3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము
3, 4 - నారాయణుని నుండి సృష్టి యొక్క ప్రాదుర్భావం తత్త్వాభిమానులైన దేవతల ప్రాకట్యం
హే గరుత్మాన్! యోగనిద్రనుండి మేల్కొన్నాక విష్ణు భగవానునిలో సృష్టి చేయాలనే కోరిక కదిలింది. ఆయనలోని ఇచ్ఛాశక్తి అనంతమైనా లౌకిక స్వరూపాన్ని ధరించి తన శరీరకాంతుల ద్వారా ముందుగా ప్రళయకాలంలో విశ్వానికి పట్టిన చీకటిని చెదరగొట్టాడు.
సంపూర్ణ స్వరూపుడైన విష్ణుభగవానుని నుండి వచ్చిన రూపాలన్నీ సంపూర్ణాలే అయినవి. పూర్ణం నుండే పూర్ణం ఉద్భవిస్తుందికదా! విష్ణువునకు పరత్వమూ అపరత్వమూ వ్యక్తిగా వచ్చినపుడు మాత్రమే కల్పించబడుతున్నాయి గాని ఆయన అన్నిటికీ అతీతుడు. వీర్య స్వరూపుడైన పరబ్రహ్మమే అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో వ్యాప్తి చెందుతూ జగత్తంతటా నిండి వుంటాడు కాబట్టి ఆయననే ఈశ్వరుడని కూడా అంటారు. పూర్ణం నుండి పూర్ణాన్ని వేరు చేసిగొని పోతే మరల పూర్ణమే మిగిలినట్లు (ఒకదీపం నుండి మరొక దీపాన్ని వెలిగిస్తే రెండూ సంపూర్ణంగానే వెలుగుతున్నట్లు - అను) పాల మున్నీటా వైకుంఠంలోనూ, జగత్తులోనూ కూడా ఒకే సమయంలో విష్ణువొకలాగే సంపూర్ణంగా వెలుగుతుంటాడు. జీవుల హృదయాలలో కూడ కదులుతుంటాడు. అందుకే ఆయనను వాసుదేవుడన్నారు. పృథ్వియొక్క భారాన్నీ, ఆ భారమెక్కువైపోతే దానినుండీ పృథ్వినీ రక్షించే కార్యం ఆయన తనపైనే వేసుకొన్న లౌకిక బాధ్యత. విశ్వమంతటా తన మాయనే వ్యాపింపజేసిన విష్ణువు ఆ మాయలోనే సర్వబీజములనూ సృష్టించి ప్రవేశపెడతాడు. ఈ బీజానికి మూలమైన విష్ణు వీర్యం రెండు ప్రకారాలుగా వుంటుంది.
ఒకటి అచింత్యవీర్యము. ఇది స్త్రీ రూపాన్ని ధరిస్తుంది. రెండవది చింత్యవీర్యం. ఇది పురుషరూపాన్ని ధరిస్తుంది.
లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువు నుండి ఏనాడూ విడివడదు. ఆమె ఆయన నిత్య సేవానురక్త, నారాయణ నామంచే ప్రసిద్ధుడైన శ్రీహరి సంపూర్ణుడూ, సర్వస్వతంత్రుడే గాని మహాలక్ష్మి లేకుంటే అంతటి వాడూ ఒంటరి వాడైపోతాడు. ముకుందుని పదారవిందాలను సేవిస్తూ ఆ తల్లి నిత్యం ఆయన కొలువులో నొక ఉత్తమస్థానంలో వుంటుంది. ఆమె కూడా అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో విశ్వమంతటా ఒకే తీరున వుంటుంది.
ప్రకృతిలో మూడు ప్రముఖగుణాలను సృష్టించిన స్వామిలక్ష్మీ దేవికూడా త్రిగుణాత్మిక కావలెనని అభిలషించాడు. శ్రీ, భూ, దుర్గాదేవీ స్వరూపాలుగా ఆమె విడిపోయింది. శ్రీ దేవిని సత్త్వగుణాభిమానియగు రూపంగానూ, భూదేవిని రజోగుణాభిమానియగు రూపంగానూ, దుర్గాదేవిని తమోగుణాభిమాని రూపంగానూ భావించి పూజిస్తారు. అలాగనీ ఈ మూడు రూపాలకూ మధ్య తేడాలుంటాయనుకొనరాదు. హరి కూడా మూడు తత్త్వాలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలను ధరించాడు.
లోకాలను పాలించడానికి హరియే స్వయంగా సత్త్వగుణంతో విష్ణురూపాన్ని ధరించాడు; సృష్టిని చేయడానికై రజోగుణాధిక్యంతో బ్రహ్మలో ప్రవేశించాడు; సంహారం చేయడానికి తమోగుణ సంపన్నుడై శివరూపుడైనాడు. అవ్యయుడైన హరి ఈ మూడు గుణాలతో మరల మరల మహత్తత్వరూపాలతో ప్రకటితమయ్యాడు. గజఃప్రధానగుణుడై వాయువుగా నిలిచాడు. ఆ వాయువే అన్ని ప్రాణులనూ బ్రతికించు మూలసాధనం. ఈ రకమైన సృష్టికీ ‘గుణ వైషమ్య సృష్టి’ యని పేరు.
తరువాత లక్ష్మీ దేవితో కలసి శ్రీమహావిష్ణువు జ్ఞాన - ద్రవ్య - క్రియాత్మకమైన అహం తత్త్వాన్నుత్పత్తి చేశాడు.
ఈ అహం తత్త్వం నుండి ఆదిశేషుడూ, గరుత్మంతుడు, హరుడ పుట్టారు. ఈ అహం తత్త్వంలో మరల హరియే స్వయంగా ప్రవేశించి దానిని సంక్షుభితం చేయడంతో మరిన్ని తత్త్వాలు వచ్చాయి. వైకారిక, తామస, తైజసములను మూడు ప్రకాధాలుగా అహంతత్త్వం విడిపోయింది. రుద్రునిలో కూడ వైకారిక, తామస, తైజసరూపాలేర్పడ్డాయి. వీటినుండీ లక్ష్మీతో కలిసి హరి దశప్రకారాల (కర్మ, జ్ఞాన) ఇంద్రియాలను సృష్టించాడు. అవే క్షేత్ర, చక్షు, స్పర్శ, రసన, ప్రణ, వాక్, పాద, పాణీ, పాయు, ఉపస్థలు. వైకారిక అహంతత్త్వాన్ని మథించి హరి ఏకాదశ ఇంద్రియాలనూ (మనసుతో కలిపి) ఏకాదశ అభిమాన దేవతలనూ సృష్టించాడు. వారిలో ప్రముఖులు ఇంద్రుడు, మన్మథుడు, వ సువులు మొ!! వారు. మూలరుద్రుడైన భవుని నుండి పదిమంది రుద్రులు ప్రకటితులైనారు. తరువాత ద్వాదశాదిత్యులూ, యాభై మరుద్గణాలూ, పదిమంది విశ్వేదేవులూ ఇంద్రియాల ద్వారా హగిచే సృష్టింపబడినారు.
అయిదు వాయువులూ స్పర్శరూపాది అయిదుతత్త్వాలనుండి వచ్చాయి. భృగు మహర్షి చ్యవనుని పుత్రుడు కాగా ఉతత్థ మహర్షి బృహస్పతి నందనుడు. మనువులు, పితరులు (ఏడుగణాలలో) వరుణదేవుడు, గంగాదులు ఆవిర్భవించారు. మొత్తం సృష్టిని మిక్కిలి సంక్షేపంగా వివరించాను. ఒకటి మాత్రం సత్యం. పరమాత్మయైన శ్రీహరియే యోగనిద్ర నుండి మేల్కొని సృష్టినేర్పరచి తాను లక్ష్మీ దేవితో సహా అందు ప్రవేశించాడు.
