3 - గరుడ పురాణము - బ్రహ్మ కాండము

Table of Contents

19 - శ్రీకృష్ణపతి నీల (నాగ్నజితి) కథ

“అగ్నిదేవునిపై నీకున్న కరుణ అనంతమనీ ఆయన భక్తీ ఆదర్శప్రాయమనీ విన్నాను. వివరాలను వినగోరుతున్నాను” అని వేడుకొన్న వైనతేయునికీ వాసుదేవుడిలా చెప్పాడు.

“అగ్నిదేవుని కూతురు నా ధర్మపత్ని కావడం నీవు విన్నదానికి మూలమై వుంటుంది. నా భార్య నాగ్నజితి పూర్వజన్మలో అగ్నిదేవుని రూపము, పితరులలో శ్రేష్ఠుడునగు కవ్యవాహుని పుత్రిక. ఆమె శ్రీ మహావిష్ణువునే పతిగా పొందాలనే అనన్య చింతనతో ఆయననే స్మరిస్తూ పూజిస్తూ జీవిస్తుండేది. ఆమెకు పెళ్ళీడు రాగానే ఆమె తండ్రి వివాహ ప్రయత్నాలను మొదలు పెట్టాడు. ఆమె నీలమేఘశ్యాముని తప్ప వేరొకరిని వరించబోనని చాలా గట్టిగా చెప్పింది. ఆయన మనకెలా దొరుకుతాడని మనసులో ఆవేదన చెందుతూనే అగ్నిదేవుడు ‘పతిగా ఇంకెవరినీ ఊహించలేనని పట్టుపట్టుకొని కూర్చున్నావు. ఎందుకంత పట్టుదల నీకు?” అని అడిగాడు.

ఆమె ఇట్లన్నది - ‘తండ్రీ! సర్వసద్గుణ సంపన్నుడగు హరి తప్ప వేరొకడు నా పతి దేవుడు కాలేడు. ఈ జన్మలో నా కోరిక నెరవేరకపోతే జన్మంతా ఇలాగే ఆయన కోసం తపిస్తూ వుండిపోతాను. అనాది, నిత్యుడు, సంపూర్ణుడు, విశ్వానికీ ఏకమాత్ర సారస్వరూపుడు, పరమ సుందరుడు, మోక్షప్రదాత, సర్వేచ్ఛలనూ సంపూర్తి చేయగలవాడునగు శ్రీహరిని పెండ్లి చేసుకున్న స్త్రీయే సంపూర్ణ సౌభాగ్యవతి. ఏ స్త్రీల భర్తలు పరమ విష్ణుభక్తులో వారి జన్మలే సఫలము. ఎన్నో జన్మల సంచిత పుణ్యం వుంటేనే స్త్రీకీ విష్ణుభక్తుడు భర్తగా లభిస్తాడు. రానున్న కలియుగంలో పరిస్థితులెలా వుంటాయో విష్ణుదయ మహిమ వల్ల నాకు తెలిసింది. చెప్తాను విను. కలియుగంలో విష్ణుభక్తులు, హరిభక్తి, భక్తుల సత్సాంగత్యం, శేషాచలంపై వెలసే హరి దర్శనం, విష్ణుపదియైన కాళిందీ తటంపై విరాజిల్లు రంగనాథుని దర్శనం, కంచి వరదరాజ స్వామిని చూడగలగడం, రామసేతు దర్శనం, భీమా, రేవా నదీతటాలపై నిలిచి విష్ణువుకి నమస్కరింపగలుగుట, గయా క్షేత్రంలో విష్ణుపాదాలకు శిరస్సును తగిలించుట - ఇవన్నీ దుర్లభాలై పోతాయి. ఆ కలియుగం రాకముందే నేను విష్ణుపత్నిగా మారి అయా ప్రదేశాల్లో విష్ణుభక్తుల దర్శనానికై వెలసి వుంటాను, వేచి వుంటాను. ఇక నేను నా స్వామికై తపస్సు చేయడానికి వెళుతున్నాను అని చెప్పి ఆమె శేషాచల పర్వతం వైపు సాగిపోయింది. అన్నీ తెలిసిన అగ్నిభట్టారకుడు నాకు నమస్కరించి ఏమీ తెలియని వాని వలె ఆమె రక్షణకేర్పాటు చేశాడు.

ఆమె ముందుగా కపిల తీర్జం చేరుకొని అక్కడున్న శ్రీనివాసుని దర్శించి ప్రణామం చేసింది. మూడు రోజులాయనను సేవించి అక్కడి నుండి పాప వినాశక తీర్థాన్ని చేరుకొని వివాహేచ్ఛను మనసులో పెట్టుకొని ఆ తీర్థరాజంలో మునకలిగి దాని కుత్తరదిశలో మూడు కోసుల విస్తీర్ణంలో వ్యాపించియున్న ఒక గుహ రూపంలో నున్న ఏకాంత స్థానానికి పోయి నారాయణ ధ్యానంచేస్తూ తపశ్చర్యలో స్థిరపడిన నాగ్నజితి ఆ స్వామినిలా స్తుతించింది. ‘హే దేవా! మీరే నా తల్లి, తండ్రి, పతి, సఖుడు, పుత్రుడు, గురువు, శ్రేష్ఠ స్వజనం, మిత్రబృందం, ప్రాణవల్లభుడు. స్వామీ! ఈ సంసారంలో మాకుందే మిత్రబాంధవాదులు నిమిత్తమూలకంగా ఏర్పడతారు. కాని మీరు ఏ నిమిత్తమూ లేకుండానే ఏనాటినుండో నా సర్వస్వమైయున్నారు. కావుననో దేవా! నేను మిమ్మేపతిగా వరించాను. ఎన్ని జన్మలకైనా మీ భార్యగానే వుంటాను’ ఈ విధంగా ఆమె చేసిన కఠిన తపశ్చర్యకు ప్రసన్నుడై శ్రీహరి అమెకు సాక్షాత్కరించి ఇలా అన్నాడు. ‘ఓ కుమారికా! కృష్ణావతారంలో నేను నీ పతిని కాగలను. *శ్రీనివాస రూపంలో దర్శనమిచ్చిన స్వామి అంతర్ధానం చెందగానే ఆ కవ్యవాహక పుత్రియౌగిక రీతిలో ఆ శరీరాన్ని వదలి కుంభకుడను పుణ్యుని ఇంటిలో నీలయను పేరిట జన్మించింది.

(*కలౌ వేంకట నాయకః అన్నంత మాత్రాన శ్రీనివాసుడు కలియుగంలోనే గాని అంతకు ముందు లేడనుకోనక్కర లేదు. కపిల తీర్థం, పాపనాశం శ్రీనివాసుడు త్రేతాయుగం నాటికే వున్నాయి.)

అమె వివాహానికామె తండ్రి స్వయంవరాన్ని చాటించాడు. శివుని వరం వల్ల ఆయనకు సంక్రమించిన ఏడు వృషభాలను అదుపులోకి తెచ్చుకోగలిగిన మగధీరునికే ఆమెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. భగవదంశ గలవాడ శ్రీమని ప్రసన్నం చేసుకున్నవాడు మాత్రమే వాటిని అధీనంలోకి తెచ్చుకోగలడని ఆయనకు తెలుసు. నేను శివుని ప్రసన్నుని చేసుకొని వాటిని అదుపులోకి తెచ్చుకున్నాను. అయినా నేను సామాన్య గోపబాలకుడినను కొని కొందరు క్షత్రియవీరులు నన్ను తప్పించి ఆమెను తీసుకుపోయే ప్రయత్నించారు. అమెను బందీగా గొనిపోయారు కూడ. నేను వారిని వెంబడించి వారందరినీ యుద్ధం చేసి గెలిచి నీలను వివాహం చేసుకున్నాను. భద్రామిత్ర విందా కూడా నా కోసం జపించి తపించి నన్ను చేపట్టారు”