వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము
అధ్యాయము 11
కురుక్షేత్రం గుండా ప్రవహించే నదులలోకెల్ల ఉత్తమమైన సరస్వతినది ఎలా పుట్ట్టింది ?సరోవరంలో చేరి, తన తటాన అనేక తీర్థాలు నెలకొల్పి, దృశ్యాదృశ్య గమనంతో ఈ పవిత్ర స్రోతస్విని, పశ్చిమాభిముఖంగా ఎల్లా ప్రవహించింది? అతి ప్రాచీనమైన తీర్థముల వంశ క్రమమంతా మాకు వివరంగా చెప్పండి.
“స్మరణ మాత్రాన్నే సర్వపాపాలు పోగొట్టునదీ, అతిప్రాచీనమైనది అయిన సరస్వతీ ప్లక్ష (మేడి) వృక్షం నుంచి ఉద్భవించింది. వేల పర్వతాలను చీల్చుకుంటూ, ఆ మహానది తన పుణ్య జలాలతో ద్వైత వనంలోకి చేరింది. ప్లక్ష వృక్షంలో ఉండగా నామేను చూచిన మార్కండేయ మహాముని శిరసా ప్రణామం చేసి ఆ దేవిని స్తోత్రం చేశాడు. “దేవీ! నీవు సర్వలోక జననివి. మంగళ మూర్తివైన దేవమాతవు (దేవారణివి) సదసద్రూపమైనదంతయూ, మోక్షదాయి అయినదీ, అర్థవంతమైన పదమేదైతే కలదో అదంతయూ యోనిలో సర్వంనిహితమైనట్లు, నీలో గర్భితమై ఉన్నది. అక్షరమైన పరబ్రహ్మతత్వం, క్షరాత్మకమైన(మారుతున్న) విశ్వం అంతయు పరాశక్తివగు నీలో యిమిడియున్నది. దారువు(కొయ్య)లో అగ్నివలె, భూమిలోగంధ(వాసన) గుణం మాదిరి అనంతమైన జగత్తు, బ్రహ్మతత్వం నీలో నిండియున్నది. ఓ దేవీ! ఓంకారంలోని స్థిరాస్థిరమైన త్రివర్ణమాత్రాక్రమం, ఉన్నది లేదను భావం, మూడులోకాలు, మూడువేదాలు, ధాతువులు, అవస్థాత్రయం, పితరులు, మాత్రాత్రయం మొదలుగాగల త్రిపుతి అంతా ఓ సరస్వతీదేవీ, నీ రూపమే పరతత్వం యొక్క విభిన్న దర్శనాలన్నీ సనాతనివగు నీ లీలలేనమ్మా!
“ఓ దేవీ! బ్రహ్మవాదులగువారు నిన్ను ఉచ్చరించిన మాత్రాన్నే సోమ, హవిర్ః పాకయజ్ఞాలు చేయగలుగుచున్నారు. అర్ధమాత్రాపరిమితమైన నీ పరమపదమట్టిదని నిర్దేశింపరాకున్నది. అది అవికారి అక్షయమైనది దివ్యమైనది సర్వపరిణామరహితమైనది అట్టినీ దివ్య రూపాన్ని నేనేకాదు యితరు లెవ్వరును వర్ణింపజాలరు. నోటికిగాని నాలుకకు గాని తాలువులు పెదవులకు గాని దానిని వర్ణించగల శక్తిలేదు.ఆ నీ రూపమే విష్ణువు, శివుడు, బ్రహ్మ, సూర్యచంద్రాగ్నులు, ప్రపంచానికి ఆశ్రయం, విశ్వమే. విశ్వం యొక్క ఆత్మ, సాంఖ్యం, బహు శాఖావిస్త్రుతమైన వేదములద్వారా అది మధ్యాంతహీనమనీ, సత్తనీ, అసత్తనీ, చెప్పబడినది. ఒకటి అయిగూడ అనేకము. ఒకే భావాన్ని ఆశ్రయించియున్నది. పేరు లేనిది, అయినా ఆరువిధాల అనేక విధాల పేర్కొనబడినది. త్రిగుణాలతో గూడినది నానాశక్తుల తత్వం తెలిసినది, నానాశక్తుల సంపుటి అయినది. సుఖాలన్నింటికి సుఖమైనది. సర్వతత్వ గుణాత్మకమైనమహా సుఖమే ణీ రూపం. సగుణ నిర్గుణాత్మకమైన ఈ విశ్వాన్నంతా ఓ భగవతీ! ఇలాంటి అద్భుతరూపంతో ఆవరించియున్నావు! అద్వయ బ్రహ్మగా, ద్వైతబ్రహ్మగా నీవే వ్యవహరిస్తున్నావు! ఈ భూమి మీద గాని, అంతరిక్షంలో గాని యితరత్రాగాని ఉన్నట్టి, శాశ్వత అశాశ్వత స్థూల సూక్ష్మాది వస్తుజాలమంతకు నాధారము నీవే! రూపు కట్టియు, కంటికగపడకయు, ఒకటి గాను, అనేకంగాను, వ్యస్తంగాను, సమస్తంగాను కనుపించే ఈ అఖిలము ఓ దేవీ! నీవగుస్వర వ్యంజనాల సమాహారమే! మనోహర విన్యాసమే!” తననీ విధంగా స్తుతించిన మహాత్ముడగు మార్కండేయ మహామునితో విష్ణు జిహ్వ అయిన ఆ సరస్వతీదేవీ యిలా పలికినది. విప్రోత్తమా! ణీ వెచ్చటకు గొనిపోవుదువో అచ్చటకల్లా నీవెంట అవిశ్రాంతంగా వస్తున్నాను. నడువుము.”
“తల్లీ మొదట బ్రహ్మ సరోవరం అనంతరం రామసరస్సుగా, ఆ తర్వాత మహర్షి కురువు చేతదున్నబడి కురుక్షేత్రంగా విఖ్యాతిగాంచిన పవిత్రక్షేత్రం మధ్యనీ పావన జలాలతో త్వరితంగా ప్రవహింపు” మనెను.
అధ్యాయము 11 complete
