వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము

అధ్యాయము 9

లోమహర్షణుడిలా చెప్పనారంభించెను. ప్రహ్లాదుడు పలికిన క్రోధపూర్ణవచనాలు విని ఆ దైత్యేశ్వరు డాయనాను ప్రసన్నుని గావించుకొనుటకై మాటిమాటికి మ్రొక్కి యిట్లనెను.

పితామహా! ప్రసన్నులుకండు! మొహోపహతుడనైన నా పై కోపించకుడు. దేహబల గర్వంతో అలామాటాడినాను. దైత్యోత్తమా! మూర్ఖత్వం నావివేకాన్ని నశింపజేసింది . నేను పాపిని దుర్మార్గుడను. నన్ను మీరు శపించుట మంచిదే. మీరు చెప్పినట్లు నా అవినయం వల్ల రాజ్యనాశాన్నీ కీర్తి నాశనాన్ని పొంది విషన్నుడనగుట నాకు యుక్తమే. త్రైలోక్యరాజ్యాదికారం యితర ఐశ్వర్యాలు సంపాదించుట కష్టమైన పనికాదు. కాని తమబోటి గురుజనులు లభించుట ఎంతో కష్టము. కనుక తాతా! నన్ను కరుణించి కోపించకుము. నీ కోపాగ్నిలో దగ్దుడనై రాత్రింబవళ్ళు పరితపిస్తుంటాను.

వత్సా! కోపం నన్ను మూర్ఖుణ్ణి చేసింది. అంచేత వివేకం నశించి నిన్ను శపించాను. మోహంవల్ల నావివేకం నశింపకపోతే శ్రీహరి సర్వజ్ఞుడని తెలిసియూనేనెందుకు శపించాలి? నేనిచ్చిన శాపం నీ వనుభవింపక తప్పదు. అయితే విచారించవద్దు. ఈ క్షణాన్నుంచీ నాదేవదేవుని అచ్యుతుని భక్తితో ఆరాధించుము. ఆ ఈశ్వరుడు నిన్ను రక్షించగలడు. వీరాగ్రణీ! నేను శపించినందున ఆదేవదేవుని నిరంతరస్మరణ నీకు లభించినది. నీ భావి శ్రేయస్సుకు తగిన ఉపాయాలు నేను చెబుతూ ఉంటాను. భయపడకు.

మహర్షులారా! సకల కామదాయియయిన వరం పొందిన వెంటనే అదితి గర్భంలో దేవదేవుడు క్రమంగా పెరగడం మొదలు పెట్టాడు. పదవ నెలలో ప్రసవ సమయాన భగవంతుడగు గోవిందుడు వామనాకృతితో జన్మించాడు. ప్రభువు అవతార సమయాన దేవతలకు దేవమాతకు సకల దుఃఖాలు తొలగిపోయాయి. వాయువులు సుఖ స్పర్శతో వీచాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. సకల జీవులలోను ధర్మాసక్తి పెరిగింది. మానవులకు శరీర బాధలు తొలగి పోయాయి. భగవంతుడు జన్మించిన వెంటనే లోకపితామహుడైన విరించివచ్చి ఆయనకు జాతకత్మాదులు చేసి యీ విధంగా స్తోత్రం చేశాడు.

సర్వాదీశా! సర్వాజేయా, నీకు జయమగుగాక, విశ్వగురూ నీకుజయము. శ్రీహరీ, జన్మమృత్యురాతీతా, అచ్యుతా జయము జయము! ఆశేషా, అవ్యక్తరూపా, సర్వజ్ఞా, పరమార్తరూపా, జ్ఞానజ్ఞేయసారరూపా, జగత్సాక్షీ, జగత్కారణా , జగద్గురో , జగత్ స్థితిపాలకా నీకు జయమగుగాక! సకల జీవహృదయ నివాసా, ఆదిమధ్యాంతమయా, జ్ఞానమయా ! ముముక్షువులకు గూడ నిర్దేశించినలవిగానివాడా, నిత్యహృష్టా, దయాది సద్గుణభూషణా, అతిసూక్ష్మా, స్థూలా, దుర్జేయా సర్వమయా జయము. ఇంద్రియరూపా, ఇంద్రియరహితా, స్వమాయా యోగాస్తితా, శేషశాయీ నీకు జయము జయము! నిజదంష్ట్రాగ్రభాగాన వసుంధరను నిలిపినప్రభూ, నృకేసరీ, దేవశత్రు వక్షఃస్థల విదారణా ప్రస్తుతం కపట వామన రూపం దాల్చిన విశ్వాత్మకా కేశవా నీకు జయము. స్వీయమాయా పరిచ్చిన్నా! జగద్దారకా, జనార్దనా, అనేక స్వరూపాలలో వెలిగే ఏకైకతత్వమా, బహువిధ ప్రకృతి వికృతుల పెంపొందించువాడా నీకు జయము. నీవు వర్దిల్లుము. జగదీశుడవగు నీవు ధర్మానికి మూలాధారుడవు. ఇలాంటి నిన్ను నేనుగాని ఈశుడుగాని ఇంద్రాది దేవతలుగాని సనకాది మునులు యోగులుగాని తెలియజాలరు. నీవు స్వీయ మాయ అనే తెరమరుగున ఉంటావు, అలాంటి మాయాపతిని నిన్నెరుగ గలవారెవ్వరు? నీ అనుగ్రహం కలిగిన వాడే నిన్నెరుగ గలడు. నిన్నారాధించి నీ కృపకు పాత్రుడగువాడే నిన్ను గుర్తించును. ఓ ఈశాన, ఈశ్వరేశ్వర భూతభావనా వర్ధిల్లుము. ఓ విశాలనేత్రా! విశ్వాత్మా! విశ్వకళ్యాణార్థం నీవు వర్ధిల్లుము. ఓ విశాలనేత్రా! విశ్వకళ్యాణార్థం నీవు వర్ధిల్లుము. నీకు జయమగుగాక!

బ్రహ్మస్తోత్రం విని వామనాకృతి దాల్చిన ఆ హృషీకేశుడు చిరునవ్వు నవ్వి భావగంభీరముగా నిట్లనెను. విరించీ! నీవు యింద్రాదులు కశ్యపుడు పూర్వం నన్ను స్తుతించగా యింద్రునకు ముల్లోకాలు యిస్తానని పతిజ్ఞ చేసియున్నాను. తర్వాత అదితి స్త్రోత్రం విని ఆమెకూ, శక్రునకు త్రిలోకాధిపత్యం యిస్తానని మాటయిచ్చి యున్నాను. ఇంద్రుని జగత్తుకు అధిపతిని చేసి ఆమాట నిలబెట్టుకుంటాను . సహస్రాక్షుడు రాజగుట తథ్యము. అంతట పొట్టివడుగునకు బ్రహ్మకృష్ణాజినం బృహస్పతి యజ్ఞోపవీతం బ్రహ్మతనయుడు మరీచి ఆషాఢదండాన్ని వసిష్టుడు కమండలం అంగిరసులు పట్టుపుట్టము, పులహుడు ఆసనం పులస్త్యుడు పీతాంబరం యిచ్చారు. ప్రణవ ఓంకారం, స్వరాలచేత ముస్తాబై సకలవేదాలు, శాస్త్రాలు సాంఖ్యయోగ విద్యలు ఆ ప్రభువును ఆశ్రయించాయి. జడలు, దండక మండలు ఛత్రాలు ధరించి సర్వాదేవమయుడైన ఆ వామనుడు బలియజ్ఞ వాటికలో ప్రవేశించెను. ఆ పొట్టివాడు తన చిట్టిఅడుగు పెట్టినచోటల్లా భూమిపీడితురాలై వివరం (రంద్రం) యిచ్చింది. అలా మెల్లగా అడుగు పెడుతూ నావామనుడు నడువగా సముద్ర పర్వత ద్వీపాదులతో కూడిన భూమి అంతా కంపించింది. బృహస్పతి మెల్లమెల్లగా శివంకరమైన చక్కని మార్గం చూపిస్తూ ఉండగా నాకుహనావటువు ఆటలలోవలె సరదాగా అతిమందగమనంతో పయనించాడు. అంతట పాతాళా న్నుంచి మహానాగం శేషుడు బయలుదేరివచ్చి దేవదేవుడైన నాచక్రితోడైనాడు. ఆ ఉత్తమమైన శేషబిలం ఈనాటికీ ప్రసిద్ది వహించి యున్నది.దానిని చూచినవారలకు సర్పభయం ఉండదు.

అధ్యాయము 9 complete