వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము
అధ్యాయము 17
మంకణకుడెలా సిద్దుడయ్యాడు? ఆయన ఎవరి కుమారుడు? ఆ మహర్షి నృత్యం చేస్తుంటే శివుడేల నివారించాడు?
మంకణముని కశ్యప మహర్షి మానసపుత్రుడు. ఒకనాడాయన వల్కలాలతో స్నానంచేయనుద్యుక్తుడయ్యాడు. బ్రాహ్మణులారా! అప్పుడచటకు సుందరులు ప్రియదర్శనలు కొమలాంగులయిన రంభాది అప్సరసలు కూడ వచ్చి ఆయనతో బాటు స్నానం చేయసాగారు. వారలను చూచి మనస్సు చలించి ఆ ముని వీర్యం నీటిలో జారి పడగా నాతపస్వి దానినొక కలశంలో పట్టివేశాడు. కలశంలోని వీర్యం ఏడుభాగాలయి అందులో నుండి సప్తమరుద్గణాలు, వాయువేగ, వాయుబల, వాయుహా, వాయుమండల, వాయుజ్వాల, వాయురేత, వాయుచక్రులను మహావీర్యవంతులుద్భవించారు. ఆ ఋషికి పుట్టిన ఆ ఏడుగురు కుమారులు ఈ చరాచర జగత్తును ధరించియున్నారు. సిద్ధపురుషుడైన ఆ మంకణకుడు పూర్వమొకసారి కుశాగ్రలతో చేయికోసుకున్నట్లు ఆ వ్రణంలోనుండి శాకరసంస్రవించినట్లు విన్నాను. చేతినుండి కారుచున్న ఆశాకరరసాన్ని చూచి ఆయన ఆనందంతో నాట్యం చేయసాగాడు. ఆనాటోద్ధతికి స్థావరజంగమాలన్నీ నాట్యం చేయసాగాయి. ఆయన తేజస్సుకు మోహం చెంది జగత్తంతానాట్యం చేయడంతో బ్రహ్మాదిదేవతలు తపోధనులయిన ఋషులందరూ కలిసి మహాదేవుని దర్శించి యిలా ప్రార్థించారు. ప్రభూ! ఈ మునిని నృత్యం చేయకుండా నివారించండి. అంతట శివుడు హర్షోన్మత్తుడయిన మునిని చూచి దేవహితం కోసమై యిలా ప్రశ్నించాడు. ఓ మునిసత్తమా! ఓ బ్రాహ్మణోత్తమా! ధర్మపథాన నడచుచున్న నీకింతటి హర్షాతిరేకం కలుగుటకు కారణమేమిటో చెప్పవలయును.
భగవాన్! నాచేతినుండి కారుచున్న శాకరసాన్ని చూడటంలేదా? దానిని చూచియే ఆనందంతో గంతులు వేస్తున్నాను. ఆ మాటకు నవ్వి పరమేశ్వరిడిలా అన్నాడు. ఓ రాగమోహితుడవైన మునీ! ఇందులో నాకేమీ ఆశ్చర్యం కనిపించుటలేదు! ఆ మాట చెప్పి ఆ మహాతేజస్వియైన దేవదేవుడు తన వ్రేలి చివర భాగంతో బొటన వ్రేలిని ప్రహరించాడు. అంతట అందులోనుంచి తెల్లని మంచులాంటి భస్మం బయటకు వచ్చింది. అదిచూచి సిగ్గుపడి ఆ మంకణుడు పరమేశ్వరుని పాదాలమీద వ్రాలి యిలా ప్రార్థించాడు. ప్రభూ! శంకరా! నిన్ను మించిన దేవుడున్నాడని నేననుకోను. చరాచర జగత్తులో శూలపాణివగు నీవే శ్రేష్టుడవు. ఈ బ్రహ్మాదిదేవతలంతా నిన్నాశ్రయించి బ్రతుకుచున్నారు. ఓ అనఘా! దేవశ్రేణిలొ అగ్రస్థానం నీదే. ఈ జగత్తునంతను సృష్టించి నడపుతున్న వాడవు నీవే. నీ అనుగ్రహం వల్లనే దేవతలంతా ఎవరివల్లా ఎలాంటి భయం లేకుండా మనుగడ సాగిస్తున్నారు. ఈ విధంగా స్తుతించి ఆ ఋషి పరమేశ్వరుని పాదాలు పట్టుకొని యిలా అన్నాడు. భగవాన్! నీ దయవల్ల నా తపస్సు నశింపకుండుగాక . అలా అనుగ్రహించుము.
నీతో బాటు ఈ ఆశ్రమంలో నేనుకూడ ఎల్లప్పుడూ ఉంటాను. సప్తసారస్వత క్షేత్రంలో స్నానంచేసి నన్నర్చించిన వానికి యిహలోకంలోనూ పరలోకంలో కూడా లభించనిదేమీ ఉండదు. శివానుగ్రహంవల్ల అలాంటి అదృష్టవంతులు సర్వోన్నతపదం పొందుతారు. సారస్వత స్వర్గసౌఖ్యాలనుభావిస్తారు.
అధ్యాయము 17 complete
