శ్రీ మద్భాగవతము - షష్థమ (6వ) స్కందము
2 - అజామీలుడు వైకుంఠమును పొందుట
శ్రీ శుకమహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఆ విష్ణు దూతలు ధర్మనిర్ణయములో పండితులు. వారా యమదూతల ప్రసంగ మును సావధానముగా విని, తరువాత వారికి ఇట్లు బదులు చెప్పిరి.
విష్ణుదూతలు ఇట్లు పలికిరి --- అయ్యో! కష్టము వచ్చినది! ధర్మ వేత్తల సభలో అధర్మము ప్రవేశించుచున్నది. ఏలయనగా, అచట వారిచే శిక్షించదగని నిరపరాధులకు శిక్ష వేయబడుచున్నది.
ప్రజలను తండ్రివలె సమబుద్దితో పాలించ వలసిన సత్పురుషుల యందే వైపరీత్యము వచ్చినచో, ఆ ప్రజలు ఎవనిని శరణు పొందెదరు?
శ్రేష్ట పురుషుడు దేనిని చేస్తే, సామాన్యజనులు దానినే చేయుదు రు. ఆతడు దేనిని ధర్మమని ప్రమాణీకరిస్తే, దానినే జనులు అనుసరిస్తారు.
అజ్ఞానియగు సామాన్యమానవుడు తాను ధర్మాధర్మములను ఎరుంగడు. సామాన్యజనుడు ఒక గొప్పవానిని నమ్మి, ఆతని ఒడిలో తల నుంచి సుఖముగా నిద్రించును.
అజ్ఞానులగు జనులు ఎవనినైతే నమ్మి మైత్రిని నేరపి తమను తాము పూర్తిగా సమర్పించుకొందురో, అట్టి నమ్మదగిన మరియు దయ గల నాయకుడు, వారికి ద్రోహము చేయుటకు ఎట్లు తగును? తగడు.
ఈతడు కోటి జన్మల పాపములకైననూ నిశ్చయముగా ప్రాయశ్చి త్తమును చేసుకున్నాడు. ఏలయనగా, ఈతడు కల్యాణములకు నిలయమగు శ్రీహరి నామమును, ఉద్దేశ్యపూర్వకముగా కాకున్ననూ, పలికినాడు.
ఈతడు ఎప్పుడైతే, నారాయణా! రమ్ము అని నాలుగు అక్షర ముల నామమును ఉచ్చరించినాడో, అప్పుడు దానిచేతనే ఈ పాపియొక్క పాపములకు నిష్కృతి కలిగినది. ఇది నిశ్చయము.
బంగారమును దొంగిలించినవాడు, మద్యము త్రాగువాడు, మిత్రు నకు ద్రోహమును చేసినవాడు, వేదవేత్తను చంపినవాడు, గురువుయొక్క భార్యను కోరినవాడు, స్త్రీని రాజును తల్లిని తండ్రిని ఆవును లేదా ఎద్దును చంపినవాడు అను వారే గాక ఇంకనూ ఇతరములైన పాపములను చేసిన వారందరికి విష్ణువుయొక్క నామమును ఉచ్చరించుటయే చక్కటి ప్రాయశ్చిత్తము. నామమునుచ్చరించుట వలన వీని మనస్సు భగవదాకారము అగును. లేదా, భగవానునకు వీడు గుర్తుకు వచ్చి వీనిపై అనుగ్రహము కలుగును.
వేదవేత్తలు పాపనిష్కృతికై వ్రతములు మొదలగు ప్రాయశ్చిత్తము లను చెప్పినారు. కాని కేవలము శ్రీహరి పేర్ల రూపములో నుండే పదము లను ఉచ్చరించి పాపి ఎట్టి విశేషమగు శుద్ధిని పొందుతున్నాడో, అట్టి విశుద్ధి ఆ ప్రాయశ్చిత్తములచే కలుగుట లేదు. పావనమగు కీర్తి గల శ్రీహరి పేరును ఉచ్చరించుట వలన, ఆయన గుణములు మనస్సునకు వచ్చును.
ప్రాయశ్చిత్తమును చేసిన తరువాత మరల మనస్సు చెడు మార్గ ములోనికి వెళ్లినచో, ఆ ప్రాయశ్చిత్తము వాని అంతఃకరణమును పూర్తిగా శుద్దము చేసినట్లు కానే కాదు. కావున, కర్మబంధమునుండి ఆత్యంతికమగు విముక్తిని కోరువారు శ్రీహరి గుణములను కీర్తించినచో, వారి అంతఃకరణము పూర్తిగా విశుద్ధమగును (తద్ద్వారా మోక్షము లభించును)
ఈతడు మరణిస్తూ భగవానుని నామమును చక్కగా ఉచ్చరించి, ఆ విధముగా తన పాపములన్నింటికీ ప్రాయశ్చిత్తమును చేసుకున్నాడు. కావున, మీరీతనిని నరకమార్గముగుండా కొనిపోవద్దు.
వైకుంఠవాసి (బుద్దియందు చైతన్యమై ఉండువాడు) యగు శ్రీహ రియొక్క నామమును ఇంకొకరి పేరును పిలిచినప్పుడు గాని, పరిహాసము కొరకు గాని, పాటలో ఊతపదముగా గాని, ఒకనిని గేలి చేయుటకు గాని ఉచ్చరించినా, పాపములన్నియు నశించునని మహాత్ములు ఎరుగుదురు.
మానవుడు పడినప్పుడు గాని, జారినప్పుడు గాని, అవయమే దైనా విరిగినప్పుడు గాని, ఏదైనా కరిచినప్పుడు గాని, ఎండ మొదలగు వాటి తాపము కలిగినప్పుడు గాని, కర్ర మొదలగువాటి దెబ్బ తగిలిన ప్పుడు గాని, బుద్ధిపూర్వకముగా కాకపోయినా, హరి అనే నామ మునుచ్చరించినచో, ఆతడు నరకయాతనలకు అర్హుడు కాడు.
మహర్షులు విచారణ చేసియే పెద్ద పాపములకు పెద్ద ప్రాయశ్చిత్త ములను, చిన్నవాటికి చిన్నవాటిని చెప్పిరి.
తపస్సు, దానము, జపము మొదలగు ప్రాయశ్చిత్తములచే పాప ములు వినాశమును పొందవచ్చును. కాని, అధర్మసంకల్పమునకు జన్మని చ్చిన అంతఃకరణము శుద్దము కాదు. ఈశ్వరుని పాదములను సేవించిన చో, అంతఃకరణము కూడ శుద్ధమగును.
మానవుడు తెలిసి గాని, తెలియక గాని పవిత్రకీర్తియగు శ్రీహరి నామము నుచ్చరించినచో, అది వాని పాపమును, నిప్పు కట్టెను వలె తగు లబెట్టును.
మంచి శక్తి గల మందును ఒకడు తెలియక..తానే అనుకోకుండా (ఈశ్వరేచ్చచే) వాడినచో, ఆ మందు తన గుణమును రూపును. అదే విధ ముగా, హరినామమంత్రము నుచ్చరిస్తే, దాని ప్రభావము కనబడి తీరును.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! వారీ విధముగా భగవద్భక్తి అనే ధర్మమును చక్కగా వివరముగా నిర్ధారించి, ఆ అజామి లుని యమదూతల పాశమునుండీ మాత్రమే గాక, మరణమునుండి కూడ విముక్తుని చేసిరి.
అంతశ్శత్రువులను నియమించిన ఓ రాజా! విష్ణుదూతలీ విధ ముగా బదులీయగా, యమదూతలు యముని వద్దకు వెళ్లి, జరిగిన వృత్తాం తమునంతను పూస గుచ్చినట్లు చెప్పిరి.
మృత్యుపాశమునుండి విముక్తుడైన అజామిలునకు విష్ణువు యొక్క అనుచరులను చూచుటచే ఆనందము కలిగెను. భయము తొలగి ఆతనికి స్వస్థత చిక్కెను. అపుడాతడు వారికి తల వంచి నమస్కరించెను.
పుణ్యాత్ముడవగు ఓ మహారాజా! ఆ అజామిలుడు ఏదో చెప్పబో తున్నాడని గమనించిన పురుషోత్తముని అనుచరులు వెంటనే, ఆతడు చూచుచుండగనే అచట అంతర్ధానమైరి.
వేదోక్తమైనది, సత్త్వరజస్తమోగుణాత్మకమగు సంసారమే ఆశ్రయ ముగా గలది అగు ప్రవృత్తిధర్మమును యమదూతలు చెప్పిరి. విశుద్ధమగు భాగవత ధర్మమును విష్ణుదూతలు చెప్పిరి. ఈ రెండింటినీ అజామీలుడు వినెను. శ్రీహరియొక్క మహిమను గురించి వినుటచే ఆతనికి అపుడు వెంటనే భగవద్భక్తి ఉదయించెను. ఆతడు తన పాపములను గుర్తుకు తెచ్చుకొని, అధికమగు పశ్చాత్తాపమును పొందెను.
అయ్యో! మనోజయము నెరుంగని నాకు పెద్ద ఆపద కలిగినది. నేను దాసియందు పుత్రుని రూపములో జన్మించి (పుత్రుని కని), వేదధర్మ మును నాశము జేసితిని.
పాపినియగు నేను సత్పురుషులచే నిందించబడితిని. వంశము నకు కలంకమగు నాకు ధిక్కారమగుగాక! అమాయకురాలు, పతివ్రత అగు భార్యను విడిచి, నేను మద్యమును త్రాగే దుష్టురాలిని పొందితిని.
అయ్యో! మరో రక్షకుడు గాని, ఇంకో బంధువులు గాని లేనివారై పరితపిస్తూ ఉండే నా తల్లిదండ్రులను కృతఘ్నుడనగు నేను ఆ కాలములో ఆమెను కలిసిన వెంటనే విడిచి పెట్టితిని. నేను నీచుడను.
అట్టి నేను ఖచ్చితముగా మిక్కిలి దారుణమగు నరకములో పడెద ను. అచట ధర్మమును చెడగొట్టే కాముకులు యమయాతనల ననుభవించెదరు.
నేను చూసిన ఈ అద్భుతము స్వప్నమా యేమి? లేక, నేను ఇక్కడ ప్రత్యక్షముగనే చూచితినా? చేతులలోని పాశములతో నన్ను లాగి వేసిన ఆ కింకరులు ఎక్కడకు వెళ్లినారు?
మరియు ఆ నల్గురు సుందరాకారులను సిద్ధపురుషులు ఎచటకు వెళ్లినారు? త్రాళ్లతో కట్టి పాతాళమునకు కొనిపోబడుచున్న నన్ను వారు విడిపించిరి.
అయిననూ, దురదృష్టవంతుడనగు నాకు దేవతోత్తముల దర్శ నము కలిగినది. అట్టివారిని దర్శించుటచే మనస్సు ప్రసన్నమగును. నాలో ఏదో ఒక పూర్వపుణ్యము ఉండి యుండవలెను.
దాసీభర్తనగు నాయందు శౌచము లేదు. పూర్వపుణ్యము లేనిచో, మరణించుచున్న నా నాలుక మనస్సును కట్టివేసే శ్రీహరినామమును పలికి యుండెడిది గాదు.
మోసగాడను, పాపిని, సిగ్గు లేకుండా వేదధర్మమును చెడగొట్టిన వాడను అగు నేనెక్కడ? ఓ నారాయణా! అనే ఈ మంగళకరమగు భగవ న్నామమెక్కడ? (నా పూర్వపుణ్యము చేతనే నాకీ నామము దక్కినది).
అట్టి నేను ఉచ్చ్వాసనిశ్శ్వాసలను (ప్రాణాయామము), ఇంద్రియ ములను (ప్రత్యాహారము), మనస్సును (ధారణ) నియంత్రించి సాధన చేసి, మరల మోహపూర్ణమగు నరకములో మునిగిపోకుండా నన్ను నేను కాపాడుకొనెదను.
ఆత్మస్వరూపము తెలియకుండుట, దాని వలన కోరికలు, వాటి వలన కర్మలు, వాటి వలన బంధము కలుగును. అట్టి ఈ బంధమును విడి చిపెట్టి, నేను సకలప్రాణుల హితమును కోరుతూ, శాంతముగా స్నేహశీల ముతో దయాగుణముతో ఇంద్రియజయము కలిగి యుండెదను. స్త్రీరూప ములోనున్న శ్రీహరియొక్క మాయ అధముడనగు నన్ను పట్టుకొని, కోతిని చేసి యాడించినది. ఆ మాయనుండి నన్ను నేను విడిపించు కొనెదను.
భోగ్యములగు విషయములు అనిత్యములు. నా బుద్ది వాటి యందు తగుల్కొని యుండెను. నేను దేహమునందు, మనస్సునందు నేను మరియు నాది అనే ధారణను విడిచి పెట్టెదను. భగవానుని కీర్తించుట మొదలగు సాధనలచే అంతఃకరణమును విశుద్దమొనర్చుకొని, నేను నా మనస్సును భగవానునిపై నిలిపెదను.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా కొద్ది సేపు సత్పురుషులతోడి సంగము వలన ఆతనికి చక్కని వైరాగ్యము కలిగెను. ఆతడు సంసారవిషయములన్నింటియందు ఆసక్తిని విడిచి పెట్టి, హరిద్వార మును చేరుకొనెను.
ఆతడు ఆ దేవస్థానమునందు కూర్చుండి యోగమార్గమును స్వీక రించెను. ఆతడు ఇంద్రియ సముదాయమును విషయములనుండి ఉపసం హరించి (ప్రత్యాహారము) మనస్సును ఆత్మయందు విలీనము చేసెను.
ఆతడు క్రమముగా మనస్సును గుణకార్యములగు దేహేంద్రియ మనోవృత్తులనుండి వివిక్తము చేసి ఆత్మనిష్ఠుడయ్యెను. భగవానుడు హృద యమునందు నిర్విశేష జ్ఞానరూపుడై యున్నాడు. అట్టి బ్రహ్మ-అభిన్న మగు ఆత్మయందు ఆతడు మనస్సును విలీనము చేసెను.
అజామిలుడు భగవానునియందు మనస్సును లగ్నము చేసియుం డగా, ఆతనికి తన యెదుట. శ్రీహరి అనుచరులు కనబడిరి. వారు ఆతడు ఇదివరలో చూచినవారే. అపుడాతడు వారిని గుర్తు పట్టి, తల వంచి నమ స్కరించెను.
వారి దర్శనము తరువాత ఆతడు హరిద్వారములోని గంగ ఒడ్డున దేహమును విడిచి పెట్టి, వెంటనే భగవంతుని అనుచరుల రూప మును స్వీకరించెను.
అజామిలుడు శ్రీహరి పారదులతో బాటుగా బంగరు విమానము నెక్కి ఆకాశమార్గములో లక్ష్మీపతి ఉన్న స్థానము (వైకుంఠము)నకు వెళ్లాను.
ఈ విధముగా అజామిలుడు దాసీకి భర్త ధర్మములనన్నింటినీ నాశము చేసుకొని, నిందించదగిన కర్మలచే పతితుడై, చెడిన వ్రతములు గలవాడయ్యెను. ఆతనిని నరకములో పడద్రోయుటకు యమదూతలు సిద్ద మైరి. అట్టి స్థితిలో ఆతడు భగవానుని నామమునుచ్చరించి, వెంటనే మోక్ష మును పొందెను.
కావున, మోక్షమును కోరువారలకు కర్మబంధమును (కర్మలకు మూలమగు అజ్ఞానమును) తెగగొట్టుటకు పవిత్రమగు పాదములు గల శ్రీహరిని నిరంతరముగా కీర్తించుట కంటే గొప్ప ఉపాయము మరియొకటి లేదు. ఏలయనగా, దీని వలన మనస్సు మరల కర్మలయందు ఆసక్తి గలది. కాదు. దీనికి భిన్నమగు ఉపాయముల ననుష్ఠించినచో, మనస్సు రజస్తమో గుణములచే మలినమగుట తప్పదు.
పాపియే అయిననూ ఏ మానవుడైతే పాపములను పోగొట్టే ఈ గొప్ప రహస్యమగు ఇతిహాసమును శ్రద్ధతో వినునో, మరియు భక్తితో నిరం తరముగా భగవానుని కీర్తించునో, అట్టివాడు నరకమును పొందే ప్రసక్తియే లేదు. యమకింకరులు వానివైపు కన్నెత్తి చూడరు. అట్టివాడు విష్ణులోక ములో మహిమ గాంచును.
మహాపాపియగు అజామీలుడు కూడ తన కొడుకుకు పెట్టుకున్న శ్రీహరి పేరును మరణసమయములో ఉచ్చరించి వైకుంఠమును పొందెను. శ్రద్ధతో శ్రీహరి నామమునుచ్చరించువాడు మోక్షమును పొందునని వేరుగా చెప్పవలయునా?
శ్రీమద్బాగవత మహాపురాణమునందలి ఆరవ స్కంధములో అజామీలుడు వైకుంఠమును పొందుటను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2).
