17 - ఆయువు వంశము - రజి మహారాజు చరితము

శ్రీశుక ఉవాచ

యః పురూరవసః పుత్ర ఆయుస్తస్యాభవన్ సుతాః

నహుషః క్షత్రవృద్ధశ్చ రజీ రంభశ్చ వీర్యవాన్

అనేనా ఇతి రాజేంద్ర శృణు క్షత్రవృధోఽన్వయమ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! పురూరవుని పుత్రుడు ఆయువు. ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజీ, పరాక్ర మశాలియగు రంభుడు, మరియు అనేనసుడు అనే పుత్రులు గలరు. వారిలో క్షత్రవృద్దుని వంశమును గురించి వినుము.

క్షత్రవృద్ధసుతస్యాసన్ సుహోత్రస్యాత్మజాస్త్రయః

కాశ్యః కుశో గృత్సమద ఇతి గృత్సమదాదభూత్

శునకశ్శౌనకో యస్య బహ్వృచప్రవరో మునిః  

క్షత్రవృద్ధుని పుత్రుడు సుహోత్రుడు. సుహోత్రునకు కాశ్యుడు, కుశుడు, గృత్సమదుడు అనే ముగ్గురు పుత్రులు ఉండిరి. గృత్సమదుని పుత్రుడు శునకుడు. శునకుని పుత్రుడగు శౌనక మహర్షి ఋగ్వేదాధ్యాయు లలో శ్రేష్ఠుడు.

కాశ్యస్య కాశిస్తత్పుతో రాష్ట్రా దీర్ఘతమఃపితా

ధన్వంతరిర్దైర్ఘతమ ఆయుర్వేదప్రవర్తకః

కాశ్యుని పుత్రుడు కాశి. కాశి పుత్రుడు రాష్ట్రుడు, రాష్ట్రుని పుత్రుడు దీర్ఘతముడు. దీర్ఘతముని పుత్రుడు ధన్వంతరి. ధన్వంతరి లోక ములో ఆయుర్వేదమును ప్రవర్తిల్ల జేసెను.

యజ్ఞభుగ్వాసుదేవాంశస్స్మృతమాత్రార్తినాశనః

తత్పుత్రః కేతుమానస్య జజ్ఞే భీమరథస్తతః

దివోదాసో ద్యుమాంస్తస్మాత్ప్రతర్దన ఇతి స్మృతః

వాసుదేవ భగవానుని అంశయైన ధన్వంతరికి యజ్ఞభాగములలో వాటా గలదు. ఆయనను స్మరించినంత మాత్రాన మానవుల దుఃఖములు దూరమగును. ఆయనయొక్క పుత్రుడు కేతుమంతుడు. కేతుమంతుని పుత్రుడు భీమరథుడు. భీమరథుని పుత్రుడు దివోదాసుడు. దివోదాసుని పుత్రుడు ద్యుమంతుడు. ద్యుమంతునకే ప్రతర్దనుడనే పేరు కూడ గలదు.

స ఏవ శత్రుజిద్వత్స ఋతధ్వజ ఇతీరితః

తథా కువలయాశ్వేతి ప్రోక్తోఽలర్కాదయస్తతః  

ఆ ద్యుమంతుడే శత్రుజిత్తు, వత్సుడు, ఋతధ్వజుడు, కువలయా శ్వుడు అనే పేర్లతో కూడ ప్రసిద్ధిని జెందెను. ఆయనకు అలర్కుడు మొద లగు పుత్రులు గలరు.

షష్టివర్షసహస్రాణి షష్టివర్షశతాని చ

నాలర్కాదపరో రాజన్ మేదినీం బుభుజే యువా

 యువకుడగు అలర్కుడు అరవై ఆరువేల సంవత్సరముల కాలము నిరంతరముగా రాజ్యమును పాలించెను. అలర్కునీకంటే మరియొకడు ఇంతకాలము రాజ్యమును పాలించలేదు.

అలరాత్సంతతిస్తస్మాత్సునీథొఽథ సుకేతనః

ధర్మకేతుస్సుతస్తస్మాత్సత్యకేతురజాయత

అలర్కుని పుత్రుడు సంతతి. సంతతి పుత్రుడు సునీథుడు. సునీ థుని పుత్రుడు సుకేతనుడు. సుకేతనుని పుత్రుడు ధర్మకేతువు. ధర్మకే తువు పుత్రుడు సత్య కేతువు.

ధృష్టకేతుస్సుతస్తస్మాత్సుకుమారః క్షితీశ్వరః

వీతిహోత్రస్య భర్గోఽతో భార్గభూమిరభూన్నృపః

సత్యకేతుని పుత్రుడు ధృష్టకేతువు. ధృష్టకేతువు పుత్రుడు సుకు మార మహారాజు. సుకుమారుని పుత్రుడు వీతిహోత్రుడు. వీతిహోత్రుని పుత్రుడు భర్గుడు. భర్గుని పుత్రుడు భార్గభూమి మహారాజు.

ఇతీమే కాశయో భూపాః క్షత్రవృద్దాన్వయాయినః

రంభస్య రభసః పుత్రో గంభీరశ్చాక్రియస్తతః  

పైన చెప్పిన వీరు క్షత్రవృద్ధుని (కాశి ముత్తాత) వంశములో కాశి మహారాజు పరంపరకు చెందిన మహారాజులు.(ఆయువు పుత్రుడైన) రంభుని పుత్రుడు రభసుడు. రభసుని పుత్రుడు గంభీరుడు. గంభీరుని పుత్రుడు అక్రియుడు.

తస్య క్షేత్రే బ్రహ్మ జజ్ఞే శృణు వంశమనేనసః

శుద్ధస్తతశ్శుచిస్తస్మాత్త్రికకుద్ధర్మసారథిః

ఆ అక్రియుని భార్యనుండి బ్రాహ్మణవంశము ప్రవర్తిల్లెను.(ఆ యువు పుత్రుడైన) అనేనసుని వంశమును గురించి వినుము. అనేనసుని పుత్రుడు శుద్దుడు. శుద్దుని పుత్రుడు శుచి, శుచి పుత్రుడు త్రికకుత్తు. తికకు త్తుయొక్క పుత్రుడు ధర్మసారథి.

తతశ్శాంతరయో జజ్ఞే కృతకృత్యస్స ఆత్మవాన్

రజేః పంచశతాన్యాసన్ పుత్రాణామమితౌజసామ్

ధర్మసారథియొక్క పుత్రుడు శాంతరయుడు. ఆయన ఆత్మజ్ఞా నము గలవాడగుటచే జీవన్ముక్తుడు. రజి (ఆయువుయొక్క పుత్రుడు) కి అమితమైన బలము గల అయిదువందలమంది పుత్రులు గలరు.

దేవైరభ్యర్థితో దైత్యాన్ హత్వేంద్రియాదదాద్దివమ్

ఇంద్రస్త స్మై పునర్దత్వా గృహీత్వా చరణౌ రజేః

ఆత్మానమర్పయామాస ప్రహ్రదాద్యరిశంకితః

దేవతలు ప్రార్థించగా రజి రాక్షసులను జయించి స్వర్గమును ఇంద్రునకు ఇచ్చేను. కాని, ప్రహ్లాదుడు మొదలగు శత్రువులకు భయపడిన ఇంద్రుడు రజియొక్క రెండు కాళ్లను పట్టుకొని తనను తాను ఆయనకు సమర్పించుకొనేను.

పితర్యుపరతే పుత్రా యాచమానాయ నో దదుః

త్రివిష్టపం మ హేంద్రాయ యజ్ఞభాగాన్ సమాదదుః

తండ్రియగు రజి మరణించిన పిదప మ హేంద్రుడు కోరిననూ, ఆయన పుత్రులు స్వర్గమును ఇంద్రునకీయలేదు. పైగా, వారు యజ్ఞభాగ ములను కూడ స్వీకరించిరి.

గురుణా హూయమానేఽగ్నౌ బలభిత్తనయాన్ రజేః

అవధీద్భ్రంశితాన్మార్గాన్న కశ్చిదవశేషితః

బృహస్పతి (ఇంద్రుని విజయము కొరకై) అగ్నియందు హోమ మును చేయుచుండగా, ఇంద్రుడు ధర్మమార్గమునుండి భ్రష్టులైన రజీ యొక్క పుత్రులను సంహరించెను. వారిలో ఒక్కరైననూ మిగులలేదు.

కుశాత్ప్రతిః క్షాత్రవృద్ధాత్సంజయస్తత్సుతో జయః

తతః కృతః కృతస్యాపి జజ్ఞే హర్యవనో నృపః

సహదేవస్తతో హీనో జయ సేనస్తు తత్సుతః

క్షత్రవృద్దుని మనుమడగు కుశునకు ప్రతి అనే పుత్రుడు కలిగెను. ప్రతి పుత్రుడు సంజయుడు. సంజయుని పుత్రుడు జయుడు. జయుని పుత్రుడు కృతుడు. కృతుని పుత్రుడు హర్యవన మహారాజు. హర్యవనుని పుత్రుడు సహదేవుడు. సహదేవుని పుత్రుడు హీనుడు. హీనుని పుత్రుడు జయ సేనుడు.

సంకృతిస్తస్య చ జయః క్షత్రధర్మా మహారథః

క్షత్రవృద్ధాత్వయా భూపాశ్శృణు వంశం చ నాహుషాత్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం

నవమస్కంధే సప్తదశోఽధ్యాయః

జయ సేనుని పుత్రుడు సంకృతి. సంకృతి పుత్రుడు జయుడు. జయుడు క్షత్రియధర్మమునందు నిష్ట గల మహారథుడు. వీరు క్షత్రవృద్ధుని వంశమునకు చెందిన మహారాజులు. ఇప్పుడు (ఆయువు పుత్రుడైన) నహుషుని పుత్రుని నుండి ప్రవర్తిల్లిన వంశమును గురించి వినుము.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో రజి మహారాజు చరితమును వర్ణించే పదునేడవ అధ్యాయము ముగిసినది.