శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము

3 - యుగధర్మములు - నామసంకీర్తన మహిమ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తనను జయించాలని ఉద్యమించే రాజులను చూచి ఈ భూమి -- ఆహా! మృత్యువు చేతిలో ఆటబొమ్మలైన ఈ పాలకులు నన్ను జయించగోరుచున్నారు -- అని నవ్వుకొనును.

రాజనీతిపండితులే అయిననూ ఈ మహారాజుల ఈ (భూమిని జయించాలనే) కామన వ్యర్థమగును. అట్టి కామనచే ఆ రాజులు నీటి నురగవలే క్షణికమైన దేహము పై అతివిశ్వాసమును కలిగియున్నారు.

అంతశ్శత్రువులను జయించకుండా బాహ్యశత్రువులపై విజయము దుర్లభము. కాబట్టి, ముందుగా కామక్రోధములు మొదలైన అంతశ్శత్రువు లను జయించి, తరువాత ఈ శత్రురాజును, మంత్రులను, సహాయకులను, ఆ నగరపౌరులను, ఆ రాజుయొక్క ఆపులను, వాని గజసైన్యమును, ఇతర సైన్యమును జయించి, వాని రాజ్యములో ముళ్లవంటి చోరాదులను (అల్పశత్రువులను) కూడ జయించెదను (అని వారు తలపోయుదురు).

ఈ తీరున క్రమముగా సముద్రమే హద్దుగా గల రాజ్యమును జయించే దము, అని వారు హృదయములో దృఢమైన ఆశను కలిగియుందురు. ఇంతలో మృత్యువు దగ్గరపడుతున్న విషయమును వారు గుర్తించరు.

సముద్రముచే చుట్టువారబడియున్న నన్ను (రాజ్యమును) జయించి వారు బలముచే సముద్రములోని ద్వీపములను జయించుటకు ఉద్యమం చెదరు. ఇంద్రియజయమునకు ఫలము భూమిని జయించుటయైనచో, అది యెంతటి ఫలము? మోక్షమే ఇంద్రియజయమునకు ఫలము.

 (పృథివీగీతమును శుకమహర్షి తన మాటలలో చెప్తున్నాడు) కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఏ భూమిని విడిచి పెట్టియే మనువులు, వారి పుత్రులు వచ్చిన విధముగా (శూన్యహస్తములతో) వెళ్లిరో (మరణించిరో), అట్టి నన్ను జయించబూనువారు అవివేకులు.

దుర్బుద్దులై రాజ్యమునందు మమకారముచే కట్టివేయబడిన మనస్సు గల తండ్రీకొడుకులకు, సోదరులకు కూడ నా కొరకై నిశ్చయముగా కలహము పుట్టును.

ఓ మూర్ఖ! ఈ భూమి అంతా నాదే, నీది కాదు, అని ఈ విధముగా వాదించి పోటీ పడుతూ రాజులు నా కొరకు పరస్పరము చంపుకొంటూ, తాము కూడ మరణించెదరు.

పృథువు, పురూరవుడు, గాధి, నహుషుడు, భరతుడు, కార్తవీర్యార్జునుడు, మాంధాత, సగరుడు, శ్రీరాముడు, ఖట్వాంగుడు, ధుంధుహుడు, రఘువు, తృణబిందువు, యయాతి, శర్యాతి, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్స్థుడు, నిషధరాజగు నలుడు, నృగుడు, హిరణ్యకశిపుడు, వృత్రాసురుడు, జనులనేడ్పించిన రావణుడు, నముచి, శంబరుడు, భూపుత్రుడగు నరకాసురుడు, హిరణ్యాక్షుడు, తారకాసురుడు, అనేకులు ఇతరరాక్షసులు, దొడ్డ ప్రభువులైన రాజులు, అందరు సర్వము దెలిసిన శూరులు, సర్వమును జయించినవారు, పరాజయము నెరుగని వారు.

ఓ పరీక్షిన్మహారాజా! (ఈ సంబోధన మాత్రము శుకమహర్షిది.మిగిలినది భూమిగీతము). వారు నా పై అధికమగు మమకారమును నేరపిరి. కాని, వారు కూడ మరణించే స్వభావము గలవారే. కాలము వారిని నిశ్చయముగా చరిత్ర మాత్రమే మిగిలినవారినిగా, కృతార్థులు కానివారినిగా చేసినది.

ఓ పరీక్షిన్మహారాజా! జనులయందు కీర్తిని విస్తరింపజేసి పరలోకమును పొందిన మహాపురుషుల యొక్క ఈ గాథలను నీకు వివేకవైరాగ్యములను బోధించే ఇచ్చచే చెప్పితిని. అంతే. ఇవి వాక్కు యొక్క విలాసలు మాత్రమే. ఇవి పరమార్థతత్త్వము కావు.

శ్రీహరియొక్క కీర్తి ఉత్తమమైనది. మహాత్ములు అమంగళములను పోనాడే ఆయన గుణములను నిరంతరముగా కీర్తించెదరు. శ్రీకృష్ణునిపై కామనల కాలుష్యము లేని శుద్ధభక్తిని కోరు సాధకుడు ఆ ప్రవచనములను ప్రతిదినము తప్పనిసరిగా మరల మరల శ్రవణము చేయవలెను.

పరీక్షిన్మహారాజు పలికెను --- పూజనీయుడవగు ఓ మహర్షీ! కలియుగ మునందు దోషములు గుట్టలుగా పెరుగును. జనులు వాటిని పోగొట్టుకునే ఉపాయమేది? నాకా విషయమును యథాతథముగా చెప్పుడు.

యుగములను, యుగధర్మములను, ప్రళయము, కల్పములు అనుపాటి కొలమానములను గురించి చెప్పడు. సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు అగు ఈశ్వరుడు కాలరూపుడై ఉన్నాడు. ఆ కాలముయొక్క గమనమును గురించి కూడ చెప్పడు.

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! కృతయుగమునందలి జనులు ధారణ చేసే ధర్మము నాలుగు పాదములతో ప్రవర్తిల్లును. ఆ పూర్ణ మైన ధర్మమునకు సత్యము, దయ, తపస్సు, (అభయ)దానము అనేవి నాలుగు పాదములు.

కృతయుగములో జనులందరికి సంతోషము, దయ, మైత్రి, మనోనిగ్రహము, బా హ్యేంద్రియనిగ్రహము, సుఖదుఃఖాదిద్వంద్వములను సహించే శక్తి, స్వరూపానందము, సమ (సమ్యగ్) దర్శనము (సర్వమునందు ఈశ్వరుని దర్శించుట), కష్టపడి పని చేయుట ఉండును.

త్రేతాయుగమునందు ధర్మపాదములయొక్క చతుర్థాంశము అధర్మపాదములచే మెల్లగా క్షీణించును. అసత్యముచే సత్యము, హింసచే దయ, పేరాసచే తపస్సు, కలహముచే దానము క్షీణించును.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ త్రేతాయుగమునందు జనులకు వైదికకర్మలయందు, తపస్సనందు నిష్ణ మెండు. గృహస్థాశ్రమములో ఇల్లు కడుగుట ఇత్యాది సందర్భములలో చీమలు మొదలగునవి చంపబడుట మొదలైన హింస తప్పనిసరి. అది తప్ప వేరే హింసను వారు చేసెడివారు కాదు. వారు భోగాసక్తి లేకుండా ధర్మార్థకామములననుష్ఠించెడివారు, ఋగ్యజుస్సామవేదములచే ప్రతిపాదించబడే వైదికకర్మలలో వారు నిష్ణాతులు. వర్ణములలో బ్రాహ్మణవర్ణమునకు ఆధిక్యము ఉండును.

ద్వాపరయుగమునందు ధర్మలక్షణములైన తపస్సు, సత్యము, దయ, దానములయొక్క సగము అధర్మలక్షణములైన హింస, దురాశ, అసత్యము, ద్వేషములచే (క్రమము అవివక్షితము) క్షీణించిపోవును.

జనులు పెద్ద లోగిళ్లు, పెద్ద కుటుంబములు కలిగి తమ వేదశాఖను అధ్యయనము చేసి చేయించుటలో ప్రీతి గలవారై కీర్తిమంతులుగా నుందురు. వారు పెద్ద యజ్ఞములను చేస్తూ ధనవంతులై ఆనందించెదరు. వర్ణములలో బ్రాహ్మణక్షత్రియవర్ణములకు ప్రాముఖ్యము ఉండును.

కలియుగమునందైతే అధర్మపాదములు పెరిగి ధర్మపాదముల నాల్గవ అంశము వరకు క్షీణించును. ఆ యుగము అంతమయ్యేనాటికి అది కూడ నశించును.

ఆ కలియుగమునందు జనులు లోభులై చెడు నడవడిని కలిగి దయ లేకుండనుందురు. భాగ్యహీనులైన జనులు పేరాసతో గిల్లి కజ్జాలు పెట్టుకొనెదరు. శూద్రులకు, మత్స్యకారులకు ప్రాముఖ్యము ఉండును.

వ్యక్తిలో సత్త్వరజస్తమస్సులనే మూడు గుణములు ఉండును. అవి కాలముయొక్క ప్రేరణచే దేహము-మనస్సులయందు మార్పు చెందును.

ఎప్పుడైతే మనస్సు, జ్ఞానేంద్రియములు అతీశయించి సత్త్వగుణమునందు ప్రవర్తిల్లుచున్నవై, జ్ఞానమునందు, తపస్సునందు అభిరుచి ఉండునో, అదియే కృతయుగమని తెలియవలెను.

బుద్దిమంతుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఎప్పుడైతే ప్రాణులకు ధర్మార్థకామములయందు భక్తి కలుగునో, అప్పుడు రజోగుణప్రధానమగు త్రేతాయుగమని తెలియుము.

ఎప్పుడైతే లోభము, దురాశ, గర్వము, డాంబీకము, మరియు ఈర్ష్య కలుగునో, కోరికలచే ప్రేరితమైన కర్మలయందు అభిరుచి కలుగునో, అదియే రజోగుణతమోగుణములు ప్రధానముగా గల ద్వాపరయుగము.

ఎప్పుడైతే కపటము, అసత్యము, సోమరిదనము, నిద్ర, హింస, దుఃఖము, ఏడుపు, వ్యామోహము, భయము, దీనత్వము కలుగునో, అదియే తమోగుణప్రధానమైన కలియుగమని చెప్పెదరు.

కలి ప్రభావము వలన మరణించే స్వభావము (దేహాతాదాత్మ్యము) గల మానవులు మందబుద్దులు, అల్పభాగ్యులు అయి తిండిపోతులు కూడ అగుదురు. వారు దరిద్రులై కాముకులగుదురు. స్త్రీలు కూడ దుష్టలై యథేచ్ఛగా సంచరించెదరు.

కలియుగమునందు దేశములోని వివిధప్రాంతములలో చోరుల సంఖ్య పెరిగిపోవును. వేదవిరుద్దాచారము గలవారు వేదములను కలుషితము చేసెదరు. రాజులు కూడ ప్రజలను వేపుకు తినెదరు. బ్రాహ్మణులకు సంభోగము, తిండి మాత్రమే ప్రధానములగును.

బ్రహ్మచారులు నియమపాలన, శౌచము లేకుండా ఉండెదరు. గృహస్థులు భిక్షను ఇచ్చుట మానివేసి తామే భిక్షాటన చేసెదరు. అడవిలో (ఏకాంతముగా) వానప్రస్థజీవనము చేయవలసిన పెద్దలు గ్రామములలోనే నివసించెదరు. సన్న్యాసులు అధికమగు ధనాశను కలిగియుందురు.

కలియుగములో స్త్రీలు పొట్టి దేహముతో తిండిపోతులుగా ఉండెదరు. అధికసంతానము గల ఆ స్త్రీలు సిగ్గు లేకుండనుండెదరు. వారు సర్వదా కటువుగా మాటలాడెదరు. వారియందు చౌర్యము, కపటము, పెద్ద సాహసము (దురుసుదనము) ఉండును.

నీచులు, మోసగాండ్రు అగు వర్తకులు వ్యాపారము చేసెదరు. జనులు ఆపద కాని సందర్భములలో కూడ సత్పురుషులు ఏవగించుకొనే బ్రదుకు దెరువును చేపట్టెదరు.

సేవకులు అందరిలో ఉత్తముడే అయినా డబ్బు లేకున్నచో ప్రభువును విడిచి పెట్టెదరు. ప్రభువులు కులపరంపరలో వచ్చినా ఆపదలో పడ్డ సేవకుని విడిచి పెట్టెదరు. గృహస్థులు పాలివ్వని ఆవును విడిచి పెట్టెదరు.

కలియుగములో పురుషులు స్త్రీకి వశవర్తులై సంభోగమే ప్రియము కాగా దీనులై జీవించెదరు. వారు తల్లిదండ్రులను, సోదరులను, మిత్రులను, బంధువులను విడిచి పెట్టి, మరదళ్లతో, బావమరదులతో సలహా సంప్రదింపులు జేసెదరు.

శూద్రులు తపశ్శాలుర వేషము వేసి అదియే బ్రదుకు దెరువు కాగా దానములను పట్టెదరు. ధర్మము తెలియనివారు ఉన్నతాసనము (వ్యాసపీఠము) ను అధిష్టించి ధర్మమును బోధించెదరు.

ఓ పరీక్షిన్మహారాజా! కరువు, అధికమగు పన్నులు కారణముగా జనులు దేహమునందు కృశించి మనస్సులో ఉద్వేగము గలవారై ఉందురు. భూలోకములో ఆహారమునకు కొదవ కలుగును. జనులు అనావృష్టి వలని భయముచే పీడను పొందెదరు.

కలియుగములో ప్రజలకు వస్త్రములు, ఆహారము, త్రాగే నీరు, తల దాచుకునే చోటు కరువగును. దాంపత్యజీవనము లేని ఆ జనులకు స్నానము, అలంకారములు కూడ ఉండవు. వారు పిశాచములను బోలి యుందురు.

 

కలియుగములో జనులు పొవలా విలువ గలదానికొరకు కూడ కలహించి, ప్రేమను విడిచి పెట్టి, ప్రియమైన వారిని, ప్రాణాలను కూడ విడిచి పెట్టెదరు. అంతే గాక, తమవారిని కూడా కొట్టి చంపెదరు.

కలియుగ మానవులు చిన్న పరిమాణము, సంకుచితమైన మనస్సు గలవారు, పోరీకీ సంభోగము, పొట్ట నింపుకొనుట మాత్రమే ప్రధానము. వారు వృద్ధులను -- ఆ వృద్ధులు తల్లిదండ్రులే అయినా -- పాలించరు. సకలవిషయములయందు నేర్పరులైన కొడుకులను కూడ తరిమివేసెదరు.

ఓ పరీక్షిన్మహారాజా! కలియుగమునందు జనుల బుద్ది వేదవిరుద్దమగు మతములచే చలింపజేయబడును. వారు లోకములకు ఆదికారణము, తండ్రియగు శ్రీహరి భగవానుని ఆరాధించరు. స్వరూపచ్యుతి లేని ఆ భగవానుని పద్మములవంటి పాదములకు ముల్లోకముల ప్రభువులగు ఇంద్రాదులు కూడ సాష్టాంగప్రణామములను చేయుదురు.

మరణిస్తున్నవాడు గాని, రోగి గాని, పడిపోతూ లేక జారిపోతూ పరవశుడై ఉన్న వ్యక్తి గాని శ్రీహరి పేరును కీర్తించినచో, కర్మలనే గడియ (ఆటంకము) తొలగి ఉత్తమగతిని పొందును. కాని, కలియుగమునందు జనులు అట్టి శ్రీహరిని ఆరాధించరు.

కలియుగముయొక్క ప్రభావముచే ద్రవ్యములయందు, స్థానములయందు, మనస్సునందు, ఇంద్రియములయందు కూడ దోషములు ఉండును. మానవులు చిత్తములో పురుషోత్తమభగవానుని స్మరించినచో, ఈ దోషములన్నియు పరాస్తమగును.

భగవానుని గాథలను శ్రవణము చేయుట, నామసంకీర్తనము, ధ్యానము, పూజ, లేదా ఆదరించుటయే అయిననూ చేసి మానవులు శ్రీహరిని హృదయమునందు నిలుపుకొనవలెను. అట్లు చేసినచో, పదివేల జన్మల పాపములు కడిగివేయబడును.

బంగారమునందు అగ్ని ప్రవేశించి రాగి మొదలైన ఇతరలోహముల మాలిన్యమును పోగొట్టును. అదే విధముగా, సాధకుల హృదయము నందుండే శ్రీహరి వారియందలి పాపవాసనల సంచితమును పోగొట్టును.

అనంతభగవానుని హృదయమునందు ధ్యానించుటచే అంతఃకరణమునకు ఏ విధమగు పూర్ణమగు శుద్ధి కలుగునో ఆ విధముగా, ఉపాసన, తపస్సు, ప్రాణాయామము, ప్రాణుల యెడల మైత్రి, తీర్థస్నానము, వ్రతములు, దానములు, జపములచే కలుగదు.

ఓ పరీక్షిన్మహారాజా! కాబట్టి నీవు మృత్యువు దగ్గరైన సమయములో సావధానుడవై హృదయమునందు నిశ్చయముగా శ్రీహరిని నిలుపుము. అట్లు చేయుటచే, నీవు సర్వోత్తమమైన మోక్షమును పొందెదవు.

ఓ పరీక్షిన్మహారాజా! మరణిస్తూ పూజనీయుడగు పరమేశ్వరుని ఏకాగ్రముగా ధ్యానించవలెను. సర్వమునకు ఆత్మ, సర్వమునకు ఆశ్రయము అగు భగవానుడు అట్టివానికి తనతో ఐక్యముననుగ్రహించును.

ఓ పరీక్షిన్మహారాజా! దోషములకు నిధానమైన కలియుగమునకు నిశ్చయముగా ఒక గుణము గలదు. అదేమంటే, ఈ యుగములో శ్రీకృష్ణుని కీర్తించినంత మాత్రాన సాధకుడు సంసారాసక్తిని వదిలి పరమాత్మను చేరుకొనును.

కృతయుగమునందు శ్రీహరిని ధ్యానించుట వలన, త్రేతాయుగమునందు యజ్ఞములచే ఆరాధించుట వలన, ద్వాపరయుగమునందు సేవ-పూజల వలన ఏది (మోక్షము) లభించునో, అది కలియుగములో శ్రీహరిని కీర్తించుటవలననే లభించును.

శ్రీమద్బాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో యుగధర్మములను, నామసంకీర్తనమహిమను వర్ణించే మూడవ అధ్యాయము ముగిసినది (3).