శ్రీ మద్భాగవతము - నవమ (9వ) స్కందము
7 - త్రిశంకు చరితము - హరిశ్చంద్రుని వృత్తాంతము
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మాంధాతయొక్క పుత్రులలో అంబరీషుడు సర్వోత్తముడనీ నేను వర్ణించి యున్నాను. అంబరీషుని తాత గారైన యువనాశ్వుడు ఆయనను పుత్రునిగా స్వీకరించెను. అంబరీషుని పుత్రుడు యౌవనాశ్వుడు. యౌవనాశ్వుని పుత్రుడు హారీతుడు. వీరు మాంధాతయొక్క వంశమునకు గోత్రప్రవర్తకులైనారు.
నాగులు తమ సోదరియగు నర్మదను పురుకుత్సునకిచ్చి వివాహమును చేసిరి. నాగరాజగు వాసుకి ఆజ్ఞచే ఆమె తన భర్తను రసాతలమునకు తీసుకొని వెళ్లాను.
ఆ పురుకుత్సుడు ఆ రసాతలములో విష్ణువుయొక్క శక్తిని ధరించి నిశ్చయముగా వధకు అర్హులైన గంధర్వులను వధించేను. ఈ వృత్తాంతమును స్మరించువారలకు సర్పభయము ఉండదు అని, నాగరాజగు వాసుకి ఆయనకు వరమునిచ్చెను.
పురుకుత్సును పుత్రుడు త్రసద్దస్యువు. త్రసద్దస్యుని పుత్రుడు అనరణ్యుడు. అనరణ్యుని పుత్రుడు హర్యశ్వడు. హర్యశ్వుని పుత్రుడు అరుణుడు. అరుణుని పుత్రుడు త్రిబంధనుడు.
ఆ త్రీబంధనుని పుత్రుడు సత్యవ్రతుడు. ఆయన త్రిశంకుడు అనే పేరుతో ప్రసిద్దిని గాంచినాడు. గురువగు వసిష్ఠుని శాపము వలన ఆయన కసాయి యైనాడు. కానీ, ఆయన విశ్వామిత్ర మహర్షి యొక్క తపోబలముచే బొందితోనే స్వర్గమును చేరినాడు. అప్పుడు దేవతలు ఆయనను తల క్రిందుగా త్రోసివేయగా, విశ్వామిత్రుడు తపోబలముచే ఆయనను రోదసియందు నిలబెట్టినాడు. ఇప్పటికీ ఆయన అచట అట్లే కనబడును.
త్రిశంకుని పుత్రుడు హరిశ్చంద్రుడు. ఆయన కారణముగనే విశ్వామిత్ర వసిష్ఠులు (పరస్పర శాపములచే) పక్షుల రూపమును పొంది చాల సంవత్సరములు యుద్ధమును చేసిరి.
హరిశ్చంద్రునకు సంతానము కలుగలేదు. అపుడాయన నారదుని ఉపదేశమును బట్టి వరుణుని -- ఓ ప్రభూ! నాకు పుత్రుడు కలుగునట్లు చేయుము -- అని శరణు వేడెను.
ఓ పరీక్షిన్మహారాజా! నాకు పుత్రుడు జన్మించినచో, నేను వానిని నీకు సమర్పించి, ఆ విధముగా నిన్ను ఆరాధించగలను, అని హరిశ్చంద్రుడు చెప్పెను. తథాస్తు, అని వరుణుడు అనుగ్రహించగా, ఆయనకు రోహితుడనే పుత్రుడు పుట్టెను.
ఓయీ! పుత్రుడు పుట్టినాడు గదా! వీనితో నన్ను ఆరాధించుము -- అని వరుణుడు హరిశ్చంద్రునితో పలికెను. పశువుగా నిర్దేశించబడిన ఈ బాలకునకు పది రోజుల వయస్సు దాటిన తరువాత యజ్ఞమునకు యోగ్యుడు అగును, అని హరిశ్చంద్రుడు చెప్పెను.
పిల్లవానికి పది రోజులు దాటగానే వరుణుడు వచ్చి, ఇప్పుడు యజ్ఞమును చేయుమని హరిశ్చంద్రునితో చెప్పెను. అప్పుడు ఆయన ఇట్లు బదులిడెను -- పిల్లవానికి దంతములు వచ్చిన తరువాతనే యజ్ఞమునకు యోగ్యుడు అగును.
పిల్లవానికి పళ్లు వచ్చినవి, ఇప్పుడు యజ్ఞమును చేయుము, అని వరుణుడు రాజునుద్దేశించి పలికెను. పాలపళ్లు ఊడిపోయిన తరువాతనే ఈ బాలకుడు యజ్ఞమునకు అర్హుడగునని ఆ రాజు చెప్పెను.
పశువుగా నిర్దేశించబడిన ఈ బాలకునకు పాలపళ్లు ఊడినవి గావున, ఇప్పుడు యజ్ఞమును చేయుమని వరుణుడు (కొంత కాలము తరువాత) రాజుతో పలికెను. ఈ బాలకునకు మరల కోత్త పళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఈతడు యజ్ఞమునకు యోగ్యుడగునని రాజు పలికెను.
దంతములు తిరిగి వచ్చినవి గనుక, ఇప్పుడు యజ్ఞమును చేయుము -- అనీ వరుణుడు రాజునుద్దేశించి పలికెను. అపుడా హరిశ్చంద్ర మహారాజు ఇట్లు పలికెను -- ఓ వరుణ దిక్పాలకా! ఈ బాలకుడు రాజకుమారుడు. కావున, కవచమును ధరించినప్పుడు మాత్రమే యజ్ఞ పశువుయొక్క యోగ్యతను పొందును.
పుత్రునియందలి అనురాగము ఆసక్తిగా మారి హరిశ్చంద్ర మహారాజుయొక్క మనస్సును వశము చేసుకొనెను. కావుననే, ఆయన ఆయా కాలములు (పది రోజులు ఇత్యాది) వచ్చినప్పుడు వాటిని తప్పించుకొనుచుండెను. ఈ విధముగా రాజు పలుకగా, వరుణ దేవుడు యజ్ఞకాలమును గురించి ఎదురు చూచెను.
తండ్రి చేయగోరే ఆ యజ్ఞమును గురించి రోహితుడు తెలుసుకోనేను. ఆతడు తన ప్రాణములను రక్షించుకొనగోరి, ధనుస్సును చేతబట్టి అడవికి వెళ్లాను.
హరిశ్చంద్ర మహారాజును వరుణుడు పీడించేను. ఆయనకు నీరు పట్టి పొట్ట పెద్దది ఆయెను. ఈ విషయమును విని రోహితుడు గ్రామమునకు తిరిగి వచ్చుటకు సంసిద్ధుడగుచుండగా, ఇంద్రుడాతనిని వారించెను.
తీర్థములను, క్షేత్రములను సేవిస్తూ భూమిని పర్యటించుట పుణ్యప్రదమగునని ఇంద్రుడు రోహితుని ఆదేశించెను. ఆ రోహితుడు ఒక సంవత్సరకాలము అడవిలోనే ఉండిపోయెను.
ఇదే విధముగా రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ సంవత్సరముల పిదప కూడ వృత్రశత్రువగు ఇంద్రుడు ముసలి బ్రాహ్మణుని రూపములో మరల మరల వచ్చి రోహితుని అటులనే ఆదేశించెను.
రోహితుడు ఆరవ సంవత్సరమును కూడ ఆ అడవిలో గడిపి, తరువాత నగరమునకు తిరిగివచ్చుచుండెను. అపుడాతడు అజీర్తుని నుండి ఆయన మధ్యమపుత్రుని కొనుగోలు చేసేను.
రోహితుడు శునశ్శేపుని యజ్ఞపశువునుగా తండ్రికి సమర్పించి నమస్కరించెను. ఆపుడా హరిశ్చంద్ర మహారాజు పురుషమేధమనే యజ్ఞమును చేసి వరుణుడు, అగ్ని మొదలగు దేవతలనారాధించి, జలోదర వ్యాధినుండి విముక్తుడాయెను. ఈ విధముగా హరిశ్చంద్రుని కీర్తి, వృత్తాంతము చాల గొప్పవి. ఆ యజ్ఞమునందు విశ్వామిత్రుడు హోత కాగా, మనోనిగ్రహములో దిట్టయగు జమదగ్ని అధ్వర్యుడు, వసిష్ఠుడు బ్రహ్మ, అయా స్యుడు సామమును గానము చేసే ఉద్గాత అయిరి. ఇంద్రుడు సంతోషించి హరిశ్చంద్రునకు బంగరు రథమునిచ్చెను.
శునశ్శేపుని మాహాత్మ్యమును తరువాత చెప్పగలను. హరిశ్చంద్రుడు మరియు ఆయన భార్య కూడ సత్యమునే ధైర్యముతో పాలించిరి. అదియే వారి బలము. ఈ విషయమును చూచిన విశ్వామిత్ర మహర్షి మిక్కిలి ప్రీతిని పొంది, ఆయనకు ఆత్మజ్ఞానమునిచ్చెను. ఆత్మజ్ఞానము మోక్షఫలమును ఇచ్చును.
ఆ హరిశ్చంద్ర మహారాజు మనస్సును పృథివీతత్త్వమునందు, పృథివిని జలములయందు, జలతత్త్వమును అగ్నియందు, అగ్నిని వాయు వునందు, వాయువును ఆకాశమునందు, ఆకాశమును పంచభూతములకు కారణమగు సమష్టి-అహంకారమునందు, ఆ అహంకారమును మహత్త త్వము (సమష్టి బుద్దిశక్తి) నందు విలీనము చేసెను. ఆయన ఆ మహత్తత్త్వ మునందు ఆత్మజ్ఞానమును ధ్యానించి, దానిచే అజ్ఞానమును నిశ్శేషముగా దహించెను.
ఆ ఆత్మజ్ఞానము దుఃఖలేశము లేని ఆనందఘనము. దానియందు జ్ఞానవృత్తిరూపము కూడ విలీనమగును. దానిని ఆత్మరూపముగా తెలుసుకున్న హరిశ్చంద్రునకు అజ్ఞానబంధము నశించెను. మాటలచే వర్ణించశక్యము కానిది, మనస్సుతో ఊహించ శక్యము కానిది అగు ఆ అఖండస ద్రూపమునందు ఆయన విలీనుడై పరబ్రహ్మరూపుడాయెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో త్రిశంకు చరితమును, హరిశ్చంద్రుని వృత్తాంతమును వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7).
