వామన మహా పురాణము లోని సరో మహాత్మ్యము

అధ్యాయము 2

ఓ మహర్షీ! యిక వామన మహాత్మ్యం, ఆయన జన్మ విశేషం, బకిబ్ని నిగ్రహించి అతని రాజ్యాన్ని యింద్రున కిచ్చిన గాథ వినిపింపుడు.

ఓ మునులారా! మహాత్ముడగు వామన దేవుని ఉత్పత్తిని, గొప్పతనాన్ని ఈ కురుజాంగల భూమిలో నివాసం మొదలయినవి చెబుతాను. ప్రేమతో వినండి. ప్రాచీనకాలంలో విరోచన పుత్రుడు బలిరాజు ఆవిర్భవించిన దైత్యవంశానికి హిరణ్యకశిపుడు మూలపురుషుడు. ఆయన కుమారుడు మహాతేజస్వి ప్రహ్లాదుడను దానవుడు. ఆయన కొడుకు విరోచనుడు. బలి ఆ విరోచనుని పుత్రుడు. దేవతలనందరను జయించి హిరణ్యకశిపుడు మరణించిన అనంతరం ఆ వంశంవారు మూడు లోకాలను నిష్కంటకంగా పాలించసాగారు. వారలను నిర్జించుటకు దేవతలు చేసిన యత్నాలేవీ ఫలించలేదు. బలవంతులైన మయుడు, శంబరుడు విజేతలయ్యారు. దిక్కులన్నీ స్వచ్చమయ్యాయి. ప్రజలంతా ధర్మకార్యాలలో నిమగ్నులయ్యారు, దైత్య విధానం సర్వత్రా వ్యాపించింది. సూర్యుడు ఆయన పథాన్ని చేరుకున్నాడు. ప్రహ్లాద మయ శంబర అనుహ్లాదులు చతుర్దిక్కులను గగన వీథిని చక్కగా రక్షించ సాగారు. వారి ఏలుబడిలో దేవతలు యజ్ఞశోభను నలువైపులా వెదజల్లసాగారు. ఈ విధంగా లోకాలన్నీ శాంతిసౌఖ్యాలతో సత్పథానధర్మాచరణం చేస్తుండగా పాపాలన్నీ హరించుకుపోయి ధర్మ ధేనువు నాలుగుపాదాలతో విస్తరించసాగినది. అధర్మం ఒంటికాలిమీద నిలచిపోయింది. రాజులంతా ప్రజాపాలనం ధర్మయుక్తంగా ఆశ్రమవ్యవస్థను పరిరక్షిస్తూ చేసేవారు. ప్రజలంతా తమతమ విధులు చక్కగా నిర్వహించేవారు. అలాంటి పరిస్థితులలో బలి దైత్యరాజ్యాభిషిక్తుడైనాడు. దైత్యగణాల్లో ఆనందోత్సాహాలు మిన్నుముట్టాయి. అంతట కమల కోమల గర్భగౌరీ, వరదాయిని అయిన లక్ష్మీ దేవి పైకెత్తిన చేతులలో పద్మములు పట్టుకుని మంగళప్రదమైన రాకతో బలిని సమీపించెను.

దైత్యేశ్వరుడవు మహాతేజస్వియగునో బలీ! బలవంతులలో నరిష్ఠుడవగు నీవు యింద్రుని జయించి నందులకు నేను ప్రీతురాలనైతిని. నీకు మేలగుకాక. యుద్ధంలో విక్రమించి దేవరాజును ఓడించావు. అలాంటి నీ ధైర్యసాహసాలు చూచి నేనే స్వయంగా వచ్చాను. అసురేంద్రుడైన హిరణ్యకశిపుని వంశంలో జన్మించిన నీ పట్ల ఈ అద్భుతకార్యం తగియేయున్నది. యిందులో ఆశ్చర్యం లేదు. ణీ ప్రపితామహుని కీర్తికి నీవు ఈ విధంగా వన్నె తెచ్చావు. ఆ దైత్యేంద్రుడు ముల్లోకాలను ఆక్రమించి అనుభవించాడు. ఇలా ప్రశంసించి ఆ లక్ష్మీ దేవి వరదాయిని సర్వదేవ సేవితురాలు సమస్త దేవసుందరి దైత్యవల్లభుడగు నాబలిలో ప్రవేశించింది. వెనువెంటనే హ్రీ కీర్తి ద్యుతి ప్రభ ధృతి, క్షమ, భూతి బుద్ధి మహామతి శృతి స్మృతి ఇడ శాంతి పుష్టి క్రియ మొదలగు శ్రేష్ఠదేవీగణం సంతోషంతో ఆమెననుసరించారు. నృత్యగీతాల్లో ప్రవీణులైన అప్సరసలంతా ఆ బలిచక్రవర్తిని ఆశ్రయించారు. ఈ విధంగా బ్రహ్మవాదియగు నాదైత్యపతి ముల్లోకాల ఐశ్వర్యాన్నంతటిని తనకు పాదాక్రాంతం చేసుకున్నాడు.

అధ్యాయము 2 complete