కౌగలించుకొని, ఆశీర్వదించి ఆసనమొసగి అతని కుశల ప్రశ్న చేసి, రాకకుగల కారణమడిగేను.

శంకరుడు తన అనుచరులు యోగీంద్రులు, సిద్ధేంద్రులు మహర్షులతో సహ ఆసనమున కూర్చున్నప్పటికి నారదుడు కూర్చొనక చేతులు జోడించి భక్తితో అతనికి నమస్కరించి స్తుతి చేసెను. ఆతరువాత మరల శంకరునకు నమస్కరించి అతని అనుజ్ఞపై శిపుని ఎడమ ప్రక్కనున్న ఆసనమున కూర్చొనెను.నారదుడు తన మనోభిలాషను శంకరునకు తెల్పగా దయాసముద్రుడగు శంకరుడు విని సరేయని అనెను.

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున సౌతి శౌనక మహర్షుల సంభాషణకల బ్రహ్మ ఖండమున కైలాసమునకు  నారదుడు చేరుట అను ఇరువది యెదవ అధ్యాయము సమాప్తము.