శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము

Table of Contents

16 - వామనావతారము - కశ్యపుడు అదితికి పయోవ్రతమును ఉపదేశించుట

ఈ విధముగా రాక్షసులు స్వర్గమునాక్రమించగా తన పుత్రులైన దేవతలు కనబడకుండా పోయినప్పుడు, దేవతల తల్లియగు అదితి నాథుడు లేనిదివలె నిరంతరమగు దుఃఖమును పొందెను.

ఆమే ఆశ్రమములో ఉత్సవము గానీ, ఆనందము గాని లేకుండె ను. చిరకాలము తరువాత సమాధినుండి బయటకు వచ్చిన పూజనీయు డగు కశ్యప ప్రజాపతి ఆమె ఆశ్రమమునకు వెళ్లాను.

కురువంశ శ్రేష్ఠుడవగు ఓ మహారాజా! అదితి ఆయనను యథా యోగ్యముగా సత్కరించెను. ఆయన ఆసనముపై కూర్చుండెను. దీనమైన ముఖముగల తన భార్యను ఉద్దేశించి ఆయన ఇట్లు పలికెను.

ఓ కల్యాణీ! లోకమునందిప్పుడు వేదవేత్తలకు గాని, ధర్మమునకు గాని, మృత్యువుయొక్క ఇచ్ఛకు వశుడై యుండే మానవునకు గాని ఆపద రాలేదు గదా?

ఓ అదితీ! ఈ ఇంటికి స్వామినివి నీవే. ఇంటియందు ధర్మార్థకామ ములనే పురుషార్థములకు ఏదేని ఆపద కలిగినది యేమి? సాధన లేనివా నికి కూడ సాధనయొక్క ఫలమును అందజేసే పవిత్రస్థానము గృహము.

ఏ నాడైననూ నీవు ఇంటి పనులలో నిమగ్నమై యుండగా అతి థులు వచ్చి, నీవు ఎదురేగి సత్కరించకుండగనే ఇంటినుండి వెళ్లిపోయి నారా యేమి?

ఏ ఇంటికి అతిథులు వచ్చి సత్కరించబడకుండా నీరైనా త్రాగ కుండా వెళ్లిపోతారో, ఆ ఇల్లు నిశ్చయముగా నక్కల రాజు ఇంటిని పోలి నది మాత్రమే.

ఓ కల్యాణీ! నీవు పతివ్రతవు. నేను ఎక్కడికో వెళ్లినప్పుడు నీవు మనస్సులో ఆదుర్దా ఉన్న కారణముగా సరియగు సమయములో అగ్నులయందు ఆహుతులను సమర్పించుట విస్మరించినావా యేమి?

గృహస్థుడు అగ్నిని, బ్రాహ్మణుని పూజించి కోరికలనీడేర్చే పుణ్య లోకములను పొందును. ఎందుకంటే, అగ్ని మరియు బ్రాహ్మణుడు నిశ్చయముగా సకలదేవతాస్వరూపుడగు శ్రీహరియొక్క ముఖమే.(అగ్ని యందు చేసిన హోమము, బ్రాహ్మణునకు పెట్టిన భోజనము సాక్షాత్తుగా విష్ణువునకు సమర్పించినట్లే యగును).

ఓ అదితీ! నీకు అభిమానము మెండు. నీ పుత్రులందరు క్షేమ మేనా? నీ ముఖకవళికలను బట్టి నీ మనస్సులో స్వస్థత లేదని నాకు తెలి యుచునే యున్నది.

 అదితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! వేదవేత్తలకు, గోవులకు, ధర్మమునకు, ఈ జనులకు కూడ మంగళమే. నీవు గొప్ప గృహస్థుడవు. నీ ఈ గృహము ధర్మార్థకామములకు నివాస స్థానము.

ఓ మహర్షీ! అగ్నులను, అతిథులను, భృత్యులను, ఆకాంక్ష గల ఇతరులను నేను సత్కరించితిని. నేను నిరంతరముగా పూజనీయుడవగు మిమ్ములనే ధ్యానించుటచే, నాకు సర్వము లోటు లేకుండ నున్నది.

ఓ పూజనీయా! ప్రజాపతివగు నీవు నాకు ఈ విధముగా ధర్మము లను బోధించుచుండగా, నా మనస్సులోనుండే ఏ కోరిక సంపన్నము కాకుండును?

ఓ మరీచిపుత్రా! సత్త్వరజస్తమోగుణములతో తాదాత్మ్యమును చెంది జీవించే ఈ ప్రాణులు నీ మనస్సునుండి, శరీరమునుండి పుట్టినవారు మాత్రమే. ఓ ప్రభూ! రాక్షసులు మొదలైన ఈ ప్రాణులయందు నీవు సమ మగు చిత్తము గలవాడవు. కాని, మహేశ్వరుడు కూడ భక్తుని సేవించును. (నీవు కూడ అట్లే చేయవలెను).

ఓ ఈశ్వరా! నీవు గొప్ప ప్రతనిష్ఠ గలవాడవు. ఓ ప్రభూ! నిన్ను సేవించే నాయొక్క హితమును గురించి నీవు ఆలోచించుము. శత్రువులు మా సంపదను, స్థానమును అపహరించినారు. అట్టి మమ్ములను రక్షించుము.

 బలశాలురగు శత్రువులు నా ఈశ్వరభావము (అధికారము) ను, సంపదను, కీర్తిని అపహరించినారు. వారు మా నివాసస్థానమును ఆక్రమించుకొని మమ్ములను బయటకు త్రోసివేసినారు. అట్టి నేను దుఃఖసముద్ర ములో మునిగియున్నాను. .

ఓ మహాత్మా! కల్యాణమును చేయువారిలో నీవు అగ్రేసరుడవు. నా పుత్రులు తిరిగి వాటిని మరల పొందే విధముగా నీవు సంకల్పించి, వారికి మంగళమును సంపాదించుము.

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- అదితి ఈ విధముగా ప్రార్థించ గా, కశ్యప ప్రజాపతి చిరునవ్వుతో ఆమెతో నిట్లనెను -- విష్ణు మాయయొక్క బలము ఆశ్చర్యమును కలిగించును. ఈ జగత్తు ఆసక్తిచే , బంధించబడి యున్నది.

పంచభూతములతో - నిర్మించబడిన అనాత్మయగు దేహము ఎక్కడ? ప్రకృతికంటె అతీతమైన ఆత్మ ఎక్కడ? భర్త, పుత్రుడు మొదలగు వారు ఎవరు? ఎవరి వారు? వ్యామోహమే ఈ సంసారమునకు కారణము.

             పూర్ణుడు, దుష్టజనశిక్షకుడు అగు వాసుదేవుడు సకలప్రాణుల హృదయములో ఆత్మరూపముగా నివసించి యున్నాడు. జగత్తునకు తండ్రి యగు ఆ భగవానుని ఆరాధించుము.

దీనులపై దయ గల ఆ శ్రీహరి నీ కోరికలను తీర్చగలడు. భగవ ద్భక్తి వ్యర్థము కాదు. మరో ఉపాయము లేదని నా అభిప్రాయము.

అదితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! జగన్నాథుడు, సత్యసంక ల్పుడు అగు శ్రీహరిని నేను ఏ విధానముతో ఆరాధించినచో, ఆయన నా మనోరథమునీడేర్చును?

ఓ మహర్షీ! నీవు వేదవేత్తలలో అగ్రగణ్యుడవు. నేను నా పుత్రులతో గూడి చాల దుఃఖమును పొందియున్నాను. నాకు శ్రీహరి దేవుడు తొంద రగా ప్రసన్నమయ్యే ఆరాధనను, ఆ విధానమును నీవు ఉపదేశించుము.

కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను --- నేను సంతానమును కోరి పూజనీయుడు, పద్మసంభవుడు అగు బ్రహ్మగారిని ప్రశ్నించగా, ఆయన నాకు ఈ వ్రతమును చెప్పినాడు. దీని వలన కేశవుడు ప్రసన్నుడగును. దీనిని నీకు నేను ఉపదేశించ గలను.

ఫాల్గునమాసములో శుక్లపక్షమునందు పన్నెండు రోజులు కేవలము పాలను మాత్రమే త్రాగుతూ గొప్ప భక్తితో కూడినవాడై పద్మముల వంటి కన్నులు గల శ్రీహరిని ఆరాధించవలెను.

             అమావాస్యనాడు లభించే పక్షములో వరాహము కలిచివేసిన మట్టితో లేపము చేసుకొని నదిలో స్నానమును చేయవలెను. ఈ మంత్ర మునుచ్చరించవలెను.

ఓ భూదేవీ! జగత్కారణుడగు వరాహ భగవానుడు ప్రాణులకు స్థానమును కల్పించ గోరి, నిన్ను రసాతలమునుండి పైకి తీసుకు వచ్చినాడు. నీకు నమస్కారము. నా పాపమును పూర్తిగా నశింప జేయుము.

సాధకుడు తన నిత్య నైమిత్తికములను నిర్వహించుకొని ఏకాగ్రచిత్త ముతో శ్రీహరి దేవుని విగ్రహము, దర్భలచే సంస్కరించబడిన వేది, సూర్యుడు, నీరు, అగ్ని మరియు గురువులయందు పూజించవలెను.

ఓ వాసుదేవ భగవానుడా! సకలప్రాణులకు ఆశ్రయమైన నీవు సక లప్రాణులలో సాక్షి చైతన్యరూపముగా వున్నావు. ఓ పురుషోత్తమా! నీకు నమస్కారము (అని స్తుతించవలెను).

శ్రీహరి అత్యంతసూక్ష్మమగు చైతన్యమే స్వరూపముగా గలవాడు గాన, ఇంద్రియములకు గాని మనస్సునకు గాని గోచరము కాడు. ప్రకృతి, ప్రాణులు అనే రెండింటి రూపముగా ఆయనయే ప్రకటమైనాడు. శ్రీహ రియే సాంఖ్యశాస్త్రాచార్యుడుగా అవతరించి, ఇరవై నాలుగు తత్త్వములను దర్శించి పరిగణించినాడు. అట్టి శ్రీహరికి నమస్కారము.

మూలప్రకృతి, మహత్తత్త్వము (సమష్టి బుద్ధిశక్తి), సమష్టి అహం కారము, అయిదు సూక్ష్మభూతములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, మనస్సు, అయిదు స్థూలభూతములు అను నవి ఇరవై నాలుగు తత్త్వములు.

స్వర్గాది ఫలములను విస్తరింప జేసే యజ్ఞమే స్వరూపముగా గల శ్రీహరికి ప్రాయణీయము, ఉదయనీయము అనే రెండు కర్మలు రెండు తలలవంటివి; ప్రాతః, మధ్యాహ్న, సాయంసవనములు మూడు పాద ములు వంటివి; ఋగ్-యజుః-సామ-అథర్వణవేదములే నాలుగు కొమ్ములు వంటివి; గాయత్రి, ఉషైక్, పంక్తి, త్రిష్టుప్, అనుష్టుప్, బృహతి మొదలైన ఏడు ఛందస్సులు ఏడు చేతులు వంటివి; యజ్ఞమునకు మూలము ఋగ్-యజుః-సామవేదములు. అట్టి శ్రీహరికి నమస్కారము.

మంగళస్వరూపుడగు శ్రీహరియే ప్రళయములో సర్వమును నశింప జేయును. సకలశక్తులను ధరించే ఆయనయే సకలవిద్యలకు మూలస్థానము. ప్రాణులకు రక్షకుడగు అట్టి శ్రీహరికి అనేక నమస్కారములు.

జగత్తు రూపముగా వెలిసిన ఓ శ్రీహరీ! తేజోమయుడవగు నీవే సమష్టి బుద్దిశక్తి-క్రియాశక్తుల రూపముగా నున్నావు. నీవు యోగప్రవర్తకు డవు మాత్రమే గాక, యోగము మరియు దాని సిద్ధులు నీ శరీరమే. నీకు అనేక నమస్కారములు.

ఓ శ్రీహరీ! ప్రకాశ స్వరూపుడవగు నీవే జగత్కారణము, సకలప్రా ణులలో సాక్షిరూపుడవై ఉండే నీవే నర-నారాయణ మహర్షుల రూపములో అవతరించితివి. పాపములను పోగొట్టే నీకు అనేక నమస్కారములు.

ఓ కేశవా! మరకత మాణిక్యము వలె శ్యామలమైన దేహము గల నిన్ను లక్ష్మీదేవి చేరి సేవించుచున్నది. పీతాంబరుడవగు నీకు అనేక నమ స్కారములు.

 ఓ పురుషోత్తమా! నీవు వరములనిచ్చువారిలో అగ్రేసరుడవు. సక లవరములనిచ్చువాడవు నీవే. కావుననే, వివేకులు మోక్షము కొరకై నీ పాద ధూళిని ఉపాసించెదరు.

శ్రీహరియొక్క పాదపద్మముల పరిమళమునందు లోభము గల వారా యన్నట్లు దేవతలు, లక్ష్మీదేవి కూడ ఆయనను సేవించిరి. అట్టి శ్రీహరి భగవానుడు నా కొరకు ప్రసన్నుడగు గాక!

సాధకుడు శ్రద్దతో కూడినవాడై ముందుగా ఇంద్రియాధిపతియగు శ్రీహరిని ఆహ్వానించి ఈ మంత్రములతో పాద్యము, ఆచమనము మొద లగు ఉపచారములను సమర్పించి పూజించవలెను.

శ్రీహరి ప్రభుని సాధకుడు పాద్యము, ఆచమనము, పాలతో అభి షేకము, శుద్దోదక స్నానము, వస్త్రములు, యజ్ఞోపవీతములు, ఆభరణము లు, గంధము, పుష్పమాలలు, ధూపము, దీపము మొదలగు ఉపచారము లతో పన్నెండు అక్షరముల మంత్రమును (ఓం నమో భగవతే వాసుదేవాయ) ఉచ్చరిస్తూ పూజించవలెను.

సంపద ఉన్నచో నెయ్యి, బెల్లము వేసి వరి బియ్యముతో పాయ సము వండి నైవేద్యము పెట్టి, పన్నెండు అక్షరముల మూలమంత్రముతో హోమము కూడ చేయవలెను.

ఆ నైవేద్యమును భక్తునకు ఈయవలెను. లేదా, తానే తినవలెను. నైవేద్యము తరువాత శ్రీహరికి ఆచమనమునిచ్చి పూజించి, తాంబూల మును కూడ నివేదించవలేను.

నూట యెనిమిది సార్లు మూలమంత్రమును జపించి, ప్రభుని స్తోత్రములతో స్తుతించవలెను. తరువాత ఆనందముతో ప్రదక్షిణము చేసి సాష్టాంగ నమస్కారమును చేయవలెను.

ఆ శ్రీహరి నిర్మాల్యమును తలపై ఉంచుకోని, శ్రీహరి దేవునకు ఉద్వాసన చెప్పవలెను. కనీసము ఇద్దరు వేదవేత్తలకు తగిన విధముగా పాయసముతో భోజనము పెట్టవలెను.

 ఆ వేదవేత్తలను సత్కరించి వారి అనుమతితో మిగిలిన ఆహార మును బంధువులతో కలిసి భుజించవలెను. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించవలెను. తెల్లవారిన తరువాత మరునాడు (అనగా పాడ్యమినాడు) స్నానము చేసి శుచియై శాస్తోక్తవిధానముతో మిక్కిలి సావధానుడై శ్రీహ రికి పాలతో అభిషేకము చేసి పూజించవలెను. ఈ విధముగా వ్రతము పూర్తి అయ్యేవరకు పూజను చేయవలెను.

సాధకుడు పాలను ఆహారముగా తీసుకుంటూ విష్ణువును పూజిం చుటయందు ఆదరము గలవాడై ఈ వ్రతమునాచరించవలెను. ఇదివరలో చెప్పినట్లుగానే, అగ్నిలో హోమమును చేసి, బ్రాహ్మణులకు భోజనమును కూడ పెట్టవలెను.

ఈ విధముగా పన్నెండు దినములు ప్రతి దినము పాలను మాత్రమే ఆహారముగా తీసుకుంటూ, శ్రీహరి ఆరాధన, హోమము, పూజ, బ్రాహ్మణ భోజనములను చేయవలెను.

సాధకుడు ఫాల్గున శుక్ల పాడ్యమినాడు మొదలిడి శుక్ల త్రయోదశి వరకు బ్రహ్మచర్యము, క్రింద పరుండుట, మూడు పూటలా స్నానము అనే నియమములను పాటించవలెను.

అసద్-భాషణము (అసత్యమును పలుకుట, దుష్టులతోడి సంభా షణము, దుష్టములైన విషయములకు చెందిన సంభాషణము) ను, మరియు చిన్న పెద్ద భోగములను విడిచి పెట్టవలెను. ఏ ప్రాణికైననూ హింసను చేయరాదు. వాసుదేవుని మాత్రమే నిరంతరముగా స్మరించవలెను.

తరువాత త్రయోదశి నాడు విష్ణు ప్రభునకు పంచామృత (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పానకము) ములతో శాస్తోక్తమైన విధానముతో శాస్త్రమునందు నిష్ణాతులైనవారిచే చేయించవలెను.

సాధకుడు డబ్బు ఖర్చు తగ్గించాలనే దుర్బుద్ధిని విడనాడి పూజను పెద్ద యెత్తున చేయవలెను. అంతర్యామియగు విష్ణువు కొరకు పాయసమును వండి తయారు చేసి, మిక్కిలి ఏకాగ్రమగు చిత్లముతో దానితో పురుషోత్తముని పూజించ వలెను. అధికమగు గుణము గల నైవేద్య మును ఇచ్చి పురుషోత్తమునకు ప్రీతిని కలిగించవలెను.

ఆచార్యుడు జ్ఞానముతో సంపన్నుడై యుండవలెను. ఆచార్యున కు, ఋత్విక్కులకు వస్త్రములను, ఆభరణములను, గోవులను ఇచ్చి సంతోష పెట్టవలెను. అదియే శ్రీహరియొక్క ఆరాధనమని తెలుసుకొనుము.

ఓ అదితీ! నీ చిరునగవు చాల స్వచ్చముగా నున్నది సుమా! ఆచా ర్యునకు, ఋత్విక్కులకు, ఇతర బ్రాహ్మణులకు, అక్కడకు అప్పుడు వచ్చిన ఇతరులకు యథాశక్తిగా రుచ్యమైన శుద్ధమగు ఆహారమును సమ ర్పించవలెను.

ఆచార్యునకు, ఋత్విక్కులకు వారి వారి అర్హతలకు తగ్గట్లుగా దక్షి ణలనీయవలేను. వచ్చినవారు ఎంతటి దురాచారులైననూ (కసాయిలే అయిననూ), వారికి రుచ్యమైన ఆహారమునిచ్చి సంతోష పెట్టవలెను.

దీనులు, గ్రుడ్డివారు, అసమర్థులు (కుంటివారు మొదలైనవారు) అందరు భుజించిన తరువాత సాధకుడు బంధువులతో గూడి భుజించవలె ను. ఈ విధముగా అతిథులను సత్కరించుటచే విష్ణువునకు ప్రీతి కలుగు నని ఆ సాధకుడు గుర్తించవలెను.

ప్రతిదినము నాట్యములు, వాద్యములు, గానములు, స్తోత్రములు, స్వస్తివాచనములు, శ్రీహరియొక్క గాథలు అనువాటితో శ్రీహరియొక్క ఆరాధనను చేయించవలేను.

పయోవ్రతమని ప్రసిద్ధి చెందిన ఈ వ్రతము పురుషోత్తముని ఆరా ధించే సర్వోత్తమమైన పద్దతి. దీనిని బ్రహ్మగారు ఉపదేశించిరి. దీనిని నీకు నేను విస్తారముగా చెప్పితిని.

ఓ మహానుభావురాలా! నీవు కూడ ఈ వ్రతమును శుద్దమగు భక్తి గల చిత్తముతో చక్కగా అనుష్టించుము. మనస్సును వశము చేసుకొని వినాశ రహితుడగు శ్రీహరిని ఆరాధించుము.

ఓ కల్యాణీ! సర్వయజ్ఞము, సర్వవ్రతము అని ప్రసిద్ధి బడసిన ఈ వ్రతము నిశ్చయముగా ఈశ్వరునకు ప్రీతికరము. ఇది తపస్సుల సారము. ఇదియే గొప్ప దానము.

వేటిచే సాక్షాత్తుగా అధోక్షజుడు (ప్రమాణములకు గోచరము కాని శ్రీహరి) ప్రసన్నుడగునో, అవియే నియమములు, అవియే ఉత్తమమగు యమములు, అదియే తపస్సు, అదియే దానము, అదియే వ్రతము, అదియే యజ్ఞము.

ఓ కల్యాణీ! కావున నీవు నియమముతో శ్రద్దగా ఈ వ్రతమును అనుష్ఠించుము. భగవానుడు నీపై ప్రసన్నుడై శీఘ్రముగా నీ మనోరథము లను సంపన్నము చేయగలడు.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో వామనావతారవృత్తాంతములో కశ్యపుడు అదితికి పయోవ్రతమును ఉపదేశించుటను వర్ణించేపదునారవ అధ్యాయము ముగిసినది.