వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము

అధ్యాయము 4

ఓ మహాబలులారా! మీరిచటకు వచ్చిన కారణం నేను ముందుగానే తెలిసికొని ఆ విషయమే ఆలోచిస్తున్నాము. మీ కోర్కె ఫలించగలదు. దానవనేత బలిని నిర్జించు మహాత్ముడు పుట్టగలడు. సమస్త విశ్వాన్నీ సృష్టించగల ఆ మహనీయుడు మిమ్ములను నన్ను మాత్రమేకాక ముల్లోకాలను ఉద్ధరించి మనందరకు నాయకుడు అవుతాడు. సకల విశ్వనిర్మాత, ఈశ్వరుడు, సనాతనుడనగు ఆ ప్రభువు సృష్టికన్నా పూర్వంనుంచి ఉన్న శాశ్వతుడు. ఆ పురుషోత్తమునిగా నేనుగాని మీరు గాని వేదాలుగాని ఎవడో ఎలా ఉంటాడో అనే విషయం ఎవ్వరూ ఎరుగరు. అయితే ఆ మహాత్ముడు మాత్రం మనలను వేదాలను విశ్వాన్నీ చక్కగా ఎరిగియున్నాడు. ఆ ప్రభువు అనుగ్రహం చేతనే మీకు చక్కని ఉపాయం చెబుతున్నాను. దాని ప్రకారం యోగ దీక్షతో తీవ్రంగా తపస్సు చేయాలి. ఉత్తరదిశన క్షీరసముద్రానికి ఉత్తరాన ఆ విశ్వ ప్రభువు నివాసం “అమృత” మని కలదు. మీరచటకు వెళ్లి వ్రతదీక్షబూని దుష్కరమైన తపస్సు చేయండి. అప్పుడు మీకు వేసవి చివర తొలకరి మేఘ ధ్వని లాంటి స్నిగ్ధ గంభీరమైన ధ్వని యొకటి రమ్యంగా అభయ ప్రదంగా మంగళకరంగా నిండుగా కర్ణ ప్రియంగా వినిపిస్తుంది. ఆ వాణి పరమ సంస్కృతమైనది. దివ్యమైనది. సత్యమై సత్య నిర్మాణ దక్షమైనది. అది మీకు వ్రత దీక్షా, సమాప్తి సమయాన ఆ పురుషోత్తముని ముఖ నిర్గతమై ఆమోఘ ప్రభావం కలిగి శ్రవణ గోచరము కాగలదు.

అప్పుడు నారాయణుడు – ఎవరికి ఏ వరం కావాలి –కోరుకొనుడు. నేనిచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. నా వద్దకు వచ్చిన మీకందరకు స్వాగతమని ప్రశ్నించును. వెంటనే అదితి కశ్యపులు ‘ప్రభూ’ మీరు మా కుమారుడుగా జన్మించండి అని కోరగలరు. ప్రణామ పూర్వకంగా మీరు యాచించినంతనే ఆ సర్వేశ్వరుడు తథాస్తని కరుణించును. బ్రహ్మదేవుని మాట విని అదితి కశ్యపులతో సహా దేవగణమంతా ఆయనకు శిరసాప్రణమిల్లి అట్లే చేయగలమనిరి. అంతట వారందరు దక్షిణ దిశగా శ్వేతద్వీపానికి ప్రయాణించి అల్పకాలంలోనే నదీపతి క్షీరసముద్రాన్ని చేరుకున్నారు. దారిలో సర్వ సముద్రాలను, పర్వతారణ్యాలను నదీనదాలను భూములను సత్యవాదియగు విరించి చెప్పినట్లు దాటి వారలు మహా భయంకరమైన అంధకారంలో ప్రవేశించారు. అచట సూర్యుడు లేడు. ఎలాంటి జీవ రాశులు లేవు. దానికి అవధులు లేవు. ఎటు చూచినా చీకటి. ఆ అమృత స్థానానికి చేరి కశ్యపుడు, దేవతలందరకూ కామ్యాలు తీర్చే సహస్ర వర్షవ్రత దీక్షయిచ్చాడు, అందరూ శ్రీ మన్నారాయణుని గూర్చి మౌనంగా, బ్రహ్మచర్య యోగదీక్షతో, వీరాసనాలు వైచికొని ఉగ్రమైన తపస్సు ప్రారంభించారు. శ్రీ పురుషోత్తముని ప్రసన్నుని గావించుటకై కశ్యపుడు వేదోక్త విధానాన స్తోత్రం గావించాడు.

అధ్యాయము 4 complete