భాగవత మహా పురాణము
22 - వామనావతారము - బలిపై శ్రీహరి ప్రసన్నుడగుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! బలి అనే ఆ రాక్షసుని భగవానుడీ విధముగా తిరస్కారము చేసెను. బలి మనస్సును సత్యమునుండి శుక్రాచార్యుడు చలింప జేసిననూ, ఆయన చలించలేదు. అట్టి బలి ఇట్లు బదులు చెప్పెను.
బలిరువాచ ।
పవిత్రమగు కీర్తి గల ఓ దేవశ్రేష్ఠా! నేను పలికిన మాటను నీవు అసత్యమని తలచుచున్నావా అట్లైనచో, నేనా మాటను సత్యము చేసెదను. అది మోసపు పలుకు కారాదు. నీ మూడవ అడుగును నా తలపై నుంచుము.
నేను అపకీర్తి వలన ఎంత అధికముగా భయపడెదనో, ఆ విధముగా నరకము వలన గాని, రాజ్యాధికారమునుండి జారిపోవుట వలన గాని, పాశముల బంధము వలన గాని, అతిక్రమించ శక్యము కాని ఆపద వలన గానీ, దారిద్యము వలన గాని, నీవు వేసే శిక్ష వలన గాని సుత రాము భయపడను.
మిక్కిలి యోగ్యుడవగు నీవు వేసే శిక్ష మానవులకు మిక్కిలి కొని యాడదగినదని నా అభిప్రాయము. ఎందుకంటే, అటువంటి శిక్షను తల్లి, తండ్రి, సోదరుడు, మిత్రులు కూడ వేయలేరు.
రాక్షసులమగు మాకు నీవు తెలియబడకుండా హితమును చేసే గొప్ప గురుడవు. పలువిధములైన, గర్వములతో గ్రుడ్డివారమై యున్న మమ్ములను నీవు రాజ్యభ్రష్టులను చేసి కనువిప్పును కలిగించితివి.
ఆశ్చర్యము! చాలమంది రాక్షసులు నీయందు దృఢమైన వైరమును బూని ఆ కారణముగా నిన్నే నితరముగా స్మరించి, అనన్యమగు భక్తియోగనిష్ఠ గలవారు పొందే సిద్ధి (మోక్షము) ని పొందిరి.
నీ లీలలు అనేకములు. అట్టి నీవు నన్ను వరుణపాశములతో బంధించితివి. అయిననూ, నేను అధికముగా సిగ్గు పడుట లేదు; పీడను కూడ పొందుట లేదు.
మా తాత ప్రహ్లాదుడు లోకప్రసిద్దమైన సత్కీర్తి గలవాడు. నీవే పరమలక్ష్యముగా గల ఆయన నీ భక్తులలో ఉత్తముడు. నీ శత్రువు, తనకు తండ్రియగు హిరణ్యకశిపుడు ఆయనను చిత్రహింసలు పెట్టెను.
మరణించే స్వభావము గల మానవునకు ఈ లోకములో దేహముతో పని యేమి: అది అంతములో ఎలాగైనా విడిచిపెట్టేదే. నావారు అనబడే వారు ఆస్తిని అనుభవించేదోపిడీగాండ్రు. వారితో మాత్రము ప్రయోజనమేమున్నది: సంసారము కొనసాగుటకు కారణమయ్యే భార్యతో ప్రయోజనమేమి గలదు: ఇంటితో ప్రయోజనమేమి: ఇవి కేవలము ఆయుర్దాయము ఖర్చు అగుటకు మాత్రమే పనికి వచ్చును.
మా తాత ప్రహ్లాదుడు లోతైన జ్ఞానము గల మహాత్ముడు. దుష్టజనుల సంగము వలన భయపడే ఆ గొప్ప సత్పురుషుడు ఈ విధముగా నిశ్చయించుకొని, నీవు తన పక్షమువారైన రాక్షసులను మట్టుబెట్టిననూ, నీ పద్మమువంటి పాదమునే శరణు వేడెను. ఎందుకంటే, నీ పాదము నిత్య ము, సకలభయములనుండి రక్షణ నిచ్చును.
దైవము నన్ను కూడ నాకు శత్రువైన నీ దగ్గరకు లాగుకువచ్చినది. నీవు బలాత్కారముగా నా సంపదను ఊడలాగినావు. అది మంచిదే. ఎందు కంటే, సంపద వ్యక్తియొక్క బుద్ధిని జడముగా చేయును. అట్టి జడబుద్ధి మృత్యువునకు వశమై యుండే ఈ జీవితము అనిత్యమనే సత్యమును గుర్తించడు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కురువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ మహారాజా!, ఆ బలి ఇట్లు మాటలాడుచుండగనే, చంద్రుడు ఉదయించినట్లుగా, ప్రహ్లాదుడు విచ్చేసెను. ఆయన ఉదయించిన పూర్ణచంద్రుడు వలె నుండెను.
ఇంద్రునియొక్క సేనవంటి సేన గల బలి తన తాతగారైన ఆ ప్రహ్లాదుని చూచెను. ఆయన పద్మమువంటి నిడివి కన్నులతో శోభిల్లి ప్రకాశించెను. పొడవైన ఆ ప్రహ్లాదుడు పచ్చని వస్త్రములను ధరించెను. కాటుక వలె ప్రకాశించే ఆయన బాగా పొడవైన చేతులతో సుందరముగా నుండెను.
నాగపాశములచే కట్టివేయబడి యుండుటచే బలి పూర్వమునందు వలె ప్రహ్లాదునకు అర్ఘ్యము మొదలగు పూజను చేయలేదు; కేవలము తల వంచి నమస్కరించేను. ఆయన కళ్లు నీటితో నిండి చంచలముగా నుండెను. ఆయన సిగ్గుతో తల దించుకొని యుండెను.
గొప్ప జ్ఞానియగు ఆ ప్రహ్లాదుడు అక్కడ కూర్చునియున్న వామన భగవానుని చూచెను. సత్పురుషులకు రక్షకుడగు ఆయనను సునందుడు, నందుడు, గరుత్మంతుడు మొదలగు అనుచరులు సేవించుచుండిరి. ఆపుడా ప్రహ్లాదుడు గగుర్పాటుతో, కన్నీటితో కలవరపడుతూ తలవంచి దగ్గరకు వెళ్లి నేలపై సాష్టాంగ నమస్కారమును చేసెను.
ప్రహ్లాద ఉవాచ ।
ప్రహ్లాదుడు ఇట్లు పలికెను --- సమృద్ధమైన ఇంద్రపదవిని బలికి నీవే ఇచ్చి నీవే లాగుకొంటివి. ఇది కూడ చాల బాగున్నది. ఎందుకంటే, బుద్ధికి మోహమును కలిగించే సంపదను ఊడకొట్టి నీవు వీనిపై గొప్ప అనుగ్రహమునే చూపితివి.
ఓ నారాయణా! వివేకజ్ఞానము, ఇంద్రియనిగ్రహము కలవానికి కూడ సంపద మోహమును కలిగించును. అట్టిచో, సంపద గలవాడు ఎవ్వాడు ఆత్మతత్త్వమును యథాతథముగా దర్శించగల్గును: (దర్శించలేడు). జగన్నాథుడవగు నీవే సకలప్రాణులలో సాక్షిరూపముగా నున్నావు. నీకు పలుమార్లు నమస్కరించుచున్నాను.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! ఆ ప్రహ్లాదుడు అంజలి ఘటించి వినుచుండగా, బ్రహ్మగారు (జగత్తునంతనూ శక్తి రూపముగా వ్యాపించియున్నవాడు) మధుసూదన (మధు అనే రాక్షసుని సంహరించిన) భగవానుని ఉద్దేశించి ఏదో చెప్ప గోరెను.
ఓ మహారాజా! తన భర్తయగు బలి బంధించబడి యుండుటను గాంచిన ఆయన భార్య భయముతో కంగారు పడెను. ఆ పతివ్రత ఇంద్రుని సోదరుడగు వామనునకు చేతులను జోడించి తలవంచి నమస్కరించి, ఇట్లు పలికెను.
వింధ్యావలిరువాచ ।
ఓ ఈశ్వరా! నీవే నీ లీల కొరకై ఈ ముల్లోకములను సృష్టించితివి. కాని, కొందరు దుర్బుద్దులు ఈ జగత్తునకు తామే ప్రభువులమని తలపోయుచుందురు. వారు సిగ్గు విడిచి తామే కర్తలమని ఆరోపించుకొని పలుకు చుందురు. వారియందు ఆ ఆజ్ఞానమును కలిగించినది కూడ నీ మాయాశక్రియే. ఈ జగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించేది నీవై యుండగా, ఆ దుర్బుద్దులు నీకు సమర్పించేది ఏది గలదు: (ఏమీ లేదు).
బ్రహ్మోవాచ ।
బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ దేవదేవా! నీవే ప్రాణులను సృష్టించి పాలించెదవు. ఈ జగద్రూపముగా నీవే ప్రకటమైనావు. ఈ బలి యొక్క సంపదలన్నీ లాగుకొనబడినవి గనుక, వీనిని బంధమునుండి విడి పించుము. ఈతడు బంధించదగినవాడు కాదు..
ఈ బలి సమస్తమగు భూలోకమును, తాను పుణ్యకర్మలచే సంపాదించిన పుణ్యలోకములను, సర్వస్వమును కూడ నీకు సమర్పించినాడు. అయిననూ, ఈతని బుద్ధియందు దైన్యము లేదు.
ఎవ్వడైననూ నిష్కపటముగా నీ రెండు పాదములకు అర్ఘ్యము నిచ్చి పచ్చగడ్డి పరకలతో చక్కని పూజను చేసినచో, అట్టివాడు ఉత్తమ మగు లోకములను పొందును. ఈ బలి దైన్యము లేని మనస్సుతో ముల్లోక ములను కూడ నీకు సమర్పించినాడు. అట్టి ఈతడు ఆపదను పొందుటకు ఎట్లు తగును?
శ్రీభగవానువాచ ।
చావమన్యతే ॥
ఓ బ్రహ్మా! నేను ఎవనినైతే అమగ్రహిస్తానో, వాని సంపదలను లాగుకొనెదను. ఎందుకంటే, సంపదలచే గర్వించి వినయమును కోల్పో యిన వ్యక్తి లోకమును, నన్ను కూడ అవమానించును.
అస్వతంత్రుడగు ఈ జీవుడు తన కర్మల ఫలమునకు తగ్గట్లుగా అనేకయోనులలో జన్మించి పరిభ్రమిస్తూ, ఏదో ఒకప్పుడు మనుష్యజ న్మను పొందును.
ఆ మనుష్యజన్మలో ఈ జీవునకు వంశము, చేసిన గొప్ప పనులు, వయస్సు, రూపము, చదువు, అధికారము, సంపద, అనుచరులు మొదల గువాటి కారణముగా గర్వము లేకున్నచో, ఆ స్వభావము నా అనుగ్రహము మాత్రమే.
వంశము, ధనము మొదలగువాటి కారణముగా గర్వించి అవినయ ముగా ఉండే వ్యక్తికి సకలకల్యాణములు సర్వవిధములుగా దూరమగును. నా భక్తుడు నిశ్చయముగా అట్టి వ్యామోహమును పొందడు.
ఈ బలి దను దితివంశీయులగు రాక్షసులలో అగ్రేసరుడై కీర్తిని వర్దిల్ల జేసినాడు. ఈతడు జయించ శక్యము కాని మాయను జయించినాడు. కావుననే, ఆపదను పొందిననూ వ్యామోహితుడు కాలేదు.
బలి సంపదను, అధికారమును కూడ పోగొట్టుకొని మనచే తిరస్క రించబడినాడు. శత్రువులగు మన చేతిలో బందీయై ఉన్న ఈతనిని జ్ఞాతులు విడిచి పెట్టిరి. ఈ విధముగా ఈతడు తీవ్రమగు పీడకు గురి చేయ బడినాడు.
ఈతని గురువగు శుక్రాచార్యుడు ఈతనిని బెదిరించి శపించిననూ, గొప్ప ప్రతనిష్ఠ గల ఈతడు సత్యమును విడిచి పెట్ట లేదు. నేను కూడ కప టవచనములతో అధర్మమును ధర్మముగా చెప్పితిని. అయిననూ, సత్యని ష్ఠుడగు ఈతడు తన ధర్మమును విడిచి పెట్టలేదు.
నేనీతనికి దేవతలకు కూడ పోంద శక్యము కాని స్థానమునిచ్చుచు న్నాను. నేనే శరణుగా గల ఈతడు సావర్ణి మన్వంతరములో ఇంద్రుడు కాగలడు.
అంతవరకు ఈతడు విశ్వకర్మచే నిర్మించబడిన సుతలలోకము నకు అధిపతియై ఉండుగాక! అచట నివసించు వారలకు నా దయాదృష్టి కారణముగా శారీరక వ్యాధులు, మనోవ్యాధులు, అలసట, సోమరిదనము, పరాభవము, ఉపద్రవములు కలుగవు.
బలి చక్రవర్తీ! సుతలము స్వర్గవాసులకు కూడ కోరదగినది. నీవు నీ జ్ఞాతులు చుట్టువారి రాగా, అచటకు వెళ్లుము. నీకు మంగళమగు గాక!
లోకపాలకులు కూడ నిన్ను అచట పరాభవించ లేరు. ఇతరులు పరాభవించలేరని వేరుగా చెప్పవలయునా? నీ శాసనమును ఉల్లంఘించే రాక్షసులను నా చక్రము సంహరించ గలదు.
ఓ వీరుడా! నిన్ను, నీ అనుచరులను, నీ పరికరములను నేను అన్ని విధములుగా రక్షించెదను. అన్ని కాలములలో నీకు సుతలములో ఉపస్థితుడనైయున్న నేను కనబడెదను.
దను దితివంశీయులగు రాక్షసులతోడి సంగము వలన నీయందు కలిగిన అసుర (భోగ) ప్రవృత్తి అచట నా మహిమను చూచిన పిదప మంద గించి నశించగలదు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో బలిపై శ్రీహరి ప్రసన్నుడగుటను వర్ణించే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).
Summary of chapter 22 of the Bhāgavata Mahā Purana is as follows:
Displaying unmatched spiritual nobility, King Bali bowed his head before Vāmanadeva, asking the Lord to place His promised third step upon his head. Bali declared that he considered the touch of the Lord's foot upon his head a far greater blessing than sovereignty over the universe. Prahlāda Mahārāja and Queen Vindhyāvalī praised Bali's total surrender. Pleased beyond measure by Bali's unalloyed devotion (*Ātma-nivedanam*), Vāmanadeva released him from his bonds, elevated him to rule the opulent subterranean realm of Sutala, promised to serve perpetually as the doorkeeper of his palace, and declared that Bali would become Indra in the next Manvantara.