శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము

5 - శ్రీ శుకమహర్షియొక్క అంతిమ ఉపదేశము

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - ఈ భాగవత పురాణము నిరంతరముగా మరల మరల సర్వాంతర్యామియగు శ్రీహరి భగవానుని వర్ణించును. ఆయన హర్షమునుండి బ్రహ్మదేవుడు, కోపమునుండి రుద్రుడు ప్రకటమైరి.

ఓ పరీక్షిన్మహారాజా! నీవైతే మరణించేదననే బుద్దిని విడిచి పెట్టుము. ఈ బుద్ధి దేహమే ఆత్మ అనే అవివేకమునుండి పుట్టినది. నీవు ఇదివరలో పుట్ట లేదు. ఇప్పుడు నశించవు. దేహము పుట్టినది. అది మాత్రమే నశించును.

నేను ఇదివరలో లేను. ఇప్పుడు ఉన్నాను. మొక్క విత్తు రూపమును, విత్తు మరల ఇంకో మొక్క రూపమును పొందునట్లుగా, నేను కూడ పుత్రులు, పౌత్రులు మొదలగువారి రూపములో భవిష్యత్తులో ఉండెదను. ఇది అజ్ఞానము. నీవు అట్లు కావు. అగ్ని కట్టెలకంటే విలక్షణమై యుండును. అదే విధముగా, నీవు దేహేంద్రియాదులకంటే విలక్షణుడవు.

ఒకప్పుడు కలలో వ్యక్తి తన తల నరకబడినట్లు, తాను మరణించినట్లు చూచును. జాగ్రదవస్థలో కూడ కనబడే సర్వము దేహమునకే. కావున, ఆత్మ నిశ్చయముగా జన్మమృత్యువులు లేనిది.

ఘటము పుట్టుటకు ముందు ఉన్నది మహాకాశమే. ఘటము పగిలిన తరువాత ఘటాకాశము మరల ఆ మహాకాశమే యగును. ఇదే విధముగా, దేహము మరణించగా (వివేకజ్ఞానముచే అనాత్మయని తెలియబడగా), జీవుడు మరల పరబ్రహ్మయందు విలీనమగును.

మనస్సు ఆత్మకు దేహములను, గుణకార్యములగు విషయములను, కర్మలను కూడ సృష్టించును. ఆ మనస్సును అవిద్య సృష్టించును. జీవునకు అవిద్య వలన సంసారము కలుగుచున్నది.

ఎంతవరకైతే తేజస్సునకు నూనె, బుడ్డి, వత్తి, నిప్పు అనువాటి సంబంధమో, అంతవరకు తేజస్సు పరిచ్చిన్నమగు దీపము అగును. ఇదే విధముగా, ఆత్మకు పుట్టుక దేహాధ్యాస వలన కలిగినది. సత్త్వరజస్తమోగుణముల వృత్తులతోడి తాదాత్మ్యము వలన ఆత్మకు పుట్టుక, మరణము కలుగుచున్నవి.

ఆత్మ ఆ దేహమునందున్నా దేహాదుల వలె నశించేది కాదు. ఆత్మ స్వయంప్రకాశము, కారణకార్యములకంటె అతీతము. ఆత్మ ఆకాశము వలే దేహాదులకు ఆధారము. ఆత్మ నిత్యము. ఆత్మకు నాశము గాని, పోలిక గాని లేవు. ఆత్మ సర్వవ్యాపకము.

ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా బుద్దియందు ప్రతిఫలిస్తున్న పరమాత్మను స్వయముగా అన్వయవ్యతిరేకములతో కూడిన బుద్ధితో (ద్రష్ట పై దృశ్యము ఆధారపడినా, దృశ్యముపై ద్రష్ట ఆధారపడదు) స్వయముగా విచారము చేసి దేహాదులకంటే వివిక్తముగా దర్శించుము. నిరంతరము శ్రీహరి భగవానుని స్మరించుము.

మృత్యువులకు మృత్యువగు ఈశ్వరుడవు నీవే. నిన్ను మహర్షి శాపముచే ప్రేరితుడైన తక్షకుడు గాని, మరేవైనా మృత్యు హేతువులు గాని దగ్గరకు రాలేవు, దహించలేవు.

నేను సర్వాధిష్ఠానమగు పరబ్రహ్మను, నేను సర్వాధిష్ఠానమగు పర బ్రహ్మను అనీ అనుసంధానము చేయుము. ఈ తీరున నిన్ను నీవు (ధ్యాన ముచే) ఉపాధిసంబంధము లేని పరమాత్మలో విలీనము చేసుకొనుము.

నాలుకలతో పెదవులను స్పృశిస్తూ కాలి పై విషపు పడగలతో కరుచుచున్న తక్షకుడనే సర్పము గాని, దేహము గాని, జగత్తు గాని ఆత్మకంటే వేరుగా లేదని నీకు తెలియగలదు.

నాయనా! పరీక్షిన్మహారాజా! సర్వాంతర్యామియగు శ్రీహరియొక్క లీలలను గురించి నీవు ప్రశ్నించగా, నేనీ విషయమును నీకు చెప్పితిని. నీవింకనూ ఏమి వినగోరెదవు?

శ్రీమద్బాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో శ్రీశుక మహర్షి యొక్క అంతిమ ఉపదేశమును వర్ణించే ఐదవ అధ్యాయము ముగిసినది (5).