వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము

అధ్యాయము 16

పవనకుండంలో స్నానంచేసి మహేశ్వరదర్శనం చేసుకున్నవాడు సర్వపాపాలు పోగొట్టుకొని శివపదవిని పొందుతాడు. పుత్ర శోకంతో వాయువు అందులో లీనుడై పోగా బ్రహ్మాదిదేవతలు ప్రసన్నులై మరల ప్రతిష్ఠింపజేసారు. అక్కడ నుండి దేవగంధర్వుల ద్వారా హనుమంతుడెచ్చట ప్రకటింపబడినాడో, ఆ పవిత్ర శివక్షేత్రం, అమృత క్షేత్ర్రానికి వెళ్ళాలి. అక్కడ స్నానం చేసినచో అమృతత్వం లభిస్తుంది. అంతట తైర్థికుడు కులోత్తారణ తీర్థాన్ని సేవించి తన మాతామహ పితామహాదులందరను తరింపచేస్తాడు. రాజర్షిశాలిహోత్రతీర్థం ముల్లోకాల్లో ప్రసిద్ధిచెందింది. అక్కడ స్నానం చేసి దేహగతాలైన దోషాలన్నీ పోగొట్టుకోవచ్చు. సరస్వతీతటాన ముల్లోకవిఖ్యాతమైన శ్రీకుంజతీర్థం ఉంది. దానిలో భక్తితో స్నానంచేస్తే అగ్నిష్టోమఫలం కలుగుతుంది: అక్కడనుండి నైమిష కుంజాన్ని దర్శిస్తే నైమిషంలో స్నానం చేసిన ఫలకం కలుగుతుంది. అక్కడే మహిమోపేతమైన వేదవతీ తీర్థముంది. అక్కడ రావణుడామే కేశాలు పట్టుకోగా శోకంతో ఆమె అతని వధార్థం శరీరత్యాగం చేసింది. సీత అనే పేరుతో జనకునకు పుట్టి రామపత్నిగా విఖ్యాతి వహించింది. ఆ పతివ్రతను రావణుడు ఆత్మనాశనానికై అపహరించికొనిపోగా రాముడాతనిని వధించి విభీషణుడిని లంకాధిపతిని చేశాడు. ఆ సాధ్విని మరల తన యింటికి గొనిపోయినాడు. అలాంటి పవిత్రవేదవతి తీర్థంలో స్నానంచేస్తే సమస్తపాపాలు పోయి కన్యాయజ్ఞఫలం కలుగుతుంది. పరమపదం లభిస్తుంది.

అచటనుంచి బ్రహ్మకు ఉత్తమస్థానమైన క్షేత్రానికి పోవాలి. అక్కడ స్నానంచేసినచో నిమ్న వర్ణాలవారు కూడా బ్రాహ్మణ్యం పొందుతారు. పరమపదం పొందుతారు. తర్వాత త్రైలోక్య దుర్లభమైన సోమతీర్థానికి వెళ్ళాలి. అక్కడ తపస్సు చేసి సముడు ద్విజరాజ్యాన్ని పొందాడు. అక్కడ స్నానం చేసి దేవపితృ తర్పణములు చేస్తే పాపరహితుడై కార్తీకపూర్ణిమా చంద్రుడిలాంటి స్వర్గాన్ని పొందుతాడు. సుప్రభ కాంచనాక్షి విశాల, మానసహ్రదా, సరస్వత్యోఘనామ సువేణా, విమలోదక అనే సప్తసరస్వతులు ఏకమై ప్రవహించే సప్తసారస్వత తీర్థం ముల్లోకాల్లో ఎన్నదగినది. పుష్కర క్షేత్రంలో యజ్ఞం చేస్తున్న బ్రహ్మనుచూచి ఋషులు, నదీ శిరోమణి అయిన సరస్వతి లేని చోట తల పెట్టిన ఆ యజ్ఞం సత్ఫలం యివ్వదని వచింపగా సంప్రీతుడై పితామహుడు సరస్వతిని స్మరించాడు. అలా బ్రహ్మచే పిలువబడి సుప్రభాదేవి సరస్వతిగా పుష్కరక్షేత్రానికి చేరుకుంది. బ్రహ్మ మీది గౌరవంతో వడివడిగా వచ్చిన ఆ సరస్వతిని చూచి సంతోషించి ఋషులు గౌరవించారు. పుష్కర క్షేత్రంలో ఉన్న సరస్వతి మహాత్ముడగు మంకనుని ద్వారా కురుక్షేత్రానికి కొనిరాబడినది.

శౌనకాది మహామునులు నైమిశారణ్యంలో పౌరాణికోత్తముడైన లోమహర్షుణుని అడిగారు. “మేము సన్మార్గాన నడుస్తూ యజ్ఞఫలం పొందేమార్గం తెలుపండి. అంతటనా మహానీయుడా ఋషులకు శిరసాప్రణామంచేసి అన్నాడు. సరస్వతీనదీ ఉన్న ప్రదేశం గొప్పయజ్ఞ ఫలాన్ని యిస్తుంది. అంతట స్వాధ్యాయపరులయిన ణా ఋషులు ఒకచోట చేరి సరస్వతిని స్మరించారు. సత్రయాగ నిష్ఠులగువారు ధ్యానించగానే వారల స్నానార్థం సరస్వతీ వారియజ్ఞ స్థలాన్ని చేరుకుంది. మంకజ మహర్షి ధ్యానించగానే కాంచనాక్షియను సరస్వతి నైమిషంనుండి కురుక్షేత్రానికి వచ్చి చేరింది. గయుడను రాజు గయలో మహాక్రతువు ఆరంభించి అచటకు నదీశిరోమణి సరస్వతిని ఆహ్వానించాడు. అలా గయను చేరిన సరస్వతిని విశాల అంటారు. అ సరస్వతే మంకణుని ప్రార్థన మన్నించి కురుక్షేత్రం చేరింది.

దేవర్షిసేవితమైన ఉత్తరకోశల పుణ్యభూమికి ఉద్ధాలకముని ధ్యానించగా సరస్వతి వచ్చి చేరినది. అచట నా శ్రేష్ఠ తరంగిణిని వల్కలాజిన ధారులైన మునిసమూహం పూజించినది. సర్వపాపహారిణి అయిన ఆ నది మనోహరగా పిలువబడినది. ఆ నది మంకణుని ప్రార్థన నంగీకరించి ఋషులపట్ల గౌరవంతో కురుక్షేత్రానికి వచ్చింది. కేదార తీర్థంలో ఉన్న సరస్వతిని సువేణు అంటారు. ఋషులు సిద్దులచే సేవింపబడిన ఆమె సర్వపాపహారిణి. ఆ మునియే పరమేశ్వరుని ఆరాధించి ఆమెను కూడా ఋషుల ఉపకారార్థం పవిత్రకురుక్షేత్రానికి రావించాడు. ఆ సరస్వతీ పుణ్యనదియే యజ్ఞదీక్షితుడైన దక్షునిచేత గంగాద్వారంలో విమలోదక రూపాన వెలువరింపబడింది మహాత్ముడైన మంకణుని పిలుపునందుకొని ఆమె కూడ కురురాజు యజ్ఞస్థలమైన కురుక్షేత్రం చేరుకొంది. మహానుభావుడైన మార్కండేయ ముని స్తోత్రానికి సంతోషించి ఆ పుణ్యోదక సరస్వతీ సరోవర మధ్యస్థలానికి వచ్చి చేరింది. మహాదేవుని చేత నివారింపబడిన సిద్ధుడు మంకణుడా సప్తసారస్వత క్షేత్రంలో ఆనంద నటనం చేస్తూ ఉన్నారు.

అధ్యాయము 16 complete