శ్రీ మద్భాగవతము - సప్తమ (7వ) స్కందము
10 - ప్రహ్లాద చరితము - ప్రహ్లాదుని నిష్కామ భక్తి, త్రిపుర దహనము
నారద మహర్షి ఇట్లు పలికెను --- ప్రహ్లాదుడు పిల్లవాడే అయినా, ఆ వరములన్నియు భక్తియోగమునకు ఆటంకములనియే భావించి, చిరున వ్వుతో ఇంద్రియాధిపతియగు నరసింహునితో ఆ సమయములో ఇట్లు పలికెను.
ప్రహ్లాదుడు ఇట్లు పలికెను --- స్వభావముచేతనే కామనల యందు ఆసక్తి కలిగియున్న నన్ను ఆ వరములతో ప్రలోభ పెట్ట వద్దు. నేను విరక్తుడనై ఆ కామనలయందలి ఆసక్తి వలన భయపడుచున్నవాడను. మోక్షమును కోరే నేను నిన్ను శరణు వేడుచున్నాను.
ఓ ప్రభూ! కామనలు సంసారమునకు మూలములు, హృదయ ములోని ముడులు. నీవు భక్తుని లక్షణములనరయుటకు మాత్రమే భక్తుడ నగు నన్ను అట్టి కామనలయందు ప్రేరేపించితివి.
ఓ సకలజగద్గురూ! అట్లు (పరీక్ష కోసము) గానిచో, కరుణానిధివగు నీవు భక్తుని ప్రలోభ పెట్టుట సంభవము కాదు. ఎవడైతే నీనుండి కామన లను కోరునో, ఆతడు నిశ్చయముగా వర్తకుడే గానీ, భక్తుడు కాడు.
ఓ భగవానుడా! పూర్ణుడవగు నీవు సర్వాత్మస్వరూపుడవు. సకల ప్రాణులలో అంతరతమమగు ఆత్మస్వరూపుడవై విరాజిల్లే పరబ్రహ్మవు నీవే. నీవు అద్బుతమగు సింహము రూపు దాల్చిన శ్రీహరివి. నీకు నమ స్కారము.
నరసింహస్వామి ఇట్లు పలికెను --- నాయందు ఏకాంతమగు (ఫలాపేక్ష లేని) భక్తి గల నీవంటి వారలు ఇహలోకమునందు గాని, పరలోకమునందు గాని కోరికలను ఏనాడైననూ నానుండి కోరరు. అయినప్పటికీ, నీవీ మన్వంతరము పూర్తి అయ్యేవరకు ఈ లోకమునందు రాక్షసప్రభువుల భోగములను నిరంతరముగా అనుభవించుము.
నీవు అభీష్టములైన నా గాథలను వినుచుండుము. నాకంటే భిన్న ముగా రెండవది ఏదీ లేదు. సకలప్రాణులలో నేనే ఆత్మరూపుడనై యున్నా ను. యజ్ఞేశ్వరుడనగు నాపై నీ మనస్సును దృఢముగా నిలిపియుంచుము. కర్మయోగము (ఈశ్వరార్పణబుద్ధితో కర్మలను చేయుట) తో నన్ను ఆరాధి స్తూ, ప్రారబ్ధకర్మను క్షయము చేసుకొనుము.
సుఖానుభవముచే పుణ్యమును, ధర్మానుష్ఠానముచే పాపమును క్షయము చేసుకొనుము. దేవలోకములో కూడ గానము చేయబడే పరిశుద్ధమైన కీర్తిని విస్తరింప జేయుము. కాలముయొక్క వేగముచే దేహమును విడిచిపెట్టి నన్ను చేరుకొనుము.
ఏ మానవుడైతే నీవు దానము చేసిన ఈ నా స్తోత్రమును కీర్తించి నిన్ను నన్ను కూడ స్మరించునో, ఆతడు తగిన కాలములో కర్మబంధము నుండి విముక్తిని పొందగలడు. .
ప్రహ్లాదుడు ఇట్లు పలికెను --- ఓ మహేశ్వరా! నీవు వరములనిచ్చువారికి ప్రభుడవు. నేను నీనుండి ఈ వరమును కోరుచున్నాను. ఈశ్వరుని తేజస్సు గురించి తెలియని నా తండ్రి నీవే తన సోదరుని చంపినావనే తప్పుడు ధారణను కలిగియుండెను. ఆయన అంతఃకరణము వ్యథతో మరియు కోపముతో నిండియుండెను. పైగా, ఆయన నీ భక్తుడనగు నాకు కూడ ద్రోహమును చేసెను. సర్వసమర్థుడవగు నీవు సాక్షాత్తుగా సకలప్రా ణులకు తండ్రివి. అట్టి నిన్ను నిందించి, ఆయన అంతము లేని పాపమును చేసెను. ఆ పాపమును తరించుట శక్యము కాదు. ఓ దీనబంధూ! ఆయన ఆ పాపమునుండి విముక్తుడగు గాక! నీవు ఆయనను సంహరించినప్పుడు కడకంటితో చక్కగా చూచితివి. ఆ చూపుతోనే ఆయన పవిత్రుడైనాడు.
ఓ సత్పురుషా! నీలో పాపము లేదు. నీ తండ్రి ఇరవై ఒక్క తరాల పితృదేవతలతో సహా పవిత్రుడైనాడు. ఇది నిశ్చయము. ఎందుకంటే, కులమును పావనము చేసే నీవు వీని ఇంటిలో జన్మించినావు గదా!
సత్పురుషులగు నా భక్తులు ప్రసన్నమైన మనస్సుతో సర్వము నందు పరమాత్మను దర్శించెదరు. చక్కని ఉత్తమమైన ప్రవృత్తి గల అట్టి నా భక్తులు ఏయే దేశములో అడుగిడుదురో, ఆ స్థానములు కీకటములే (అ పవిత్రదేశములు) అయినా, పావనమగును.
ఓ రాక్షసరాజా! తొలగిపోయిన కోరికలు గల నా భక్తులు పెద్ద గాని, చిన్న గాని ప్రాణుల సముదాయములయందు ఏ ప్రాణికైననూ ఏ విధమైన హింసను చేయరు. వారు హింసను పరిహరించుటకు సర్వప్రయత్నములను చేసెదరు.
లోకములో నిన్ను నిష్టగా అనుసరించే జనులు నా భక్తులగుదురు. నా భక్తులందరిలో శ్రేష్ఠుడవగు నీవు నా భక్తులందరికీ ఆదర్శము అగుచున్నావు సుమా!
ఓ వత్సా! నా అవయవములను స్పృశించుటచే నీ తండ్రి అన్ని విధములుగా (అన్ని పాపములనుండి) పవిత్రుడైనాడు. నీవంటి మంచి పుత్రుని కన్నందువలన ఆయన పుణ్యలోకములను పొందగలడు.
ఓ వత్సా! నీ తండ్రియొక్క రాజ్యాధికారమును కూడ నీవు చేపట్టుము. మనస్సును నాయందే గట్టిగా నిలిపి, నేనే పరమలక్ష్యముగా గలవాడవై, వేదవేత్తల బోధనలను ఉల్లంఘించకుండా, కర్మలను చేయుము.
నారదుడిట్లు పలికెను --- ఓ ధర్మరాజా! నరసింహ భగవానుడు ఆదేశించిన విధముగా ప్రహ్లాదుడు కూడ తండ్రియొక్క ప్రేతకర్మను చేసెను. గొప్ప వేదవేత్తలు ఆయనను రాజ్యాభిషిక్తుని చేసిరి.
నరసింహరూపములోనున్న శ్రీహరి ప్రసన్నుడై సుందరమగు ముఖమును కలిగియుండుటను గమనించిన బ్రహ్మగారు, దేవతలు మహర్షులు మొదలగువారు చుట్టువారియుండగా, పవిత్రములగు వాక్కులతో స్తుతించి ఇట్లు పలికెను.
. బ్రహ్మోవాచ ।
ఓ దేవదేవా! సర్వేశ్వురడవగు నీవే సకలప్రాణులను సృష్టించితివి. తండ్రీ! పాపియై లోకములకు అధికమగు పీడను కలిగించుచున్న రాక్షసుని నీవు సంహరించి లోకకల్యాణమును చేసితివి.
ఈ రాక్షసుడు నా సృష్టిలోని వారెవ్వరైననూ సంహరించలేని విధముగా నానుండి వరములను పొందెను. ఈతడు తపస్సును చేసి యోగశక్తులను సంపాదించి గర్వించినవాడై వైదికధర్మములనన్నింటినీ చెడగొట్టెను.
కాని సౌభాగ్యమేమనగా వీని పుత్రుడగు ఈ బుడతడు సత్పురుషుడు,గొప్ప భగవద్భక్తుడు. వానిని నీవు మృత్యువునుండి విడిపించితివి. ఈతడు సౌభాగ్యముచే నిన్ను ఇప్పుడు శరణు పొందినాడు.
ఓ భగవానుడా! నీ ఈ రూపము నియంత్రించబడిన మనస్సుతో ధ్యానించువానిని అన్ని విధములుగా రక్షించును; మృత్యుదేవత సంహరించగోరువానినైననూ ఈ రూపముయొక్క ధ్యానము రక్షించును.
నరసింహుడిట్లు పలికెను --- పద్మమునుండి పుట్టిన ఓ బ్రహ్మా! నీవు అసురులకు ఇట్టి వరమును ఈయరాదు. క్రూరస్వభావము గలవారికి వరమునిచ్చుట పాములకు పాలు పోయుట వంటిది.
ఓ ధర్మరాజా! శ్రీహరి భగవానుడీ విధముగా పలికి, బ్రహ్మగారి పూజలనందుకొని, అప్పుడే అక్కడే సకలప్రాణులకు కానరాకుండా అంతర్ధానమాయెను.
తరువాత ప్రహ్లాదుడు భగవానుని అంశలగు బ్రహ్మగారిని, రుద్రుని, ప్రజాపతులను, దేవతలను చక్కగా పూజించి తల వంచి ప్రణమిల్లెను.
తరువాత పద్మాసనుడగు బ్రహ్మగారు శుక్రాచార్యుడు మొదలగు మహర్షులతో గూడి, ప్రహ్లాదుని దితి-దనువంశీయులగు రాక్షసులకు ప్రభువునుగా చేసెను.
ఓ ధర్మరాజా! తరువాత బ్రహ్మగారు మొదలగు దేవతలు ప్రహ్లాదుని అభినందించి గొప్ప ఆశీస్సులను చేసిరి. ప్రహ్లాదుడు కూడ వారిని పూజించెను. అపుడు వారు తమ తమ స్థానములకు వెళ్లిరి.
ఈ విధముగా విష్ణువుయొక్క అనుచరులగు ఆ జయ విజయులిద్దరు దితికి పుత్రులై జన్మించిరి. వైరబుద్దిచే శ్రీహరియే హృదయమునందు స్థిరముగా నిలిచియుండగా, వారిద్దరు సంహరించబడిరి.
వేదవేత్తలగు సనకాదుల శాపముచే మరల వారిద్దరు కుంభకర్ణుడు, రావణుడు అనే రాక్షసులై జన్మించిరి. వారినిద్దరిని పరాక్రమశాలియగు శ్రీరాముడు సంహరించెను.
శ్రీరాముడు తన బాణములతో వారి గుండెలను పగులగొట్టగా, వారు నేలకొరిగి, గడచిన జన్మ (హిరణ్యాక్ష-హిరణ్యకశిపులు) లో వలెనే ఆయననే చిత్తములో స్మరిస్తూ దేహమును విడిచి పెట్టిరి.
తరువాత వారిద్దరు ఈ సమయములో శిశుపాల దంతవక్తులై జన్మించి శ్రీహరియందు వైరమును నిరంతరముగా చేసిరి. నీవు చూచుచుండగనే వారిద్దరు శ్రీహరియందు విలీనమైరి.
శ్రీకృష్ణునియందు వైరము గల రాజులు పూర్వజన్మలో ఆయనను నిందించి చాల పాపమును చేసిరి. కాని, గొంగళిపురుగు తుమ్మెదను ధ్యానించి దాని రూపమును పొందినట్లుగా, వారు దేహత్యాగసమయము నందు శ్రీకృష్ణుని స్వరూపములో విలీనమై ఆ పాపమును విడిచి పెట్టిరి.
భక్తులు భేదదర్శనము లేని సర్వోత్కృష్టమైన భగవంతునియందలి భక్తితో ఏయే విధముగా, శ్రీహరిని ధ్యానించి ఆయన స్వరూపములో విలీనమగుదురో, అదే విధముగా చేదిరాజగు శిశుపాలుడు మొదలగు రాజులు కూడ ఆయననే నిరంతరముగా స్మరించి ఆయనలో విలీనమైరి.
దమఘోషుని పుత్రుడగు శిశుపాలుడు మొదలగువారు శ్రీహరిని ద్వేషించి కూడా ఆయన స్వరూపములో విలీనమగుటను గురించి నీవు నన్ను సాదరముగా ప్రశ్నించితివి. ఈ విషయమునంతనూ నేను నీకు చెప్పితిని.
శ్రీకృష్ణుడు వేదవేత్తల యెడల భక్తి గల దేవుడు. సర్వాత్మస్వరూపుడగు ఆయనయొక్క ఈ అవతార గాథ పవిత్రమైనది. దీని యందు మొట్టమొదటి దితిపుత్రులగు హిరణ్యాక్ష-హిరణ్యకశిపుల సంహారము వర్ణించబడినది.
గొప్ప భగవద్బక్తుడగు ప్రహ్లాదుని వృత్తాంతము, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఈ శ్రీహరియొక్క స్వరూపము అను విషయములు నిశ్చయముగా వర్ణించబడినవి.
సృష్టిస్థితిలయములకు ప్రభుడగు శ్రీహరియొక్క గుణములు, లీలలు వర్ణించబడినవి. గొప్పవారగు దేవతల స్థానములలో, నికృష్టులగు రాక్షసుల స్థానములలో కాలమును బట్టి వచ్చిన గొప్ప మార్పులు (తల్లక్రిందులగుట) కూడ వర్ణించబడినవి.
భగవానుని పొందించే భగవద్భక్తుల ధర్మము, ఆత్మానాత్మవివేకము మొదలైన ఆత్మస్వరూప నిరూపణము కూడ ఈ గాథలో చక్కగా వర్ణించ బడినవి.
ఈ పవిత్రమైన గాథలో విష్ణువుయొక్క పరాక్రమము విస్తారముగా వర్ణించబడినది. దీనిని ఎవడైతే శ్రద్ధతో కీర్తించునో మరియు వినునో, అట్టి వాడు కర్మబంధమునుండి విముక్తుడగును.
ఈ విధముగా సర్వజగత్కారణుడగు పురుషోత్తముడు నరసింహావతారమునెత్తి లీలలను చేసెను. ఆయన రాక్షసరాజు సేనానాయకుడు అగు హిరణ్యకశిపుని సంహరించెను. హిరణ్యకశిపుని పుత్రుడగు ప్రహ్లాదుడు పవిత్రమగు ప్రభావము గలవాడు. ఈ వృత్తాంతమునంతనూ ఎవడైతే వినునో, ఏకాగ్రమగు చిత్తముతో పఠించునో, అట్టివాడు దేనివలనైననూ భయము లేని ఆత్మలోకమును (ఆత్మజ్ఞానముచే) పొందును.
ఆహా! మానవలోకములో మీ భాగ్యము చాల గొప్పది. రహస్యముగా మానవాకృతిని దాల్చియున్న పరబ్రహ్మ సాక్షాత్తుగా మీ ఇంటిలో నివసించుచున్నాడు. కావుననే, లోకమును పావనము చేసే మహర్షులు అన్ని వైపులనుండియు మీ గృహమునకు వచ్చుచున్నారు.
అద్వయ-ఆత్మాభిన్నము, నిరుపద్రవము, ఆనందానుభవమే స్వరూపముగా గలది, వేదములలో ప్రసిద్దమైనది అగు పరబ్రహ్మను మహర్షులు ధ్యానమార్గములో అన్వేషించుచుందురు, అట్టి పరబ్రహ్మ మీ మేన మామ కొడుకగు. శ్రీకృష్ణుడే. ఆయన మీకు ప్రియమైన హితకారియై హితమునుపదేశించి మీ పనులను కూడ చేసి పెట్టును. మీ పూజలనందుకొనే ఆయన మీకు మిక్కిలి అనుకూలుడు గదా!
శ్రీకృష్ణునియొక్క తత్త్వమును సాక్షాత్తుగా బ్రహ్మగారు, రుద్రుడు మొదలగువారైననూ తమ బుద్ధితో యథాతథముగా వర్ణించజాలరు. ఆయనను సాధకులు మౌనముచే, భక్తితో, ఇంద్రియజయముతో ఆరాధించేదరు. భక్తజనపాలకుడగు ఆ ఈ శ్రీకృష్ణుడు మాపై ప్రసన్నుడగు గాక!
పూర్వము రుద్రదేవుని కీర్తిని అంతులేని మాయలు గల మయుడు వినష్టము చేసెను. అపుడు ఆ ఈ శ్రీహరి భగవానుడు ఆయన కీర్తిని మరల విస్తరింప జేసెను.
ధర్మరాజు ఇట్లు పలికెను --- జగన్నాథుడగు రుద్రదేవుని ఏ కార్యమునందు మయుడు ఆయన కీర్తిని వినష్టము చేసినాడు? ఈ శ్రీకృష్ణుడు ఆ కీర్తిని ఎట్లు వర్ధిల్ల జేసెను? వివరించుము.
నారదుడిట్లు పలికెను --- ఒకప్పుడు ఈ శ్రీకృష్ణునిచే శక్తి అనుగ్రహించబడిన దేవతలు యుద్ధములో అసురులను జయించిరి. అపుడు వారు మాయావులకు పరమగురువగు మయుని శరణు వేడిరి.
సర్వసమర్థుడగు ఆ మయుడు బంగారము, వెండి, ఇనుములతో మూడు నగరములను నిర్మించి వారికి ఇచ్చేను. విమానముల రూపములో నుండే ఆ నగరముల రాకపోకలు కంటికి కానరావు. వాటిలోని వస్తు సామగ్రి ఊహకైననూ అందదు.
ఓ ధర్మరాజా! ఆ రాక్షస సేనానాయకులు లోకపాలకులతో సహా ముల్లోకముల యెడల తమకు పూర్వమునందు గల వైరమును గుర్తుకు తెచ్చుకొని ఆ నగరములలో ఉంటూ కంటికి కనబడకుండా నాశనము చేయ దొడగిరి.
ఓ ధర్మరాజా! అపుడు దేవతలు లోకపాలకులతో గూడి రుద్రుని వద్దకు వెళ్లి ఇట్లు విన్నవించిరి -- ఓ దేవా! మూడు నగరములలో నివసించి యున్న రాక్షసులు మాకు వినాశము తెచ్చి పెట్టుచున్నారు. నీ వారలమగు మమ్ములను కాపాడుము.
అపుడు సర్వసమర్థుడగు రుద్ర భగవానుడు దేవతలను, భయపడకుడు అని అనుగ్రహించి, ధనుస్సు పై బాణమునెక్కు పెట్టి ఆ మూడు నగరములపై అస్త్రమును ప్రయోగించెను.
సూర్యమండలమునుండి కిరణముల సమూహములు వచ్చినట్లుగా, ఆ బాణమునుండి అగ్ని వలె ప్రకాశించే బాణములు బయల్వెడలినవి. వాటి కారణముగా ఆ నగరములు కానరాలేదు.
ఆ బాణములు తగులగానే ఆ పురములలోని వారందరు ప్రాణము లను కోల్పోయి నేలకొరిగిరి. మయుడు గొప్ప సిద్దులు గలవాడు. ఆతడు అమృతము ఉండే నూతిని నిర్మించి, వారిని తెచ్చి అందులో వైచెను.
జీవమునిచ్చే ఆ అమృతరసము తగులగానే ఆ రాక్షసులు వజ్రము వలే దృఢమైన దేహములు మరియు గొప్ప శక్తి గలవారై లేచి నిలబడిరి. వారు మేఘములను పగులగొట్టే మెరుపుల రూపములోనున్న అగ్నులు వలె ప్రకాశించిరి.
తన సంకల్పము భగ్నము కాగా మనస్సు చెడియున్న వృషభధ్వజుడగు రుద్రుని చూచి, ఈ శ్రీకృష్ణుని రూపములోనున్న ఆ విష్ణు భగవానుడు అపుడు ఆ పురములను భేదించుటకై ఒక ఉపాయమును పన్నెను.
అప్పుడు బ్రహ్మగారు దూడలై, ఈ విష్ణువు స్వయముగా ఆవుడై మూడు పురములలో మధ్యాహ్నసమయములో ప్రవేశించి, ఆ నూతియందలి అమృతరసమును త్రాగివేసిరి.
వ్యామోహితులైయున్న ఆ రాక్షసులు ఆ దూడను, ఆవును చూచి కూడ అడ్డుకొననేలేదు. గొప్ప శక్తులు గల మయుడు ఆ విషయము తెలిసి ఆ దైవముయొక్క లీలను స్మరించి తాను శోకమును పొందలేదు. కాని, శోకముతో పీడితులైయున్న నూతి కాపలాదారులతో ఆయన ఇట్లు పలికెను -- ఈ జగత్తులో దేవత గాని, అసురుడు గాని, మానవుడు గాని, మరియొ కడు గాని, ఎవడైననూ తనకు గాని, ఇతరునకు గాని, ఇద్దరికీ గాని దైవ ముచే కల్పించబడిన దానిని పరిహరించుటకు సమర్థుడైనవాడు లేడు.
తరువాత ఈ విష్ణువు తన శక్తులతో రుద్రుని యుద్ధసామగ్రిని నిర్మించెను. ధర్మముతో రథమును, జ్ఞానముతో సూతుని, వైరాగ్యముతో జెండాను, ఐశ్వర్యముతో గుర్రములను, తపస్సుతో ధనుస్సును, విద్య (ఉపాసన) తో కవచమును, (వైదిక) కర్మతో బాణమును, ఇతరశక్తులతో ఇతరమగు సామగ్రిని వ్యవస్థ చేసెను.
స్వర్గమునందు దుందుభులు మ్రోగినవి. ఆకాశమునందు వందలాది విమానముల రద్దీలు ఏర్పడెను. దేవతలు, దేవర్షులు, పితృదేవతలు, సిద్దుల నాయకులు జయము, జయము అంటూ పూల వానలను చల్లిరి. ఆనందముతో కొందరు గానము చేయగా, అప్సరసల గుంపులు నాట్యమాడిరి.
ఓ ధర్మరాజా! ఈ విధముగా రుద్ర భగవానుడు మూడు నగరములను తగులబెట్టి త్రిపురనాశకుడు ఆయెను. బ్రహ్మగారు మొదలగువారు స్తుతించుచుండగా, అపుడాయన తన ధామమును చేరుకొనెను.
జగత్తునకు తండ్రి, గురువు, ఆత్మస్వరూపుడు అగు శ్రీహరి తన మాయాశక్తిచే మానవరూపమును అనుకరిస్తూ ఈ విధమైన పరాక్రమము లను నెర పెను. మహర్షులచే గానము చేయబడిన ఆ లీలలు జనులను పావనము చేయుచున్నవి. నేను ఇంకనూ దేనిని గురించి చెప్పవలెను?
శ్రీమద్భాగవత మహాపురాణమునందలి సప్తమ స్కంధములో ప్రహ్లాదచరితమునందు ప్రహ్లాదుని నిష్కామభక్తిని, త్రిపుర దహనమును వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది (10) .
