శ్రీ మద్భాగవతము - అష్టమ (8వ) స్కందము

Table of Contents

11 - సముద్ర మథనము - ఇంద్రుడు నముచిని సంహరించుట

ఇదివరలో దేవతలు రాక్షసుల చేతిలో దెబ్బలను తినియున్నారు. కానీ ఇప్పుడు పురుషోత్తముని సర్వాతీశాయియగు దయచే వారి మనస్సు లలోని ధైర్యము రాక్షసుల మాయచే వీగి పోలేదు. అప్పుడు ఇంద్రుడు, వాయువు, అగ్ని మొదలగు దేవతలు ఆ రాక్షసులను యుద్ధములో గట్టిగా దెబ్బ తీసిరి.

పూజనీయుడు, పాకాసురుని సంహరించినవాడు అగు ఇంద్రుడు విరోచన పుత్రుడగు బలిపై కోపించి వజ్రమును పైకి ఎత్తగా, ప్రజలు అయ్యో అయ్యో! అంటూ ఆక్రోశించిరి.

ధైర్యశాలియగు విరోచనుడు యుద్ధసామగ్రిని నిండా ఉంచుకొని, ఆ గొప్ప యుద్ధములో అంతటా సంచరిస్తూ యుద్దమును చేయుచుండె ను. ఆయన తన ముందుకు రాగానే ఇంద్రుడు వజ్రము చేతబట్టి తిరస్కార పూర్వకముగా ఆయనతో ఇట్లు పలికెను.

ఓరీ మూర్ఖ! నటుడు పిల్లలను మంచి మాటలతో వశము చేసు కొని, వారి కళ్లకు గంతలు కట్టి వారి వద్ద ఉండే సొమ్మును అపహరించును. నీవు కూడ అదే విధముగా మాయలతో మమ్ములను జయించ గోరుచున్నావు. కాని, మేము మాయలకు అధిపతులము.

ఎవరైతే మాయలతో స్వర్గమును చేరాలని గాని, స్వర్గమును దాటి పై లోకములకు వెళ్లాలని గాని కోరెదరో, వారు మూర్ఖులైన చోరులు. వారిని నేను ఇదివరలో ఉన్న స్థానముకంటె కూడ క్రిందకు పడ గొట్టెదను.

             ఓరీ మందబుద్దీ! చెడ్డ మాయలను చేసే నీ తలను అట్టి నేను ఇప్పుడే వంద కణుపుల వజ్రముతో ఊడగొట్టెదను. నీవు నీ బంధువులతో గూడి కాసుకొనుము.

బలి ఇట్లు పలికెను --- కాలముచే ప్రేరితులై కర్మలను చేస్తూ యుద్ధమును చేయుచున్నవారందరికి కీర్తి, జయము, అపజయము, మర ణము వరుసగా కలుగుచునే యుండును. 

ఆ ఈ జయాపజయములు, కీర్తి-అపకీర్తులను కాలము నియం త్రించును. ఈ విషయము తెలిసిన వివేకవంతులు మంచికి హర్షముతో గెంతులు వేయరు; చెడుకు శోకముతో క్రుంగిపోరు. కాని, మీరు ఈ వివే కము గలవారు కారు.

జయాపజయములకు కర్తలము మేమే అని మీరు తలపోయుచుం దురు. మీ అజ్ఞానమునకు సత్పురుషులు మీపై జాలి పడెదరు. అట్టి మీపై హృదయములో గాయమును చేసే నిందావాక్యములను ప్రయోగించుట మాకు సమ్మతము కాదు.

బలి వీరులను సంహరించే వీరుడు. ఆయన ఈ విధముగా ఇంద్రు నకు ఆక్షేప వచనములచే దుఃఖమును కలిగించెను. అంతేగాక, నారిని చెవి వరకు లాగి విడిచిన బాణములతో ఆయన ఇంద్రుని కొట్టెను.

బలి ఈ విధముగా సత్యమును పలికి తిరస్కరించగా, దేవేంద్రుడు అంకుశముచే పొడవబడిన ఏనుగు వలె ఆ బలియొక్క ఆక్షేప వచనమును సహించ లేకపోయెను.

శత్రుసంహారకుడగు ఇంద్రుడు మొక్కవోని వజ్రముతో ఆ బలిని కొట్టగా, ఆయన విమానముతో బాటుగా రెక్కలు తెగగొట్టబడిన పర్వతము వలే నేలపై కుప్పకూలేను.

జంభాసురుడు బలికి మిత్రుడు, హితకారి. ఆయన క్రింద బడిన తన మిత్రుని చూచెను. తన మిత్రుడు హతుడైననూ ఆయనకు హితమునే చేయువాడై ఆ జంభుడు ఇంద్రుని ఎదుటికి వచ్చెను.

మహాబలిశాలియగు ఆ జంభాసురుడు సింహవాహనముపై ఇంద్రుని దగ్గరకు వచ్చి వేగముగా గదను పైకెత్తి కొంకులపై కొట్టెను. ఆతడు ఐరావతమును కూడ కొట్టెను.

గద దెబ్బచే పీడను పొందిన ఆ ఏనుగు పూర్తిగా స్వాధీనత తప్పి రెండు మోకాళ్లపై నేలపై గూలిపోయెను. అది అప్పుడు చాల ఎక్కువ సేపు మూర్ఛను పొందెను.

అప్పుడు మాతలి వేయి గుర్రములను పూన్చిన రథమును తీసు కురాగా, దేవేంద్రుడు ఏనుగును విడిచి పెట్టి ఆ రథము పై ఎక్కెను.

రాక్షసశ్రేష్ఠుడగు జంభుడు ఆ సారథి యుద్ధములో చేసిన పనిని అభినందించెను. అపుడాతడు చిరునవ్వు నవ్వుతూ ఆ సారథిని మాత్రము మండే శూలముతో కొట్టెను.

మాతలి ధైర్యమును చిక్కబట్టి మిక్కిలి సహించ శక్యము కాని ఆ నొప్పిని సహించెను. ఇంద్రుడు జంభునిపై చాల కోపించి, వజ్రముతో వాని తలను నరికి వేసెను.

జంభుడు హతుడైనాడని నారద మహర్షి చెప్పగా విని, వాని బంధువులైన నముచి, బలుడు, పాకుడు వేగముగా ఆ స్థానమునకు వచ్చి పడిరి.

ఆ ముగ్గురు మర్మస్పర్శియగు పరుషవాక్యములతో ఆ ఇంద్రు నకు పీడను కలిగిస్తూ, మేఘములు పర్వతముపై వర్షధారలను వలె, ఆత నిపై బాణములను వర్షించిరి.

 బలుడు అలవోకగా పెద్ద సంఖ్యలో బాణములను విడువగలిగే నైపుణ్యము గలవాడు. ఆతడు యుద్ధములో ఇంద్రుని వేయి గుర్రములపై వేయి బాణములను ఒకే సారి ప్రయోగించి వాటికి పీడను కలిగించెను.

పాకుడు ఒకే సారి రెండు వందల బాణములను సంధానము చేసి వందతో మాతలివి, వందతో రథముయొక్క ప్రతి అంగమును కొట్టెను. అది యుద్ధములో ఆశ్చర్యము ఆయెను.

నముచి యుద్దమునందు బంగరు క్రింది భాగములు గల పది హేను గొప్ప బాణములతో ఇంద్రుని కొట్టి, నీటితో నిండిన మేఘము వలె, గర్జించెను.

రాక్షసులు ఇంద్రుని, ఆతని రథమును, దాని సారథిని బాణముల సమూహముతో అన్ని వైపులా, వర్షాకాలమునందలి సూర్యుని మేఘములు వలె, కప్పివేసిరి.

శత్రువులను రాక్షసులచే జయించబడిన దేవగణములు వారి అను చరులతో బాటుగా ఆక్రోశించిరి. వారికి ఇంద్రుడు కానరాలేదు. నాయకుడు లేని ఆ దేవతలు, సముద్రమధ్యములో నావ పగిలిన వర్తకులు వలె, చాల ఆదుర్దాను చెందిరి. -

అప్పుడు గుర్రములు, జెండా, సారథి, రథములతో బాటుగా ఇంద్రుడు బాణములచే కట్టబడిన పంజరమునుండి బయట పడెను. అపు డాయన రాత్రి గడచిపోగా సూర్యుడు వలె తన తేజస్సుతో దిక్కులను, ఆకాశమును. భూమినీ కూడ ప్రకాశింప జేయుచుండెను.

వజ్రధారియగు దేవేంద్రుడు యుద్ధమునందు శత్రువులు తన సైన్యమును పీడించుటను చూచెను. ఆయన కోపముతో శత్రువును సంహీ రించుట కొరకై వజ్రమును పైకెత్తెను.

ఓ మహారాజా! ఆ ఇంద్రుడు ఎనిమిది ధారలు గల ఆ వజ్రము తోనే బలాసుర పాకాసురులయొక్క తలలను వారి బంధువులు చూచు చుండగా నరికెను. ఆ బంధువులు చాల భయపడిరి.

ఓ మహారాజా! వారిద్దరి వధను చూచిన నముచికి శోకము, అస హనము, కోపము కలిగెను. ఆతడు ఇంద్రుని చంప గోరి, చాల పెద్ద ప్రయ త్నమును చేసెను.

నముచి కోపించి మృగేంద్రుడగు సింహము వలె నినదిస్తూ, లోహ ముతో చేసిన శూలమును గట్టిగా పట్టుకొని దేవరాజగు ఇంద్రుని మీదకు పరుగెత్తాను. ఇదిగో! నీవు చచ్చితివి, అంటూ ఆతడు ఇంద్రుని అధికముగా బెదిరిస్తూ గంటలు, బంగరు ఆభరణములు ఉన్న ఆ శూలమును ఇంద్రుని పైకి విసిరేను.

ఓ మహారాజా! ఆకాశతలమునందు మహావేగముగా వచ్చి పడు చున్న ఆ శూలమును ఇంద్రుడు బాణములతో వేయి ముక్కలుగా ఖండిం చేను. కోపమును పొందియున్న దేవరాజు అపుడు ఆ నముచి తలను నరు కగోరి వజ్రముతో వాని మెడపై కొట్టెను.

బలము గల ఆ వజ్రమును దేవేంద్రుడు బలముగా ప్రయోగించే ను. అయిననూ, అది నముచియొక్క చర్మమును కూడ ఊడగొట్టలేకపో యెను. అది గొప్ప ఆశ్చర్యము! మహాపరాక్రమశాలియగు వృత్రుని సంహ రించిన ఇంద్రుని నముచి మెడపై చర్మము తిరస్కారమునకు గురిచేసెను.

తన వజ్రమును నిర్వీర్యము చేసిన నముచి అనే ఆ శత్రువు వలన ఇంద్రుడు భయపడెను. దైవముయొక్క ఘటన ఇట్లున్నదేమి? ప్రాణులకు విశేషమగు మోహమును కలిగించే ఘటన ఇట్లు ఏల ఘటిల్లినది? అని ఆయన తలపో పెను.

 పూర్వము పర్వతములకు రెక్కలుండెడివి. అవి ఇటునటు ఎగు రుతూ నేలపై వాలినప్పుడు ఆ భారముచే ప్రజలు నశించెడివారు. ఆ స్థితిలో నేను ఇదే వజ్రముతో వాటి రెక్కలను నరికితిని.

త్వష్టయొక్క మహాప్రభావశాలియగు తపస్సే వృత్రాసురుడైనది. అట్టి వృత్రుడు మాత్రమే గాక, సకలములైన అస్త్రములచే చెక్కు చెదరని చర్మము గల ఇతరులైన బలశాలురు కూడ ఈ వజ్రముచే చీల్చి వేయబడి నారు.

అల్పుడైన రాక్షసునిపై నేను ప్రయోగించిన అట్టి ఈ వజ్రము నిర్వీర్యమైనది. ఇది బ్రహ్మవేత్తయగు దధీచియొక్క తేజస్సే అయిననూ, ఈనాడు ఇది కట్టెవలె నిరర్థకము. కావున, నేను దీనిని స్వీకరించను.

ఈ విధముగా ఖేదమును పొందియున్న ఇంద్రుని ఉద్దేశించి ఆకాశ వాణి ఇట్లు పలికెను -- ఈ రాక్షసుని పొడి వస్తువులతో గాని, తడి వస్తువు లతో గాని సంహరించుట సంభవము కాదు.

వీనికి తడి గాని, పొడి గాని అయిన వస్తువులచే మరణము కలు గనే కలుగదని నేను వరము నిచ్చితిని. కావున, నీవు వీని సంహారము కొరకై మరియొక ఉపాయమును ఆలోచించుము.

పరమేశ్వరునియొక్క ఆ ఆకాశవాణిని విని ఇంద్రుడు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తముతో ధ్యానించెను. అపుడు ఆతనికి నురగ తడి మరియు పొడి అనే రెండు లక్షణములు కలదిగా తోచెను.

ఇంద్రుడు తడి మరియు పొడి కూడ కాని నురగతో నముచి తలను తొలగించేను. అపుడు మహర్షుల గణములు స్వర్గాధిపతియగు ఆ ఇంద్రుని స్తుతించి, పుష్పములను వర్షించిరి.

గంధర్వశ్రేష్టులగు విశ్వావసువు పరావసువు గానము చేసిరి. దేవ తల దుందుభులు మ్రోగినవి. అప్సరసలు ఆనందముతో నాట్యమాడిరి.

వాయువు, అగ్ని, వరుణుడు, యముడు మొదలైన ఇతర దేవతలు కూడ తమతో ద్వంద్వయుద్ధమును చేయుచున్న శత్రువులను ఇదే విధముగా అస్త్రముల సమూహములను ప్రయోగించి, లేళ్లను సింహములు వలె, సంహరించిరి.

ఓ మహారాజా! రాక్షసులు పూర్తిగా నశించిపోయే పరిస్థితిని చూచి బ్రహ్మగారు దేవర్షియగు నారదుని పంపించెను. ఆయన వచ్చి దేవతలను, వారి అనుచరులగు గంధర్వాదులను రాక్షససంహారమునుండి విరమింపజేసెను.

నారదుడిట్లు పలికెను --- నారాయణుని భుజములను ఆశ్రయిం చిన మీకు అమృతము దక్కినది. మిమ్ములనందరిని లక్ష్మీదేవి చక్కగా వర్దిల్ల జేసినది. కావున, మీరు కలహమునుండి విరమించుడు.

దేవతలందరు కోపోద్రేకమును నియంత్రించుకొని నారద మహర్షి మాటను మన్నించిరి. వారు తమ కీర్తిని గానము చేసే అనుచరులతో కూడి స్వర్గమునకు వెళ్లిరి.

ఆ యుద్దమునందు ఏ రాక్షసులు మిగిలి యుండిరో, వారు నార దుని అనుమతితో మరణించిన బలిని తీసుకొని అస్తాచలమునకు వెళ్లిరి.

ఆ యుద్ధములో అవయవములు పోకుండా మెడపై తల ఉన్న రాక్షసులను శుక్రాచార్యుడు తన సంజీవినీ విద్యతో మరల బ్రతికించెను.

బలిని శుక్రాచార్యుడు స్పృశించగానే ఆయన తిరిగి బ్రతికెను. ఆయనకు ఇంద్రియశక్తులు, స్మరణము తిరిగి వచ్చెను. ఆయన యుద్ధ ములో పరాజయమును పొందినా, లోకస్వభావము బాగా తెలిసినవాడు గనుక, ఖేదమును పొందలేదు.

శ్రీమద్భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధములో సముద్ర మథన వృత్తాంతములో ఇంద్రుడు నముచిని సంహరించుటను వర్ణించే పదకొండవ అధ్యాయము ముగిసినది.