భాగవత మహా పురాణము
20 - శకుంతలా దుష్యంతుల గాథ – భరతుని రాజ్య పాలనము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఇప్పుడు పూరువుయొక్క వంశమును వర్ణించెదను. ఈ వంశమునందే నీవు జన్మించితివి. ఈ వంశములో వంశవర్ధనులగు రాజర్షులు మరియు బ్రహ్మర్షులు కూడ జన్మించిరి.
పూరువుయొక్క పుత్రుడు జనమేజయుడు. జనమేజయుని పుత్రుడు ప్రచిన్వంతుడు. ప్రచిన్వంతుని పుత్రుడు ప్రవీరుడు. ప్రవీరుని పుత్రుడు నమస్యువు. నమస్యుని పుత్రుడు చారుపదుడు.
చారుపదుని పుత్రుడు సుద్యువు. సుద్యువు పుత్రుడు బహుగవుడు. బహుగవుని పుత్రుడు సంయాతి. సంయాతి పుత్రుడు అహంయాతి. అహంయాతి పుత్రుడు రౌద్రాశ్వుడు.
ఆ రౌద్రాశ్వునకు ఘృతాచి అనే అప్సరసయందు -- ప్రాణికోటికి ఆత్మయైన ముఖ్య (ప్రధాన) ప్రాణమునకు పది ఇంద్రియములు (అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు) వలె -- పది మంది పుత్రులు కలిగిరి. ఋతేయువు, కుక్షేయువు, స్థండిలేయువు, కృతేయువు, జలేయువు, సంతతేయువు, ధర్మేయువు, సత్యేయువు, ప్రతేయువు, వనేయువు అనునవి వారి పేర్లు. వీరిలో వనేయువు ఆఖరివాడు.
ఓ పరీక్షిన్మహారాజా! ఋతేయువుయొక్క పుత్రుడు రంతిభారుడు. రంతిభారునకు సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అనే ముగ్గురు పుత్రులు కలిగిరి. అప్రతిరథుని పుత్రుడు కణ్వుడు.
కణ్వుని పుత్రుడు మేధాతిథి. ఆయననుండియే ప్రస్కణ్వుడు మొదలగు బ్రాహ్మణులు ఉదయించిరి. సుమతి (రంతభారుని పుత్రుడు) యొక్క పుత్రుడు రైభ్యుడు. రైభ్యుని పుత్రుడు దుష్యంతుడు.
దుష్యంతుడు కొద్దిమంది భటులు చుట్టువారి రాగా వేటకు వెళ్లి, కణ్వమహర్షియొక్క ఆశ్రమస్థానమునకు వెళ్లెను. అచట కూర్చుండియున్న లక్ష్మీదేవివంటి ఒక స్త్రీని చూచెను. ఆమె తన కాంతిచే ఆ ఆశ్రమమునకే అలంకారమా యన్నట్లు ఉండెను. దేవమాయవంటి ఆ యువతిని చూచి ఆయన వెంటనే మోహమును పొందెను. అపుడాయన ఆ సుందరితో మాటలాడెను.
ఆమెను చూచుటచే చాల హర్షమును పొందిన దుష్యంతునకు (వేట వలని) అలసట పూర్తిగా తొలగిపోయెను.(ఆమె యందలి) కామనచే మిక్కిలి తాపమును పొందిన ఆయన నవ్వుతూ మధురమగు వాక్కుతో ఆమెను ఇట్లు ప్రశ్నించెను.
ఓ కలువ రేకుల కన్నుల దానా! నీవెవతెవు? నీవు నా హృదయమును దోచినావు సుమా! నీవు ఎవరి దానవు? నిర్జనమగు ఈ అడవిలో నీవు ఏమి చేయగోరుచున్నావు?
ఓ చక్కని నడుము దానా! నీవు క్షత్రియకన్యవని స్పష్టముగా నాకు తెలియుచునే యున్నది. ఏలయనగా, పూరువంశీయుల మనస్సు ఏనాడైననూ (ఎక్కడైననూ) అధర్మమునందు రమించదు.
శకుంతలోవాచ ।
శకుంతల ఇట్లు పలికెను --- ఓ వీరుడా! యథార్థమే. నేను విశ్వామిత్రుడనే క్షత్రియుని కుమార్తెనే. నన్ను మేనక అడవిలో విడిచి పెట్టినది. ఈ విషయము కణ్వమహర్షికి తెలియును. మేము నీకు చేయదగినది ఏమైన గలదా?
పద్మముల వంటి కన్నులు గలవాడా! సంశయించకుండా కూర్చుండుడు. మా పూజను స్వీకరించుడు. మా వద్ద నివ్వెర బియ్యపు సరుకులు గలవు. తమరు వాటిని భుజించుడు. తమకు ఇష్టమైనచో, ఇచట మకాము చేయుడు.
దుష్యంత ఉవాచ ।
దుష్యంతుడిట్లు పలికెను --- అందమైన కనుబొమలు గలదానా! కుశిక వంశములో జన్మించిన నీవు ఇట్టి ఆతిథ్యమునిచ్చుట తగియేయున్నది. రాజకన్యకలు తామే తగిన వరుని ఎన్నుకొనెదరు సుమా!
దుష్యంత మహారాజు దేశకాలములను మరియు శాస్త్రవిధులను తెలిసినవాడు. శకుంతల తన అంగీకారమును తెలుపగానే, ఆయన ఆమెను ధర్మమును తప్పకుండా గాంధర్వవివాహ (పరస్పరము ప్రతిజ్ఞలను చేసుకొనుట) పద్ధతిలో వివాహము చేసుకొనెను.
రాజర్షియగు దుష్యంతుడు అమోఘమగు శక్తి గలవాడు. ఆయన తన భార్యయగు శకుంతలయందు గర్భమును ఆధానము చేసెను. తెల్లవారగానే ఆయన తన నగరమునకు వెళ్లెను. ప్రసవకాలము సంప్రాప్తము కాగా, ఆమె పుత్రుని కనెను.
ఆ బాలకునకు కణ్వ మహర్షి జాతకర్మ మొదలగు యథోచితము లైన సంస్కారములను అడవిలోనే నిర్వర్తించెను. ఆ బాలుడు సింహములను బలముగా బంధించి వాటితో ఆడుకొనెడివాడు.
శ్రీహరియొక్క అంశయొక్క అంశతో పుట్టిన ఆ బాలకుడు ఎదురులేని పరాక్రమము గలవాడు. యువతులలో శ్రేష్ఠురాలగు శకుంతల ఆ బాలకుని తీసుకొని తన భర్తయగు దుష్యంతుని దగ్గరకు వచ్చెను.
దోషము లేని ఆ భార్యను, పుత్రుని దుష్యంత మహారాజు స్వీకరించ లేదు. అప్పుడు సకలప్రాణులు వినుచుండగా ఆకాశమునందు అశరీరవాణి ఇట్లు పలికెను.
పుత్రునకు తల్లి క్షేత్రము. పుత్రుడు వాస్తవములో తండ్రికి మాత్రమే చెందును. పుత్రుడు ఏ తండ్రి ద్వారా పుట్టునో, ఆ తండ్రికంటె భిన్నుడు కాడు. ఓ దుష్యంతా! పుత్రుని స్వీకరించి పాలించుము. శకుంతలను అవమానించకుము.(భరించుమని చెప్పుటచే ఆ బాలుడు భరతుడైనాడు).
ఓ మహారాజా! వంశకర్తయగు పుత్రుడే తండ్రిని యమపురికి పోకుండా (నరకములో పడకుండా) తరింప జేయును. ఈ శిశువునకు తండ్రివి నీవే. శకుంతల సత్యమునే చెప్పుచున్నది.
తండ్రియగు దుష్యంతుడు మరణించిన తరువాత ఆ బాలకుడు (భరతుడు) చక్రవర్తియై గొప్ప కీర్తిని పొందెను. శ్రీహరియొక్క అంశ వలన జన్మించిన ఆ భరతుని గొప్పదనమును భూలోకములో జనులు కీర్తించుచున్నారు.
ఈ భరతుని కుడిచేతియందు చక్రము, రెండు పాదములయందు పద్మపు మొగ్గలు (సాముద్రిక చిహ్నములైన చక్రవర్తి లక్షణములు) ఉండెను. సర్వసమర్థుడగు ఆ భరతుడు గొప్ప అభిషేక క్రియ ద్వారా చక్రవర్తిగా అభిషిక్తుడైనాడు. ఆయన గంగాతీరమునందు ఏభై అయిదు పవిత్రములైన అశ్వమేధ యాగములను చేసి ఈశ్వరుని ఆరాధించెను.
భరత చక్రవర్తి మమత పుత్రుడగు దీర్ఘతమసుని పురోహితునిగా చేసుకొని యమునా తీరమునందు డెబ్బది ఎనిమిది పవిత్రములగు అశ్వమేధ యాగములను చేసి, సంపదను దానము చేసెను.
దుష్యంత పుత్రుడగు భరతుడు సకలసద్గుణములు గల స్థానమునందు అగ్నిని స్థాపించి యజ్ఞమును చేసెను. ఆ స్థానమునందు వేయి మంది బ్రాహ్మణులు భరతునిచే ఈయబడిన గోవులను ఒక్కొక్కరు బద్ధము (13 084 గోవుల మంద) చొప్పున విభాగము చేసి తీసుకొనిరి.
దుష్యంత పుత్రుడగు భరతుడు నూట ముప్పై మూడు అశ్వమేధ యాగములను చేసి రాజులను విస్మయ పరచెను. ఆయన వైభవము నిశ్చయముగా దేవతల వైభవమును కూడ అధిగమించెను. ఆయన అవిద్యను అతిక్రమించి (ఆత్మజ్ఞానమును పొంది) దేవగురువగు శ్రీహరిలో ఐక్యమాయెను.
యజ్ఞములోని మష్ణారము అనే కర్మయందు ఆయన తెల్లని దంతములు గల నల్లని పదునాలుగు లక్షల గొప్ప జాతి ఏనుగులను దానముచేసెను. అవి బంగరు ఆభరణములచే అలంకరించబడి యుండెను.
మానవులు రెండు చేతులను పైకెత్తి స్వర్గమును పట్టుకొనుట ఇది వరలో జరుగలేదు, ఈ పైన జరుగబోదు. అదే విధముగా, భరతుడు చేసిన కర్మలను ఆయనకు పూర్వమునందలి రాజులు చేయలేదు, ఆయన తరువాతి రాజులు చేయబోరు.
ఆయన దిగ్విజయ యాత్రయందు కిరాతులను, హూణులను, యవనులను, అంధ్రులను, కంకులను, ఖశులను, శకులను, మ్లేచ్ఛులను, వేదవిరోధులగు రాజులను అందరినీ సంహరించెను.
పూర్వము బలశాలురగు రాక్షసులు దేవతలను జయించి, రసాతలమును చేరిరి. అప్పుడు వారు దేవతాస్త్రీలను బలాత్కారముగా రసాతలమునకు తీసుకుపోయిరి. భరత మహారాజు ఆ దేవతాస్త్రీలను (చెర విడిపించి) మరల (స్వర్గమునకు) తెచ్చెను.
ఆయన పాలించుచుండగా భూలోక స్వర్గలోకములు ప్రజలకు అభీష్టములైన సకలవస్తువులను (పంటలు మొదలగువాటిని, వర్షములు మొదలగువాటిని) సమృద్ధిగా ఇచ్చినవి. ఆయన చక్రవర్తిగా ఇరవై ఏడు వేల సంవత్సరముల కాలము నీరంతరముగా దిక్కులయందు తన శాసనమును ప్రవర్తిల్ల జేసెను.
లోకపాలకులలో ప్రఖ్యాతమైన ఈశ్వరభావము, రాజాధిరాజుల సంపద, ఎదురు లేని శాసనము, ఆఖరికి ప్రాణములు కూడ మిథ్యయేనని నిశ్చయించుకొని, ఆ భరత చక్రవర్తి విరక్తుడాయేను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆయనకు మిక్కిలి ప్రియురాండ్రైన ముగ్గురు భార్యలు ఉండిరి. వారు విదర్భ రాజకుమార్తెలు. వారికి కలిగిన సంతానమును గురించి -- వీరు నాకు తగినవారు కారు -- అని భరతుడు పలికెను. భరతుడు తమను విడిచి పెట్టునేమో యను భయము వలన వారు ఆ పిల్లలను చంపిరి.
వంశాంకురము లేని కారణముగా ఈ విధముగా తన వంశము వ్యర్థమగుచుండగా, భరతుడు మరుత్ స్తోమమనే యజ్ఞమును చేసి మరుద్దేవతల నారాధించెను. ఆ మరుద్దేవతలు ఆయనపై ప్రసన్నులై ఆయనకు భరద్వాజుని పుత్రునిగా సమర్పించిరి.
భరద్వాజుని ఉత్పత్తి గాథ ---
ఒకనాడు బృహస్పతి గర్భవతియగు తన సోదరుని (ఉతథ్యుని) భార్య (మమత) తో సంభోగము కొరకు ప్రవర్తిల్లగా, గర్భమునందలి శిశువు వారించెను. అప్పుడు బృహస్పతి కోపించి ఆ శిశువును (గ్రుడ్డివాడవు కమ్మని) శపించి వీర్యమును విడిచి పెట్టెను (దానినుండి పుత్రుడు జన్మించెను).
తన భర్త తనను విడిచి పెట్టుననే ఆశోకతో మమత ఆ పిల్లవానిని విడిచి పెట్టుటకు సంకల్పించెను. అప్పుడు దేవతలు మమతను ఉద్దేశించి ఈ శ్లోకమును పాడిరి. మమతా-బృహస్పతుల సంవాదమైన ఈ శ్లోకములో గర్భమునందలి బాలకుని పేరు నిర్వచించ బడినది.
బృహస్పతి -- ఓ మూర్ఖురాలా! ఈ పిల్లవాడు మన యిద్దరి వలన పుట్టినవాడు. కావున వీనిని పోషించుము. మమత -- ఓ బృహస్పతీ! ఈ పిల్లవాడు మన ఇద్దరి వలన జన్మించిన వాడు గావున వీనిని నీవే పోషించుము. ఈ విధముగా పలికి వారిద్దరు బాలకుని విడిచి పెట్టిరి. వారి పలుకులను బట్టి ఈ బాలకుడు భరద్వాజుడైనాడు.
ఈ విధముగా దేవతలు మమతను (భర్త త్యజించునేమోననే ఆశంక వద్దు అని) ప్రేరేపించిరి. కాని, ఆ బాలకుడు వ్యర్థుడేనని తలచి మమత వానిని విడిచి పెట్టెను. అప్పుడు మరుద్దేవతలు ఆ బాలకుని పోషించిరి. భరతుని వంశము వ్యర్థము (అంకురము లేనిది) అగుచుండగా, వారీ బాలకుని భరతునకు సమర్పించిరి.
శ్రీమద్భాగవత మహాపురాణమునందు తొమ్మిదవ స్కంధములో శకుంతలా దుష్యంతుల గాథను, భరతుని రాజ్యపాలనమును వర్ణించే ఇరువదియవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 21 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter presents the extraordinary history of King Rantideva, a noble monarch descended from Bharata who embodied ultimate selflessness, renunciation, and compassion (*Dayā*). Having distributed all his royal riches in charity, Rantideva and his family endured forty-eight consecutive days of total fasting without food or water. On the forty-ninth morning, a small quantity of food and water arrived by divine providence. As the starving family prepared to break their fast, a hungry brāhmaṇa guest arrived, and Rantideva respectfully gave him a share. Next, a śūdra guest arrived, followed by a man with hungry dogs, and Rantideva joyfully gave away the remaining food. When only a few drops of water remained to quench his burning thirst, an outcast (*Caṇḍāla*) begged for water. Rantideva handed over his last water, praying not for mystic powers or personal liberation, but only to suffer on behalf of all distressed living entities so that they might be freed from misery. Instantly, Lord Brahmā, Mahādeva Śiva, and the devatās revealed themselves, explaining they had tested his virtue, and elevated Rantideva and his associates directly to the spiritual realm.