శ్రీ మద్భాగవతము - ద్వాదశ (12వ) స్కందము
1 - కలియుగ రాజవంశముల వర్ణనము
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- యాదవవంశమునకు అలంకారమైన శ్రీకృష్ణుడు తన ధామమునకు చేరిన పిదప, భూలోకములో ఎవని వంశము ఉండెను? ఓ మహర్షీ! నాకీ విషయమును చెప్పడు.
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- పురంజయుడని (రిపుంజయుడు) ప్రసిద్ది చెందినవాడు బృహద్రథ (జరాసంధుని తండ్రి) వంశీయులలో ఆఖరి రాజు కాగలడు. ఆతని మంత్రియగు శునకుడు ప్రభువును సంహరించి, ప్రద్యోతుడనే పేరు గల తన కొడుకును రాజు చేయగలడు. ఆ ప్రద్యోతునకు పాలకుడనే పుత్రుడు ఉండును. పాలకుని పుత్రుడు విశాఖయూపుడు, విశాఖయూపునికి రాజకుడనే పుత్రుడు కలుగును.
ఆ రాజకుని పుత్రుడు నందివర్ధనుడు. ప్రద్యోతుని వంశీయులగు ఈ ఐదుగురు (ప్రద్యోతునితో కలిపి) ప్రద్యోతనులనబడుదురు. వీరు నూట ముప్పది యెనిమిది సంవత్సరముల కాలము భూమిని పాలించెదరు.
ఆ నందివర్ధనుని పుత్రుడు శిశునాగుడు. శిశునాగుని పుత్రుడు కాకవర్ణుడు. కాకవర్ణుని పుత్రుడు క్షేమధర్ముడు. క్షేమధర్ముని పుత్రుడు క్షేత్రజ్ఞుడు కాగలరు.
క్షేత్రజ్ఞుని పుత్రుడు విధిసారుడు, విధిసారుని పుత్రుడు అజాతశత్రుడు, అజాతశత్రుని పుత్రుడు దర్భకుడు, దర్భకపుత్రుడు అజయుడు కాగలరు.
కురువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అజయుని పుత్రుడు నందివర్ధనుడు. నందివర్ధనుని పుత్రుడు మహానంది. ఈ (శిశునాగునినుండి మహానంది వరకు) పదిమంది శిశునాగ వంశీయులు కలియుగమునందు మూడు వందల అరవై సంవత్సరముల కాలము భూమిని పాలించగలరు. ఓ రాజా! మహానందికి శూద్రురాలైన భార్యయందు బలశాలియగు నందుడనుపాడు పుట్టును. మహాపద్మ (ఒకానొక పెద్ద) సంఖ్య గల సైన్యమునకు (మహాపద్మమనే నిధికి) ప్రభువగు ఆ నందుడు క్షత్రియవంశమును విసాశము చేయును.
అప్పటినుండి రాజులు శూద్రప్రాయులు, ధర్మము లేనివారు అగుదురు. ఆ మహాపద్మనందుడు ఏకచ్ఛత్రాధిపతియై రాజ్యమును ఏలును. ఆతని శాసనమును ఎవ్వరైననూ ఉల్లంఘించరు. క్షత్రియనాశము అనే అంశములో ఆతడు రెండవ పరశురాముడు వంటివాడు.
ఆ మహాపద్మనందునకు సుమాల్యుడు మొదలైన ఎనమండుగురు పుత్రులు ఉండగలరు. వారు రాజులై ఈ భూమిని వంద సంవత్సరములు పొలించగలరు.
ఒకానొక బ్రాహ్మణుడు (చాణక్యుడు) ప్రఖ్యాతి చెందిన ఆ తొమ్మండుగురు (తండ్రి, ఎనమండుగురు పుత్రులు) నందులను రాజ్యభ్రష్టులను చేయును. దానితో కలియుగమునందు చంద్రవంశము అంతమగును. అప్పుడు రాజ్యమును మౌర్యులు పాలించగలరు.
ఆ బ్రాహ్మణుడే చంద్రగుప్తుని రాజ్యమునందు పట్టాభిషిక్తుని చేయగలడు. ఆ చంద్రగుప్తుని పుత్రుడు వారిసారుడు. వారిసారుని పుత్రుడు అశోకవర్ధనుడు.
ఆ అశోకవర్ధనుని పుత్రుడు సుయశస్కుడు. సుయశస్కుని పుత్రుడు సంగతుడు. సంగతుని పుత్రుడు శాలిశూకుడు. శాలిశూకుని పుత్రుడు సోమశర్మ అగును.
ఓ పరీక్షిన్మహారాజా! కురువంశమును నిలబెట్టేది నీవే. ఆ సోమశర్మకు శతధన్వుడు, శతధన్వునకు బృహద్రథుడు పుత్రులు కాగలరు. ఈ పదిమంది మౌర్యరాజులు (చంద్రగుప్తునితో తొమ్మిదిమంది, చంద్రగుప్తునికంటే ముందువాడు దశరథుడు, వెరసి పదిమంది) నూట ముప్పై ఏడు సంవత్సరములు రాజ్యమునేలగలరు.
కలియుగములో బృహద్రథమౌర్యుని ఆతని సేనాపతియగు పుష్యమిత్రశుంగుడు సంహరించి తానే రాజ్యమునేలగలడు.
ఆ పుష్యమిత్రుని పుత్రుడు అగ్నిమిత్రుడు. అగ్నిమిత్రుని పుత్రుడు సుజ్యేష్ఠుడు. సుజ్యేష్ఠుని పుత్రుడు వసుమిత్రుడు. వసుమిత్రుని పుత్రుడు భద్రకుడు. భద్రకునకు పులిందుడనే పుత్రుడు కలుగగలడు.
ఆ పులిందుని పుత్రుడు ఘోషుడు. ఘోషుని పుత్రుడు వజ్రమిత్రుడు. వజ్రమిత్రుని పుత్రుడు భాగవతుడు. భాగవతునకు దేవభూతి అని ప్రసిద్ధి జెందిన పుత్రుడు కలుగును.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ పదిమంది శుంగులు భూమిని వంద యేళ్లకంటే ఎక్కువ (నూట పన్నెండు) కాలము పాలించగలరు. తరువాత ఈ భూమి గుణసంపద కొరవడిన కణ్వవంశీయుల చేతిలోనికి వెళ్లగలదు.
వసుదేవ కణ్వుడు గొప్ప బుద్ధిశాలియైన అమాత్యుడు, ఆతడు కాముకుడైన దేవభూతీశుంగుని సంహరించి తానే రాజ్యమునేలగలడు.
ఆ వసుదేవుని పుత్రుడు భూమిత్రుడు. భూమిత్రుని పుత్రుడు నారాయ ణుడు. నారాయణుని పుత్రుడు సుశర్మ అనే పేరుతో ప్రసిద్ధిని బడయును.
ఈ కణ్వవంశీయులు కలియుగములో మూడు వందల నలభై ఐదు సంవత్సరములు భూమిని పాలించగలరు.
కణ్వవంశీయుడైన సుశర్మకు బలి అనే పేరుతో శూద్రుడైన సేవకుడు ఉండును. అంధ్రజాతీయుడైన ఆ సేవకుడు పరమదుష్టుడు. ఆతడు ఆయనను సంహరించి కొంత కాలము భూమిని పాలించును.
తరువాత బలి సోదరుడు కృష్ణుడనువాడు రాజ్యమును పాలించును. కృష్ణుని పుత్రుడు శ్రీశాంతకర్ణుడు. శ్రీశాంతకర్ణుని పుత్రుడు పౌర్ణమాసుడు.
ఆ పౌర్ణమాసుని పుత్రుడు లంబోదరుడు. లంబోదరుని పుత్రుడు చిబిలక మహారాజు, చిబిలకుని పుత్రుడు మేఘస్వాతి. మేఘస్వాతి పుత్రుడు అటమానుడు.
అటమానుని పుత్రుడు అనిష్ట కర్ముడు. అనిష్టకర్ముని పుత్రుడు హాలేయుడు. హాలేయుని పుత్రుడు తలకుడు. తలకుని పుత్రుడు పురీషభీరువు. పురీషభీరుని పుత్రుడు సునందన మహారాజు.
శత్రువులను జయించే ఓ పరీక్షిన్మహారాజా! సునందనుని పుత్రుడు చకోరుడు. చకోరునకు బహువులనే పుత్రులు ఎనమండుగురు గలరు. వారిలో ఎనిమిదవవాడు శివస్వాతి. శివస్వాతి పుత్రుడు గోమతి. గోమతికి పురీమంతుడనే పుత్రుడు కలుగును.
పురీమంతుని పుత్రుడు మేదశిరస్సు. మేదశిరస్సుయొక్క పుత్రుడు శివస్కందుడు. శివస్కందుని పుత్రుడు యజ్ఞశ్రీ. యజ్ఞశ్రీ యొక్క పుత్రుడు విజయుడు. విజయుని పుత్రుడు చంద్రవిజ్ఞుడు. చంద్రవిజ్ఞుని పుత్రుడు సలోమధి.
కురువంశమునానందింపజేసే ఓ రాజా! ఈ ముప్పది మంది రాజులు నాలుగు వందల ఏభై ఆరు వత్సరముల కాలము భూమిని పొలించెదరు.
అవభృతీనగరమును పాలించిన ఆభీరజాతికి చెందిన ఏడుగురు, గర్గభులనే పదిమంది, కంకులనే పదునాల్గురు రాజులు కూడ భోగపరాయణులు అగుదురు.
తరువాత ఎనమండుగురు గ్రీసు జాతీయులు, పధ్నాలుగురు టర్కీ జాతీయులు, మరల పదిమంది గురుండులు, పదకొండు మంది మౌనులు అనే వారు రాజ్యమునేలగలరు.
ఈ యవనులు, తురుష్కులు, గురుండులు భూమిని వెయ్యి తొంబై తొమ్మిది సంవత్సరములు పాలించెదరు. మౌనులనే రాజులు పదకొండు మంది మూడు వందల సంవత్సరములు భూమీనీ పొలించెదరు. వారి పాలన అంతమైన పిదప కిలికిలానగరమునందు భూతనందుడు, ఆయన పుత్రుడైన వంగిరి, శిశునంది, ఆయన సోదరుడైన యశోనంది, ప్రవీరకుడు అనే ఈ రాజులు నూట ఆరు సంవత్సరములు రాజ్యము నేలేదరు.
ఆ భూతనందుడు మొదలగువారికి బాహ్లికులు అనే పదముగ్గురు పుత్రులు కలిగెదరు. వారి రాజ్యము తరువాత పుష్పమిత్రుడనే క్షత్రియుని రాజ్యము వచ్చును. ఆ పుష్పమిత్రుని పుత్రుడు దుర్మిత్రుడు.
బాహ్లికవంశీయులు ఏడుగురు అంధ్రదేశమునకు, ఏడుగురు కోసలదేశమునకు ప్రభువులగుదురు. ఆ వంశీయులే విదూరదేశమునకు, నిషధదేశమునకు కూడ ప్రభువులు కాగలరు. వీరందరు సమకాలీనులు.
మగధవంశీయులలో విశ్వస్పూర్జి అనే రాజు ఉండగలడు. ఈయనకు పురంజయుడని ప్రసిద్ది. ఇదివరలో వచ్చిన పురంజయునికంటే ఈతడు వేరు. ఈతడు పులిందయదుమద్రకులనే కొత్త వర్ణములను కల్పించి, వారిని బ్రాహ్మణులు మొదలగు వర్ణముల స్థానములో నియమించును.
ఆ విశ్వస్ఫూర్జి దుర్బుద్ధి, బలశాలి. ఆతడు పద్మవతి అనే నగరములో ఉంటూ, హరిద్వార్ నుండి ప్రయాగ వరకు గల రాజ్యమును రక్షిస్తూ పాలించగలడు. ఆతడు క్షత్రియధర్మమును నశింపజేసి, జనులలో వైదికసంస్కారము ఇంచుమించు లుప్తమగునట్లు చేయగలడు.
సౌరాష్ట్రము, అవంతి, ఆభీరము, శూరము, అర్బుదము, మాలవము అనే దేశములకు చెందిన బ్రాహ్మణులు ఉపనయనసంస్కారము లేని వారుగా, ప్రజలను పాలించే రాజులు శూద్రులతో సములుగను అగుదురు.
సింధు, చంద్రభాగా నదుల తీరమునందలి దేశములను, కుంతీ పురమును, కాశ్మీరమండలమును శూద్రులు, ఉపనయనసంస్కారము లేని బ్రాహ్మణక్షత్రియులు, మ్లేచ్చులు, వేదాచారము లేనివారు పాలించేదరు.
ఓ పరీక్షిన్మహారాజా! మ్లేచ్చులతో తుల్యులైన ఈ పాలకులు సమకాలీనులు. వీరికి అధర్మమునందు, అసత్యమునందు నిష్ఠ మెండు. అల్పమును దానము చేసే వీరి కోపము తీవ్రముగానుండును.
వారు స్త్రీలను, పిల్లలను, గోవులను, బ్రాహ్మణులను హింసించేదరు. వారికి ఇతరుల భార్యలపై, సొత్తు పై ప్రీతి ఉండును. వారు ఒక క్షణములో సంతోషమును, ఇంకో క్షణములో దుఃఖమును కలిగియుందురు. వారి బలము అల్పము. వారి ఆయుష్షు కూడ అల్పము.
క్షత్రియుల రూపములో నున్న ఆ మ్లేచ్చులకు ఉపనయనాది వైదికసంస్కారములు ఉండవు. రజోగుణతమోగుణములతో కూడియున్న ఆ పాలకులు వైదికకర్మలను చేయరు. వారు ప్రజలను పీడించేదరు.
అట్టి పాలకులచే పాలించబడే ఆ ప్రాంతములలోని జనులు కూడ ఆ పాలకుల శీలము, ఆచారము, భాషణములవంటి శీల-ఆచారభాషణములను కలిగియుందురు. వారు పరస్పరము పీడించుకుంటూ, పాలకులచే కూడ పీడించబడుతూ, వినాశమును పొందెదరు.
శ్రీమద్భాగవత మహాపురాణము పన్నెండవ స్కంధములో కలియుగ రాజవంశములను వర్ణించే మొదటి అధ్యాయము ముగిసినది (1).
