శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము
18 - యయాతి చరితము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రాణధారులకు శ్రోత్ర-త్వజ్ నేత్ర-జిహ్వా-ఝణములు మరియు మనస్సు అనే ఆరు ఇంద్రియములు న్నట్లే -- (ఆయువు పుత్రుడైన) నహుషునకు యతి, యయాతి, సంయా తి, ఆయతి, నియతి మరియు కృతి అనే ఆర్గురు పుత్రులు (వశవర్తులై కార్యకారులై ఉండిరి.
తండ్రి యతికి రాజ్యమునిచ్చెను. కాని, ఆయన దానికి ఇష్టపడలే దు. ఎందుకంటే, రాజ్యమును స్వీకరిస్తే వచ్చే పరిణామములు (అనర్థములు) ఆయనకు తెలియును. రాజ్యవ్యవహారములలో ప్రవేశించిన వ్యక్తి ఆత్మస్వరూపమును తెలియలేడు.
నహుషుడు ఇంద్రపత్నియగు శచీదేవి పొందును కోరుట అనే దోషము కారణముగా అగస్త్యాది మహర్షులచే శపించబడి ఇంద్రపదము నుండి భ్రష్టుడై కొండచిలువ యైనాడు. ఆ సమయములో యయాతి రాజాయెను.
యయాతి తన తమ్ములను నలుగురిని నాలుగు దిక్కులయందు ప్రజాపాలన కొరకు నియోగించెను. ఆయన తాను శుక్రాచార్యుని కుమార్తె ను, మరియు వృషపర్వుడనే రాక్షసరాజు కుమార్తెను వివాహమాడి రాజ్య మును పాలించెను.
పరీక్షిన్మహారాజు ఇట్లు ప్రశ్నించెను --- పూజనీయుడగు శుక్రాచా ర్యుడు బ్రహ్మర్షి. కానీ, నహుషుని పుత్రుడగు యయాతియైతే క్షత్రియుడు. రాజునకు బ్రాహ్మణయువతితో ఈ తల్లక్రిందులు వివాహము జరుగుటకు కారణమేమి?
రాక్షసరాజగు వృషపర్వునకు శర్మిష్ఠయని ప్రసిద్ధి గాంచిన యువతియగు కుమార్తె గలదు. ఆ సుందరి ఒకనాడు వేయి చెలికత్తెలు వెంటరాగా, దానవగురువగు శుక్రాచార్యుని కుమార్తెయైన దేవయానితో కలిసి నగరమునందలి ఉద్యానవనములో విహరించెను. పుష్పించిన చెట్లు దట్టముగానున్న ఆ ఉద్యానమునందలి సరస్సులలో వికసించిన పద్మములయందున్న తుమ్మెదల మధురమగు గానముతో ఆ సరస్సుల ఇసుకతిన్నెలు ప్రతిధ్వనించుచుండెను.
కలువ కన్నుల ఆ కన్యలు సరస్సును చేరి ఒడ్డుపై వలువలనుంచి ఒకరిపైనొకరు నీటిని చిమ్ముకుంటూ విహరించిరి.
ఇంతలో పార్వతీదేవితో గూడి నందిని యెక్కి వెళ్లుచున్న కైలాస పతియగు శివుడు ఆ యువతుల కంటబడెను. వెంటనే వారు ఒడ్డునకు వచ్చి వస్త్రములను కప్పుకొనిరి.
శర్మిష్ఠ హడావిడిలో శుక్రాచార్యుని కుమార్తెయగు దేవయాని యొక్క చీరను గుర్తుపట్టక తనది అని తలచి ధరించెను. దీనితో దేవయాని చాల కోపించి ఇట్లు పలికెను.
ఆహా! ఈమె చేసిన అనుచితమగు పనిని కనుడు! యజ్ఞములో ఆడుకుక్క హవిస్సును ముట్టుకున్నట్లుగా, మాచే ధరించబడే వస్త్రమునీమె ధరించినది.
వేదవేత్తలు ఈ జగత్తును తమ తపశ్శక్తిచే సృష్టించిరి. వారు పురుషోత్తముని ముఖరూపులు. వారు ఈ లోకములో చైతన్యరూపుడగు పరబ్రహ్మను తమ హృదయమునందు ధారణ చేయుదురు. వారు జనులకు మంగళకరమగు వేదమార్గమును నిర్దేశించేదరు.
లోకపాలకులైన దేవశ్రేష్ఠులు వేదవేత్తలకు నమస్కరించి స్తుతించెదరు. జగత్తునకు సత్తాస్ఫూర్తులననుగ్రహించే శ్రీహరి భగవానుడు కూడ అటులనే చేయును. లక్ష్మికి నివాసస్థానమగు ఆ శ్రీహరి లోకములను పావనము చేయును.
అట్టి వేదవేత్తలగు బ్రాహ్మణులయందు కూడ మేము భృగువంశీయులము. ఈమె తండ్రియగు వృషపర్వుడు మాకు శిష్యుడు. ఈ దుష్టురాలు, వేదమునకు అనర్హుడు వేదమును వలె, మేము ధరించే వస్త్రమును తాను ధరించినది.
శుక్రాచార్యుని పుత్రికయగు దేవయాని ఇట్లు తిట్టుచుండగా, ఈ విధముగా తిరస్కారమునకు గురియైన శర్మిష్ఠ కోపముతో క్రింది పెదవిని కొరుకుతూ, పామువలె దీర్ఘముగా నిట్టూర్చుచున్నదియై ఇట్లు పలికెను.
ఓ దేవయానీ! నీవు బిచ్చగత్తెవు. నీ బ్రదుకుదెరువును తెలుసుకోకుండా అధికముగా వదరుచున్నావు. మా ఇంటివద్ద మేము వేసే అన్నము కొరకు నీవు, కాకులు మరియు కుక్కలు వలె, ఎదురుచూచేదానవు కావా?
శుక్రాచార్యుని పుత్రికయగుటచే దేవయాని పూజకు అర్హురాలు. కాని, శర్మిష్ఠ ఆమెను ఈ విధమైన పరుషవాక్కులతో తిట్టి, ఆమె వస్త్రమును లాగుకొని నూతిలో పడద్రోసెను.
అప్పుడు శర్మిష్ఠ తన యింటికి వెళ్లాను. ఇంతలో యయాతి వేటాడుతూ ఈశ్వరేచ్ఛచే అనుకోకుండా దప్పికను తీర్చుకొనుటకై నూతి వద్దకు వచ్చి ఆ దేవయానిని చూచెను.
యయాతి మహారాజు దయాపరుడు. వస్త్రము లేని ఆమెకు ఆయన తన ఉత్తరీయమునిచ్చి, ఆమె చేతిని తన చేతితో పట్టుకొని పైకిలాగెను.
శుక్రాచార్యుని కుమార్తెయగు దేవయాని వీరుడగు ఆ యయాతిని ఉద్దేశించి ప్రేమతో నిండిన వాక్కుతో ఇట్లు పలికెను -- శత్రువుల నగరములను జయించే ఓ రాజా! నీవు నా చేతిని పట్టుకొంటివి.
నీవు పట్టుకున్న నా చేతిని మరియొక వ్యక్తి పట్టుకొననే రాదు (అనగా నాకు పాణిగ్రహణము మరియొక వ్యక్తితో కానే రాదు). మన యిద్దరి ఈ సంబంధము ఈశ్వరకృతమే గాని, మానవులచే చేయబడినది కాదు. ఏలయనగా, నూతిలో పడియున్న నాకు నీ దర్శనము (ఈశ్వరేచ్ఛచేతనే) కలిగినది.
ఓ రాజా! నీ భుజములు గొప్పవి సుమా! నాకు వివాహము కొబోయేది బ్రాహ్మణునితో కాదని బృహస్పతి పుత్రుడగు కచుడు ఇదివరలో నన్ను శపించినాడు. ఆతనిని నేను కూడ (నీవు నేర్చిన విద్య నీకు ఫలించదని) శపించితిని.
తాను కోరని ఈ సంబంధమును ఈశ్వరుడే తనకు కలిగించినాడనియు, తన మనస్సైతే ఆమెయందు లగ్నమైనదనియు తెలుసుకున్న యయాతి ఆమె వచనమును అంగీకరించెను.
ఆ యయాతి మహారాజు వెళ్లిన తరువాత దేవయాని ఏడుస్తూ తండ్రి దగ్గరకు వచ్చి, శర్మిష్ఠ తనను నిందిస్తూ పలికిన పలుకులను, తనకు చేసిన ఆ పనిని అంతనూ తండ్రియగు శుక్రాచార్యునకు విన్నవించెను.
పూజనీయుడగు ఆ శుక్రాచార్యుని మనస్సు చెడిపోయెను. ఆయన పురోహిత వృత్తిని గర్హించెను. అంతకంటె పావురముల వలె పొలములలో క్రింద పడిన గింజలను ఏరుకొని తిని బ్రదుకుట శ్రేష్ఠమని ఆయన అట్టి బ్రదుకు దెరువు (ఉంఛవృత్తి) ను స్తుతించెను. ఆయన కుమార్తెతో గూడి నగరమును విడిచిపెట్టి వెళ్లెను.
ఆ శుక్రాచార్యుడు తన శత్రువులగు దేవతల పక్షమున చేరి వారికి హితమును చెప్పగోరుచున్నాడని వృషపర్వ మహారాజు తలచెను. ఆయన వెంటనే మార్గమునందున్న ఆచార్యుని ప్రసన్నుని చేసుకొనుటకై ఆయన రెండు పాదములకు తల వంచి ప్రణమిల్లెను.
పూజనీయుడగు శుక్రాచార్యుని కోపము అర్ధక్షణము మాత్రమే ఉండును. ఆయన శిష్యుడగు వృషపర్వునితో నిట్లు పలికెను -- ఓ రాజా! ఈ దేవయాని కోరికను నెరవేర్చుము. తల్లి లేని ఈ పిల్లను ఉదాసీనముగా విడిచి పెట్టే శక్తి నాకు లేదు.
అటులనే అని వృషపర్వుడు అంగీకరించి నిలిచియుండెను. అప్పుడు దేవయాని తన మనస్సులోని మాటను ఇట్లు చెప్పెను -- నా తండ్రి నన్ను ఎవరికి ఇచ్చి వివాహము చేయునో, వారి గృహమునకు నేను వెళ్లునప్పుడు, శర్మిష్ఠ తన చెలికత్తెలతో బాటుగా నా వెంట రావలెను.
శుక్రాచార్యుడు రాజ్యమును విడిచిపెట్టుట వలన తన తండ్రికి విపత్తు కలుగుననియు, శుక్రాచార్యుని నిలబెట్టుకొనుట రాజ్యముయొక్క సుస్థిరతకు చాల ప్రముఖమైన విషయమనియు శర్మిష్ఠ గుర్తించేను. ఆమె వేయిమంది చెలిగత్తెలతో గూడి దేవయానికి దాసి వలె పరిచర్యలను చేసెను.
శుక్రాచార్యుడు తన కుమార్తెయగు దేవయానిని నహుషుని పుత్రుడగు యయాతికిచ్చి వివాహము చేసెను. శర్మిష్ఠ దేవయాని వెంట వెళ్లెను. అపుడు శుక్రాచార్యుడు యయాతితో నిట్లనెను -- ఓ రాజా! ఏనాడైననూ శర్మిష్ఠతో సంబంధమును పెట్టుకొనకుము.
కొంత కాలమునకు దేవయానికి సంతానము కలిగెను. యోగ్యురాలైన శర్మిష్ఠ ఆ పరిస్థితిని గమనించి ఒకనాడు ఏకాంతములో, తన చెలికత్తెయగు దేవయానియొక్క భర్తయైన ఆ యయాతినే వరించెను.
రాజపుత్రికయగు శర్మిష్ఠ తనకు సంతానము కావలెనని ధర్మము తెలిసిన యయాతిని కోరెను. ఆయన కూడ ధర్మమును పరిశీలించెను. పైగా, ఆయనకు శుక్రాచార్యుని హెచ్చరిక కూడ గుర్తులోనుండెను. అయిననూ, ఆయన ఆ సమయములో అది (శర్మిష్ఠతోడి పొందు) దైవనిర్ణయమేనని భావించెను.
దేవయానికి యదువు, తుర్వసుడు అనే పుత్రులు కలిగిరి. వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠకు కూడ ద్రుహ్యువు, అనువు, పూరువు అనే పుత్రులు కలిగిరి.
వృషపర్వాసురుని కుమార్తెయగు శర్మిష్ఠ తన భర్తయగు యయాతి వలన సంతానమును పొందినదని దేవయానికి తెలిసెను. ఆ అభిమానవతి కోపముచే ఆవేశించబడినదియై తన తండ్రియగు శుక్రాచార్యుని ఇంటికి వెళ్లిపోయెను.
యయాతికి దేవయానియందు ప్రేమ గలదు. కావుననే, ఆయన కూడ ఆమె వెంట వెళ్లెను. మార్గములో మంచి మాటలతో, పాదములను స్పృశించుట, ప్రయాణములో సహకరించుట మొదలగు క్రియలతో ఆమెను ప్రసన్నురాలను చేయుటకు యత్నించి ఆయన విఫలుడాయెను.
కోపించిన శుక్రాచార్యుడు యయాతితో నిట్లనెను -- ఓరీ మూర్ఖా! నీకు స్త్రీలయందు లోభము ఎక్కువ. అసత్యమును చెప్పుటకు వెనుకాడని వ్యక్తివి నీవు. మానవులకు వికృతరూపమును కలిగించే ముసలితనము నిన్ను (వెంటనే) ప్రవేశించు గాక!
యయాతి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! నీ కుమార్తెతో గూడి నేను అనుభవించిన భోగముల యెడల నాకింకనూ తృప్తి కలుగలేదు. (శుక్రాచార్యుడు ఇట్లు పలికెను) -- ఎవడైతే నీతో తన యౌవనమును మార్పిడి చేయుటకంగీకరించునో, వానితో యథేచ్ఛగా నీ ముసలితనమును మార్పు చేసుకొనెదవు గాక!
ఈ విధముగా యయాతి శుక్రాచార్యునినుండి ముసలితనమును వినిమయము చేసే వ్యవస్థను పొందెను. ఆయన తన పెద్ద కొడుకగు యదువుతో నిట్లనెను -- ఓ కుమారా! నాకు మీ తాతగారు (శుక్రాచార్యుడు) కలిగించిన ఈ ముసలితనమును నీవు స్వీకరించి నీ యౌవనమును నాకిమ్ము. ఓ కుమారా! నాకింకనూ ఇంద్రియభోగములయందు తృప్తి కలు గలేదు. నేను నీ మౌవనముతో కొన్ని సంవత్సరములు నిరంతరముగా రమించెదను.
యదువు ఇట్లు పలికెను --- తమకు మధ్యవయస్సులో సంప్రాప్తమైన ముసలిదనమును స్వీకరించి ముసలివాడనై జీవించుటకు నాకు ఉత్సాహము లేదు. ఇంద్రియసుఖములననుభవించకుండా వ్యక్తికి వైరాగ్యము కలుగదు.
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! యయాతి తుర్వసుని, ద్రుహ్యుని, మరియు అనువును కూడ అదే విధముగా ఆదేశించగా, వారు తమ యౌవనమునిచ్చుటకు నిరాకరించిరి. ఎందుకంటే, వారికి ధర్మము తెలియదు. పైగా, అనిత్యమగు యౌవనమునందు నిత్యమనే ధారణ వారికి ఉండెను.
యయాతియొక్క చిన్న కొడుకగు పూరువు వయస్సులో చిన్నవాడే అయినా, గుణములలో అధికుడు. యయాతి ఆతనితో నిట్లనెను -- ఓ కుమారా! నీవు నీ అన్నలవలె నన్ను తిరస్కరించుట తగదు.
పూరువు ఇట్లు పలికెను --- ఓ మహారాజా! లోకములో తనకు జన్మనిచ్చిన తండ్రియొక్క ఋణమును తీర్చగల వ్యక్తి ఎవడైనా గలడా?(లేడు). తండ్రియొక్క అనుగ్రహము వలన పుత్రునకు ఉన్నతమైన శ్రేయస్సు లభించును.
తండ్రి మనస్సులోని మాటను పైకి చెప్పకుండానే నిర్వర్తించే పుత్రుడు ఉత్తముడు. తండ్రి చెప్పిన దానిని చేయువాడు మధ్యముడు. తండ్రి చెప్పిన దానిని శ్రద్ధ లేకుండా చేయువాడు అధముడు. తండ్రి చెప్పిన దానిని అసలే చేయనివాడు తండ్రియొక్క మాలిన్యమువంటి వాడు మాత్రమే.
ఓ పరీక్షిన్మహారాజా! ఇట్లు పలికీ పూరువు ఆనందముతో తండ్రి యొక్క ముసలిదనమును స్వీకరించెను. అపుడా యయాతి పూరువు యొక్క యౌవనమును పొంది భోగములను యథేచ్ఛగా సేవించెను.
భరతవర్షములలోని తొమ్మిది ద్వీపములలో ఏడింటికి ప్రభువు యయాతియే. ఆయన ప్రజలను తండ్రివలె చక్కగా పాలించెను. ఆయన అలుపునెరుగని ఇంద్రియములతో విషయభోగములను తనకు ప్రీతి కలిగేటంతవరకు సేవించెను.
ప్రియురాలగు దేవయాని కూడ ప్రతిదినము ఏకాంతమునందు తన ప్రియుడగు యయాతికి మనస్సుతో అతిశయించిన ప్రేమను చూపి, వాక్కుతో మధురముగా మాటలాడి, దేహముతో పరిచర్యలను చేసి, ఇంకా అభీష్టమగు వస్తువులను సమర్పించెను. ఈ విధముగా ఆమె ఆయనకు సర్వాతిశాయియగు ప్రీతిని కలిగించెను.
సకలదేవతలు యజ్ఞేశ్వరుడగు శ్రీహరియొక్క రూపములు మాత్రమే. సకలవేదములు కూడ ఆయన స్వరూపమే. అట్టి శ్రీహరి దేవుని యయాతి అధికమగు దక్షిణలనిచ్చి క్రతువులను చేసి ఆరాధించెను.
ఈ జగత్తు స్వప్నము వలె, ఇంద్రజాలము వలె కేవలము మనస్సుయొక్క విలాస మాత్రమే. ఈ జగత్తు ఆత్మరూపుడగు శ్రీహరి (అధిష్ఠానము) యందు, మేఘపంక్తి ఆకాశమునందు వలె, ప్రకటమగుచున్నది. ఈ జగత్తు ఆ శ్రీహరియొక్క ప్రకాశమునందే ప్రకాశించుచున్నది. సుషుప్తి ప్రళయములయందు ఆ శ్రీహరియందే విలీనమై భాసించుట లేదు.
సకలజగన్నివాసుడు మరియు చైతన్యస్వరూపుడు అగు నారాయణుడు సకలప్రాణులలో హృదయమనే రహస్యస్థానమునందు నివసించును. యయాతి కామనలను విడిచిపెట్టి సూక్ష్మాతిసూక్ష్ముడు మరియు జగన్నాథుడు అగు ఆ నారాయణుని మాత్రమే హృదయమునందు నిలిపి, ఆయనను యజ్ఞముల ద్వారా ఆరాధించెను.
యయాతి చక్రవర్తియే అయిననూ, వేలాది సంవత్సరములు నిరంతరముగా కామభోగములను శ్రోత్ర-త్వఙ్-నేత్ర-జిహ్వా-ఘ్రాణములు మరియు నునస్సు అనే దుష్టములగు (బహిర్ముఖములైన) ఇంద్రియములతో అనుభవించుచున్ననూ, సంతృప్తిని చెందలేదు.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో యయాతి చరితమును వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది.
