3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము
30 - గరుడపురాణ మాహాత్త్యం
గరుడ పురాణ సారాన్ని పూర్తిగా వివరించిన పిమ్మట ఖగవాహనుడు కాలకంఠునితో ఇలా చెప్పాడు. ‘గరుడ పురాణం’ రక్షిస్తుంది. ఈ పురాణం చదివినవారికి ‘ఇక్కడ’ భోగం ‘అక్కడ’ మోక్షం కలుగుతాయి. (ఇది మానవులకి) గరుడపురాణం ఎల్లరికీ విద్య, యశస్సు, సౌందర్యం, లక్ష్మి, విజయం, ఆరోగ్యం మున్నగువాటిని ప్రసాదిస్తుంది. దీనిని పఠించిన వానికీ విన్నవానికీ సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. అది స్వర్గానికి మనిషిని గొనిపోగలదు’.
తాను విష్ణుభగవానుని ద్వారా ఈ పురాణాన్ని విని తరించానని బ్రహ్మ వ్యాస మహర్షికి చెప్పగా ఆ మహర్షి నాతో ఇలా అన్నాడు.
‘వత్సా! విష్ణు భగవానుని నుండి గరుడపురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికీ, నారదునికీ, నాకూ బోధించాడు. నేను నీకు చెప్పాను. నువ్వు శౌనకాది మహామునులకు వివరించి చెప్పు. ఎందుకంటే దీనిని విన్నవ్యక్తి సర్వజ్ఞుడై అభీష్ట ప్రాప్తినీ బ్రహ్మ పదాన్నీ పొందే మార్గాన్ని తెలుసుకుంటాడు. విష్ణుదేవుడు గరుత్మంతునికి కూడా ఇదే పురాణాన్ని చెప్పి దానినా మహాభక్తుని పేర ప్రపంచానికి ప్రసాదించాలని ఆదేశించాడు. ఇది నిజమైన మహాసార తత్త్వం. ఇది ఏ ప్రాణికైనా ధర్మార్థ కామ మోక్షాల ఫలాలనీయగలదు.’
శౌనకాది మహర్షులారా! ఈ శ్రేష్ఠతమమైన పురాణాన్ని మీరు నా నుండి విన్నారు కదా! దీనిని బ్రహ్మ నుండి నిని మా గురువుగారైన వ్యాస భగవానులు బహుకాలం క్రిందటే నాకు బోధించారు. ఆ శ్రీహరియే వ్యాసరూపమున జనించి నాలుగు వేదాలనూ స్పష్టపచి, పదునెనిమిది పురాణాలనూ రచించాడు. ఇతర పురాణాలనన్నింటినీ మహానుభావుడైన శ్రీ శుకమహర్షి నాకు వినిపించాడు. ఈ మహాపురాణాన్ని నా నుండి మీరు విన్నారు కదా! మహావిష్ణువిచ్చిన వరాన్ని కూడా వినండి - ఈ పురాణాన్ని ఏకాగ్రచిత్తులై చదువుకున్నా, చదివినా, చదివించినా, విన్నా, వినిపించినా, వ్రాసినా, వ్రాయించినా, గ్రంథరూపంలో నిత్యం పూజించినా వారికి ధర్మార్థులైతే ధర్మము, అర్థాభిలాషులైతే, కోరికలుంటే అవి, మోక్షం కావాలంటే మోక్షము లభిస్తాయి. కోరికలు లభించుటయనగా తీరుటయని భావము. మనిషి ఏ వస్తువుని కోరుకొని గరుడ పురాణాన్ని శ్రద్ధగా పఠించినా ఆ మనిషికా వస్తువు తప్పకుండా లభిస్తుంది. పైగా సుఖజీవనమూ దేహాంతంలో మోక్షమూ లభిస్తాయి.
ఈ పురాణంలోని ఒక శ్లోకాన్ని రోజూ చదివినా మనిషి పాపరహితుడవుతాడు. ఏ గృహంలోనైతే సంపూర్ణ గరుడ పురాణం వుంటుందో ఆ ఇంటివారికి ఈ జన్మలోనే అన్ని ఆశయాలూ సిద్ధిస్తాయి, సర్వశుభాలూ సమకూరుతాయి. ఈ పురాణమే చేతిలో ఎక్కువ కాలం వుంటుందో ఆ హస్తం నీతికోశంతో సమానం. ధర్మార్థ కామ మోక్షాలతో బాటు, ఈ పురాణాన్ని నిత్యం పారాయణ చేసేవారికి, పుత్రుడు కావాలంటే పుత్రుడు, విద్యను కోరుకుంటే విద్య, తీరని కోరికలుంటే వాటి సాఫల్యం, పుణ్యం లభిస్తాయి. ఎంత పుణ్యం లభిస్తుందంటే దాని వల్ల బ్రహ్మహత్యా పాతకం కూడా శమించవచ్చు. ఈ పురాణం పారాయణగాని శ్రవణుంగాని చేసే గొడ్రాలు సంతానాన్ని కోరుకుంటే తల్లి అవుతుంది. పిల్లలకు మంచి గుణాలు రావాలనుకుంటే వస్తాయి. కన్యకు మంచి పతి లభిస్తాడు. ఈ పురాణాన్ని వేడుకుంటే పిల్లలు విద్యావంతులవుతారు. కవి కాదలచుకున్నవాడు కవి అవుతాడు. అందుకే మళ్ళీ చెపున్నాను. ఈ పురాణమొక కల్పవృక్షం. దీనిని పఠించి గాని వినిపించి గాని, కనీసం విని గాని భోగం కోరుకుంటే భోగం, దానిననుభవిస్తూ కోరుకుంటే అనాయాస మరణం, దేహాంతంలో మోక్షం లభిస్తాయి.
పక్షి శ్రేష్టుడూ, భక్త శిఖామణీయగు గరుడుడు బోధించిన ఈ పురాణం ధన్యం. ఇది సకల లోక కల్యాణకరం. ఈ పురాణం పారాయణ చేసేవారికి అకాలమృత్యువుండదు. దుష్టశత్రుక్షయమై ఇక ఎవరి వల్లా భయముండదు.
పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం ।
శృణ్వత్వాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదైపహి ॥ (ధర్మ..49/13ఽ)
యశ్చదం శ్రుణు యా మర్త్యో
యశ్చాపి పరికీర్తయేత్ ।
విహాయ యాతనాం ఘోరాం
ధూతపాపో దివం ప్రజేత్ ॥ (ధర్మ..49-136)
‘అక్షరాలలో అకారాన్నీ, పక్షిగణాల్లో గరుత్మంతుడినీ, పురాణాల్లో గరుడపురాణాన్నీ నేనే’ అని విష్ణు భగవానుడే స్వయంగా చెప్పి యున్నాడు. ఇదీ ఈ పురాణం రాజము యొక్క మాహాత్మ్యము.
గరుడ పురాణం సంపూర్ణం
