శ్రీ మద్భాగవతము - ప్రధమ (1వ) స్కందము
3 - తృతీయోఽధ్యాయః
భగవంతుడు పూర్వము సృష్టిని చేయగోరి మహత్తత్త్వము, అహంకారము మరియు పంచతన్మాత్రలతో గూడి సునిష్పన్నమైన పురుష రూపమును గ్రహించెను. ఆ రూపమునందు అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, అంతఃకరణము, అయిదు భూతములు అనే పదునారు కళలు గలవు.
కారణజలమునందు నడుము వాల్చి సమాధిరూపమైన నిద్రను కొనసాగించుచున్న పరమేశ్వరుని నాభి అనే సరస్సునుండి ప్రజాపతులకు ప్రభువగు బ్రహ్మగారు ఉదయించెను.
ఆ పరమేశ్వరుని అంగాంగముల రూపముగా మాత్రమే ఈ జగత్తు విస్తరించి యున్నది. భగవానుని ఆ విరాడ్రూపము రజస్తమోగుణముల సంస్పర్శ లేని నిరతిశయమైన సత్త్వగుణముయొక్క అభివ్యక్తియే.
అనంతములైన పాదములు, ఊరువులు, భుజములు, శిరస్సులు, చెవులు, కన్నులు, ముక్కులు, కిరీటములు, వస్త్రములు మరియు కుండల ములతో అద్బుతముగా ప్రకాశించే ఈ రూపమును యోగులు గొప్ప జ్ఞాన నేత్రముతో చూచెదరు.
వివిధములగు అవతారములు ఈ ఆదినారాయణరూపమునుండియే ఉద్భవించి, అవతారప్రయోజనము పూర్తి అయిన తరువాత మరల దానియందే విలీనమగును. బ్రహ్మగారు ఈ రూపముయొక్క అంశ కాగా, ఆయన అంశలగు మరీచ్యాది మహర్షులచే దేవతలు పశువులు పక్షులు మానవులు మొదలగు ప్రాణులు సృష్టించ బడుచున్నవి.
ఆ ఆదినారాయణుడే కౌమారసర్గములో సనక, సనందన, సనాత న, సనత్కుమారులనే మహర్షుల రూపమును స్వీకరించి, విఘ్నములు లేని క్లేశసాధ్యమైన బ్రహ్మచర్యమును నేరపెను.
రెండవ పర్యాయములో యజ్ఞేశ్వరుడగు ఆ నారాయణుడు ఈ జగత్తుయొక్క సమృద్ధి కొరకు పాతాళమునందున్న భూమిని పైకి తీయ గోరి వరాహరూపమును దాల్చెను.
ఆ నారాయణుడు మూడవదియగు ఋషిసృష్టిలో దేవర్షియగు నారదుని రూపమును దాల్చి, భక్తులు చేయదగిన కర్మలను బోధించే పంచరాత్రాగమమును ఉపదేశించెను. సహజముగా బంధహేతువులగు కర్మలు దాని ప్రభావముచే అంతఃకరణశుద్ధి ద్వారా మోక్ష హేతువులగును.
నాల్గవ అవతారమునందు ఆయన ధర్ముని పత్నియరు. మూర్తీ యందు నరనారాయణమహర్షుల రూపములో జన్మించి, మనస్సును పూర్ణముగా నిగ్రహించి కఠోరమైన తపస్సును చేసెను.
ఐదవ పర్యాయములో ఆయన సిద్దులకు ప్రభువగు కపిలమ హర్షిరూపముగా అవతరించి తత్త్వసముదాయమును విశేషముగా నిర్ధారించి చెప్పే సాంఖ్యశాస్త్రమును ఉపదేశించెను. ఆ శాస్త్రము కాల ప్రభావముచే అంతరించి పోయినది.
ఆరవ పర్యాయములో ఆయన అనసూయా దేవిచే కోరబడి (ఆ త్రీచే తన సంతానరూపములో కోరబడి ఆ కోరిక విషయములో తప్పును పట్టకుండగా) అత్రిమహర్షికి కొడుకుగా (దత్తాత్రేయ మహర్షి) పుట్టి అలర్కు డు, ప్రహ్లాదుడు, యదువు, హైహయుడు మొదలగు వారికి ఆత్మవిద్యను ఉపదేశించెను.
అ తరువాత ఏడవ పర్యాయములో ఆయన రుచి ప్రజాపతికి ఆకూతియందు యజ్ఞుడై జన్మించి, తన పుత్రులగు యామ మొదలైన దేవ గణములతో కూడి స్వాయంభువ మన్వంతరమును రక్షించెను.
విశాలమగు పాదవిక్షేపములు గల శ్రీమహావిష్ణువు నాభిమహారాజునకు మేరుదేవియందు ఋషభుడై జన్మించి, వివేకవంతులకు అన్ని ఆశ్ర మములవారిచే నమస్కరించబడే పరమహంస (జ్ఞాన) మార్గమును చూపించెను.
తొమ్మిదవ పర్యాయము ఋషులు కోరగా ఆయన పృథుమహా రాజు రూపములో జన్మించి గోరూపములోనున్న ఈ భూమినుండి. సక లములగు ఓషధులను పితికెను. ఓ మహర్షులారా! అందువలననే, ఆ అవ తారము మిక్కిలి కల్యాణకరమైనది.
చాక్షుషమన్వంతరము పూర్తి కాగానే సముద్రములన్నియు కలిసి పోయి ఏకార్ణవమైనప్పుడు ఆయన మత్స్యరూపమును దాల్చి, వైవస్వత మనువును నౌకరూపములోనున్న భూమియందు ఎక్కించుకొని కాపాడెను.
పదకొండవ పర్యాయములో సర్వస్యోపకుడగు పరమేశ్వరుడు దేవతలు మరియు రాక్షసులు సముద్రమును మథించుచుండగా కూర్మరూ పమును దాల్చీ మందరపర్వతమును తన వీపుపై మోసెను.
పన్నెండవది ధన్వంతరి అవతారము. పదమూడవ అవతారములో ఆయన మోహినీ రూపముతో రాక్షసులకు మోహమును కలిగించి, దేవత లచే అమృతపానము చేయించేను.
పదునాల్గవదియగు నరసింహావతారములో శ్రీమహావిష్ణువు బల శాలియగు రాక్షసరాజైన హిరణ్యకశిపుని వక్షఃస్థలమును చేతిగోళ్లతో, ఊలను చేయుపోడు గడ్డిని వలే చీల్చివేసెను.
పదిహేనవ పర్యాయము ఆయన వామనావతారమును స్వీకరిం చి, స్వర్గమును లాగుకొనుటకై బలిచక్రవర్తియొక్క యజ్ఞమునకు వెళ్లి, మూడడుగుల భూమిని కోరెను.
పదునారవ అవతారములో రాజులు ఈశ్వరద్రోహమును చేయు చుండుటను గాంచి ఆయన కోపించి ఇరవై ఒక్క సార్లు భూమియందు క్షత్రి యులు లేకుండగా చేసెను.
తరువాత ఆయన పది హేడవ అవతారములో పరాశరమహర్షికి సత్యవతియందు వ్యాసుడై జన్మించి, మానవులు అల్పమగు ప్రజ్ఞను కలిగి యుండుటను గాంచి, వేదము అనే మహావృక్షమును శాఖల రూపముగా విభాగము చేసెను.
ఆ తరువాత (పదునెనిమిదవ అవతారములో) ఆయన దేవకార్య మును చేయగోరి, శ్రీరామచక్రవర్తిరూపమును దాల్చి, సముద్రముపై సేతువును కట్టుట మొదలగు శౌర్యపూర్ణములగు కార్యములను చేసెను.
విష్ణుభగవానుడు పందొమ్మిది మరియు ఇరువది అవతారములలో యదువంశమునందు బలరామకృష్ణులుగా జన్మించి భూభారమును పోగొట్టెను.
తరువాత కలియుగము ఆరంభమైన పిమ్మట దేవవిద్వేషులను మోహ పెట్టుట కొరకై మగధదేశమునందు బుద్దుడు అనే పేరుతో అజనుని కుమారుడై జన్మించగలడు.
తరువాత జగత్తులను రక్షించే శ్రీమహావిష్ణువు కలియుగము యొక్క అంతమునందు, రాజులు ఇంచుమించు చోరులుగా తయారైన ప్పుడు, కల్కి అను పేరుతో విష్ణుయశస్సు అనునాతని కుమారుడై జన్మిం చగలడు.
ఓ మహర్షులారా! ఎండిపోవుట యెరుగని అగాధసరస్సునుండి వేలాది పిల్లకాలువలు బయలుదేరు విధముగా, సత్త్వగుణస్వరూపుడగు శ్రీహరినుండి లెక్కలేనన్ని అవతారములు బయలుదేరుచుండును.
ఋషులు, మనువులు, దేవతలు, గొప్ప పరాక్రమశాలురైన మను పుత్రులు, ప్రజాపతులు అందరు శ్రీహరియొక్క అంశలు మాత్రమే.
పరమేశ్వరుని ఈ అంశావతారములు రాక్షసులచే ఇబ్బందులకు గురిచేయబడే లోకమును ప్రతియుగమునందు రక్షించుచుందురు. కాని, శ్రీకృష్ణుడు స్వయముగా శ్రీహరియే.
భగవానుని రహస్యమగు ఈ అవతారముల గాథను ఏ మానవు డైతే పరిశుద్దుడై ఉదయము మరియు సాయంకాలము పఠించునో, ఆతడు దుఃఖమయమగు సంసారమునుండి విముక్తిని పొందును.
రూపము లేని చైతన్యఘనుడగు పరమేశ్వరునకు ఈ జగద్రూ పము మాయాశక్తి యొక్క కార్యములగు మహత్తత్త్వము మొదలగు వాటి చేత ఆ పరమేశ్వరుని మాత్రమే అధిష్ఠానముగా చేసుకొని రచించబడినది. లేదా, రూపము లేనివాడు, శుద్ధచేతనుడు అగు జీవునకు ఈ శరీరము భగ వంతుని మాయాశక్తివికారములగు మహత్తత్త్వము మొదలగు వాటిచేత చిదనమగు ఆత్మ (పరం బ్రహ్మ) అనే అధిష్టానమునందు రచించబడినది.
మేఘముల గుంపు వాయువును ఆశ్రయించి యున్ననూ ఆకాశ మునందు ఆరోపించ బడుచున్నది. పొగకు మూలము పృథివీవికారమగు ధూళియే అయిననూ, అది అగ్నికి అంటగట్ట బడుచున్నది. అటులనే, దృక్స్వరూపమగు ఆత్మయందు దృశ్యమగు శరీరముయొక్క ధర్మములు (జన్మమరణములు ఇత్యాదులు) ఆరోపించ బడుచున్నవి.
చిద్ఘనుడగు ఆ పరమేశ్వరునకు, చేతులు కాళ్లు మొదలగు స్థూల రూపములలోనికి పరిణామమును చెందని, సత్త్వరజస్తమోగుణములచే రచించబడిన మరియొక ఉపాధి గలదు. అది కంటికి కానరాని, చెవులకు వినరాని సూక్ష్మమగు ఉపాధి. అదియే జీవుని సూక్ష్మ (లింగ) శరీరమని నిర్దేశించ బడుచున్నది. దాని వలననే జీవునకు పునర్జన్మ కలుగుచుండును.
మానవుడు ఏ కాలమునందైతే ఈ రెండు స్థూలసూక్ష్మరూపము లు అజ్ఞానముచే ఆత్మయందు కల్పించబడినవని గుర్తించి, స్వరూపజ్ఞాన ముచే వాటిని త్రోసిపుచ్చునో, అదే క్షణములో జ్ఞానఘనమగు బ్రహ్మయే యగును; లేదా, బ్రహ్మసాక్షాత్కారము కలుగును
బుద్ధిరూపిణియగు ఈ పరమేశ్వరుని మాయాశక్తి విద్యారూప ముగా మారి తొలగిపోయినచో, జీవుడు నిశ్చయముగా తన బ్రహ్మస్వరూ పమును పొందునని తత్త్వవేత్తలు చెప్పుచున్నారు. ఆపైన ఆ జీవుడు తన పరమానంద స్వరూపమునందు విరాజిల్లును.
కర్తృత్వము లేనివాడు, పుట్టుక లేనివాడు, అంతర్యామి అగు ఆ పరమేశ్వరునకు మాయాసంబంధముచే వచ్చిన వేదముల రహస్యములైన కర్మలను మరియు జన్మలను విద్వాంసులు ఈ విధముగా వర్ణించినారు.
అమోఘమగు లీలలు గల ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టిం చి, పాలించి, ఉపసంహరించుచున్నాడు. కాని, ఆయన జగత్తునందు ఆస క్తిని కలిగి యుండుటలేదు. ఆ పరమేశ్వరుడు ప్రాణుల హృదయములో అంతర్యామిరూపముగా నున్నవాడై, చెవి కన్ను నాలుక చర్మము ముక్కు మరియు మనస్సు అనే ఆరు ఇంద్రియములను నియంత్రిస్తూ, శబ్దరూపర సస్పర్శగంధములు మరియు సుఖదుఃఖములు అనే వాటి విషయములను ఆఘ్రాణించుచున్నాడు. కాని, స్వతంత్రుడగు ఆ పరమాత్మకు ఈ విషయ ములతో సంగము లేదు.
మూర్ఖునకు నటుని చేష్టల స్వరూపము తెలియదు. అటులనే, సంకల్పముచే రూపములను, వేదరూపములగు వాక్కులతో నామములను చక్కగా విస్తరింపజేయుచూ జగత్తును పాలించుచున్న ఈ పరమేశ్వరుని లీలలను దుర్బుద్ధియగు ఏ మానవుడైననూ తర్కపటిమచే తెలియజాలడు.
ఎవడైతే నిష్కపటస్వభావము గలవాడై నిరంతరముగా ఈశ్వరీయ జీవనమును కొనసాగిస్తూ ఆ పరమేశ్వరుని పాదపద్మముల పరిమళమును సేవించునో, అట్టివాడు జగద్విధాత, అంతుచిక్కని పరాక్రమము గలవాడు, చక్రమును చేతియందు ధరించువాడు అగు ఆ పరమేశ్వరుని స్వరూపము ను, లీలల రహస్యమును తెలియగల్గును.
కావున, పూజ్యులగు మీరు ధన్యులు. ఏలయనగా, మీరు ఇట్లు ప్రశ్నించి సకలజగన్నాయకుడగు శ్రీమహావిష్ణువునందు ఈ జన్మలో పూర్ణ మైన అనన్యమైన ప్రేమను చేయుచున్నారు. ఇట్టి మనోభావము కలిగిన మానవుడు మరల భయంకరమగు జన్మమరణముల సుడిగుండములో చిక్కుకొనడు.
భగవాన్ వేదవ్యాసమహర్షి ఉత్తమమగు కీర్తిగల పరమేశ్వరుని చరి తమును వర్ణించే, వేదములతో సమానమైన, భాగవతమను ఈ ప్రసిద్ధమగు పురాణమును రచించెను.
కొనియాడదగినది, మంగళములకు నిధానము అగు అట్టి ఈ మహాపురాణమును ఆయన మానవాళియొక్క పరమహితము కొరకై తన కుమారుడు, ఆత్మజ్ఞానులలో అగ్రేసరుడునగు శుకమహర్షికి నేర్పించెను.
ఈ పురాణములో సకలవేదములు మరియు రామాయణభారత ముల సారభూతమైన తత్త్వము సంగ్రహించ బడినది. దీనిని ఆ శుకమహర్షి గంగానదీతీరమునందు ప్రాయోపవేశము చేసి ఋషులచే చుట్లువారబడి యున్న పరీక్షిన్మహారాజునకు వినిపించినాడు. ఓ మహర్షులారా! గొప్ప తేజ శ్శాలియగు శుకమహర్షి అచట భాగవతమును కీర్తించుచుండగా, అక్కడనే కూర్చుండియున్న నేను కూడా ఆయన అనుగ్రహముచే దానిని తెలుసు కొంటిని. అట్టి నేను అధ్యయనము చేసినదానిని అతిక్రమించకుండగా నా బుద్ధిశక్తిననుసరించి మీకు వినిపించెదను.
శ్రీకృష్ణుడు ధర్మము, జ్ఞానము మొదలగు వాటితో గూడి తన ధామమునకు వెళ్లిపోగానే, జ్ఞాననేత్రము లోపించిన జనులకొరకై ఈ పురా ణమనే సూర్యుడు ఇప్పుడు ఉదయించినాడు.
శ్రీమద్భాగవతమహాపురాణములోని ప్రథమస్కంధములో మూడవ అధ్యాయము ముగిసినది.
