వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము

అధ్యాయము 6

బ్రాహ్మణ శ్రేష్టుడు బ్రహ్మజ్ఞుడునైన కశ్యపుడొనర్చిన ఆ ఉత్తమ స్తోత్రాన్ని విని సంతోషించి నారాయణుడు స్పష్టంగా చక్కని మాటలలో, ఓ దేవతలారా ! మీకు కావలసిన వరమడుగుడు; యిచ్చేదను. మీకు కల్యాణమగుగాక యనెను. అప్పుడు కశ్యపుడిట్లనెను. ఓ దేవశ్రేష్టా ! మీరు మాయందు ప్రసన్నులగుట నిశ్చయము. దయచేసి యింద్రునకు తమ్ముడవుగా, అదితికి పుత్రుడవుగా, జ్ఞాతిలోకాని కానందవర్ధనుడవుగా జన్మించుము. దేవమాత అదితి కూడా నాడే సంకల్పంతో ణా వరదేశ్వరుని తన గర్భమున జన్మించుమని యాచించినది. దేవతలందరు ణా మహేశ్వరుని తమకు అధినాతుడుగా రక్షకుడుగా నుండవలసినదని శరణువేడిరి. అంతట ణా విష్ణుడు కశ్యపునితో సమస్త దేవతలలో , మీ శత్రువులనందరను ముహూర్తమాత్రాన సలహరించి యజ్ఞభాగభక్కులైన దేవతలకుహవ్యాలు, పితృదేవతలకు కావ్యాలు మరల యిప్పించగలను. మీరు మీమీ ప్రదేశాలకు మరలి వెళ్ళుడనెను.

ప్రభవిష్ణుడైన విష్ణుదేవుని మాటవిని సంతుష్టాంత రంగులై అదితి కశ్యపులతో కూడిన విశ్వీదేవతలందరు నా దేవదేవునికి పూజా నమస్కారాదు లర్పించి త్వరగా తూర్పు దిశగా పయనించి విశాలమైన కశ్యపాశ్రమానికి వెళ్ళారు. కురుక్షేత్రవనమైన ఆ ఆశ్రమానికి వెళ్లి దేవమాత అదితిని ప్రసన్నురాలిని గావించుకొని ఆమెను తపో దీక్షలో నిలిపిరి. ఆ సాధ్వియు పదివేల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసింది. సర్వకోర్కెలు తీర్చే ఆ వనం ఆమెపేర ప్రసిద్ధి చెందింది. వాక్ నియమంతో వాయు భోజనం చేస్తూ తపించే ఆమె, రాక్షసులచే నోటువడిన తన పుత్రుల తలంచుకొని తన మాతృత్వము వ్యర్థమైనదని నిర్వేదం పొందినది. ఆవేదనకు శ్రీహరి మీద ప్రేమతోడుకాగా పరమార్థబోధకాలయిన శ్రేషవచనాలతో ఆమె సర్వలోక శరణ్యుడు, భక్త వత్సలుడు, దేవదైత్యమయుడు నాదిమధ్యాంతస్వరూపి అయిన మహావిష్ణువు నిట్లు స్తుతించెను.

అదితిస్తోత్రం. కృత్యాభిచారాదిపీడితుల ఆర్తి పోగొట్టు వానికి నమస్కారము. పద్మమాలాధరునకు పరమ కళ్యాణ రూపికి మొదలి బ్రహ్మకు నమస్సులు. పద్మనేత్రునకు పద్మనాభునకు పంకజ సంభవ జనకునకు ఆత్మయోనికి లక్ష్మీపతికి దాంతునకు దృశ్యజగత్తునియామకునకు, చక్రధరునకు, పద్మపాణికి, ఖడ్గదారికి హిరణ్యరేతునకు నమస్సులు. ఆత్మజ్ఞానయజ్ఞ రూపికి, యోగిధ్యేయునకు మహాయోగికి, నిర్గుణునకు విశేషునకు బ్రహ్మరూపియగు శ్రీహరికి ప్రణామములు. జగత్తులో ఉంటూనే దాని కగోచరుడగు వానికి స్థూలునకు అతి సూక్ష్మునకు శార్జ్గుపాణికి నమస్కారము. ప్రపంచాన్నంతా చూడగలిగిన చూపుగలవారలెవని చూడజాలరో జగద్ద్రుష్టి వదలినవారవనిని తమహృదయంలోనే చూడగలరో అట్టివానికి నమస్కారము. బయటి వెలుగులో ఎవడుకనిపించడో ఎవడు సమస్త వెలుగులకు వెలుపలి తత్వమో ఈ విశ్వమంతా ఎవనిలో ఎవని నుంచి ఎవని రూపాన విస్తరించి ఉన్నదో అట్టి సర్వజగన్మయునకు మరల మరల నమస్సులు. సర్వానికి ఆద్యుడు, ప్రజాపతి, పితరులకు పరమాధిపతి, దేవనాథుడనగు శ్రీకృష్ణునకు నమస్కరించుచున్నాను! ప్రవృత్తి నివృత్త్యాత్మకములగు కర్మలెవరినంటజాలవో, స్వర్గాపవర్గ ఫలములొసంగ గల ఆగదాధరునకు ప్రణామములు. స్మరణమాత్రాన్నే సమస్త పాపములు పోగొట్ట జాలిన శుద్ధస్వరూపియగు శ్రీహరి మేధునకు నమస్సులు. అఖిలాదారుడు ఈశ్వరుడు అజుడు అవ్యయుడైన ఏ ప్రభు దర్శనం చేయువారలు జన్మమరణాల నుండి ముక్తులగుదురో అట్టి మహానీయునకు ప్రణామములు. యజ్ఞపరములగు జ్ఞానులచే యజ్ఞ రూపాన యజ్ఞసంస్థితుడై ఆరాధింపబడు యజ్ఞపురుషుడైన విష్ణువునకు పరమేశ్వరునకు వందనములు. వేదవిదులగు జ్ఞానులచేతను కీర్తింపబడు శాశ్వతుడగు వేదవేద్యునకు విష్ణువుకు నమస్కారములు. ఎవనినుండి విశ్వం జనించునో ఎవని యందుండి ఎవనిలో లయమగునో అట్టి విశ్వోద్భవ ప్రతిష్ఠుడగు మహాత్మునకు ప్రణామము. బ్రహ్మ మొదలు గడ్డి పోచవరకు గల ఈ చరాచర ప్రపంచమంతా ఎవనిచే పరివేష్టితమైనదో అట్టి మాయా శక్తి సమన్వితుడైన ఉపేంద్రునకు నమస్కారము. ఎవడు తోయస్వరూపస్థితుడై (నారాయణుడై ) ఈ అఖిల విశ్వాన్ని ధరించి రక్షించుచున్నాడో అట్టి విశ్వరూపుడు విశ్వపతి అయిన విష్ణుదేవునకు నమస్కారము. అసుర తత్వ రూపాన దైత్యులలోని తమస్సును, నైశాంధకారాన్ని పోగొట్టు సూర్యునివలె, నశింపజేయునుపేంద్రునకు నమస్కారము. జీవుల శుభాశుభ కర్మలు, రాత్రింబవళ్ళు సూర్య చంద్రులనే నేత్రాలతో చూచుచుండు ఉపేంద్రునకు నమస్కారము. ఆ సర్వేశ్వరునియందే ఈ సకలం యిమిడియున్నదని చెప్పినది సత్యము. అది అనృతం కాదు. అలాంటి జన్మరహితునకు అవ్యయుడగు ప్రభువునకు శ్రీమహావిష్ణువుకు మాటిమాటికి నమస్కరించెదను.ప్రభూ, జనార్ధనా! నేను చెప్పినదంతయు సత్యమగుచో, ఆ సత్య ప్రభావం వల్ల ణా మనోరథాలన్నీ సఫలమగు గాక !

అధ్యాయము 6 complete