శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము

8 -  అష్టమోఽధ్యాయః

సూతుడు ఇట్లు పలికెను: తరువాత పాండవులు శ్రీకృష్ణుడు తోడు రాగా, మరణించి నీటిని కోరే తమ పుత్రులకు గంగలో జలతర్పణములని చ్చుట కొరకై స్త్రీలను ముందడుకొని వెళ్లిరి.

వారందరు జలతర్పణములనిచ్చి అధికముగా విలపించి, శ్రీహరి యొక్క పాదపద్మములయందలి ధూళిచే పవిత్రమైన గంగానదీజలము లలో మరల స్నానమును చేసిరి.

ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, ఆయన సోదరులు, పుత్రశోకముతో బాధపడుతున్న గాంధారీకుంతీద్రౌపదులు, యుద్ధములో బంధువులను పోగొట్టుకొని శోకమునకు వశులైయున్న ఇతరులు అక్కడ కూర్చుండి దుఃఖించుచుండగా, శ్రీకృష్ణభగవానుడు మహర్షులతో కూడి వారికి ప్రాణు లు మృత్యువు వాతబడుట అనివార్యమని బోధించి ఓదార్చెను.

శ్రీకృష్ణభగవానుడు అజాతశత్రువగు ధర్మరాజునకు జూదగాళ్లగు దుర్యోధనాదులచే అపహరింపబడిన తనదైన రాజ్యమును సంపాదించి పెట్టి, ద్రౌపదియొక్క జుట్టుముడిని పట్టుకొనుటచే క్షీణించిన ఆయుర్గా యము గల దుష్టులగు రాజులను సంహరింపజేసి, ధర్మరాజుచేత ఉత్తమ మగు సామగ్రి మరియు ఋత్విక్కులు గల మూడు అశ్వమేధయాగము లను చేయించి, ఆయనయొక్క పవిత్రమగు కీర్తిని ఇంద్రుని కీర్తిని వలె నాల్గు దిక్కులయందు విస్తరింప జేసెను.

శ్రీకృష్ణభగవానుడు ద్వారకకు వెళ్లవలెనని నిశ్చయించుకునే వాడై, పాండవుల వద్ద సెలవు తీసుకొని, వ్యాసుడు మొదలగు మహర్షులనువెంట రాగా, రథమును అధిష్ఠించుచుండగా, భయముతో కంగారు పడుతూ తన వైపునకు పరుగెత్తుకొని వచ్చుచున్న అభిమన్యుపతియగు ఉత్తరాదేవిని చూచెను.

ఓ మహాయోగీ! దేవదేవా! జగన్నాయకా! ఒకరిని మరియొకరు చంపుకునే ఈ లోకములో నాకు నీవు తక్క మరియొక శరణు కానరాదు. .

ఓ ఈశ్వరా! ప్రభూ! రక్షకుడా! మండుచున్న ఇనుప బాణము నా వైపునకు వచ్చుచున్నది. అది నన్ను యథేచ్ఛగా సంహరించు గాక! కాని, నా గర్భమునకు హాని కలుగరాదు.

సూతుడు ఇట్లు పలికెను: భక్తవత్సలుడగు శ్రీకృష్ణభగవానుడు ఆమె మాటను వింటూనే, అది ఈ జగత్తులో పాండవుల వంశము లేకుండా చేయుటకొరకై అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమని గ్రహించెను.

ఓ మహర్షీ! అదే సమయములో పాండవులు కూడ తమ వైపుకు వచ్చుచున్న మండే అయిదు బాణములను చూచి, తమ అస్త్రములను పైకి తీసిరి."

ఇతరవిషయములయందు లగ్నము కాని మనస్సులు గల (తన యందు అనన్యమగు భక్తి గల) ఆ పాండవులకు వచ్చిన ఆ ఆపదను చూచి, శ్రీకృష్ణభగవానుడు తన అస్త్రమగు సుదర్శనచక్రముతో తన భక్తులను రక్షించెను.

సర్వప్రాణుల ఆత్మరూపుడు, సర్వయోగులకు ప్రభువు అగు శ్రీకృ ష్ణభగవానుడు కురువంశముయొక్క ఒకే ఒక సంతానమును నిలబెట్టుట కొరకై విరాటపుత్రికయగు ఉత్తరయొక్క గర్భములోనికి ప్రవేశించి, దానిని తన మాయాశక్తితో కప్పివేసెను.

ఓ శౌనకమహర్షీ! బ్రహ్మాస్త్రము మొక్కవోనిది, ప్రతిక్రియ లేనిది అయిననూ, వైష్ణవతేజస్సు ఎదురు కాగానే శాంతించెను.

అద్భుతములన్నింటికీ పుట్టినిల్లగు శ్రీకృష్ణభగవానుని విషయ ములో ఈ బ్రహ్మాస్త్రమును ఉపశమింప జేయుట ఆశ్చర్యమని నీవు తలు పకుము. పుట్టుక లేని ఆయన తన మాయాశక్తిచే ఈ జగత్తును సృష్టించి, పాలించి, సంహరించుచున్నాడు. .

పతివ్రతయగు కుంతి బ్రహ్మాస్త్రముయొక్క తేజస్సునుండి విము కులైన పాండవులతో మరియు ద్రౌపదితో గూడినదై, ప్రయాణమునకు సిద్ద ముగా నున్న శ్రీకృష్ణభగవానునితో నిట్లనెను.

కుంతి ఇట్లు పలికెను: నీవు ఆదినారాయణుడవు, సర్వజగన్నియం తవు. మాయాశక్తికి అతీతమైన నీవు ఇంద్రియములకు గోచరించవు. సర్వ ప్రాణుల అంతఃకరణమునందు మాత్రమే గాక బాహ్యమునందు కూడ నెల కొనియున్న నీకు నమస్కరించు చున్నాను.

మాయ అనే తెరచే కప్పివేయబడియుండే నీవు ప్రత్యక్షాదిప్రమాణములకు గోచరుడవు కావు. అట్టి అవినాశియగు నిన్ను నేను ఎట్లు తెలియగలను? మూర్ఖుడు వేషమును దాల్చియున్న నటుని పోల్చుకొన లేడు. అటులనే, దేహాభిమానముచే సమ్మోహితమైన బుద్ధిగల మానవుడు నిన్ను గుర్తుపట్ట లేడు.

సమ్యగ్జర్శననిష్ఠులు, స్వచ్ఛమగు అంతఃకరణము గలవారునగు మహర్షులు సైతము భక్తియోగమును చేయుట కొరకై నీవు భూమియందు అవతరించితివి. అట్టి నీ యథార్థస్వరూపమును స్త్రీలమగు మేము ఎట్లు చూడగల్గుదుము?

దేవకీవసుదేవుల ముద్దుబిడ్డడై జన్మించి నందగోపుని ఇంటిలో ఆవులను కాయుచూ పెరిగిన శ్రీకృష్ణునకు అనేక నమస్కారములు.

నాభియందు పద్మము గలవాడు, పద్మముల మాలను దాల్చినవా డు, పద్మమును బోలిన కన్నుల వాడు, అరికాళ్లయందు పద్మముల చిహ్న ములు గలవాడునగు నీకు అనేక నమస్కారములు.

ఇంద్రియాధిపతివగు ఓ పరమేశ్వరా! ప్రభూ! దుష్టుడగు కంసు నిచే బంధింపబడి చిరకాలము దుఃఖముతో నిండిన జీవితమును గడిపిన దేవకీదేవిని నీవు ఏ విధముగా బంధవిముక్తురాలిని చేసితివో, అదే విధ ముగా నా పుత్రులతో సహా నన్ను కూడా పలు పర్యాయములు రక్షకు డవగు నీవు మాత్రమే ఆపదల సమూహమునుండి గెట్టెక్కించితివి.

ఓ శ్రీహరీ! నీవు మమ్ములను విషము (దుర్యోధనుడు భీమునకు విషమునిచ్చిన సందర్భము) నుండి, లక్క ఇంటిలో పెద్ద అగ్ని ప్రమాదము నుండి, హిడింబుడు మొదలైన రాక్షసులు తారసపడ్డ పరిస్థితులనుండి, దుర్యోధనుడు మొదలగు దుష్టసభికుల సభనుండి, అరణ్యవాసములోని కష్టములనుండి, అనేకయుద్ధములలో కర్ణుడు మొదలైన అనేకులగు మహా రథుల అస్త్రముల బారినుండి, ఈ నాడు అశ్వత్థామయొక్క బ్రహ్మాస్త్రము నుండి కాపాడగా, మేమీ విధముగా జీవించి యున్నాము.

గీతను బోధించిన ఓ జగద్గురూ! మాకు సర్వదా ఆయా సందర్బ ములలో ఆపదలు వచ్చుచుండును గాక! ఏలయనగా, మాకు ఆపదల యందు నీ దర్శనమగుచుండును, నీ దర్శనము చేసిన వారికి, మరల సంసారమును దర్శింపబని లేదు గదా!

దరిద్రునకైననూ నీవు దర్శనమునిచ్చెదవు. గొప్ప వంశములో పుట్టుట, అధికారము, చదువు, సంపద అను వాటి కొరణముగా పెరిగిన గర్వము గల పురుషుడు నిన్ను పిలుచుటకైననూ అర్హుడు కాడు.

దరిద్రులకు నీవే సంపద. ప్రకృతిగుణముల కార్యమగు ప్రపంచము నీకు లేపమును కలిగించదు. రాగము మొదలగు దోషములు లేని నీవు స్వస్వరూపమునందు మాత్రమే రమించెదవు. మోక్షమునిచ్చే ప్రభుడవగు నీకు అనేకనమస్కారములు.

కాలస్వరూపుడు, ఆద్యంతములు లేనివాడు, సర్వవ్యాపకుడు అగు పరమేశ్వరుడు నీవేనని నేను తలంచుచున్నాను. ప్రాణులు పరస్స రము కలహించుకొనుచున్ననూ, నీవు సర్వకాలములలో సర్వప్రాణులలో సమానముగా సంచరించు చున్నావు.

ఓ భగవాన్! నీవు మానవులను అనుకరిస్తూ లీలలను చేసెదవు. నీవు ఏమి చేయ గోరుచున్నావో ఎవ్వరికీ తెలియదు. నీకు ఏ కాలమునండై ననూ ఎవ్వరైననూ ప్రియమైనవాడు గాని, ద్వేషింప దగినవాడు గాని లేడు. కాని, మానవులు నీ విషయములో పరస్పరవిరుద్ధములగు ధారణ లను కలిగి యున్నారు.

విశ్వమునకు ఆత్మ అయినవాడా! నీకు. పుట్టుక గాని, కర్తృత్వము గాని లేవు. కాని, నీవు పశు (వరాహ), మనుష్య(శ్రీరామ), ఋషి(వామన),జలచర (మత్స్య) యోనులయందు జన్మించి ఆయా కర్మలను చేయుట కేవలము లీల మాత్రమే.

నీవు పాలకుండను పగులకొట్టుట అనే అల్లరి పనిని చేసినప్పుడు యశోద కోపించి నిన్ను కట్టివేయుటకై త్రాటిని తీసుకువచ్చునంతలో, నీవు కాటుకతో కలిసిపోయిన కన్నీరు చెక్కిళ్లపై ప్రవహించుచుండగా, ఆదుర్దాగా ఇటునటు చూస్తూ ముఖమును క్రిందకు దించుకుని భయపడిపోతూ నిలబ డియున్న ఏ అవస్థ గలదో, అది నన్ను విశేషముగా మురిపించుచున్నది. వాస్తవములో నీ వలన భయము కూడ భయపడును గదా!

నీకు పుట్టుక లేదు. అయిననూ, పవిత్రమగు కీర్తి గలవాడు మరియు నీకు ఇష్టుడు అగు యదుమహారాజుయొక్క కీర్తిని విస్తరింప జేయుట కొరకై, చందనవృక్షము మలయపర్వతముపై ప్రకటమైన రీతిగా, ఆయన వంశములో జన్మించినావని కొందరు చెప్పుచున్నారు.

దేవకీవసుదేవులు పూర్వజన్మలో నిన్ను తమ పుత్రుడు కమ్మని కోరగా, నీవు జన్మలేని వాడవైననూ జగత్తుయొక్క క్షేమమును గోరి రాక్ష సులను సంహరించుటకై వారికి పుత్రుడవై జన్మించితివని మరికొందరు చెప్పుచున్నారు.

సముద్రములో నావ వలె అధికమగు భారముచే పీడింపబడు చున్న భూమియొక్క భారమును తగ్గించుట కొరకు బ్రహ్మచే ప్రార్థింపబడి నీవు జన్మించినావని ఇతరులు చెప్పుచున్నారు.

ఈ సంసారములో ఆత్మస్వరూపముయొక్క అజ్ఞానము, దాని వలన కామనలు, వాటి వలన కర్మలు అనే చక్రములో తగులుకొని క్లేశపడు చున్న జనులకు వినుటకు మరియు స్మరించుటకు అర్హములగు లీలలను చేయగోరి నీవు జన్మించినావని కొందరు చెప్పుచున్నారు.

జనులు నీ చరితమును నిత్యము విని, కీర్తించి, పఠించి, స్మరించి ఆనందించుచున్నారు. అట్టివారు మాత్రమే శీఘ్రమే జన్మపరంపరకు స్వస్తి చెప్పే నీ పాదపద్మములను చూచెదరు.

భక్తుల కోర్కెలను ఈడేర్చే ఓ ప్రభూ! నీవీనాడు నిన్ను ఆశ్ర యించి జీవించే మిత్రులమగు మమ్ములను విడువ గోరుచున్నావా యేమి? మేము రాజులకు దుఃఖమును కలిగించి యుంటిమి. మాకు నీ పాదపద్మ ములు తక్క మరియొక శరణు లేదు.

జీవుని సన్నిధానము లేనిచో, ఇంద్రియముల గతి యేమగును? ఈ నాడు యదువులు మరియు పాండవులమగు మేము పేరుప్రఖ్యాతుల ను, సంపదలను కలిగి యున్నాము. నీ దర్శనము లేనిచో, అట్టి మాకు అస్తి త్వము ఏమి ఉండును?

ఓ గదాధరా! ఈ కురుదేశములోని భూమి ఈనాడు అసాధారణ మగు పద్మము మొదలగు చిహ్నములు గల నీ పాదముల ముద్రలతో ప్రకా శించుచున్నది. కాని, నీవు వెళ్లిన తరువాత దానికి ఆ శోభ కరువగును.

అడవులు, పర్వతములు, నదులు, సముద్రములతో కూడిన ఈ రాజ్యములు నీ చూపుల చలవ వలన కోతకు వచ్చిన పంటలతో, ఫలము లతో నిండిన లతలతో మరియు వృక్షములతో సుసమృద్ధములై వర్ధిల్లుచున్నవి. 

ఓ జగన్నాయకా! నామరూపాత్మకమగు జగత్తునకు అధిష్టానమైన వాడా! జగద్రూపములో ప్రకటముగువాడా! నీవు వెళ్లే పక్షములో, నాకు ఈ పాండవులయందు యాదవులయందు గల దృఢమైన మమకారము అనే బంధమును ఛేదించుము.

ఓ యదుపతీ! నా బుద్ది ఇతరవిషయములయందు లగ్నము కాకుండగా నిరంతరముగా గంగాప్రవాహము (విఘ్నములను లెక్కచేయ కుండగా) సముద్రములో కలియువిధముగా నీయందు అవిచ్ఛిన్నమగు ప్రీతిని కలిగియుండు గాక!

ఓ శ్రీకృష్ణా! నీవు అర్జునునకు మిత్రుడవు. యదువంశ శ్రేష్ఠుడవు. భూలోకమునకు చేటును తల పెట్టే రాజుల వంశములను నశింపజేసే నీ ప్రభావము అనంతమైనది. ఓ గోవిందా! నీవు గోవుల, బ్రాహ్మణుల మరియు దేవతల కష్టములను బాపుటకు అవతరించినావు. యోగులకు ప్రభువగు ఓ జగద్గురూ! నీకు నమస్కారమగు గాక! .

సూతుడు ఇట్లు పలికెను: ఈ విధముగా కుంతి మధురమగు వాక్య ములతో శ్రీహరియొక్క సర్వతోముఖమగు. మహిమను కొనియాడగా, ఆయన తన మాయచే మోహింప జేయుచున్నాడా యన్నట్లు మెల్లగా నవ్వెను.

ఆయన ఆమెతో సరే అని పలికి ఆమె వద్ద, మరియు హస్తినాపుర మును ప్రవేశించి సుభద్ర మొదలగు వారి వద్ద సెలవు తీసుకొని తన నగర మునకు బయలుదేర బోతూ ఉండగా ధర్మరాజు ప్రేమతో ఆయనను నివా రించెను.

బంధుమరణముచే అతిశయించిన దుఃఖమును పొందియున్న ధర్మరాజును అద్భుతమగు లీలలు గల శ్రీకృష్ణుడు మాత్రమే గాక, ఈశ్వ రుని అభిప్రాయమునెరింగిన వ్యాసుడు మొదలగు మహర్షులు కూడ వివిధ ములగు ఇతిహాసములను చెప్పి ఓదార్చిరి. అయిననూ, ఆయనకు దుఃఖము శాంతించలేదు.

ఓ మహర్షులారా! మనస్సులో అవివేకము నిండియుండుటచే ధర్మరాజు ప్రేమకు మోహమునకు వశుడై స్నేహితుల వధను గురించి చింతిస్తూ ఇట్లు పలికెను.

అయ్యో! దుష్టబుద్దినగు నో హృదయమునందు గట్టిగా నెలకొని యున్న అజ్ఞానమును గనుడు. కుక్కలకు నక్కలకు ఆహారము కోదగిన ఈ నా దేహము కొరకై అనేకములగు అక్షౌహిణీల (21 870 రథములు, 21 870 ఏనుగులు, 109 350 సిపాయీలు, 65 600 అశ్వ సైనికులు కలిసి ఒక అక్షౌహిణి) సైన్యము సంహరించ బడినది.

పిల్లలకు బ్రాహ్మణులకు బంధువులకు స్నేహితులకు తండ్రులకు అన్నదమ్ములకు మరియు గురువులకు ద్రోహమును చేసిన నాకు పది కోట్ల సంవత్సరముల తరువాత నైననూ నరకమునుండి విడుదల లభించదు.

ప్రజలను రక్షించే రాజు ధర్మయుద్దములో శత్రువులను సంహరిం చుటలో పాపము లేదనే శాస్త్రవచనమైతే నా అవగాహనకు వచ్చుట లేదు.

బంధువులను సంహరించుటచే స్త్రీలకు జరిగిన ద్రోహమును నేను గృహస్థులు చేసే యజ్ఞయాగాది కర్మల ద్వారా పోగొట్టుకొన లేను.

బురద నీటిని మరింత బురదతో శుద్దము చేయలేము. మద్యము వలన వచ్చిన దోషమును మరింత మద్యముతో తుడిచి వేయలేము. అదే విధముగా, ఒక ప్రాణియొక్క హింసాదోషమునైననూ అనేకయజ్ఞముల ద్వారా తుడిచి వేయుట సంభవము కాదు.

శ్రీమద్బాగవత మహాపురాణములోని ప్రథమస్కంధములో ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.