వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము

అధ్యాయము 21

కామ్యకవనానికి తూర్పున దేవతలచే సేవింపబడేలతా గృహం ఉంది. ఆ కుంజతీర్థం పుట్టుక వివరాలు తెలియజేయండి.

మునులారా! మీరందరూ, దేనిని విన్నంతనే శ్రీ వామనదేవుని కృపవల్ల ముక్తికలుగుతుందో అలాంటి ఉత్తమమైన వామనపురాణాన్ని శ్రద్దగా వినండి. స్థాణువట సమీపాన, వాలఖిల్యాది మునులు బ్రహ్మపుత్రులైన మహానీయులతో ఆసీనుడైనబ్రహ్మ మానసపుత్రుడు సనత్కుమారుని సమీపించి మార్కండేయముని యొకపరి వినయంగా అబివాదనం చేసి, ఆ సరోవరం యొక్క విస్తారం, మహిమలు, ఉనికీ వివరించవలసినదిగా ఆర్థించాడు. సర్వశాస్త్ర కోవిదుడవైన బ్రహ్మకుమారా! సర్వపాపాలు క్షాలనంచేసే సరోవరమహిమ నాకు తెలుపగోరెదను. ఏఏ తీర్థాలు ప్రత్యక్షంగా ఉన్నవి, ఏ తీర్థాలు గుప్తంగా ఉన్నవి ? స్థాణువుకు అతి దగ్గరగా ఉన్న అతిపవత్ర లింగాలు ఎవ్వి? దర్శనమాత్రాన ముక్తి/సదాలైన ఆ లింగాలను గురించీ, పవిత్ర వటవృక్షదర్శన పుణ్యం, దాని ఉత్పత్తీ, తీర్థప్రదక్షిణ స్నానాల ఫలం వివరించండి. అచట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండే దేవతలనారాధించిన కలుగుఫలం దేవాదిదేవుడైన స్థాణువు సరోవరం మధ్య ఉండుట, శక్రుడా తీర్థాన్ని మట్టితో పూడ్చుట, ఆస్తాణు తీర్థ మహిమ, చక్రతీర్థ సూర్యతీర్థ సోమతీర్థాల మహిమా విశేషాలు వివరించండి. మహామునీ ! బ్రహ్మ ముఖతః తమరు తెలుసుకున్న వివరాలతో, ఈశ్వరుని గుహ్యస్తానాలు విష్ణుస్థానాలు సరస్వతీ వృత్తాంతం దేవాదిదేవుని మహిమ మొదలగునవన్నియు సవిస్తరంగా తెలుపగలరని మార్కండేయ మహర్షి విన్నవించాడు.

మార్కండేయముని మాటలు విన్న వెంటనే బ్రహ్మత్ముడైన ఆ మహాముని, తీర్థము లందు అతి శ్రద్ధ కలవాడై ఎంతో భక్తితో తనపర్యంకాసనముద్రవీడి పరమశివునకు నమస్కరించి తాను పూర్వం బ్రహ్మ వలన విన్నదంతయు చెప్పనారంభించాడు.

ఓ మహామునీ! వరదుడు కల్యాణకరుడునగు మహేశ్వరునకు నమస్కరించి మున్ను నేను బ్రహ్మ వలన వినినట్టి తీర్థముల ఉత్పత్తి ప్రకారం వినిపించెదను. పూర్వం భయంకరమైన జల ప్రళయ మేర్పడి స్థావర జంగమాత్మకమైన జగత్తంతా నశించి పోయింది. సకల జీవసృష్టికి మూలమైన పెద్ద అండం (గ్రుడ్డు) ఒకటి పుట్టింది. ఆ అండంలో ఉన్న బ్రహ్మ వేయియుగాలపాటు నిద్రించి మేలుకొన్నాడు. లోకమంతా శూన్యం కావడం చూచి ఆయన రజోగుణ మోహితుడై సృష్టిచేయ నాలోచించాడు. సృష్టి గుణం రజస్సు, స్థితిగుణం లయంకాగా ఉపసంహారకాలంలో తమోగుణం ప్రవర్తిస్తుంది.యిక ఈ సకల జీవులను వ్యాపించియున్న ఆ పరమ పురుషుడగు భాగావానుదో సకలగుణాలకు అతీతుడు. అతడే బ్రహ్మగా ఈశ్వరుడుగా గోవిందుడుగా పిలవబడే సనాతనుడు. ఆ పరతత్వాన్ని గుర్తించినవానికిసకలం తెలిసి ఉంటుంది. అతడే సర్వజ్ఞుడు. అలా ఆత్మతత్వాన్ని తెలిసికొన్న మహనీయులకు ఈ తీర్థాలు ఆశ్రమాలు యేవీఅవసరం లేదు. నాకు ముక్తులు. సంయమమనే పవిత్ర తీర్థాలతో, సత్యం శీలం సమాధులనే పవిత్రోదకాలతో శోభించే ఆత్మయే పవిత్రమైనది. అందులో స్నానం చేసిన పుణ్యుడు పవిత్రుడౌతాడు. అంతేకాని అంతరాత్మ శుద్ధి నీటివల్ల కలుగనేరదు. కనుక ఆత్మజ్ఞాన సుఖంలో నిమగ్నమై ఉండుటే మానవుడొనర్చవలసిన ప్రధానకర్తవ్యం. అదే తెలియవలసిన ఏకైకవస్తువని, దానిని పొందినవాడు సమస్తమైన కోరికలను వదలివేయుననీ పెద్దలగు సాధువులు చెబుతారు. బ్రాహ్మణుడగువానికి సర్వసమతాభావాలు ఏకత్వం శీలం వదలకుండుట హింసాత్యాగం క్రోధరాహిత్యం ఉపరతి (అసంగం) అనే గుణాలే నిజమైన ధనం. దానిని బోలినవిత్తం మరొకటి లేదు. ఓ బ్రాహ్మణోత్తములారా! సంక్షేపంగా మీకు బ్రహ్మస్వరూపాన్ని గురించి చెప్పాను. దీనిని తెలిసుకున్నవాడు నిస్సందేహంగా పరమబ్రహ్మను పొందుతారు.

ఇక పరమాత్మయగు బ్రహ్మ ఉత్పత్తి వినండి. నారాయణుని విషయంలో ఈ శ్లోకాన్ని సాధారణంగా చెబుతూ ఉంటారు. నీళ్ళు “నార” శరీరం కలవి. (నీటికి నారమని పేరు) వాని మీద శయనించినందుకు నారాయణుడని భగవంతునకు పేరు. జగత్తంతా నీటిలో మునిగి ఉన్నదని తెలిసికొన్న ఆ ప్రభువు ఆ పెద్ద గ్రుడ్డును బ్రద్దలు చేయగా అందులో నుంచి ఓంకారం బయలుదేరింది. అందులోనుంచి భూః , భువః, స్వః అనే మూడు భూర్భువస్వః లోకాలు వచ్చినయి. వానినుంచి తేజస్సు, తత్సవితుర్వరేణ్యం, బయటకు వచ్చింది. ఆ తేజస్సానీళ్ళన్నింటిని ఎండింపజేసింది. మిగిలినది పిండం (కలలం)గా మారింది. దానినుంచి బుడగ ఏర్పడి అదిగట్టిపడింది. ఆ గట్టితనం వల్ల దానిని ధరణి అన్నారు. ఆమెయే సకల జీవులను ధరిస్తుంది. ఆ అండం నిలచిన ప్రదేశమే సన్నిహిత సరస్సు. ఆదిలో వచ్చిన తేజస్సును ఆదిత్యుదన్నారు. లోకపితామహుడైన విరించి గ్రుడ్డుమధ్యలో ఉద్భవించాడు. ఆయనకు పిండం మేరువు, యోనిపర్వాతాలు, సప్తసముద్రాలు వేలాది నదులూ గర్భోదకం (ఉమ్మనీరు) బ్రహ్మనాభి ప్రదేశాన ఉన్న నిర్మలమైన ఉత్తమజలమే ఆ మహాత్సరోవరంలో నిండినది. దానికి మధ్యలో స్థాణురూపమైన వటవృక్షం వెలిసింది. ఆ స్థాణువటం నుండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుద్భవించారు. విప్రుల కార్యసాధనకు శూద్రులు వెలసారు. అంతట అవ్యక్త జన్ముడైన బ్రహ్మ సృష్టికార్యాన్ని ఆలోచించగా ఆయన మనస్సునుండి సనకాది రుషులుద్భవించారు. ప్రజాసృష్టికాయన మరల సంకల్పించుకోగా సప్తరుషులుత్పన్నమైనారు. వారే ప్రజాపతులు.

రజోగుణమోహితుడై బ్రహ్మ మరల ఆలోచించగా తపఃస్వాధ్యాయ నిరతులైన వాలఖిల్యమునులు జన్మించారు. వారు స్నానదేవతార్చన ఉపవాస వ్రతాదులలో మునిగి, వానప్రస్థ పద్దతిలో అగ్నికర్మలు నేరవేర్చుకుంటూ కఠోరమైన తపస్సుతో తమశరీరాలు శుష్కింపజేసుకున్నారు. వేయిదివ్య సంవత్సరాలావిధంగా తపించినందున వారలదేహాల్లోని రక్త మాంసాదులు శుష్కించి కేవలం నాడులు, నరాలు మిగిలిపోయాయి. అలా ఆరాధించినాశంకరుడు ప్రసన్నుడు కాలేదు. తర్వాత చాలాకాలానికి శివపార్వాతులాకాశ మార్గాన పోతుంటే పార్వతి వాళ్ళ ఎండిన దేహాలు చూచి దుఃఖించి భర్తను ప్రసన్నునిగావించి యిలా అన్నది. “ప్రభో! దేవదారువనంలో ఆ మునులావిధంగా కష్టపడుతున్నారు. దయచేసి వారలక్లేశాలు తొలగించండి. ఆస్తికులై వేదధర్మ నిష్ఠతో ఆస్థిశల్య మాత్రావశిష్టులై యింతకాలంగా ఘోరతపస్సు చేసినా యింకా శుద్దులు కాకుండుటకు వీరంతటి దుష్కర్మలు చేశారా ? కనికరించి అనుగ్రహించండి. పార్వతీదేవిమాటలు విని ఆ చంద్రమౌళి, పినాకపాణి, అంధకాంతకుడు చిరునవ్వు నవ్వి యిలా అన్నాడు.

దేవీ! నీవు ధర్మసూక్ష్మం ఎరుగక యిలా అంటున్నావు. వీరింతగా తపించినా ధర్మమెరుగరు. కామక్రోధాదులు వదలలేని మూఢబుద్దులు; నీవేరుగవు” అందులకాతల్లి ప్రభూ : తపోవ్రతనిష్టులైన వీరిని గురించి అలా అనకండి. అనుగ్రహించి వారలకు దర్శనమొసగి రక్షించండి. నాకు చాలా బాధగా ఉంది. అని వేడుకోగా నా దేవదేవుడు నవ్వుతూ యిలా అన్నాడు. అయితే నీవిక్కడనే ఉండి చూస్తూండు. నేను వెళ్లి వారుచేసే కఠోర తపస్సు అసలు రంగు బైట పెట్టెదను. వారల చేష్టితాలు నీకే అర్థమౌతాయి.” అందుకు సంతోషించి పార్వతి భర్తతో మంచిది, నడవండి అలాగే వెళ్లుదాం, నేను కూడా వస్తానని యిద్దరూ బయలుదేరారు. కట్టెపుల్లలు యినుపఊచల్లాగా ఉండి వేదాధ్యయనాలు అగ్నికర్మలు అదేపనిగా చేస్తున్న ఆ మునులను చూచి పరమేశ్వరుడు సర్వాంగ సుందరమూ, దిగంబరమూ, వనమాలాభూషితమైనయువాకృతి ధరించి చేతిలో కపాలం పట్టుకొని ఆ మున్యాశ్రమాల వెంట భిక్షాటనం చేయసాగాడు.

తను ఆశ్రమాల వెంట తిరుగుతున్న ఆ అందమైన యువతపస్విని నగ్నంగా చూచుటతో సహజమైన ఉత్కంటతో ఆ మునుల భార్యలు మోహంలో మునిగిపోయారు. అందరూ ఒకచోటచేరి తమలోతామా సుందరతపస్విని చూచెదమనుచూ కందమూల ఫలాలు తీసికొని భిక్ష పెట్టుటకు బయలు దేరారు. ఆ దేవదేవుడు కూడ “తెండు ! తెండ “ నుచు వారలిచ్చే ఫలాలు స్వీకరించుటకై భిక్షకపలాన్ని చూచి భిక్ష తీసికొంటూ మేలుకలుగుగాక! “ అని నవ్వులొలకబోయసాగెను. ఆయన నవ్వులకు మరింత కామాతిరేకంతో పిచ్చివారై ఆ స్త్రీలు స్వామిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. “ఓయీ తాపస యువకుడా! ఈ విధంగా దిగంబరత్వంతో వనమాలికలు ధరించి భిక్షాటనంచేసే వ్రతం ఎలాటిది? దాని విధానం ఎక్కడ ఉంది? నిన్ను చూచి మా హృదయాలు కరిగిపోతున్నాయి. మేము కూడ అందచందాలలో నీకు తీసిపోము.” ఆ కామార్తల ప్రశ్నవిని శివుడు – సుందరులారా! ఇది చాల రహస్యమైన వ్రతం. దీని విదానం ఫలం పదిమందిలో వెల్లడించకూడదు. కాన మీరు వెళ్ళిపోండి.” అనగానాస్త్రీలు “అలాగైతే ఏకాంత స్థలానికి వెళ్దాం పదండి. అక్కడ మాకు అన్ని విషయాలు చెప్పవచ్చు “ నంటూ ఆయన చేయి పట్టుకొనిరి. కొందరు సుందరాంగనలాయన మెడను మోహావేశంతో పెనవేసుకున్నారు. కొందరు కాళ్ళు, పిక్కలు పట్టుకుంటే కొందరాయన నాభిప్రదేశాన్ని చుట్టివేసుకున్నారు. ఈ విధంగా మోహావేశంలో కన్నుగానక ప్రవర్తిస్తున్న తమస్త్రీల వికారచేష్టలకు మునులు ఆగ్రహోదగ్రులై ఈ దుష్టుని హతమార్చుదము రండు రండంటూ కర్రలూ, రాళ్ళూ తీసికొని ఆయనను ప్రహరిస్తూ ఆయన భీషణ లింగాన్ని నేలపై బడవేశారు. తన లింగం ఊడినేలపైబడిన వెంటనే ఆ మహాదేవుడంతర్హితుడై పోయాడు.

పార్వతితో కలిసి రుద్రుడు కైలాసగిరి చేరుకున్నాడు. దేవదేవుని లింగం భూమిపై పడుటతోనే సృష్టి అంతా అతలాకుతలమై పోయింది. భగవానుని వ్యాకులపాటువల్ల ఆత్మజ్ఞానులయిన ఋషుల హృదయాలు క్షోభించాయి. అంతటనా మునులలో బుద్దిమంతుడయిన ఆతడొకడు, మనము ఆ మహాత్ముడైన తపస్వి సద్భావాన్ని గుర్తించలేకపోయాము. ఇపుడందరం వెళ్లి విరించిని శరణు వేడుదాము. ఆయనే యిందులోని రహస్యం తెలిసినవాడు అని సలహా యిచ్చాడు. ఆ ప్రకారం ఆ మునులందరు తమ తొందరపాటుకు, మూర్ఖత్వానికి సిగ్గుపడి, దేవతల చేత పరివేషితుడైన బ్రహ్మ సన్నిధికి వెళ్లి వ్రణతులై తల వంచుకొని నిలబడ్డారు. అలా దుఃఖితులైన ఆ మునులను చూచి బ్రహ్మ యిలా మందలించాడు. “క్రోధం మిమ్ములను కలషాత్ములను గావించింది. దానికి లోబడి పరమ మూర్ఖులై పోయారు. మూఢబుద్దులారా! మీరలు ఏ మాత్రం ధర్మకార్య స్వభావాన్ని ఎరుగక పోయారు. పరమక్రూర కార్యమాచరించారు. ధర్మ స్వరూపం, సారతత్వం యిప్పుడైనావిని తెలుసుకోండి. ధర్మ స్వరూపం గుర్తించిన విజ్ఞుడు శ్రీఘ్రమే ఉత్తమఫలం పొందుతాడు. ఆ పరమేశ్వరుడు మీ శరీరాల్లోనే, ఆత్మలోనే సదా నిలిచి యున్నాడు. మీకంటె భిన్నుడు కాడు. అనాదితత్వమైన ఆ మహాస్థాణువు, పరమ ప్రకాశవంతమైనమణి ఏ విధంగా తాను కప్పబడిన వస్త్రము యొక్క రంగులోనే పైకి కనపడునో, అదే విధంగా ప్రాణుల దేహంలో ఉంటూ వార కర్మ వాసనల అంతరాన్ననుసరించి భిన్న ప్రకృతుల రూపాన కనిపిస్తాడు. ఆయా జీవుల మనోభావాలచేత పరిచ్చిన్నుడై యుంటాడు. అయితే ఆయనకు వారల కర్మ వాసనలేమాత్రము అంటవు. వారల కర్మానుసారమే స్వర్గ నరకాది భోగాలు అనుభవించడం జరుగుతుంది. కనుక ఈ విషయం గుర్తించి బుద్దిమంతులగు వారు జ్ఞాన యోగాది సాధనల ద్వారా తమ మనస్సులను పరిశుద్ధం గావించుకోవాలి. చిత్తశుద్ది అయిన వెంటనే అంతరాత్మ తనంతతానే నిశ్చలంగా ఉండిపోతుంది. ఎలాంటి వ్యాకులానికి లోను కాదు. అలాంటి మానసిక నైర్మల్యం లేనంతవరకు ఎంతకాలం వ్రతోపవాసాలతో శరీరం శుష్కింపజేసుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. మనస్సును పాపాలనుంచి మరలించేవే సత్క్రియలు. ఈ అనుష్టానాలన్నీ చిత్తశుద్ది కోసమే ఉద్దేశింపబదడినాయి. పాపపంకిలమైన యీ దేహాన్ని శుద్ధి పరచుకొనుటకే లోకంలో ఈ జ్ఞానమార్గం ప్రవర్తితమైనది. అలాంటి సత్ప్రవర్తనకు సాధనభూతంగానే, ఆ పరమేశ్వరుడు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ నేర్పరచినాడు. కాగా ఎక్కువమంది అజ్ఞానాన్ని మోహాన్ని గొప్ప విషయంగా భావించి గొప్పవారమనుకుంటున్నారు . ఇక మీ విషమమే చూడండి. మీరుండేది ఆశ్రమాల్లో. మీ మనస్సులో తిష్టవేసికొని ఉన్నవో కామక్రోధాలు! నిజమైన జ్ఞానులకు యిల్లే ఆశ్రమం. జ్ఞానులు కానివారికి ఆశ్రమాలు యింటి కంటె గూడ నికృష్టమైనవిగా ఉంటాయి. స్త్రీ సంబంధమైన భ్రమలకు లోనైన మీరెక్కడ? నిరీహమైన జీవితమెక్కడ? క్రోదానికి దాసులైన మీరెక్కడ? ఆత్మజ్ఞానమెక్కడ? క్రోదాభిభూతుడు చేసే యజ్ఞాలు, యిచ్చే దానాలు, వేల్చే ఆహుతులు, ఆచరించే తపోవ్రతాదులు బూదిలోపోసిన పన్నీరు వలె నిష్ప్రయోజనకరాలు! ఈ జన్మలో అని ఎలాటి ఫలాన్నీ యివ్వవు. కోపిష్టి చేసే పనులన్నీ వ్యర్థ చేష్టితాలు!

అధ్యాయము 22 complete