శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
9 - వృత్రాసురుని పుట్టుక - దేవతలు శ్రీహరిని స్తుతించుట
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ విశ్వరూపునకు మూడు తలలు ఉండెననియు, ఒక తలతో సోమరసమును, రెండవ తలతో మద్యమును త్రాగెడివాడనియు, మూడవ దానితో ఆహారమును తినెడివాడనియు విని యుంటిమి.
ఆ విశ్వరూపునకు తండ్రులు దేవతలే. కావున, ఆతడు యజ్ఞములో సవినయముగా బిగ్గరగా దేవతలకు హవిర్భాగములను ప్రకటిస్తూ, సమర్పించెడివాడు.
ఆ విశ్వరూపుడు యజ్ఞమును చేస్తూ, రాక్షసులకు కూడ హవిర్భాగములను రహస్యముగా సమర్పించెను. ఆతని తల్లి రాక్షసవంశమునందు పుట్టుటచే, ఆమెకు వారియందు ఉండే ప్రేమకు ఈతడు కూడ వశీభూతు డై, రాక్షసులకు భాగమును అందజేసెడివాడు.
ఆ విధముగా ఆతడు ధర్మములో కపటమును చేస్తూ దేవతల యెడల అపరాధమును చేయగా, దేవప్రభుడగు ఇంద్రుడు గమనించెను. ఇంద్రుడు భయపడి, కోపముతో వేగముగా ఆతని తలలను నరికివేసెను.
సోమపానమును చేసే వాని తల కముజు పిట్టగను, మద్యమును త్రాగే తల పిచ్చుకగను, ఆహారమును తినే తల తీతువు పిట్టగను ఆయెను.
ఇంద్రుడు స్వర్గాధిపతియే అయిననూ, ఆయనకు బ్రహ్మహత్య తప్పలేదు. ఆయన ఆ పాపమును తన దోసిలితో స్వీకరించెను. సంవత్సరము తరువాత ఆయన తన దేహమునందలి నాలుగు భూతముల పరిశుద్ధి కొరకై (ఆకాశమునకు అపవిత్రత లేదు), ఆ పాపమును నేల, నీరు, చెట్లు మరియు స్త్రీలకు నాలుగు భాగములుగా పంచి యిచ్చెను.
భూమిపై ఎక్కడైననూ గొయ్యి తనంత తానుగా పూడ్చబడవలెను అనే వరమును తీసుకొని, భూమి ఆ పాపముయొక్క నాల్గవ భాగమును స్వీకరించెను. భూమిపై కనబడే చవిటి నేల బ్రహ్మహత్యయొక్క రూపమే.
తెగిన కొమ్మ చిగురించవలెను అనే వరమును పొంది, చెట్లు ఆ పాపములో నాల్గవ వంతును స్వీకరించినవి. ఆ బ్రహ్మహత్యాదోషము కొమ్మను నరికినప్పుడు వచ్చే బంక రూపములో కనబడును.
అధికమగు కామమును వరముగా పొంది, స్త్రీలు ఆ పాపములో నాల్గవ వంతును స్వీకరించిరి. స్త్రీలలో ప్రతి నెల రజస్వల యగుట అనే రూపములో ఆ దోషము కనబడును.
నూతులు మొదలగువాటియందు నీరు అధికముగా ఊరుచుండవలెను అనే వరమును పొంది, జలములు నాల్గవ వంతు పాపమును స్వీకరించినవి. ఆ పాపమే నీటియందు బుడగలు, నురగల రూపములో కనబడును. వ్యక్తి నీటిని తీసుకొనే సమయములో వాటిని ప్రక్కకు త్రోసివేయును.
తరువాత కొడుకును కోల్పోయిన త్వష్ణ ఇంద్రుని సంహరించు వాని కొరకై, ఓ ఇంద్ర సంహారకా! వర్ధిల్లుము, విలంబము లేకుండా శత్రువును హతమార్చుము అనే అర్థము గల మంత్రముతో హోమము చేసెను.
అపుడు దక్షిణాగ్నినుండి భయంకరాకారుడగు పురుషుడొకడు బయటకు వచ్చెను. ఆతడు ప్రళయకాలమునందు లోకములను సంహరించే రుద్రుడు వలె కానవచ్చెను.
ఆ పురుషుడు ప్రతిదినము అన్ని వైపులా ఒక బాణము పరిమాణములో పెరుగుచుండెను. తగులబడ్డ పర్వతము వలె నల్లనైన ఆతడు సంధ్యాకాలమునందలి మేఘముల గుంపుయొక్క కాంతిని కలిగియుండెను. పుటము పెట్టిన రాగిని బోలిన జుట్టు, గెడ్డము, మీసములు గల ఆతని కన్నులు మధ్యాహ్నసూర్యుని వలె చూపరులకు తాపమును కలిగించుచుండెను. ఆతడు గొప్పగా వెలిగిపోవుచున్న మూడు కొనల శూలమును పట్టుకొని బిగ్గరగా నాదము చేస్తూ నాట్యమాడినప్పుడు, నేల కంపించెను. ఆ శూలముపై అంతరిక్షమును గ్రుచ్చినాడా యన్నట్లుండెను. గుహవలె లోతైన ఆతని నోటిలో పెద్ద భయంకరములగు కోరలు ఉండెను. ఆతడు మాటిమాటికీ ఆవులిస్తూ, ఆకాశమును త్రాగివేయుచున్నాడా యన్నట్లు, నాలుకతో నక్షత్రములను నాకి వేయుచున్నాడా యన్నట్లు, ముల్లోకములను మ్రింగి వేయుచున్నాడాయన్నట్లు ఉండెను. వానిని చూచి జనులు చాల భయపడి పది దిక్కులకు పారిపోయిరి.
త్వష్టయొక్క పుత్రుని రూపములో చీకటి ఈ లోకములను ఆవరించెను. కావుననే, పాపి మిక్కిలి క్రూరుడు అగు ఆతడు వృత్రుడు (ఆవరించినవాడు) అని పిలువబడెను.
దేవవీరులు తమ గణములతో కూడి వానిపై దండెత్తి వానిని తమ తమ దివ్యములగు అస్త్ర (మంత్రపూర్వకముగా ప్రయోగించబడే ఆయుధములు) శస్త్రముల (బాణములు మొదలగు ఆయుధములు) తో గట్టిగా కొట్టిరి. ఆతడు వాటినన్నింటినీ మ్రింగి వేసెను.
తరువాత తమ తేజస్సు తిరస్కరించబడుటచే ఆశ్చర్యవిషాదములను పొందియున్న ఆ దేవతలందరు, ఆత్మస్వరూపుడు సర్వజగత్కారణుడు అగు పూర్ణ పరబ్రహ్మను ఏకాగ్రమగు చిత్తముతో నిలబడి స్తుతించిరి.
దేవతలిట్లు పలికిరి --- పృథివ్యప్తేజోవాయ్వాకాశములనే పంచభూతములు, ముల్లోకములు, బ్రహ్మగారు మొదలుగా గల దేవతలమగు మేము కాలమునకు భయపడి, శ్రీహరికి పూజాదికమును సమర్పించుచుందుము. కాని, ఆ కాలము కూడ శ్రీహరి వలన భయపడును. అట్టి శ్రీహరి మాకు శరణు.
సర్వజగత్కర్తయగు శ్రీహరియందు కర్తృత్వాహంకారము గాని, రాగద్వేషములు కానీ లేవు. ఆనందఘనమగు తన స్వరూపము చేతనే పరిపూర్ణమైన మనోరథములు గల శ్రీహరి సర్వమునందు సమముగా ప్రకటమగుచున్నాడు. ఆ శ్రీహరిని కాకుండా, మరియొక సామాన్యుని శరణుపొందే వ్యక్తి, కుక్క తోక పట్టుకొని సముద్రమును తరించ గోరుచున్నాడు.
ఆ మత్స్యమూర్తియొక్క పెద్ద కొమ్మునకు మనువు పడవ రూపములోనున్న పృథివిని కట్టి సునాయాసముగా మహాభయమునుండి బయట పడెను. త్వష్టయొక్క పుత్రుడగు వృత్రుని వలని భయమునకు అంతము కానరాదు. ఆ శ్రీహరియే శరణు వేడిన మమ్ములను కూడ నిశ్చయముగా ఈ భయమునుండి రక్షించగలడు.
పూర్వము ప్రళయజలములయందు పెద్ద గాలులు వీచి తరంగములు పుట్టి మహాశబ్దముతో భయమును గొల్పుచుండగా, ఒంటరియగు స్వయంభువుడు నాభికమలమునుండి పడిపోయేను. ఆయన ఆ భయము నుండి శ్రీహరి అనుగ్రహముచే బయట పడెను. మమ్ములను కూడ ఆ శ్రీహరి రక్షించు గాక!
అద్వితీయుడు, ఈశ్వరుడు అగు శ్రీహరి తన మాయచే మమ్ములను సృష్టించగా, ఆపైన మేము ఆయన అనుగ్రహము చేతనే జగత్తును సృష్టించుచున్నాము. మేము ఆయన కంటే భిన్నులము, మేము ప్రభువులము అనే అభిమానము మాకు గలదు. కావుననే, ఆయన మా యెదుటనే తన లీలలను చేయుచున్ననూ, మేము ఆయన స్వరూపమును తెలియలేకున్నాము.
ఆ శ్రీహరి కాలమునకు అతీతుడు. అయిననూ, ఆయన తన మాయాశక్తిచే యుగయుగమునందు దేవతలు, మహర్షులు, పశువులు, మనుష్యుల రూపముగా అవతరించి, శత్రువులచే మిక్కిలి పీడింపబడుచున్న మమ్ములను తన వారినిగా భావించి రక్షించుచున్నాడు.
ఈ సృష్టికి ఉపాదానము, నిమిత్తము కూడ ఆ శ్రీహరియే. ఆయనయే జగద్రూపముగా ప్రకటమైననూ, జగత్తుకంటె విలక్షణముగానున్నాడు. శరణు జొచ్చినవారిని కాపాడే ఆయనయే మా ఉపాస్యదైవము. మేమందరము ఆ భగవానుని శరణు వేడుచున్నాము. సర్వాత్మస్వరూపుడగు ఆయన మాకు సుఖమును కలిగించ గలడు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా ఆ దేవతలు స్తుతించుచుండగా, పడమర దిక్కునందు శంఖము, చక్రము, గదలను ధరించిన శ్రీహరి ప్రకటమయ్యెను.
ఓ మహారాజా! ఆ శ్రీహరిని చుట్టువారి పదునార్గురు అనుచరులు సేవించుచుండిరి. శ్రీవత్సమనే మచ్చను, కౌస్తుభమాణిక్యమును మినహాయించి, వారు శ్రీహరినే పోలియుండిరి. వికసించిన శరత్కాలపద్మముల వంటి కన్నులు గల ఆ శ్రీహరిని చూచి దేవతలందరు ఆ ఆనందముచే వివశులైరి. వారు సాష్టాంగ దండప్రణామము నాచరించి, మెల్లగా లేచి నిలబడి స్తుతించిరి.
దేవతలిట్లు పలికిరి --- కాలస్వరూపుడవగు నీవే యజ్ఞఫలదాతవు. శత్రువులపై చక్రమును ప్రయోగించే నీకు చక్కని నామములు చాల గలవు. నీకు అనేక నమస్కారములు.
ఓ పాలకుడా! జీవులు పొందే ఉత్తమ (స్వర్గాది)- మధ్యమ (మనుష్య)- అధమ (నరకాది) గతులను శాసించేది నీవే. నీ సర్వాతీశాయి స్వరూపమును తెలియుటకు సృష్టి తరువాత వచ్చిన మావంటివారు తగరు.
ఓ నారాయణ భగవానుడా! నీకు నమస్కారమగు గాక! వాసుదేవా! పురుషోత్తమా! జగత్కారణమగు చైతన్యము నీవే. నీ మహిమ గొప్పది. పరమమంగళమగు నీ రూపము భక్తులకు గొప్ప కల్యాణముల నిచ్చును. ఓ అద్వయా! కరుణామయుడవగు నీవే జగత్తునకు అధిష్ఠానమగుచున్నావు. లోకములను శాసించి రక్షించే ఏకైకప్రభుడవు నీవే. ఓ లక్ష్మీపతీ!
పరమహంస పరివ్రాజకులు సర్వోత్కృష్టమగు ఆత్మనిష్ఠయందు ఏకాగ్రత గలవారై యుందురు. ఆ విధముగా పరిశుద్ధము చేయబడిన వారి అంతఃకరణమునందు సర్వసంగపరిత్యాగుల శమదమాది ధర్మము చక్కగా స్ఫురించుచుండును. దానిచే, చిత్తము అనే మోక్షద్వారమునకు ఉండే అజ్ఞానపు తలుపులు తెరుచుకొనును. అట్టి చిత్తమునందు ఆత్మరూపుడవైన నీవు చక్కగా ఆవిర్భవించెదవు. అట్టి ఆత్మసాక్షాత్కారమునందు తనంత తానుగా ప్రకటమయ్యే బ్రహ్మానందానుభవము నీ స్వరూపమే.
నీ ఈ లీలాపద్ధతి బుద్ధికి అంతు పట్టుటనే లేదు. ఏలయన, నీకు ఆశ్రయము గాని, శరీరము గాని, గుణములు గాని లేవు. మా సాహాయ్యమును నీవు అపేక్షించవు, నీ స్వరూపములో వికారములేవియు రావు. అయిననూ, నీవీ త్రిగుణముల కార్యమగు జగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించుచున్నావు.
నీవు ప్రాకృతజీవుని వలె ఈ లోకములో త్రిగుణకార్యమగు దేహాదులయందు ఆత్మభావము గలవాడవై పరాధీనుడవై మంచి-చెడు కర్మలను చేసి వాటి ఫలములగు సుఖదుఃఖములననుభవించుచున్నావా? లేక, ఆత్మారాముడవు, శాంతస్వభావుడవు, కర్తృత్వ భోక్తృత్వములకు అతీతమగు బ్రహ్మాత్మ దర్శనము గలవాడవు అగు కేవల సాక్షివై యున్నావా? ఇది మాకు అంతు పట్టరాకున్నది.
సర్వమును శాసించే భగవానుని గుణగణములను లెక్కించుట శక్యము కాదు. తెలియ శక్యము కాని మహిమ గల ఆ భగవానుని విషయములో, దురాగ్రహమునకు నిలయమై దూషితమైన బుద్ధి గల వాదులు కొంగ్రొత్తగా కల్పించే చెడు తర్కముల శాస్త్రములలోని వికల్పములకు (ఇదా? అదా? అనే సంశయములు), విరు ద్ధతర్కములకు, విచారములకు (వాదనలు), ప్రమాణములు (జ్ఞానసాధనములు) వలె కన్పట్టే అప్రమాణములకు తావు లేదు. మాయాకల్పితమగు సంసారము అద్వితీయుడగు ఆ భగవానునియందు నిరస్తమైనది. భగవానునియందు సగుణము-నిర్గుణము, కర్త-అకర్త మొదలగు పరస్పర విరుద్ధములగు అంశములు మాయాశక్తిని మధ్యలో నుంచుకున్నచో అసంగతములు కానే కావు. మాయాశక్తిచే పొసగనిది ఒకటి ఉన్నదా! వాస్తవములో సర్వమునకు అతీతమగు అద్వయ బ్రహ్మయందు కర్తృత్వము గాని, అకర్తృత్వము గాని, సగుణత్వము గాని, నిర్గుణత్వము గాని ఉండవు. పరబ్రహ్మ సకలద్వంద్వ విలక్షణము.
ఒకే త్రాడు ముక్క యథార్థమగు దర్శనము గలవానికి త్రాడుగను, విరుద్ధదర్శనము గలవారలకు పాము మాల మొదలగు రూపములలోను కొనవచ్చును. అదే విధముగా, సమదర్శనము (అద్వయబ్రహ్మాత్మజ్ఞానము) గలవారలకు సర్వరూపుడువుగను, భేదదృష్టి గలవారలకు భేదములు గలవాడివగను కానవచ్చేది నీవే.
మరల విచారించినచో, సర్వజగన్నాథుడగు ఆ భగవానుడు సకల జగత్తునకు కారణములగు పంచభూతములకు కూడ కారణము. కావున, సకలప్రపంచముయొక్క పరమార్థ (కేవల-అఖండసత్తా) స్వరూపము ఆయనయే. ఆయనయే సకలప్రాణులలో అంతరతమమగు ఆత్మస్వరూపముగా ఉండి, గుణకార్యములగు ఇంద్రియములనన్నింటినీ ప్రకాశింప జేయుచున్నాడు. ఆయా ఇంద్రియప్రకాశములు ఆ సర్వేశ్వరునే సంకేతముగా చూపుచున్నవి. ఈ కార్యప్రపంచమును సర్వమును నిషేధించగా (కారణముకంటే భిన్నముగా లేదని తెలుసుకొని కారణములో విలీనముచేయగా), మిగిలి ఉండేది ఆ అద్వయ పరమేశ్వరుడు మాత్రమే.
ఓ మధుసూదనా! కావుననే, భగవద్భక్తశిఖామణులకు నీ మహిమ అనే అమృతరససముద్రముయొక్క బిందువును ఒక్కసారి ఆస్వాదించినంతనే వారి మనస్సునందు అఖండానందము జాలువారును. దానిచే వారు అంతవరకు చూచిన మరియు విన్న ఇంద్రియభోగములయందలి అల్పమగు సుఖముయొక్క ప్రతీతి మరుగున పడిపోవును. సకలప్రాణులకు ఆత్మరూపుడవు, హితకారివి, సర్వముయొక్క పరమార్థరూ పుడవు, భగవానుడవు అగు నీయందు అనన్యభక్తి గల ఆ సాధుపురుషుల మనస్సు సుఖముగా నిలిచియుండును. తమ పురుషార్థము విషయములో నిపుణులగు ఈ భక్తులు ఆత్మయందే ఆనందఘనుడు హితకరుడు అగు పరబ్రహ్మను దర్శించేదరు. అట్టి మహాత్ములు మరల నీ పాదపద్మముల నిరంతర సేవను ఏ విధముగా విడిచిపెట్టెదరు? (విడిచిపెట్టరు). దాని వలన మానవునకు మరల ఈ సంసారములో పరిభ్రమణము తొలగి పోవును.
ఓ భగవానుడా! ఈ ముల్లోకములే నీ నివాసము. ఈ ముల్లోకములకు నీవే ఆత్మ మరియు ఆశ్రయము. నీవీ ముల్లోకములను మూడు అడుగులతో కొలిచినావు. ముక్కంటివి నీవే. నీ మహిమలు (లీలలు) ముల్లోకములలో మనోహరములైనవి. దితి దనువుల సంతానమగు రాక్షసులు కూడ నీ విభూతులే. అయిననూ, వారు ఉద్యమించే కాలము ఇది కాదని భావించిన సందర్భములలో, నీవు నీ స్వరూపములో అంతర్గతమైన మాయాశక్తిచే దేవత (వామనుడు), మానవుడు (శ్రీరాముడు), మృగము (వరాహము), నరసింహముల కలయిక, జలచరము (మత్స్యము) ల రూపములో అవతరించి, వారి అపరాధములకు తగ్గట్లుగా వారికి శిక్షను అమలు చేసితివి. అదే విధముగా, నీకు అంగీకారమైనచో, త్వష్టయొక్క పుత్రుడగు ఈ వృత్రుని కూడ సంహరించుము.
కర్తృత్వాది దోషములు లేని ఓ శ్రీహరీ! మాకు తండ్రివి, తాతవు నీవే. మేము నీ వారము. నీకు నమస్కరించుచున్నాము. మా హృదయములు నీ పాదపద్మముల జంటకు ధ్యానము అనే సంకేలచే కట్టి వేయబడినవి. నీవు నీ మూర్తిని మా ముందు ప్రకటించి మమ్ములను నీవారినిగా స్వీకరించినావు. నీ అందమగు నిర్మలమైన చిరునవ్వు దయతో అనురాగముతో కూడి చల్లగా నుండును. అట్టి చిరునవ్వుతో కూడిన చూపుతో, మరియు నీ నోటినుండి వెలువడే మధురమగు వాక్కు అనే అమృతబిందువుతో మా మనస్తాపమును చల్లార్చుట నీకు తగును.
ఓ భగవానుడా! నీవు గురువులకు గురుడవు. నిన్ను శరణు పొందినవారికి వివిధదుఃఖములతో కూడియున్న సంసారమునందలి అధికమగు శ్రమను నీ పాదపద్మముల నీడ ఉపశమింప జేయుచుండును. మేము ఒక కోరికతో అట్టి నీ పాదములను పట్టుకున్నాము. కావున, నీవు స్వయముగా మాకా కోరికను సంపాదించి పెట్టుము.
ఓ ఈశ్వరా! కృష్ణా! కావున, ఇప్పటికే మా శక్తులను అస్త్రములను ఆయుధములను మ్రింగివేసి, ముల్లోకములను కూడ మ్రింగి వేయుచున్న త్వష్టయొక్క పుత్రుడగు ఆ వృత్రుని నీవు సంహరించుము.
శ్రీభగవానుడిట్లు పలికెను --- ఓ దేవతోత్తములారా! మీరు నన్ను ఉద్దేశించి చేసిన స్తుతి తత్త్వజ్ఞానముతో కూడియున్నది. నేను ప్రసన్నుడనైతిని. ఈ స్తుతి వలన మానవులకు నాయందు భక్తి కూడ ఉదయించి, ఆత్మరూపుడనగు నా ఈశ్వరభావము స్మృతిలో నుండును.
ఓ దేవతోత్తములారా! నేను ప్రసన్నుడనైనచో లభించనిది ఏమి ఉండును? అయిననూ, నాయందు అనన్యమగు భక్తిగల తత్త్వవేత్తలు నానుండి (భక్తిని తక్క) ఇతరమును దేనినీ కోరరు.
త్రిగుణకార్యమగు జగత్తునందు సత్యత్వబుద్ధి గల వ్యక్తి సంసారాసక్తుడై యుండును. వానికి తన హితము ఏదో తెలియదు. వాడు కోరే భోగ.
మోక్షసాధనమగు ఆత్మజ్ఞానమును పొందిన మహాత్ముడు అజ్ఞానికి కామనలను తీర్చే కర్మల నుపదేశించడు. హితము కాని ఆహారమును రోగి కోరిననూ, మంచి వైద్యుడు ఆతనికి దానిని ఈయడు గదా!
ఓ ఇంద్రా! దధీచి మహర్షివద్దకు శీఘ్రముగా వెళ్లుడు. మీకు మంగళమగు గాక! ఉపాసన, వ్రతములు, తపస్సులచే దృఢమైన ఆయన శరీరమును కోరుడు.
నిరవయవమగు పరబ్రహ్మయొక్క జ్ఞానము ఆ దధీచునకు గలదు, అశ్వశిరము అని ప్రసిద్ధి గాంచిన ఆ జ్ఞానమును ఆయన అశ్వినీ కుమారులకు ఉపదేశించగా, వారు జీవన్ముక్తులైరి.
అథర్వవేదీయుడగు దధీచి నా స్వరూపమగు కవచమును త్వష్టకు ఇచ్చెను. ఆ కవచము దుర్భేద్యమైనది. దానిని త్వష్ట తన పుత్రుడగు విశ్వరూపునకీయగా, ఆయన వద్దనుండి నీవు పొంది ధారణ చేసితివి.
అశ్వినీ దేవతలు కోరినచో, ధర్మము తెలిసిన దధీచి తన అవయవములను మీకు ఈయగలడు. వాటితో విశ్వకర్మ గొప్ప ఆయుధమును నిర్మించును. నా తేజస్సుచే వర్ధిల్లజేయబడిన నీవు దానితో వృత్రుని తలను నరుకగలవు.
ఆ వృత్రుడు సంహరించబడగానే మీకు తేజస్సు, అస్త్రశస్త్రములు, సంపదలు మరల లభించగలవు. మీకు మంగళమగు గాక! నా భక్తులను ఎవరైననూ హింసించలేరు.
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో వృత్రాసురుని
జననమును వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
